SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, X/Telugu Desam Party
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
-
27 మే 2025
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని ప్రధాన పార్టీ తెలుగుదేశంలో కీలక నాయకుడు ఎవరు?
పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర్వాత టీడీపీలో అత్యంత ముఖ్యమైన నేత ఎవరు?
ఈ ప్రశ్నలకు సమాధానంగా కొన్నాళ్లుగా నారా లోకేష్ పేరే బలంగా వినిపిస్తోంది.
అయితే.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ప్రభుత్వంలో ఐటీ, హెచ్ఆర్డీ వంటి కీలక శాఖల మంత్రిగా ఉన్న లోకేష్కు మరింత ‘పవర్’ కావాలనే డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది.
టీడీపీ ప్రధాన కార్యదర్శులుగా మరికొందరు సీనియర్ నేతలున్నారు. మంత్రులూ చాలామంది ఉన్నారు.
వారిలో ఒకరిగా కాదు.. లోకేష్కి ఇంకా బలమైన ముద్ర కలిగిన పదవి కావాలంటూ టీడీపీ శ్రేణులు ఇటీవలి కాలంలో గట్టిగా స్వరం వినిపిస్తూ వస్తున్నాయి.


ఫొటో సోర్స్, X/Telugu Desam Party
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే..
2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ ఏడాది తొలినాళ్లలో లోకేష్కి డిప్యూటీ సీఎం పోస్టునివ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహాసేన రాజేష్ తన మీడియా చానల్లో మాట్లాడుతూ.. మొదటగా ఈ విషయమై గళం విప్పగా, పార్టీ సీనియర్ నేతలైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాస్ రెడ్డి వంటి వారు సైతం ఆ డిమాండ్ను బలంగా తెరపైకి తెచ్చారు.
ఇక లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనేది కోటిమంది టీడీపీ కార్యకర్తల కోరికగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అప్పట్లో వ్యాఖ్యానించారు.
అయితే, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఒక్కరే ఉంటారంటూ జనసేన నేతలు స్వరం పెంచుతూ వచ్చారు.
దీంతో చివరికి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వడం వంటి ప్రతిపాదన ఏదీ లేదని.. టీడీపీ నేతలు, కార్యకర్తలు అనవసరంగా బహిరంగ వ్యాఖ్యలు, డిమాండ్లు చేయొద్దని వారించారు. దాంతో అప్పటికి ఆ విషయం సద్దుమణిగింది.

ఫొటో సోర్స్, X/Telugu Desam Party
ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంటూ..
పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి మహానాడును ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహిస్తున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఏటా నిర్వహించే మహానాడు వేదికగానే ఈసారి లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించాలనే వాదనను కొద్దిరోజులుగా ఆ పార్టీ నేతలు బలంగా వినిపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు దాటగా, సరిగ్గా 42 ఏళ్ల వయసున్న లోకేష్ను ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది.
“లోకేష్ను టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలనేది కార్యకర్తలందరి అభిప్రాయం. అందుకు ఇదే సరైన సమయం. కడపలో జరిగే మహానాడే సరైన వేదిక. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు నివేదిస్తాం.” అని మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, టీడీపీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఇది కొత్త పోస్టే
వాస్తవానికి ఇప్పటివరకు టీడీపీ సంస్థాగత పదవుల్లో ‘వర్కింగ్ ప్రెసిడెంట్’ అనేది లేదు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణలకు రాష్ట్ర శాఖల అధ్యక్షులను నియమించి, తాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు.
గతంలో తెలంగాణ శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు.
ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి గతంలో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు.
ఇప్పుడు లోకేష్ కోసం డిమాండ్ చేస్తున్న ‘జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్’ పోస్టు మాత్రం కొత్తది.

ఫొటో సోర్స్, X/N Chandrababu Naidu
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
2014లో ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి ప్రవేశించిన లోకేష్ అప్పుడు కూడా ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరించారు.
కానీ, పార్టీ కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో జోక్యం చేసుకునేవారు కాదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
“పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో పార్టీలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. ‘యువగళం’ పాదయాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులకు నైతిక స్థైర్యాన్నిచ్చారు’’ అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘ఇక గతేడాది పార్టీ అధికారంలోకి వచ్చిన మొదలు ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా చంద్రబాబు బిజీగా ఉంటున్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు తోడుగా పార్టీ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు లోకేష్కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.’’ అని చెప్పారు.
‘‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బాధ్యతలు తీసుకోవాలి? లోకేష్ ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు” అని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, TDP
‘పార్టీలో చర్చ జరగలేదు, కానీ అర్హుడే..’
“లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ నేతలు, శ్రేణులదే. ఇదంతా స్పెక్యులేషనే. పార్టీలో చర్చ జరగలేదు. ఇంకా డిస్కషన్ జరగాలి” అని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు బీబీసీతో అన్నారు.
“జనరేషన్ మారుతున్నప్పుడు పార్టీకి యువరక్తం కావాలి. కొత్త లీడర్లు రావాలి. అలా లోకేష్ అర్హుడే.. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు” అని యనమల స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో పార్టీలో సీనియర్లకి ప్రాధాన్యం తగ్గుతోందన్న వాదనలపై యనమల మాట్లాడుతూ.. ” కొత్త తరం వచ్చినప్పుడు సహజం. కొత్త వారికి దిశానిర్దేశం చేసే బాధ్యతలు సీనియర్లు తీసుకుంటారు” అని వ్యాఖ్యానించారు.
ఆ పోస్టుకు ప్రాధాన్యం ఉంటుందా?
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పోస్టుకు ప్రాధాన్యం ఉంటుందా అన్న వాదనలపై యనమల స్పందించారు.
“అలా ఏమీ జరగదు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది జాతీయ పార్టీకి. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎప్పటిలాగే తమ భూమిక పోషిస్తారు” అని చెప్పుకొచ్చారు.
కాగా, పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీడీపీ సీనియర్ నేత ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. “ఆ పదవి ఉన్నా, లేకపోయినా ఇప్పుడు టీడీపీ మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏడాది కాలంగా లోకేష్ బలమైన శక్తిగా మారారు. ఈ పరిస్థితుల్లో ఈ పోస్టు అదనపు హంగు తప్ప ఇంకేమీ కాదు. పైగా కడపలో జరిగే తొలి మహానాడులో కన్నా వచ్చే ఏడాదో, ఆ తర్వాతో తీసుకుంటే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు తెలిసి చంద్రబాబు కూడా ఇప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోరేమో..” అని వ్యాఖ్యానించారు.
ఇందులో ఆశ్చర్యం లేదు: గాలి నాగరాజు
ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం అనేది ఆనవాయితీగా మారిందని, ఇందుకు చంద్రబాబు నాయుడు కూడా మినహాయింపు కాదనేది పదేళ్ల కిందటే లోకేష్ రాజకీయ ప్రవేశంతో అర్థమైందని పొలిటికల్ అనలిస్ట్ గాలి నాగరాజు బీబీసీతో అన్నారు.
“2014 ఎన్నికలకు ముందు లోకేష్ అధికారికంగా టీడీపీలో చేరగా, రెండేళ్లకే పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. ఇప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఉన్నా లేకున్నా పార్టీ పగ్గాలు లోకేష్కు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు మహానాడులో ఆ పోస్టు అప్పగించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే చంద్రబాబుకు లోకేష్ షాడోగా పనిచేస్తున్నారు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, X/N Chandrababu Naidu
ఇదీ మహానాడు ప్రస్థానం
1982 మార్చి 27న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా.. మరుసటి నెలలో అంటే.. ఏప్రిల్ 10, 11వ తేదీలలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఈ ‘మహానాడు’ సభను తొలిసారిగా నిర్వహించారు.
అదే ఏడాది మే 27, 28 తేదీలలో తిరుపతి త్యాగరాజ మండపంలో ‘మహానాడు’ పేరుతో మరో సభను నిర్వహించారు.
అయితే, ఆ తర్వాత మహానాడును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28న నిర్వహించాలని పార్టీలోని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తోంది.
మే 27, 28 తేదీలలో ప్రతినిధులతో సభలు, మే 29న ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
ఇప్పుడు కడపలో జరుగుతున్న ప్రతినిధుల సభల్లోనే లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రస్తావన తేవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS