SOURCE :- BBC NEWS

జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసనలు

ఫొటో సోర్స్, UGC

అమరావతి వేశ్యల రాజధాని అంటూ విశ్రాంత పాత్రికేయుడు కృష్ణంరాజు సాక్షి టీవీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంటలు పుట్టిస్తున్నాయి.

ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు సాక్షిపై ఫిర్యాదులు చేస్తూ, కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు.

అటు బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుబంధ మహిళా సంఘాలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించగా, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు దీనిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా బాధ్యులని టీడీపీ ఆరోపిస్తుంటే, టీవీలో వచ్చిన దానికి పార్టీకేం సంబంధం అంటోంది వైయస్సార్సీపీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

జూన్ 6న సాక్షి టీవీలో నిర్వహించిన చర్చావేదికలో భాగంగా, అమరావతి దేవతల రాజధాని అనే ప్రభుత్వ ప్రచార వాక్యాన్ని విమర్శించారు కృష్ణంరాజు.

ఆ చర్చావేదికను ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస రావు నిర్వహిస్తున్నారు.

ఆ సంభాషణ ఇలా సాగింది:

కృష్ణంరాజు: ”అమరావతి దేవతల రాజధాని అని పదేపదే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గారు చెబుతున్నారు. కానీ, హిందూ దేవతలను ఆరాధించే వారిని కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది ఏదో ఇంద్రలోకమో ఇంకోటో. దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అని ఎట్లా అంటారండి?”

కొమ్మినేని శ్రీనివాస రావు: ”మరీ అట్లా అనటం బాగోదేమో.. మళ్ళీ మీ మీద పడతారు” అంటూ కాస్త సున్నితంగా నవ్వుతూనే హెచ్చరికగా అన్నారు.

కృష్ణంరాజు: ”ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారంటే, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు”

కొమ్మినేని శ్రీనివాస రావు: ”ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో, ది హిందూలోనో వచ్చింది. అది కరెక్టే కానీ, మనం తరచూ ఆ వార్తను రిఫర్ చేస్తే అసూయ అనో, ఇంకోటో.. కృష్ణం రాజుగారు కావాలని ఇట్లా అనో అట్లా అనో సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంది”

సాక్షి టీవీ లైవ్ షో

ఫొటో సోర్స్, screengrab

కృష్ణంరాజు: ”వారు నీచంగా ప్రచారం చేస్తారు అన్నది మనకు అనవసరం. కానీ, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పలేకపోతే ఈ సమాజానికి మనం ద్రోహం చేసినట్లవుతుంది. వేశ్యా కేంద్రాలకు సంబంధించిన 150 స్వచ్ఛంద సంస్థలు అమరావతి చుట్టుపక్కల పనిచేస్తున్నాయి. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ సెక్స్ వర్కర్ల వల్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారని, ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే వ్యక్తి నాకు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా అమరావతిని దేవతల రాజధాని అని చెప్పడం మానుకోవాలి.”

కృష్ణంరాజు: ”దేవతలు అనే సరికి మళ్లీ ఇంకో సమస్య వస్తుంది. హిందూ దేవతలా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవతలా అని.. కాబట్టి ఈ పనికిమాలిన పదాలను వాడకుండా ఉంటే మంచిది. పైగా ఈ దేవతల రాజధాని పేరుతో వారు అక్కడ అవినీతి పనులకు పాల్పడవచ్చా? అక్కడ ఎప్పుడూ అవినీతి వార్తలు వస్తూనే ఉన్నాయి.”

…ఇదీ ఆ సంభాషణ. ఆ తరువాత ఈ వీడియో వైరల్ అయింది.

మహిళల నిరసన

ఫొటో సోర్స్, UGC

అమరావతి ప్రాంత మహిళలతో పాటు అన్ని పార్టీల వారూ దీనిపై ఘాటుగా స్పందించారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు ఫిర్యాదులు చేశారు.

అనేక చోట్ల సాక్షి పత్రికలు తగలబెట్టడం, వ్యాఖ్యలు చేసిన వారి, యాంకర్ ఫోటోలను చెప్పులతో కొట్టడం, నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఏలూరు సాక్షి కార్యాలయం దగ్గర స్వల్ప ఉద్రిక్తత కూడా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణ రాజు, ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

దీనిపై అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

”అమరావతిపై విషం చిమ్మడం మినహా దీనికి మరో లక్ష్యం ఉందని అనుకోగలమా? సాక్షి టీవీలో ఆ టాక్ షోను నిర్వహించే కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు మాటలకు సన్నాయి నొక్కులు నొక్కారు. కృష్ణంరాజు చేస్తోన్న వ్యాఖ్యలు విద్వేషపూరిత వ్యాఖ్యలనీ, వాటిని ఆదిలోనే ఆపాలనీ ఆయనకు అనిపించలేదు.” అంటూ విమర్శించారు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్.

టీడీపీ నాయకులు పలు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి జగన్, భారతిలు క్షమాపణ చెప్పాలనీ, సాక్షి ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

పలు జర్నలిస్టు సంఘాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి.

దీంతో, సాక్షి టీవీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదంటూ స్క్రోలింగ్ వేసింది. దానిపై వార్త కూడా ప్రసారం చేసింది.

”సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకులు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే. ఆయన చేసిన వ్యాఖ్యలు సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తోంది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవ అభిమానాలను చూపుతోంది. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు నుంచి వెలువడిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంతమాత్రం సమర్థించదు. సమర్థించలేదు. ఇదిలా ఉండగా తన వ్యాఖ్యలకు కృష్ణంరాజు కూడా వివరణ ఇచ్చారు.” అని వార్త ప్రసారం చేసింది సాక్షి చానెల్. ఆ వార్తలోనే కృష్ణంరాజు వీడియోను కూడా ప్రసారం చేసింది.

కృష్ణం రాజు

ఫొటో సోర్స్, Screengrab

”ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఇసుమంతైనా లేదు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం అసలు ఏ మాత్రం లేదు. అమరావతి రాజధాని. అది అందరికీ రాజధానే. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్‌గా దీనిని భావించవద్దని నేను కోరుతున్నాను. అమరావతి అన్నది క్లీన్‌గా, అన్ని విషయాల్లో అది అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి చెబుతున్నా ఎవరి మనోభావాలను కించపరచడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే దానికి నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని కృష్ణంరాజు ఆ వీడియోలో చెప్పారు.

తరువాత దీనిపై కొమ్మినేని శ్రీనివాస రావు కూడా మరో వీడియోలో స్పందించారు. ”మొన్న జరిగిన చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది అనేది అందరూ భావించాం. దాని మీద వివరణ కూడా ఇచ్చారు కృష్ణం రాజు .. మాబోటి వారం కూడా ఖండించాం. నేను వారించడానికి కూడా ప్రయత్నం చేశాను. నేను ముందుగా ఆ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణ కోరడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నా 18 ఏళ్ళ ట్రాక్ రికార్డులో ఎక్కడా కూడా ఒక అనుచిత పదం వాడితే ఒప్పుకోలేదు. ఆఖరికి చంద్రబాబు, లోకేశ్ గార్ల గురించి కూడా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడబోయినా, మాట్లాడే ప్రయత్నం చేసినా నేను ఒప్పుకోలేదు’’ అని అన్నారు.

‘‘మహిళల గురించి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ.. మహిళలే కాదు, ఎవరిమీదా అభ్యంతరకర భాష వాడకూడదు అన్నది నా స్పష్టమైన విధానం. అయితే మొన్నా ఇంకా గట్టిగా వారించి ఉండాల్సింది ఉంది అన్నారు నేను వారించాను. కానీ ఇంకా గట్టిగా ఖండించాల్సింది అని కొందరు అభిప్రాయపడ్డారు. వారు అలా అనుకోవడంలో తప్పు ఉందని అనుకోవడం లేదు. ఒకటి మాత్రం వాస్తవం. ఆ సందర్భం వేరు. అక్కడ అనవసరంగా ఆ ప్రస్తావన వచ్చింది” అని కొమ్మినేని శ్రీనివాస రావు చెప్పారు.

అయితే ఎక్కడా వీరు బేషరతుగా క్షమాపణ చెప్పలేదు.

”రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఏమన్నారు?

”గౌతమ బుద్దుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి. అలాంటి బౌద్ధం విలసిల్లిన ప్రాంతాన్ని వైసీపీ టీవీ చానల్ ద్వారా అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారు అంటే అక్కడ ఉన్న- ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా? ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతి పరిసరాలను బౌద్ధులకు పవిత్ర ప్రదేశం చేశారు. అమరావతి ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా అవహేళన చేసినట్లే” అని పవన్ కల్యాణ్ అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమని స్పందించింది?

సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్టు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

”సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్టు కృష్ణం రాజు గారు చేసిన వ్యాఖ్యలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందిన నాయకులు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. జర్నలిస్టు కృష్ణం రాజు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి’’ అంటూ ఆ ప్రకటనలో రాసింది వైయస్సార్సీపీ.

‘‘మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తంచేస్తే, అవి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అడ్డంపెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్‌ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం” అని పేర్కొంది.

ప్రస్తుతం ఏ స్టేషన్లోనూ ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదయినట్టుగా అధికారిక సమాచారం లేదు.

పోలీస్ స్టేషన్‌లో మహిళల ఫిర్యాదు

ఫొటో సోర్స్, UGC

అసలీ సెక్స్ వర్కర్ల ప్రస్తావన ఎందుకు వచ్చింది?

2025 జూన్ 2వ తేదీన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు మహిళా సెక్స్ వర్కర్ల జనాభాలో అగ్రస్థానంలో ఉన్నాయనీ, మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉందనీ ఒక వార్త ప్రచురించింది.

ప్రోగ్రమేటిక్ మాప్యింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ కీ పాపులేషన్ ఇన్ ఇండియా – మెథడ్స్ అండ్ ఫైండిగ్స్ పేరుతో ఆ సంస్థ నివేదికను ప్రచురించింది.

ఆ నివేదికలో మొత్తం భారతదేశంలో సెక్స్ వర్కర్లు, నెట్వర్క్ ఆపరేటర్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏఏ జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు వంటి వివరాలను పొందుపరిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)