SOURCE :- BBC NEWS

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో నివసించే డాక్టర్ స్నేహ్ భార్గవ (95)కు 1984 అక్టోబర్ 31న జరిగిన ఘటన ఇప్పటికీ గుర్తుంది. ఆరోజు ఆమెకు ఎయిమ్స్ డైరెక్టర్‌గా మొదటి రోజు. అయితే, అదేరోజు ఉదయం అకస్మాత్తుగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బుల్లెట్ గాయాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు.

“1984 అక్టోబర్ 31 ఉదయం నేను రేడియాలజీ విభాగంలో ఒక ముఖ్యమైన కేసు గురించి చర్చిస్తున్నాను. అంతలో, ఒక రేడియోగ్రాఫర్ పరుగెత్తుకుంటూ వచ్చి ప్రధానమంత్రిని ఎమర్జెన్సీకి తీసుకువచ్చారని చెప్పారు. సమాచారం, భద్రత లేకుండా ప్రధాని రారు, ప్రోటోకాల్ కూడా లేదు, ఏదో జరగరానిది జరిగిందని నాకు అనిపించింది” అని డాక్టర్ స్నేహ్ భార్గవ గుర్తుచేసుకున్నారు.

“నేను ఆసుపత్రి క్యాజువాలిటీ డిపార్ట్‌మెంట్‌కు పరిగెత్తాను. అక్కడ ఇద్దరు యువ వైద్యులు భయంతో కూర్చుని ఉన్నారు. ప్రధాని ఎక్కడ ఉన్నారని అడిగా, ఇందిరాగాంధీని పడుకోబెట్టిన ట్రాలీని చూపించారు” అని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
స్నేహ్ భార్గవ

ఈ సంఘటన జరిగిన దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, డాక్టర్ స్నేహ్ భార్గవ తన జ్ఞాపకాల గురించి ఇటీవల ఒక పుస్తకం రాశారు.

‘ది వుమన్ హూ రేన్ ఎయిమ్స్’ అనే పేరుతో పుస్తకం ప్రచురితమైంది.

స్నేహ్ భార్గవ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో 1930లో జన్మించారు. ఆమె 1984 నుంచి 1990 వరకు ఎయిమ్స్‌కు మొదటి మహిళా డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

‘రక్తంతో తడిసిపోయారు’

ఆ రోజును డాక్టర్ స్నేహ్ గుర్తుచేసుకుంటూ “ఇందిరాగాంధీ రక్తంతో తడిసిపోయారు. నేను ఆమె ముఖాన్ని చూశాను. ఆమె జుట్టులో ప్రత్యేకంగా ఉంచుకున్న తెల్ల వెంట్రుకలు కనిపించాయి. ట్రాలీపై కూడా బుల్లెట్లు ఉన్నాయి” అని తెలిపారు.

జూన్ 1984లో సిక్కుల ప్రధాన మత స్థలమైన శ్రీ దర్బార్ సాహిబ్‌లో భారత సైన్యం సైనిక చర్యను ప్రారంభించింది, దీనిని ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అని పిలిచారు.

జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, అతని సాయుధ సహచరులను దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్ నుంచి బయటికి రప్పించడానికి జరిగిన సైనిక చర్య ఇది.

అయితే, ఆపరేషన్ మొదలైన దాదాపు 5 నెలలకు, అంటే 1984 అక్టోబర్ 31న, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని దిల్లీలోని ఆమె నివాసంలో ఆమె సిక్కు అంగరక్షకులు కాల్చారు.

దాంతో హుటాహుటిన అక్కడి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కి తరలించారు.

ఆపరేషన్ బ్లూ స్టార్

ఫొటో సోర్స్, Getty Images

‘ఆపరేషన్ బ్లూ స్టార్’

1970ల చివరలో, 1980 మొదటి సంవత్సరాలలో దమ్‌దామి తక్సల్ చీఫ్ జర్నైల్ సింగ్ భింద్రన్వాల్ సిక్కు సమస్యలను లేవనెత్తి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు.

1984లో ఇందిరాగాంధీ అమృత్‌సర్‌లోని సిక్కుల మతపరమైన ప్రదేశమైన శ్రీ దర్బార్ సాహిబ్‌లో జర్నైల్ సింగ్, ఆయన సహచరులపై సైనిక చర్యకు ఆదేశించారు.

‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అని పిలిచే ఈ సైనిక చర్యలో వందలాది మంది మరణించారు.

ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల్లోనే ఇందిరాగాంధీని ఆమె సిక్కు భద్రతా సిబ్బంది హత్య చేశారు.

స్నేహ్ భార్గవ

ఫొటో సోర్స్, Doctor Sneh Bhargava

ఇందిరను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు?

రెండు నిమిషాల్లోనే ఇద్దరు సర్జన్లను పిలిపించగా, వారు ఇందిరాగాంధీని పరీక్షించారని డాక్టర్ స్నేహ్ భార్గవ చెప్పారు.

“నాడి కొట్టుకోవడం లేదని, గుండె-ఊపిరితిత్తుల మెషీన్ అమర్చితే ఏదైనా ఫలితం ఉండొచ్చని వాళ్లు నాకు చెప్పారు. ‘మరి ఎందుకు వేచి ఉన్నారు, పరిగెత్తండి’ అన్నాను. వెంటనే ఇందిరా గాంధీని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి, సర్జన్‌కు అప్పగించాం” అని స్నేహ్ అన్నారు.

ఇందిరాగాంధీ బ్లడ్ గ్రూప్ బి-నెగటివ్ అని, అప్పటికి ఆసుపత్రిలో బి-నెగటివ్ రక్తం చాలా తక్కువ అందుబాటులో ఉందన్నారు.

