SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకరమైన ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేసినందుకు చైనా మహిళ ఒకరిని అరెస్ట్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ చెప్పారు.
ఆమె పేరు యుంకింగ్ జియాన్ అని ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్టులో తెలిపారు.
యుంకింగ్ మిషిగన్ యూనివర్సిటీలో పని చేస్తున్నారని, ఒక పరిశోధన కోసం ప్రమాదకరమైన ‘ఫ్యూసేరియం గ్రామినారమ్’ అనే ఫంగస్ను అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చారని ఆయన చెప్పారు.
ఈ ఫంగస్ “వ్యవసాయ ఉగ్రవాదానికి ఆయుధం” అని అమెరికన్ న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫంగస్ వల్ల ‘హెడ్ బ్లైట్’ అనే తెగులు వస్తుంది. ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరిలో కనిపిస్తుంది.
ఈ ఫంగస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా బిలియన్ల డాలర్ల విలువైన నష్టాలు వస్తున్నాయని న్యాయశాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది.


ఫొటో సోర్స్, Reuters
కాష్ పటేల్ ఏం చెప్పారు?
ఈ కేసులో జియాన్ ప్రియుడు జున్యోంగ్ లియుపైనా అభియోగాలు మోపినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ చెప్పారు.
లియు మొదట అబద్ధం చెప్పినప్పటికీ, తర్వాత తాను ఫ్యూసేరియం గ్రామినారమ్ను డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయం ద్వారా అక్రమంగా రవాణా చేసినట్లు అంగీకరించాడని కాష్ పటేల్ తెలిపారు. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధన చేయడానికే ఈ ఫంగస్ను తెప్పించానని లియు ఎఫ్బీఐ విచారణలో చెప్పారు.
ఈ చైనీస్ జంట మీద కుట్ర, అమెరికాలోకి అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు, వీసా మోసం వంటి వివిధ ఆరోపణల కింద అభియోగాలను నమోదు చేశారు.
చైనాలో వ్యాధి కారక ఫంగస్పై పరిశోధనలు చేసేందుకు జియాన్కు చైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అమెరికన్ న్యాయశాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటి?
ఫ్యూసేరియం గ్రామినారమ్ను ‘వ్యవసాయ ఉగ్రవాద ఏజెంట్’ అని కాష్ పటేల్ ఎక్స్లో పోస్ట్ చేసిన మెసేజ్లో రాశారు. వ్యవసాయ ఉగ్రవాదం వ్యవసాయ సంబంధిత నేరాలలో భాగం. వ్యవసాయ నేరాలు, వ్యవసాయ ఉగ్రవాద నేరాల మధ్య చాలా తేడా ఉంది.
దీనిని ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార ఉత్పత్తులను దెబ్బ తీసే లక్ష్యంతో ఆ దేశంలోని పంటలు, పశువులు మీద జరిగిన ‘దాడిగా’ అర్థం చేసుకోవచ్చు.
“వ్యవసాయాన్ని నాశనం చేసే ఉద్దేశంతో జీవసంబంధమైన ఏజెంట్లను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడాన్ని వ్యవసాయ ఉగ్రవాదం అంటారు. ఆహార పంటలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని తీవ్రంగా అస్థిరపరచడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇలాంటి దాడులు వెలుగులోకి రాలేదు. అయితే వ్యవసాయ రంగంపై నేరుగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలకు అవి చాలా వినాశకరమైనవి” అని ఆ అధ్యయనంలో తెలిపారు.
ఈ రకమైన దాడుల్లో, వ్యవసాయ రంగం మీద హానికరమైన బ్యాక్టీరియా లేదా వైరస్లను ప్రయోగిస్తారు. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తులు నాశనం అవుతాయి. పర్యావరణానికి నష్టం కలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయ ఉగ్రవాదం చరిత్ర ఏంటి?
జీవ ఆయుధాలతో యుద్ధం చేయడం కొత్త కాదు.
అల్జీరియాలోని మోస్టెజ్నామ్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ నేరాలపై ఒక అధ్యయనం జరిగింది.19వ శతాబ్దంలో పశ్చిమ దేశాల్లో ‘జీవ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించారని ఈ అధ్యయనం చెబుతోంది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని పురుగులను ప్రయోగించి బ్రిటన్లో బంగాళాదుంప పంటను నాశనం చేయాలని జర్మనీ ప్రణాళిక రచించినట్లు అదే అధ్యయనం పేర్కొంది.1943లో చిన్న స్థాయిలో జరిగిన ఇలాంటి దాడి వల్లనే ఇంగ్లండ్లో ఆ పురుగులు కనిపించడం మొదలైందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన అగ్రి టెర్రరిజం కేసుల్లో జంతువులపై ఇటువంటి దాడులు ఎక్కువగా కనిపించాయని వ్యవసాయ సంబంధిత విషయాలపై నిపుణుడు దేవేంద్ర శర్మ చెప్పారు.
