SOURCE :- BBC NEWS

ప్రధాని మోదీ, బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

42 నిమిషాలు క్రితం

గత వారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు, ఎవరో ఒకరి పక్షాన నిలవడం భారత్‌కు అంత సులువైన విషయం కాదు.

కానీ, దాదాపు నెలరోజుల కిందట, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై భారత్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ భారత్‌కు బహిరంగంగానే మద్దతు ఇచ్చింది.

పాకిస్తాన్ విషయంలో భారత్‌ వైపు నిలబడటం ఇజ్రాయెల్‌కు అంత కష్టం కాదు. ఎందుకంటే, ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పాకిస్తాన్ ఇంకా అంగీకరించలేదు.

మరోవైపు, ఇరాన్‌తో భారత్ సంబంధాలు బాగున్నాయని చెబుతారు.

ఇతర ప్రభుత్వాలతో పోలిస్తే భారత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్ విషయంలో మరింత ఉదారంగా ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

గత వారం రోజుల్లో జరిగిన సంఘటనలు చూస్తే.. భారతదేశం ఇజ్రాయెల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందనే విషయం అర్థమవుతోంది.

ఉదాహరణకు, గాజాలో తక్షణ కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 12న ఓటింగ్ నిర్వహించింది. 149 దేశాలు కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేశాయి. 12 దేశాలు కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 19 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ 19 దేశాలలో భారత్ కూడా ఒకటి.

ఈ 19 దేశాలను పరిశీలిస్తే, భారత్ మినహా పనామా, దక్షిణ సూడాన్, టోగో, మలావి వంటి ఇతర దేశాలకు ప్రపంచ రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేదు. కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఓటు వేసిన 12 దేశాల్లో అమెరికా కూడా ఉంది. కానీ ఫిజి, పపువా న్యూ గినియా, టోంగా వంటి మిగిలిన 11 దేశాలు అంతర్జాతీయ వేదికలపై పెద్దగా ప్రభావం చూపలేవు.

అయితే, కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేసిన 149 దేశాలలో, దాదాపు అన్ని ముఖ్యమైన దేశాలు ఉన్నాయి.

చైనా, జపాన్ నుంచి యూరప్ వరకు మొత్తం ఇందులో ఉన్నాయి. కానీ, భారత్ ఈ ముఖ్యమైన దేశాల్లో లేదు. భారత్ సభ్యత్వం కలిగి ఉన్న ఇతర ప్రపంచ స్థాయి సంస్థలలో కూడా ఇజ్రాయెల్ విషయంలో భారత్ వైఖరి భిన్నంగా ఉంది.

ఆయతుల్లా అలీ ఖమేనీ, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు దౌత్యపరమైన సవాల్

షాంఘై సహకార సంస్థ (షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్) ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ జూన్ 14న ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత్ కూడా ఎస్‌సీఓలో సభ్యదేశంగా ఉంది. కానీ, ఎస్‌సీఓ ప్రకటనలో భారత్ భాగం కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదే రోజు ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు, భారత్‌కు బ్రిక్స్‌లో సభ్యత్వం ఉంది. దాదాపు అన్ని బ్రిక్స్ దేశాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించాయి. కానీ, భారత్ తటస్థంగా ఉంది.

యూఎన్‌జీఏలో కూడా, దాదాపు అన్ని బ్రిక్స్ సభ్యదేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేశాయి. ఆ ఓటింగ్‌కు దూరంగా ఉన్న బ్రిక్స్ సభ్య దేశాలు భారత్, ఇథియోపియా.

క్వాడ్‌ను చైనా వ్యతిరేక సమూహంగా చూస్తారు. ఇందులో జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికా ఉన్నాయి. ఇందులో కూడా, జపాన్, ఆస్ట్రేలియా యూఎన్‌జీఏలో కాల్పుల విరమణకు మద్దతుగా ఓటు వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భారత్ వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంగ్లిస్ న్యూస్ పేపర్ ‘ది హిందూ’ డిప్లొమాటిక్ ఎఫైర్స్ ఎడిటర్ సుహాసిని హైదర్, ఎస్‌సీఓలో భారత్ వైఖరి గురించి ఇలా రాశారు, “యూఎన్‌జీఏలో ఎస్‌సీఓ కలవలేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని విమర్శిస్తున్న ఎస్‌సీఓ ప్రకటనకు భారత్ ఇప్పుడు దూరం జరిగింది. భారత్ పశ్చిమాసియాలో చాలా జాగ్రత్తగా సమతుల్య వైఖరిని కొనసాగించింది. ఇప్పుడు ఒక వైపు మొగ్గుతోందా?”

భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. “దౌత్యపరంగా మనం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు, ఎస్‌సీఓ వంటి సమూహాల సభ్యత్వం మధ్య సమతుల్యత సాధించడం కష్టమైన పరిస్థితి” అని అందులో రాశారు.

ప్రముఖ దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితిలో భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్.. జూన్ 12న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసం రాశారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు క్లిష్టమైన పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు.

పహల్గామ్ దాడి, పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ తర్వాత భారత్ విదేశాలకు పంపిన ప్రతినిధుల బృందంలో సయ్యద్ అక్బరుద్దీన్ కూడా ఉన్నారు.

ఇరాన్, భారత్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ మౌనానికి అర్థమేంటి?

“ఓటింగ్‌కు దూరంగా ఉండటం కూడా కొన్నిసార్లు మౌనంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సంక్షోభ సమయాల్లో మౌనం నుంచి అనేక అర్థాలు తీసుకోవచ్చు. మోదీ నాయకత్వంలో, దౌత్యపరంగా భారత్‌పై విశ్వాసం పెరిగింది. అది మనవైపు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించింది. ఆకర్షణ పెరిగినప్పుడు, ప్రజల పర్యవేక్షణ కూడా పెరుగుతుంది. ఇప్పుడు కేవలం భారత్ ఏం చేస్తుందని అడిగే ప్రపంచం కాదిది” అని అక్బరుద్దీన్ ఎక్స్‌లో రాశారు.

”ఇప్పుడు భారత్ ఏం చెబుతుంది, ఏం చెప్పదు అని కూడా గమనిస్తుంటారు. దీనికి భారత్ ఒక పరిష్కారం కనుక్కోవాలి. ఎందుకంటే, మన హోదా పెరిగినప్పుడు.. చర్యను, మౌనాన్ని రెండింటినీ ప్రపంచం గమనిస్తుంది. అంచనా వేస్తుంది” అని ఆయన రాశారు.

థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో అయిన తన్వి మదన్ ఎక్స్‌లో ఇలా రాశారు, “భారత్ సంప్రదాయికంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, ఇరాన్ మధ్య సమతుల్య వైఖరిని కొనసాగిస్తుంది. అయితే, ఇది అందరితోనూ సమానంగా అని కాదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల తర్వాత ప్రధాని మోదీ చెప్పిన దానిని బట్టి చూస్తే.. ఇజ్రాయెల్‌కు స్పష్టమైన మద్దతు ఇవ్వలేదు. అలా అని ఇజ్రాయెల్ దాడిని ఖండించనూలేదు.”

రష్యాతో భారత్‌కు చారిత్రక స్నేహం ఉంది. కానీ, అది ఇజ్రాయెల్‌ను బహిరంగంగా విమర్శిస్తోంది.

శనివారం, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని రష్యా విదేశాంగ మంత్రి ఖండించారు. ఉద్రిక్తతలను తగ్గించడం సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇరాన్‌కు బ్రిక్స్, ఎస్‌సీఓ రెండింటిలోనూ సభ్యత్వం ఉంది.

ఇరాన్‌తో స్నేహాన్నితార్కిక ముగింపునకు తీసుకెళ్లడానికి భారత్ కూడా చాలా కాలంగా సంకోచిస్తోంది.

1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు, ప్రపంచం కొత్త మలుపు తీసుకుంది. అమెరికాతో భారత్ సంబంధాలు బలోపేతం కావడం కూడా భారత్‌ను ఇరాన్‌కు దగ్గర కాకుండా నిరోధించింది.

1990లో భారతదేశ ఆర్థిక సంక్షోభానికి అంతర్జాతీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

1990లో ప్రారంభమైన గల్ఫ్ యుద్ధం భారత్‌పై ప్రత్యక్షంగా ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది.

చమురు ధరల పెరుగుదల, దిగుమతుల పరిమాణం కూడా పెరగడం వల్ల 1990-91లో పెట్రోలియం దిగుమతి బిల్లు రెండు బిలియన్ డాలర్ల నుంచి 5.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)