“మెడికల్ సూపరింటెండెంట్ దిల్లీలోని అన్ని ఆసుపత్రుల నుంచి రక్తాన్ని సేకరించడం ప్రారంభించారు” అని స్నేహ్ గుర్తుచేసుకున్నారు.

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

సోనియాగాంధీ ఏం చేశారు?

ఇందిరా గాంధీని కాల్చినప్పుడు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రధానిని ఆసుపత్రికి తరలించినపుడు రాజీవ్ భార్య సోనియా గాంధీ, వారి పిల్లలు అక్కడికి చేరుకున్నారు.

“రాహుల్, ప్రియాంక కూడా సోనియాతో కలిసి ఎయిమ్స్‌కు వచ్చారు. తరువాత ఆ ఇద్దరు పిల్లలను తేజీ బచ్చన్ ఇంటికి పంపారు. సోనియా గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నారు. సోనియాకు ఆస్తమా ఉంది. ఆమెను ఆపరేషన్ థియేటర్ వెలుపల గదిలో కూర్చోబెట్టారు” అని స్నేహ్ అన్నారు.

“సోనియాను చూసుకోవడం నా బాధ్యత. కాల్పుల వార్త బయటికి వచ్చిన తర్వాత, చాలామంది ఆసుపత్రికి వస్తున్నారు. ఎవరిని లోపలికి అనుమతించాలో, ఎవరిని అనుమతించకూడదో సోనియాను అడిగేదాన్ని” అని స్నేహ్ తెలిపారు.

మృతి ప్రకటనలో ఆలస్యం ఎందుకు జరిగింది?

”అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ విదేశాల్లో ఉన్నారు. రాజీవ్ గాంధీ సహా సీనియర్ అధికారులెవరూ దిల్లీలో లేరు. ఇందిరాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. ధవన్, రాజకీయ సలహాదారు మఖన్ లాల్ ఫోటేదార్ ఆసుపత్రిలో ఉన్నారు” అని స్నేహ్ అన్నారు.

“ఆరోగ్యశాఖ మంత్రి (శంకరానంద్), ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకున్నారు. అనంతరం, పవర్ వాక్యూమ్ ఉండకూడదని, కాబట్టి ప్రధాని మరణించినట్లు ప్రకటించవద్దని మాకు చెప్పారు” అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

‘జ్ఞానీ జైల్ సింగ్ భయపడ్డారు’

ఇందిరాగాంధీ మరణ వార్త దిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో సిక్కు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించింది.

ఈ సంఘటన జరిగిన సమయంలో భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ యెమెన్ పర్యటనలో ఉన్నారు. భారతదేశానికి ఆయన మొదటి సిక్కు రాష్ట్రపతి. ఇందిరాగాంధీ మరణ వార్త విన్న వెంటనే ఆయన భారత్‌కు తిరిగి వచ్చారు.

జైల్ సింగ్ సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకున్నారని, ఆ సమయంలో ఆయన చాలా షాక్‌కు గురై, భయపడినట్లు కనిపించారని డాక్టర్ స్నేహ్ భార్గవ తన పుస్తకంలో రాశారు.

“సిక్కు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారనే వార్త వ్యాపించడంతో జైల్ సింగ్ కూడా భయపడ్డారు. ఆయన కొంతసేపు ఆసుపత్రిలో ఉండి, రాజీవ్ గాంధీని రానివ్వండి అని చెప్పి వెళ్లిపోయారు” అని స్నేహ్ తెలిపారు.

రాజీవ్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాజీవ్ గాంధీ ఆసుపత్రికి చేరుకొని, సోనియా గాంధీని కలిశారని స్నేహ్ తన పుస్తకంలో రాశారు.

“రాజీవ్ గాంధీ షాక్ అయినట్లు అనిపించింది, కానీ ప్రశాంతంగా ఉన్నారు. తల్లి మృతదేహం వద్ద ఆయన ఎక్కువసేపు ఉండలేదు” అని పుస్తకంలో రాశారు స్నేహ్ .

సిక్కుల ఊచకోత

ఫొటో సోర్స్, Getty Images

ఎయిమ్స్‌లో సిక్కు సిబ్బంది పరిస్థితి?

ఇందిరా గాంధీ మరణం తరువాత, దిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది.

ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ ప్రకారం, ఈ ఊచకోతలో 2,733 మంది సిక్కులు మరణించారు. అయితే, ప్రభుత్వ గణాంకాలకు, సిక్కు సంస్థల లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉంది.

అగ్నిప్రమాదం కారణంగా చాలామందిని కాలిన స్థితిలో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారని డాక్టర్ స్నేహ్ తన పుస్తకంలో రాశారు.

ఇందిరాగాంధీ మరణంతో ఎయిమ్స్‌లో పనిచేస్తున్న సిక్కు ఉద్యోగులు కూడా భయాందోళనకు గురయ్యారని ఆమె చెప్పారు.

“ఇందిరా గాంధీకి సహాయం చేస్తున్న రక్త మార్పిడి టెక్నిషియన్ కూడా సిక్కు వ్యక్తే. సిక్కులు ఆమెను కాల్చారని తెలుసుకున్నప్పుడు, ఆ వ్యక్తి భయాందోళనకు గురై, వెంటనే ఆపరేషన్ థియేటర్ నుంచి పారిపోయారు. నా చీఫ్ రేడియోగ్రాఫర్ ఒక సర్దార్. మా సిబ్బంది సురక్షితంగా ఉండేలా భద్రత కల్పించాలని ఐజీకి చెప్పాను” అని స్నేహ్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)