SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
అణ్వస్త్ర విస్తరణ నిరోధక బాధ్యతలను ఇరాన్ 20 ఏళ్లలో తొలిసారి ఉల్లంఘించినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రకటించింది.
దీనిపై అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా బోర్డులోని 35 దేశాల్లో 19 దేశాలు ఓటు వేశాయి.
ఇరాన్ తన రహస్య అణు కార్యకలాపాల గురించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అనేక సార్లు విఫలమైందని, ఇది నియమావళిని ఉల్లంఘించడమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది.
అణ్వస్త్రాల తయారీకి, అణు విద్యుదుత్పత్తికి అవసరమైన రియాక్టర్లలో ఉపయోగించే శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ తీర్మానం రాజకీయపరమైనదన్న ఇరాన్, తాము కొత్తగా మరో శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని, తాము అణ్వాయుధాలను ఉత్పత్తి చేయడం లేదా సేకరించే ప్రసక్తే ఉండదని నొక్కి చెప్పింది.
ఇరాన్ చెంతకు అణ్వాయుధాలు చేరితే అది తమకు పెనుముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. అందుకే ఇరాన్ మీద దౌత్యమార్గంలో కాకుండా సైనికచర్య తీసుకోవాలని చాలాకాలంగా వాదిస్తున్నారు.
గతేడాది ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్ మీదకు మిసైళ్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇది పశ్చిమాసియాలో పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చనే ఆందోళనలను పెంచింది.


ఫొటో సోర్స్, Getty Images
ఎవరిది పై చేయి?
ప్రపంచంలో ప్రతి దేశానికి గణనీయమైన సామర్థ్యం ఉండవచ్చు. దాన్ని వాళ్లు రహస్యంగా ఉంచే అవకాశం కూడా ఉంది. అయితే అందుబాటులో ఉన్న వనరుల సాయంతో ఎవరిది పై చేయి అనే ప్రశ్నకు సమాధానం గుర్తించే ప్రయత్నం చేసింది బీబీసీ.
అందుబాటులో ఉన్న అధికారిక అంశాల ఆధారంగా, ఉత్తమ అంచనాలను ప్రకటించేందుకు ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) రెండు దేశాల సైన్యాలు, ఆయుధశక్తిని పోల్చి చూసింది.
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి ఇతర సంస్థలు కూడా అంచనాలు వేశాయి. అయితే కచ్చితత్వంలో కొంత తేడా ఉండవచ్చు. ఎందుకంటే దేశాలు తమ సైనిక శక్తి గురించిన వాస్తవాలను తరచుగా ప్రకటించడం లేదు.
ప్రపంచదేశాల సైనిక సామర్థ్యం గురించి తెలుసుకోవడానికి ఐఐఎస్ఎస్ అంచనాలు కొలబద్ద లాంటివని పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్, ఓస్లోకు చెందిన నికొలస్ మార్ష్ చెప్పారు.
రక్షణ బడ్జెట్ విషయంలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తోందని, అందువల్లే యుద్ధం వచ్చినప్పుడు అది బలంగా పోరాడుతోందని ఐఐఎస్ఎస్ చెబుతోంది.
2022, 2023లో ఇరాన్ రక్షణ బడ్జెట్ 7.4 బిలియన్ డాలర్లు ఉందని, అదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 19 బిలియన్ డాలర్లు, అంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉందని ఐఐఎస్ఎస్ చెబుతోంది.
జీడీపీలో రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలోనూ టెల్ అవీవ్, తెహ్రాన్ కంటే చాలా ముందుంది.

ఫొటో సోర్స్, Getty Images
సాంకేతిక అనుకూలత
ఇజ్రాయెల్ వద్ద 340 మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్లు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఐఐఎస్ఎస్ గణాంకాలు చెబుతున్నాయి. దీని వల్ల దాడుల్లో కచ్చితత్వం పెరుగుతుంది.
ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఫైటర్ జెట్ విమానాల్లో ఎఫ్- 15 విమానాలు సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగలవు. ఎఫ్- 35 హైటెక్ స్టెల్త్ విమానాలు రాడార్లను కూడా దాటి పోగలవు, అలాగే వేగంగా దాడులు చేసే హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.
ఇరాన్ వద్ద 320 యుద్ధ సామర్థ్యం ఉన్న విమానాలు ఉన్నాయని ఐఐఎస్ఎస్ అంచనా వేస్తోంది. అయితే ఇవి 1960ల నాటివని, వీటిలో ఎఫ్-4, ఎఫ్-14లు ఉండవచ్చని భావిస్తోంది.
ఇరాన్ వద్ద ఉన్న పాత విమానాల్లో వాస్తవంగా ఎన్ని పని చేస్తున్నాయో స్పష్టంగా తెలియదని నికొలస్ మార్ష్ చెప్పారు. ఈ విమానాల విడి భాగాల్లో పాడైన వస్తువు స్థానంలో కొత్తవి లభించడం చాలా కష్టం.
ఐరన్ డోమ్, యారో
ఇజ్రాయెల్ రక్షణకు ఐరన్ డోమ్, యారో వ్యవస్థలు వెన్నెముక లాంటివి. ఇజ్రాయెల్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్నఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లో పని చేస్తున్న మిసైల్ ఇంజనీర్ యుజి రుబిన్ దీని సృష్టికర్త.
ప్రస్తుతం ఆయన జెరూసలేం ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీలో సీనియర్ పరిశోధకుడిగా ఉన్నారు. గతేడాది ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లను ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్, మిత్ర దేశాలు కూల్చివేసినప్పుడు తాము ఎంత భద్రంగా ఉన్నామో తెలిసిందని ఆయన బీబీసీతో చెప్పారు.
“నాకు తృప్తిగా అనిపించింది. ఇది దీని లక్ష్యాలను సాధించడంలో చాలా ప్రత్యేకమైనది. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్. దీనికి సమానమైనది మరొకటి లేదు” అని చెప్పారాయన.

ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ఎంత దూరం?
రెండు దేశాల మధ్య 2,100 కిలోమీటర్ల దూరం ఉంది. ఒక దేశం మరో దేశంపై దాడి చేయాలంటే క్షిపణులు ప్రధానం అని ‘డిఫెన్స్ ఐ’ ఎడిటర్ టిమ్ రిప్లే బీబీసీతో చెప్పారు.
పశ్చిమాసియాలో ఇరాన్ మిసైల్ కార్యక్రమం అతి పెద్దది, వైవిధ్యమైనదిగా భావిస్తారు.
ఇరాన్ వద్ద 3వేలకు పైగా ఖండాంతర క్షిపణులు ఉన్నాయని 2022లో అమెరికన్ సెంట్రల్ కమాండ్కు చెందిన జనరల్ కెన్నెత్ మెకంజీ చెప్పారు.
ఇజ్రాయెల్ అనేక దేశాలకు క్షిపణులను ఎగుమతి చేస్తోందని సీఎస్ఐఎస్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టు చెబుతోంది.
1980 నుంచి 1988 మధ్య పొరుగునున్న ఇరాక్తో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ తన క్షిపణి వ్యవస్థపై విస్తృతంగా పని చేసింది.
ఇందులో భాగంగా స్వల్పశ్రేణి, దీర్ఘశ్రేణి మిసైళ్లు, డ్రోన్లను అభివృద్ధి చేసింది.
హుతీ రెబెల్స్ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించేందుకు సిద్ధం చేసిన క్షిపణులు ఇరాన్లో తయారైనవని విశ్లేషకులు నిర్థరించారు.

ఫొటో సోర్స్, Reuters
‘శిక్షించడమే’ ఇజ్రాయెల్ విధానం!
ఇరాన్తో ఇజ్రాయెల్ భూతల యుద్ధం చేసే పరిస్థితి ఉండకపోవచ్చని ‘డిఫెన్స్ ఐ’కి చెందిన టిమ్ రిప్లే చెప్పారు.
