SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
50 నిమిషాలు క్రితం
ఇరాన్ సుప్రీంలీడర్ ఎక్కడున్నారో తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అయతొల్లా అలీ ఖమేనీ పేరు ప్రస్తావించకుండా ‘సుప్రీంలీండర్ అనే వ్యక్తి దాక్కున్నారు’ అని ట్రంప్ చెప్పారు.
తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఇరాన్ గురించి ట్రంప్ అనేక పోస్టులు చేశారు. తాజాగా చేసిన పోస్టులో ‘షరతులు లేని లొంగుబాటు’ జరగాలని ఇరాన్ను ఉద్దేశిస్తూ ఆయన పోస్టు చేశారు.
”ఇరాన్ సుప్రీంలీడర్ ఎక్కడున్నారో మాకు తెలుసు. కానీ ఇప్పుడాయన్ని మేం చంపబోవడం లేదు” అని మరో పోస్టులో ట్రంప్ రాశారు.
”సుప్రీం లీడర్ దాక్కున్న కచ్చితమైన ప్రదేశం మాకు తెలుసు. ఆయన్ను తేలిగ్గా లక్ష్యం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆయన అక్కడ సురక్షితంగా ఉన్నారు” అని ట్రంప్ తెలిపారు.
”వాళ్లను ఆపాలని(చంపాలని)మేం అనుకోవడం లేదు. కనీసం ఇప్పటికైతే అనుకోవడం లేదు. కానీ, మా సహనం నశించిపోతోంది” అని ట్రంప్ తెలిపారు.
ఈ పోస్టుకు కొన్ని నిమిషాల ముందు ‘ఇరాన్ గగనతలంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది’ అని ట్రంప్ అన్నారు.
”ఇరాన్ దగ్గర మంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ సామాగ్రి భారీ మొత్తంలో ఉంది. కానీ అవి అమెరికాలో రూపొందించి తయారుచేసిన వాటితో సరిపోలవు” అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, EPA
ఇరాన్పై దాడుల్లో అమెరికా కూడా పాల్గొంటుందా?
చాలా కాలంగా ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సాయం అందిస్తోంది. శుక్రవారం (జూన్ 13) ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పుడు, వాటిలో తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది.
అయితే ఇరాన్ అణుకేంద్రంగా చేసుకుని ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో భాగస్వామ్యం కావాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్టు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ తెలిపింది. కానీ, ట్రంప్ ఆ నిర్ణయం తీసుకోగలరా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని బీబీసీ ప్రాంక్ గార్డెనర్ అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్, ఇరాన్ సంక్షోభంపై వైట్ హౌస్లో అత్యవసర సమావేశం జరిగింది. వైట్హౌస్ సిట్యువేషన్ రూమ్లో ట్రంప్ ఈ సమావేశం నిర్వహించారు.
ఫోర్డో సహా ఇరాన్లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపే దాడుల్లో భాగస్వామ్యం కావాలని ట్రంప్ భావించారని, అయితే ఆయన సన్నిహిత సలహాదారుల మధ్య పూర్తి అంగీకారం కుదరలేదని సీబీఎస్ తెలిపింది. బాగా భూగర్భంలో ఉండే ఫోర్డోలోని యురేనియం సెంటర్ను ధ్వంసం చేయగల శక్తి అమెరికా దగ్గర మాత్రమే ఉంది.
”ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని” మంగళవారం సోషల్ మీడియాలో చేసిన పోస్టుల్లో ట్రంప్ డిమాండ్ చేశారు.
ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా పాల్గొనేలా చేసే ట్రంప్ అధికారాలను పరిమితం చేసే బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు చర్చిస్తున్నారు.
కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్పై ట్రంప్ దాడులకు పాల్పడలేరని యుద్ధ అధికారాల తీర్మానం చెబుతోంది.
అమెరికా ఇరాన్తో పోరాడితే, ఇది పశ్చిమాసియాలో 2001 తర్వాత అమెరికా చేస్తున్న మూడో యుద్ధం అవుతుందని బిల్లుపై సెనేట్లో చర్చ సందర్భంగా వర్జీనియా డెమోక్రటిక్ సెనేటర్ టిమ్ కైన్ అన్నారు
ఇరాన్తో అలాంటి యుద్ధం ‘అమెరికాకు ఒక వినాశనకరమైన తప్పిదం’ అవుతుందని, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై విస్తృత దాడులకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Instagram/g.lockaviation
యూకే స్థావరం నుంచి బయలుదేరిన అమెరికా బాంబర్ జెట్లు
ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకోనుందన్న వార్తలు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఇంగ్లండ్లోని బేస్ నుంచి అమెరికా ఫైటర్ జెట్లు బయలుదేరాయి.