“ఇటువంటి దాడుల తర్వాత, జంతువుల ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడిపోతుంది” అని ఆయన చెప్పారు

ఫొటో సోర్స్, Getty Images
ఇదెంత ప్రమాదకరం?
చైనా జంట దిగుమతి చేసిన ఫంగస్ జంతువుల్లోనే కాకుండా మనుషుల్లోనూ తీవ్రమైన అనారోగ్య సమస్యలు సృష్టిస్తుందని ఎఫ్బీఐ డైరెక్టర్, అమెరికన్ న్యాయ శాఖ విడుదల చేసిన ప్రకటనలు సూచిస్తున్నాయి.
అంతే కాకుండా ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాలకు ఇది కారణం కాగలదు.
ఇది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా పెద్దదని వ్యవసాయ రంగ నిపుణుడు దేవేంద్ర శర్మ చెప్పారు.
“ఆహార భద్రతపై దాడి చేయడానికి సులభమైన మార్గం. ఒక దేశపు ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్కు కూడా ముప్పు ఉందా?
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం.
గోధుమలు, బియ్యం, డ్రైఫ్రూట్స్, పప్పుధాన్యాలు, చెరకు, తృణధాన్యాలు, కూరగాయల్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో కొంత భాగం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
భారత జనాభాలో దాదాపు 42.3 శాతం మందికి వ్యవసాయ రంగం జీవనోపాధిని అందిస్తోంది. దేశ జీడీపీలో 20శాతం వాటాను సమకూరుస్తోందని భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులున్నప్పుడు, పంటలు లేదా జంతువులపై ఫంగస్, వైరస్ లేదా బ్యాక్టీరియా దాడులు దేశానికి ఎంత ప్రమాదకరం?
“భారతదేశానికి ఇతర ప్రాంతాల నుంచి 173 ప్రమాదకరమైన జీవులు వచ్చాయి. ఒక దేశంలో సమృద్ధిగా కనిపించే వాటిని ఆక్రమణ జాతులు అంటారు. అయితే అవి ఇక్కడ పుట్టినవి కాదు. వేరే ప్రాంతం నుంచి వచ్చినవి. దేశానికి ప్రమాదం కలిగిస్తాయి. వాటిని నియంత్రించడం కష్టం” అని దేవేంద్ర శర్మ అన్నారు.
దీనికి ఉదాహరణగా “అమెరికా నుండి గోధుమలను దిగుమతి చేసుకునేటప్పుడు లాంటానా కెమారాకూడా వాటితో పాటు వచ్చింది. ఇప్పుడది దేశమంతటా వ్యాపించింది. దీని వల్ల భారత్ నష్టాలను చవిచూస్తోంది. దానిని నియంత్రించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతోంది” అని ఆయన చెప్పారు.
లాంటానా కెమారా అనేది ఒక పొద మొక్క, ఇది భారతీయ అడవులకు ముప్పుగా మారింది.
ఒక బ్యాక్టీరియా లేదా ఫంగస్ ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా భారత్లోకి ప్రవేశించవచ్చని దేవేంద్ర శర్మ చెప్పారు. అవి మన వ్యవస్థలోకి ప్రవేశించకుండా చూసుకోవాలన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ముప్పును ఎదుర్కోవడం ఎలా?
ఇటీవల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసిన దాదాపు ఐదు లక్షల డాలర్ల విలువైన మామిడి పండ్లను నాశనం చేయాల్సి వచ్చింది. మామిడిలో తెగుళ్లను నాశనం చేసే ప్రక్రియ తర్వాత జారీ చేసే పత్రాలు లేకపోవడమే దీనికి కారణం.
“భారత్లో 140 కోట్లకు పైగా జనాభా ఉంది. అందుకే మనకు దేశ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఇండియాలో మామిడి కాయలో పురుగులున్నా పెద్దగా పట్టించుకోరు. అమెరికాలో అలా ఉండదు. కాయపై పురుగు కనిపించినా సరే, దాన్ని దేశంలోకి అనుమతించరు” అని దేవేంద్ర శర్మ చెప్పారు
పటిష్టమైన నిఘా వ్యవస్థ, వ్యాధికారకాలను వేగంగా గుర్తించే పరిజ్ఞానం ఉన్న దేశాలకు ఇలాంటి ఫంగస్ల వల్ల ముప్పు పెద్దగా ఉండదని డీఆర్డీఓ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఫంగస్ల వల్ల ముప్పు రాకుండా చూసుకోవాలంటే శానిటరీ, సైటోసానిటరీ నియమాలను ఖచ్చితంగా పాటించడం అవసరమని దేవేంద్ర శర్మ అంటున్నారు. వీటిని ఎస్పీఎస్ అంటారు.
ఒక దేశంలో సురక్షితమైన ఆహార ఉత్పత్తులు, జంతువులు, మొక్కలను తెగుళ్ల నుండి రక్షించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ నియమాలను రూపొందించింది.
భారత విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, బ్యాక్టీరియా లేదా వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని దేవేంద్ర శర్మ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)