SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారి విజృంభించిన వేళ రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యవ్యవస్థ తన వంతు కృషి చేసింది. కానీ.. అదే సమయంలో, వైద్యవ్యవస్థకే మచ్చ తెచ్చే ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఒక వర్గానికి చెందిన ‘కరోనా రోగిని చంపేయండి’ అని ఒక సీనియర్ వైద్యుడు అంటున్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గీర్ పట్టణంలో జరిగింది. సంబంధిత వైద్యుడిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
రోగి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిందితుడిగా ఉన్న వైద్యుడి పేరు శశికాంత్ దేశ్పాండే. ఆయన్ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, 2021లో కరోనా ప్రబలిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. అలాగే, చాలాచోట్ల సౌకర్యాల కొరత కూడా ఉంది.
అప్పటి ఆడియో క్లిప్ ఇప్పుడు బయటపడింది.
ఈ కేసుకు సంబంధించి డాక్టర్ శశికాంత్ దేశ్పాండేపై బీఎన్ఎస్ సెక్షన్ 295A (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), సంబంధిత ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది.
నిందితుడు శశికాంత్ దేశ్పాండేకు పోలీసులు లీగల్ నోటీసులు పంపారు.
ప్రస్తుతం పోలీసులు ఆ ఆడియో క్లిప్ను ధ్రువీకరించే పనిలో ఉన్నారు. ఈ కేసులో డాక్టర్ డాంగేకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
”వారు వేరే జిల్లాలో ఉన్నారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తాం” అని ఉద్గీర్ ఇన్స్పెక్టర్ దిలీప్ గాడే తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు విషయం ఏమిటి?
సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఆ ఆడియో క్లిప్లో ఒక డాక్టర్ ”ఆ రాక్షసిని చంపేయండి, మీకు మొదట్నుంచీ వారితో(నిర్దిష్ట మతానికి చెందిన వారిని ఉద్దేశిస్తూ) బాగా అలవాటైపోయింది, ఆ రాక్షసి చాలా ఆక్సిజన్ పీల్చేస్తోంది” అని అంటున్నట్లుగా ఉంది.
దానికి స్పందిస్తూ మరో వైద్యుడు, ”రాత్రి బాగా తగ్గించాం, ఒక్కొక్కరికీ 2 లీటర్లకు తగ్గించాం” అని అంటున్నారు.
అప్పటి ఉద్గీర్ ప్రభుత్వ ఆస్పత్రి డిస్ట్రిక్ట్ సర్జన్గా ఉన్న శశికాంత్ దేశ్పాండేకి, మరో డాక్టర్ శశికాంత్ డాంగేకి మధ్య ఈ సంభాషణ జరిగిందనేది ఆరోపణ.
2021లో డాక్టర్ శశికాంత్ దేశ్పాండే అడిషనల్ డిస్ట్రిక్ట్ సర్జన్గా ఉండగా, డాక్టర్ శశికాంత్ డాంగే ఉద్గీర్లోని కోవిడ్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆరోపణలకు కారణమైన ఆ ఆడియో క్లిప్లో.. ఆ మహిళా రోగిని చంపేయాలని, అమె చాలా ఆక్సిజన్ పీల్చేస్తోందని డాక్టర్ దేశ్పాండే మరో డాక్టర్ డాంగేతో చెబుతున్నట్లు ఉంది.
డాక్టర్ డాంగే బదులిస్తూ, ”అవునవును, అందుకే రాత్రిపూట ఒక్కొక్కరికీ ఆక్సిజన్ 2 లీటర్లకు తగ్గించేశాం” అని అంటున్నట్లు ఉంది.
ఆ పేషంట్ భర్త ఫిర్యాదు మేరకు ఇప్పుడు కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అప్పట్లో ఉద్గీర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ శశికాంత్ దేశ్పాండే, కోవిడ్ 19 కేర్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్ శశికాంత్ డాంగే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
పేషంట్ కౌసర్ ఫాతిమా 53 ఏళ్ల దాయమీ అజీముద్దీన్ గౌసుద్దీన్ భార్య. ఆమె కరోనా నుంచి కోలుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
గౌసుద్దీన్ ఫిర్యాదు ఆధారంగా, మే 24న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్లో ఏముంది?
గౌసుద్దీన్ ఫిర్యాదు మేరకు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఆయన భార్య కౌసర్ ఫాతిమా (అప్పటికి 41 ఏళ్లు) 2021లో కోవిడ్ బారినపడ్డారు.
ఆమెను 2021 ఏప్రిల్ 15న ఉద్గీర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇన్ పేషంట్గా చేర్చారు.
నాందేడ్ రోడ్డులో ఉన్న కంటి ఆస్పత్రి ఎదురుగా ఉన్న భవనంలో డాక్టర్ డాంగే కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఆమె 10 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమె చేరిన 7వ రోజున, పేషంట్ భర్త.. డాక్టర్ డాంగేకి సమీపంలోనే కూర్చుని ఉన్నారు.
డాక్టర్ డాంగే భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఆయనకు డాక్టర్ దేశ్పాండే నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో డాక్టర్ డాంగే తన ఫోన్ను స్పీకర్లో పెట్టారు, వారిద్దరూ ఆస్పత్రిలో బెడ్ల గురించి మాట్లాడుకున్నారు.
ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయని డాక్టర్ దేశ్పాండే అడగ్గా, ఖాళీగా లేవని డాక్టర్ డాంగే చెప్పారు.
అప్పుడు, డాక్టర్ దేశ్పాండే ”ఆ రోగి దాయమీ.. చంపేయండి” అన్నారని దాయమీ అజీముద్దీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గౌసుద్దీన్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. దేశ్పాండే – డాంగే మధ్య జరిగిన సంభాషణలో ఒక వర్గానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి.
అవి విని తాను షాక్ అయ్యానని గౌసుద్దీన్ చెప్పారు. అయితే, ఆ సమయంలో తన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున మౌనం వహించానన్నారు. కొద్దిరోజులకు ఆయన భార్య కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇంతలో, 2025 మే 2న ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఆ దారుణ మాటలను మరోసారి విని మనోవేదనకు గురయ్యానని, మతరపరమైన వ్యాఖ్యలు కలచివేశాయని గౌసుద్దీన్ చెప్పారు.

పేషంట్ బంధువులు ఏమంటున్నారంటే..
రోగి బంధువులు ఈ విషయం గురించి మాట్లాడుతూ, ”మేం అది విని షాక్ అయ్యాం. మతం ఆధారంగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారంటే.. అసలు సమాజం ఎటుపోతోంది?”
”ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో.. ఈ విషయంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి” అని అన్నారు.
సామాజిక కార్యకర్త, న్యాయవాది అల్తాఫ్ ఖాజీ మాట్లాడుతూ, ”వైద్య వృత్తికి మానవ సేవే మాధవ సేవ అనే సూత్రమే మూలం. మరీముఖ్యంగా, విపత్తులు లేదా మహమ్మారి సమయంలో వైద్యులే సమాజానికి దన్ను”
”వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైతే, అది కేవలం నైతిక లేదా వృత్తిపరమైన వైఫల్యం కాదు. మొత్తం మానవత్వానికే మచ్చతెచ్చే అమానవీయ నేరం. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి. నిజమని తేలితే కఠిన శిక్ష విధించాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కథనం ప్రచురించే సమయం వరకూ డాక్టర్ దేశ్పాండేను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన స్పందన రాగానే ఈ స్టోరీలో అప్డేట్ అవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS