SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జీన్ మెకంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
1 జూన్ 2025
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల మధ్య దట్టమైన ముళ్లతీగల కంచెలు, వందలాది సెక్యూరిటీ పోస్టులు (గార్డ్ పోస్ట్) ఉంటాయి. కానీ, వాటి మధ్య భారీ, గ్రీన్ క్యామోఫ్లాగ్ స్పీకర్లు ఉండటం అసాధారణంగా కనిపిస్తోంది.
గత నెలలో ఒక రోజు మధ్యాహ్నం, ఒక స్పీకర్ నుంచి దక్షిణ కొరియా పాప్ సాంగ్స్ రావడం మొదలైంది.
”విదేశాల్లో తిరుగుతుంటే వచ్చే మజానే వేరు” అనే అర్థం వచ్చేలా ఒక మహిళా గాయని పాడిన పాట స్పీకర్ నుంచి వినిపిస్తోంది.
ఉత్తర కొరియా ప్రజలకు తమ దేశాన్ని విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేనందున ఇది వారిని ఉద్దేశించి పాడిన పాటలా అనిపించింది.
అదే సమయంలో ఆ పాట తమ వైపు వినిపించకుండా ఉత్తర కొరియా వారు మోగించిన మిలటరీ ప్రచార సంగీతం కూడా లీలగా వినిపించింది.

ఈ రెండు దేశాల మధ్య కాల్పులు జరిగి ఏళ్లు గడుస్తున్నా, సాంకేతికంగా అవి యుద్ధంలోనే ఉన్నాయి. ఇరుదేశాలూ ‘సమాచార యుద్ధాన్ని’ చేస్తున్నాయి.
ప్రపంచంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని ఏకైక దేశం ఉత్తర కొరియా. అక్కడ నడిచే టీవీచానెళ్లు, రేడియో స్టేషన్లు, వార్తాపత్రికలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనివే.
”కిమ్ కుటుంబం చాలా కట్టుకథల్ని అక్కడ ప్రచారంలోకి తెచ్చింది. అందుకే ఈ నియంత్రణ పెట్టింది. వారు ప్రజలకు చెప్పేవాటిలో చాలా వరకు అబద్ధాలే” అని వాషింగ్టన్కు చెందిన స్టిమ్సన్ సెంటర్ సీనియర్ ఫెలో, నార్త్ కొరియా టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ నిపుణుడు మార్టిన్ విలియమ్స్ అన్నారు.

ఉత్తర కొరియాలోకి సమాచారాన్ని చేరవేసేందుకు దక్షిణ కొరియా ప్రయత్నిస్తుంటే కిమ్జోంగ్ దానిని అడ్డుకోవడానికి, తన ప్రజలకు బాహ్యప్రపంచ సమాచారం చేరకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ అబద్ధాలను ప్రజలకు తెలిసేలా చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోయే అవకాశముందని దక్షిణ కొరియా భావిస్తోంది.
అందుకే దక్షిణ కొరియా ప్రభుత్వం లౌడ్ స్పీకర్లను ఒక మార్గంగా ఎంచుకుంది. కానీ, తెరవెనుక మరో అధునాతన ఉద్యమం అభివృద్ధి చెందింది.
కొంతమంది ప్రసారకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులు రాత్రివేళ రేడియో తరంగాల రూపంలో సమాచారాన్ని ఉత్తర కొరియాలోకి ప్రసారం చేస్తున్నారు. దీంతో ఉత్తర కొరియా ప్రజలు రహస్యంగా వాటిని వినొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి నెలా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ డ్రామాలు, పాప్ సాంగ్స్, వార్తల సమాచారం ఉన్న వేలాది యూఎస్బీ స్టిక్లు, మైక్రో ఎస్డీ కార్డులు సరిహద్దుల ద్వారా ఉత్తర కొరియాలోకి అక్రమ రవాణా అవుతున్నాయి. వీటిలోని సమాచారమంతా ఉత్తర కొరియా ప్రచారాన్ని సవాలు చేసేలా ఉంటుంది.
కానీ, ఇప్పుడు ఈ పని చేస్తున్నవారంతా తమపై ఉత్తర కొరియా పైచేయి సాధిస్తుందని భయపడుతున్నారు.
విదేశీ కంటెంట్తో పట్టుబడిన వారి పట్ల కిమ్ కఠినంగా వ్యవహరించడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన ఎయిడ్ కట్ కారణంగా భవిష్యత్లో ఈ పని ఇబ్బందుల్లో పడొచ్చు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే ఎక్కువ భాగం ఈ పని జరుగుతోంది.
ఎంతోకాలంగా జరుగుతున్న సమాచార యుద్ధంలో ఇప్పుడు ఈ రెండు దేశాల పరిస్థితి ఎలా ఉండనుంది?

