SOURCE :- BBC NEWS

విక్టోరియన్లకు ఆకుపచ్చని రంగు అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి ఎమరాల్డ్ షేడ్ రంగు అంటే వారికిష్టం. కాపర్, ఆర్సెనిక్ కలపడం ద్వారా ఈ రంగు వస్తుంది. వాల్పేపర్ నుంచి పిల్లల బొమ్మల దాకా అన్నింటిలో దీన్ని ఉపయోగిస్తారు.
”19వశతాబ్దంలో ఈ రంగు చాలా ప్రసిద్ధి చెందింది. దీర్ఘకాల మన్నిక, పాలిపోని శక్తి కారణంగా ఈ రంగుకు చాలా ఆదరణ ఉండేది” అని సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీలో ప్రిజర్వేటివ్ కన్జర్వేటర్ ఎరికా కోట్జె చెప్పారు.
”చాలా గృహోపకరణాలకు ఆర్సెనిక్ ఆధారిత ఆకుపచ్చ రంగు వేసేవారు. చివరకు మిఠాయిలలో కూడా దీనిని ఉపయోగించేవారు.
ఇక్కడ సమస్య ఏంటంటే ఉపయోగించిన మూలకాల కలయిక విషపూరితమైనది. శతాబ్దానికి పైగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.
పాత పుస్తకాల విషయానికొచ్చేసరికి ఇది మరింత తీవ్రమైన ప్రత్యేక సమస్య.

పాత పుస్తకాలతో ఆరోగ్య సమస్యలు
పుస్తకాల కవర్ పేజీలు జిగేల్ మని మెరిసిపోయేలా ఉండేందుకు విక్టోరియా బుక్బైండర్లు ఆర్సెనిక్, పాదరసం, క్రోమ్ వంటివాటిని ఉపయోగించేవారు.
అయితే పుస్తకాలను ఆర్కైవ్స్లో భద్రపరిచే 19వ శతాబ్దపు అభిరుచి 21వ శతాబ్దంలో సమస్య సృష్టిస్తోంది.
దీర్ఘకాలంపాటు ఈ ఆకుపచ్చని పుస్తకాలకు దగ్గరగా ఉండటం తక్కువ మోతాదులోనైనా ఆర్సెనిక్ విషప్రభావానికి గురిచేస్తుంది.
ఎక్కువసేపు ఆ పుస్తకాలతో గడపడం వల్ల చర్మం రంగు మారుతుంది. కాలేయానికి, మూత్రపిండాలకు హాని కలుగుతుంది. ఎర్ర, తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు 2019లో ఓ ప్రయత్నం జరిగింది. వింటర్ట్హర్ట్ మ్యూజియం, స్టేట్ యూనివర్శిటీ మధ్య డెలావేర్లో ఓ ఏర్పాటు చేశారు.
ది పాయిజన్ బుక్ ప్రాజెక్ట్ పుస్తకాలను పరీక్షించింది. మనుషులకు హాని కలిగించగల పుస్తకాల జాబితాను రూపొందించింది.
ఫ్రాన్స్ జాతీయ లైబ్రరీలోని నాలుగు పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. వెంటనే వాటిని అక్కడినుంచి తీసేశారు.

విషపూరితమయ్యే పుస్తకాల్లో ప్రత్యేక లక్షణం
దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఎరికా కొట్జే తన కొలీగ్ డాక్టర్ పిలార్ గిల్తో దీనిపై చర్చించారు. గిల్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీలో ప్రత్యేకంగా సేకరించిన పుస్తకాల సంరక్షణ కోసం పనిచేస్తున్నారు.ఆమె బయో కెమిస్ట్గానూ శిక్షణ పొందారు.
తమ దగ్గర ఉన్న పుస్తకాల్లో వేలాది చారిత్రక పుస్తకాలను పరిరక్షించేందుకు ఆచరణయోగ్యమైన విధానాన్ని గిల్ అనుసరించారు.
”ఎలాంటి నష్టం కలిగించకుండా ఒక పుస్తకం విషపూరితమయిందా,కాదా అన్నది మనకు చెప్పగలిగే ఓ చిన్న పరికరాన్ని కనుక్కోవడం ముఖ్యమైన విషయం” అని ఆమె చెప్పారు.
పుస్తకాలు పాతవి కావడంతో వాటిని పరిశీలించడానికి ఎక్స్-రే టెక్నాలజీ సరైనది కాదని ఆమె భావించారు. భూగర్భశాస్త్ర విభాగంలో ఏదైనా అవకాశం ఉంటుందేమోనని ఆలోచించారు.
రాళ్ళలోని ఖనిజాలను గుర్తించడానికి వారి దగ్గర ఒక స్పెక్ట్రోమీటర్ ఉంది. ఇది అనేక రకాల తరంగదైర్ఘ్యాల కాంతి ప్రసరణను కొలిచే పరికరం.
“ఖనిజాలు, రంగుల మధ్య చాలా పోలిక ఉంటుంది” అని డాక్టర్ గిల్ చెప్పారు, “దీంతో నేను ఆ పరికరాన్ని అరువుగా తెచ్చుకుని పుస్తకాలలో ఎమరాల్డ్ ఆకుపచ్చ కోసం వెతకడం ప్రారంభించాను” అని గిల్ చెప్పారు.
ఆమె వందలాది పుస్తకాలను పరీక్షించారు. తర్వాత గొప్ప పురోగతిని గుర్తించినట్టు గ్రహించారు.
“విషపూరితమయ్యే వాటికి ఒక విలక్షణమైన నమూనా ఉందని నేను గ్రహించాను. అది ఒక ‘యురేకా’ క్షణం. ఇది ఇంతకు ముందు ఎవరికీ తెలియని విషయమని నేను గ్రహించాను.” అని తెలిపారు.

ఫొటో సోర్స్, University of St Andrews
పరికరం ఎలా పనిచేస్తుందంటే…
తదుపరి పని మా సొంత ప్రోటోటైప్ తయారీకి భౌతిక శాస్త్ర విభాగంతో మాట్లాడటం.
ఇది ఎలా పనిచేస్తుందో సీనియర్ రీసెర్చ్ లాబొరేటరీ మేనేజర్ డాక్టర్ గ్రాహం బ్రూస్ వివరించారు.
“ఇది పుస్తకంపై కాంతిని ప్రకాశింపజేస్తుంది, ఆపైన ప్రకాశించే కాంతి పరిమాణాన్ని కొలుస్తుంది” అని ఆయన చెప్పారు.
“మనం చూడగల ఆకుపచ్చ కాంతిని, మన కళ్లతో చూడలేని పరారుణ కాంతిని ఉపయోగిస్తుంది. ఆర్సెనిక్ అవశేషాలు లేనప్పుడు ఆకుపచ్చ కాంతి ఫ్లాష్లా కనిపిస్తుంది. రంగులు ఉన్నప్పుడు ఎర్ర కాంతి కనిపిస్తుంది.
పూర్తి స్థాయి స్పెక్ట్రోమీటర్తో పోలిస్తే కొత్త పరికరం చిన్నది.దీని తయారీకి, వినియోగానికి తక్కువ ఖర్చవుతుంది.
సెయింట్ ఆండ్రూస్ సేకరణలో స్కాట్లాండ్ జాతీయ లైబ్రరీలో వేలాది పుస్తకాలను సర్వే చేయడానికి ఇప్పటికే దీన్ని ఉపయోగించారు. తమ డిజైన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో పంచుకోవాలని ఆ బృందం భావిస్తోంది.

పాత పుస్తకాలను సురక్షితంగా చదువుకునేలా…
“ఒక పెద్ద సంస్థగా మేం ఖరీదైన కిట్ కలిగి ఉండటం అదృష్టం. దాని ద్వారా మేం 19వ శతాబ్దపు విషపూరిత పుస్తకాలను పరీక్షించగలం” అని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ, మ్యూజియం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జెస్సికా బర్గ్ చెప్పారు.
“కానీ భారీగా పుస్తకాలు ఉన్న ఇతర సంస్థలకు అలాంటి వనరులు ఉండకపోవచ్చు, అందుకే మేం చౌకధరలో తేలిగ్గా ఉండేదాన్ని సృష్టించాలనుకున్నాం. దీనికి ప్రత్యేక సంరక్షకులు లేదా విశ్లేషణ అవసరం లేదు. అప్పటికప్పుడే ఉపయోగించుకోవచ్చు” అని జెస్సికా అన్నారు.
ఇది ఎప్పటికైనా తొలగిపోయే సమస్య కూడా కాదు. పుస్తకాలు మరింత పాతవైపోయి పాడైపోతున్న కొద్దీ ఇంకా హానికరంగా మారతాయి.
వాటిని గుర్తించడం వల్ల వాటిని సురక్షితమైన మార్గంలో నిల్వ చేయవచ్చు. గ్లోవ్స్ వంటివి తొడుక్కోవడం ద్వారా జాగ్రత్తలు పాటించి వాటిని ఇప్పటికీ ఉపయోగించవచ్చు.
“ఇది ఎప్పటికీ ఒక సమస్యలాగే ఉంటుంది” అని బర్గ్ చెప్పారు.
“కానీ ప్రస్తుతం సంస్థలకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే, 19వ శతాబ్దానికి చెందిన ఆకుపచ్చ కవర్ ఉన్న ఏ పుస్తకాన్నయినా చదవాలనుకోవడం లేదు. దీనికి కారణం వారికి వాటిని పరీక్షించే విధానం తెలియకపోవడమే.
‘‘ఇప్పుడు సంస్థలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే 19వ శతాబ్దానికి చెందిన ఆకుపచ్చ కవర్ ఉన్న ఏ పుస్తకాన్నైనా ప్రమాదకరంగా భావించి, వాటిని వినియోగించడం మానేస్తున్నారు. కానీ వాటిలో నిజంగా హానికరమైనమైవి ఏవో వారికి తెలియదు’’
‘‘అయితే గ్రంథాలయాలు, మ్యూజియంలు నిజంగా అలాంటి పని చేయకూడదు. మేం ప్రజలు ఆ పుస్తకాలను వాడాలని, వాటిని అధ్యయనం చేయాలని ఆశిస్తాం. వాటిని ఉపయోగించనీయకుండా చేయడం కాకుండా, వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం’’అని డాక్టర్ బర్గ్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)