లేకెన్హీత్ రాయల్ ఎయిర్ఫోర్స్ నుంచి ఎఫ్ -35 ఫైటర్ జెట్లు బయలుదేరుతున్నట్టు ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోల్లో కనిపిస్తోంది.
వాటితో పాటు గాలిలో ఇంధనం నింపుకునే విమానం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్తో రాజీ లేదు- ఖమేనీ
ఇజ్రాయెల్తో తాము ఎప్పటికీ రాజీపడబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చెప్పారు.
”మేం జియోనిస్టులపై దయచూపబోం” అని ఆయనన్నారు. సొంత సోషల్ మీడియాలో దీనిపై వరుస పోస్టులు చేశారు. మరో పోస్టులో ‘యుద్ధం మొదలైంది’ అని ఆయన రాశారు.
”ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు. కానీ మేం ఆయన్ను బయటకు తీసుకురాం” అని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఖమేనీకి చెందిన అనేక భాషల అకౌంట్లలో ఆయన తాజా వ్యాఖ్యలు కనిపించాయి.
ఖమేనీని చంపాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికకు ట్రంప్ అంగీకరించలేదని ఈ వారం ప్రారంభంలో బీబీసీ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Reuters
తెహ్రాన్పై ఇజ్రాయెల్ వరుస దాడులు
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి ఐదురోజులయింది. అప్పటినుంచి రెండువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్ మిలటరీ చర్య లక్ష్యం ఇరాన్లో అధికార మార్పిడి కాదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు.
తెహ్రాన్ దగ్గరలోని ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.
తెహ్రాన్ దగ్గరలోని ఖోజిర్ క్షిపణి తయారీ కేంద్రాన్ని తాజా దాడుల్లో ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ మీడియా తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ కేంద్రం కీలకమైనది. గత ఏడాది అక్టోబరులోనూ ఇజ్రాయెల్ దాడుల్లో ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఫొటో సోర్స్, EPA
ఫతా క్షిపణులతో ఇరాన్ దాడులు
టెల్ అవీవ్ మీద ఫతా-1 హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్టు ఇరాన్ తెలిపింది.
ఈ క్షిపణులు ప్రయోగించినట్టు ప్రభుత్వానికి చెందిన ప్రెస్ టీవీ కూడా తెలిపింది. ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) ఈ విషయం చెప్పినట్టు రెండు సంస్థలు తెలిపాయి.
‘ఆపరేషన్లో తాజా దశ కీలకమైనదిగా ఐఆర్జీసీ వర్ణించింది. ఫతా క్షిపణుల మోహరింపు, ఇజ్రాయెల్ ‘అభూత కల్పన’ లాంటి రక్షణ వ్యవస్థల ముగింపుకు ప్రారంభమని ఐఆర్జీసీ చెప్పింది’ అని ప్రెస్ టీవీ తెలిపింది.
2024 అక్టోబరులో ఇజ్రాయెల్పై చేసిన దాడిలో కూడా పదులసంఖ్యలో ఫతా క్షిపణులను ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించింది. అయితే తాజా సంక్షోభంలో ఈ క్షిపణులు ఉపయోగించడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.
ఫతా క్షిపణిని 2023లో తయారుచేశారు.
ఇజ్రాయెల్పై దాడి చేసే క్షిపణిగా ఐఆర్జీసీ దీన్ని అభివర్ణించింది. క్షిపణి ఆవిష్కరణ సమయంలో తెహ్రాన్లో ఏర్పాటుచేసిన బ్యానర్లో ‘టెల్ అవీవ్కు 400 సెకన్లు’ అని హిబ్రూలో రాశారు.
ఫతా హైపర్సోనిక్ క్షిపణి అని ఐఆర్జీసీ చెబుతుండగా సైనిక నిపుణులు మాత్రం దాని హైపర్సోనిక్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు టెల్ అవీవ్ పొరుగు ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆదేశించిందని ఇరాన్ మీడియా తెలిపింది. తూర్పు నుంచి వస్తున్న రెండు డ్రోన్లను తాము అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) ప్రకటించిన తర్వాత ఈ ఆదేశాలొచ్చాయి. ఇజ్రాయెల్లోని డెడ్ సీ ప్రాంతంలో సైరన్లు మోగించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని భారతీయ విద్యార్థులను తెహ్రాన్ నుంచి తరలించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)