“ఇజ్రాయెల్కున్న అతి పెద్ద అవకాశం దాని వైమానిక శక్తి, లక్షిత ఆయుధాలు. అందుకే ఇరాన్లో కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసే సామర్థ్యం దానికి ఉంది”
వైమానిక దాడుల ద్వారా ఇరాన్లో కీలక అధికారులను చంపేయడం, చమురు కేంద్రాలను ధ్వంసంచేసేలా ఇజ్రాయెల్ ప్రయత్నించవచ్చని రిప్లే చెప్పారు.
“శిక్షిద్దాం. ఇదే వాళ్ల విధానం. ఇజ్రాయెల్ సైన్యం, ఆ దేశ నాయకులు, ఈ పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. ఇది వారి ఫిలాసఫీలో భాగం. ప్రత్యర్థులు ఇజ్రాయెల్ గురించి ఆలోచించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఆ బాధ కలిగించాలి”
గతంలో ఇరాన్లో సైనిక, రాజకీయ నాయకులు అనేక మంది వైమానిక దాడుల్లో చనిపోయారు. 2024 ఏప్రిల్ 1న సిరియా రాజధానిలోని ఇరానియన్ కాన్సులేట్ భవనంపైనా వైమానిక దాడి జరిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది.
ఆ దాడికి తమదే బాధ్యతని ఇజ్రాయెల్ ఎన్నడూ చెప్పలేదు. అనేక మంది ప్రముఖ ఇరానియన్ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులపైనా స్పందించలేదు.
అలాగే ఆ దాడుల్ని తాము చేయలేదని కూడా చెప్పలేదు.
ఇక ఇరాన్కు పురాతన నౌకా దళంలో 220 నౌకలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద 60 ఉన్నాయని ఐఐఎస్ఎస్ నివేదికలు చెబుతున్నాయి.ఇజ్రాయెల్ వద్ద 60 నౌకలు ఉన్నాయని ఐఐఎస్ఎస్ చెబుతోంది.

ఫొటో సోర్స్, EPA
సైబర్ దాడులు
సైబర్ దాడి జరిగితే ఇరాన్ కంటే ఇజ్రాయెల్ ఎక్కువగా నష్టపోతుంది.ఇరాన్ రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ కంటే సాంకేతికంగా వెనకబడి ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ సాంకేతికతపైన ఎక్కువగా ఆధారపడిన రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది. అందుకే సైబర్ దాడి జరిగితే ఇజ్రాయెల్కే ఎక్కువ నష్టం జరుగుతుంది.
“సైబర్ దాడుల తీవ్రత గతంలో కంటే పెరిగింది. కనీసం మూడు రెట్లు ఎక్కువైంది. ఇజ్రాయెల్లోని ప్రతి రంగంపైనా దాడులు జరుగుతున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్ హిజ్బొల్లా మధ్య సహకారం బాగా పెరిగింది” అని ఇజ్రాయెల్ ప్రభుత్వ జాతీయ సైబర్ డైరెక్టరేట్ తెలిపింది.
2023 అక్టోబర్ 7 నుంచి ఆ ఏడాది చివరి వరకు 3380 సైబర్ దాడులు జరిగాయని కథనాలు వచ్చాయి. 2024 పార్లమెంటరీ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు తాము 200 సైబర్ దాడులను భగ్నం చేసినట్లు ఇరాన్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అధిపతి బ్రిగేడియర్ జనరల్ ఘోలంరెజా జలాలి చెప్పారు.
గతేడాది డిసెంబర్లో సైబర్ దాడి కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఆటంకం ఏర్పడిందని ఇరాన్ చమురు శాఖ మంత్రి జవద్ ఔజి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
అణు ముప్పు
ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, అయితే అది అధికారికంగా కావాలనే సందిగ్ధంగా వ్యవహరిస్తోంది.
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని భావిస్తున్నారు, అయితే తెహ్రాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పౌర అణు కార్యక్రమాన్ని అణ్వాయుధాల తయారీకి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను ఇరాన్ నాయకత్వం తోసిపుచ్చింది.
భౌగోళికంగా, జనాభా పరంగా..
ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్దది. ఇజ్రాయెల్ జనాభా( కోటి మంది) కంటే ఇరాన్ జనాభా(దాదాపు 9 కోట్ల మంది) పది రెట్లు ఎక్కువ.
ఇజ్రాయెల్ సైనికుల కంటే ఇరాన్ సైనికుల సంఖ్య కూడా ఆరు రెట్లు ఎక్కువ. ఇరాన్లో 6లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య లక్షా 70వేల మంది మాత్రమేనని ఐఐఎస్ఎస్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇరాన్ కార్డ్’
ఇజ్రాయెల్ పార్లమెంట్, మంత్రి వర్గంలో ఉండి యుద్ధాన్ని కోరుకుంటున్న వారు ప్రధానమంత్రి నెతన్యాహుపై ఒత్తిడి తెస్తున్నారని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణుడు తారిక్ సులేమాన్ బీబీసీతో చెప్పారు.
“నెతన్యాహు రాజకీయంగా బలహీన పడగానే ఇరాన్ కార్డు బయటకు తీస్తారు” అని ఆయన అన్నారు.
గతేడాది ఇజ్రాయెల్లోని హీబ్రూ యూనివర్సిటీ నిర్వహించిన ఒక పోల్లో ఇరాన్ మీద ప్రతీకార దాడులని మూడొంతుల మంది ప్రజలు వ్యతిరేకించినట్లు తేలింది. దీని వల్ల ఇజ్రాయెల్ మిత్ర దేశాల భద్రతా కూటమిని దెబ్బ తీస్తుందని చెప్పారు.
2024 ఏప్రిల్ 14,15న ఈ పోల్ నిర్వహించినట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోల్లో 1466 మది మహిళలు, పురుషులు, యూదులు, అరబ్బులు పాల్గొన్నారని, ఇంటర్నెట్, టెలిఫోన్ ద్వారా వారి అభిప్రాయాలు సేకరించినట్లు అందులో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Houthi militants handout / EPA
ఇరాన్ పరోక్ష యుద్ధం
ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగలేదు. అయితే అనధికారికంగా రెండు దేశాలు నిరంతరం కత్తులు దూస్తూనే ఉన్నాయి. ఇరాన్ ప్రముఖులు స్వదేశంలో, విదేశాల్లో హత్యకు గురైనప్పుడల్లా తెహ్రాన్ నాయకత్వం ఇజ్రాయెల్పై ఆరోపణలు చేస్తోంది. ఇరాన్తో సన్నిహితంగా ఉంటున్న కొన్ని సంస్థలు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి.
2023-24లో ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా 13నెలల పాటు యుద్ధం చేశాయి. ఇది 2024 అక్టోబర్లో దక్షిణ లెబనాన్లో భూతల దాడికి దారి తీసింది. హిజ్బొల్లాకు మద్దతును ఇరాన్ ఎన్నడూ ఖండించలేదు.అలాగే హమాస్కు ఇరాన్ మద్దతు కూడా. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగం మీదకు అనేక దశాబ్ధాలుగా హమాస్ రాకెట్ దాడులు చేస్తూనే ఉంది.
హమాస్కు ఇరాన్ నుంచి ఆయుధాలు, నిధులు, శిక్షణ అందుతున్నాయని ఇజ్రాయెల్తో పాటు పశ్చిమ దేశాలు కూడా నమ్ముతున్నాయి.
యెమెన్లో హౌతీలను కూడా ఇరాన్కు సన్నిహిత సంస్థగా చూస్తున్నారు. తమపై హౌతీలు ప్రయోగించిన క్షిపణులు ఇరాన్లో తయారయ్యాయని సౌదీ అరేబియా ఆరోపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)