SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ గాజాలో సహాయ పంపిణీ కేంద్రం దగ్గర ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారని, అనేక మంది గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని పౌర రక్షణ సంస్థ తెలిపింది.
శనివారం ఉదయం ఆహార సామాగ్రి కోసం ప్రజలు గుమిగూడినప్పుడు కాల్పులు ప్రారంభయ్యాయని ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. ఆహారసామాగ్రి ఉన్న ప్రదేశం వైపు వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించినపుడు ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షులు చెప్పినట్టు రిపోర్టుల్లో ఉంది.
తమ దగ్గరకు బెదిరింపు ధోరణిలో వచ్చిన అనుమానితులపై హెచ్చరికగా కాల్పులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.


ఫొటో సోర్స్, Reuters
ఆహార సామాగ్రి పంపిణీ కేంద్రంపై విమర్శలు
ఈ వారంలో సాయం పంపిణీ కేంద్రానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యూమన్టేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) ఈ కేంద్రాలను నడుపుతోంది. రద్దీని నియంత్రించేందుకు, భద్రతను మెరుగుపరచడానికి వీలుగా తమ కార్యకలాపాలకు విరామమిచ్చినట్టు జీహెచ్ఎఫ్ తెలిపింది.
కానీ ఇజ్రాయెల్ మిలటరీ జోన్కు సమీపంలోని ఓ కూడలి వద్ద దాదాపుగా రోజూ ప్రజలు గుమిగూడుతున్నారు. సహాయ కేంద్రాన్ని చేరుకోవడానికి ఈ మార్గం ద్వారానే ప్రజలు వెళ్ళాలి.
రాత్రిపూట ఈ ప్రాంతం యుద్ధం పరిధిలో ఉంటుందని తాము గాజా ప్రజలకు చెప్పినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.
హమాస్ ప్రత్యక్ష బెదిరింపుల కారణంగా శనివారం ఆహార పంపిణీ చేయలేకపోయామని జీహెచ్ఎఫ్ తెలిపింది. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది.
ఏదేమైనప్పటికీ కొత్త పంపిణీ విధానంపై అంతర్జాతీయస్థాయిలో వ్యక్తమవుతున్న విమర్శలను తాజాగా జరిగిన కాల్పులు బలపరుస్తున్నాయి. ఇది పాలస్తీనియన్లను ప్రమాదంలో పడేస్తుందని గాజా మానవతా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తగినంత ఆహారం, మందులను అందించదని ఐక్యరాజ్యసమితి పదే పదే చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
మూడు రోజుల్లో 60మందికిపైగా మృతి
గాజాలోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది మరణించారని, కొంతమంది క్షతగాత్రులు శిథిలాల్లో చిక్కుకుపోయారని పౌర రక్షణ సంస్థ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు.
ఈ దాడుల్లో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ ముజాహిదీన్ బ్రిగేడ్స్ అధిపతిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో ముజాహిదీన్ బ్రిగేడ్స్ అధిపతి పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
శుక్రవారం జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మూడు నెలల దిగ్బంధనం తర్వాత ఇటీవల గాజాలోకి పరిమిత సహాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. జీహెచ్ఎఫ్ ద్వారా పంపిణీకి ఇజ్రాయెల్ ప్రాధాన్యత ఇస్తోంది.
కానీ ఆ ఫౌండేషన్పై వివాదం నెలకొంది.
ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే 60 మందికి పైగా పాలస్తీనియన్లు కాల్పుల్లో మరణించారని వైద్యులు, స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఈ మరణాలకు ఇజ్రాయెల్ సైనికులే కారణమని పలువురు సాక్షులు ఆరోపించారు.

ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయెల్ ఆరోపణలు
మొదటి రెండు రోజుల్లో హెచ్చరికగా కాల్పులు జరిపామని, మూడవ రోజు తమ వైపుకు వస్తున్న పాలస్తీనా అనుమానితులకు దగ్గరగా కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది.
గాజాలో జీహెచ్ఎఫ్ ఆహారసామాగ్రి పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తోంది. మానవతాసాయానికి సంబంధించిన కొత్త వ్యవస్థలో ఇది భాగం. సహాయ కార్యక్రమాల నుంచి ఐక్యరాజ్యసమితిని తప్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మానవతాసంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
హమాస్కు చెందినవారికి ఆహారసామాగ్రిని మళ్లించకుండా నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ఖండించింది. తాము అందించే మానవతాసాయం అంతటికీ జవాబుదారీగా ఉన్నామని తెలిపింది. జీహెచ్ఎఫ్తో ఉపయోగం లేదని, అది అనైతికమైనదని ఆరోపించింది.
హమాస్ దాడులకు ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించి 20 నెలలు అయింది. హమాస్ దాడుల్లో దాదాపు 1,200 మంది మరణించారు. 251 మంది బందీలుగా ఉన్నారు.
గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో 54,675 మందికి పైగా మరణించారని ఆ ప్రాంత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)