ఫొటో సోర్స్, Getty Images
పాప్ సాంగ్స్, టీవీ డ్రామాల అక్రమ రవాణా
యూనిఫికేషన్ మీడియా గ్రూప్ (యూఎంజీ) అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉత్తర కొరియాకు పంపాల్సిన తాజా వార్తలు, ఎంటర్టైన్మెంట్ అంశాలను సేకరించి ప్లే లిస్టుల్లా తయారు చేస్తారు.
దక్షిణ కొరియా టీవీ డ్రామాలు, పాప్ సాంగ్స్లాంటివాటిని తక్కువ ప్రమాదకర జాబితాలోనూ, విద్యాసంబంధిత కార్యక్రమాలు, మానవహక్కులు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన కంటెంట్ను ఎక్కువ ప్రమాదం (హై రిస్క్) జాబితాగా వర్గీకరించి వాటిని యూఎస్బీలలో పొందుపరుస్తారు.
తర్వాత వీటిని చైనా సరిహద్దులకు పంపిస్తారు. అక్కడ యూఎంజీకి చెందిన భాగస్వాములు ప్రమాదకర పరిస్థితుల్లో వాటిని నది గుండా ఉత్తర కొరియాలోకి చేరవేస్తారు.
దక్షిణ కొరియా ప్రజలు పేదరికంలో నివసిస్తున్నారని, వారు దారుణ అణచివేతకు గురయ్యారని కిమ్ తమ దేశంలో ప్రచారం చేశారు.
అయితే, ఈ ప్రచారానికి విరుద్ధంగా దక్షిణ కొరియా ప్రజల సాధారణ జీవన శైలి అంటే ఎత్తైన అపార్ట్మెంట్లలో జీవించడం, కార్లలో తిరగడం, రెస్టారెంట్లలో తినడం వంటి విషయాలను ఈ టీవీ డ్రామాలు ప్రతిబింబిస్తాయి.
”ఈ డ్రామాలు చూస్తూ కన్నీరు పెట్టుకున్నట్లు కొంతమంది మాకు చెప్పారు. మొదటిసారి తమ కలల గురించి ఆలోచించేలా చేశాయని వారు అన్నారు” అని యూఎంజీ డైరెక్టర్ లీ క్వాంగ్ బీక్ అన్నారు.
ఉత్తర కొరియాలో రాజకీయ ప్రతిపక్షం లేదు, అలాగే అసమ్మతివాదులు లేరు. నిరసన తెలపడానికి గుమిగూడటం అక్కడ చాలా ప్రమాదకరం.

ఉత్తర కొరియా నుంచి తప్పించుకోవడం
దక్షిణ కొరియా కంటెంట్ను చూస్తున్న కొద్దీ తమ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు అర్థమయ్యాయని 2023లో ఉత్తర కొరియా నుంచి పడవలో పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చిన 24 కాంగ్ గ్యురీ చెప్పారు.
”నాకు అక్కడ ఊపిరి ఆడలేదు. అక్కడినుంచి పారిపోవాలనే కోరిక కలిగింది. యూఎస్బీల ద్వారా ఈ టీవీ కార్యక్రమాలతో కాస్త ప్రేరణ పొందాను” అని ఆమె వెల్లడించారు.
యువతపై అణచివేత, శిక్షలు
ఈ ముప్పు గురించి తెలిసిన కిమ్ జాంగ్ ఉన్ ఎదురుదాడి చేస్తున్నారు.
మహమ్మారి సమయంలో, చైనా సరిహద్దుల వెంబడి విద్యుత్ కంచెలను నిర్మించారు. దీనివల్ల సమాచారాన్ని దేశంలోకి అక్రమ రవాణా చేయడం కష్టమైంది.
అలాగే, విదేశీ మీడియాను చూస్తూ, ఇతరులకు షేర్ చేస్తూ పట్టుబడిన వారికి శిక్షలను మరింత పెంచుతూ 2020లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు.
ఇలాంటి కంటెంట్ను పంపిణీ చేసేవారిని జైల్లో పెట్టొచ్చు లేదా ఉరి తీయచ్చు అని అందులో పేర్కొన్నారు.
దక్షిణ కొరియా కంటెంట్తో పట్టుబడిన కేసుల్లో ఎక్కువ మందిని ఉరి తీస్తున్నట్లుగా తనకు తెలిసిందని కాంగ్ చెప్పారు.
దక్షిణ కొరియా జాతీయాలను వాడినా, వారి యాసలో మాట్లాడినా నేరంగా పరిగణిస్తామని 2023లో కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు.
దీని కోసం ఏర్పాటు చేసిన ‘యూత్ క్రాక్డౌన్ స్క్వాడ్’ వీధుల్లో గస్తీ కాస్తూ యువత ప్రవర్తనను, మాటతీరును పరిశీలిస్తుంది. దక్షిణ కొరియా వాళ్లలా జుట్టును స్టయిలింగ్ చేసుకున్నందుకు ఈ బృందం వారు తనను మందలించారని కాంగ్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
నిధుల కోతలు, ట్రంప్ ప్రభావం
డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొన్ని సహాయసంస్థలకు నిధులు నిలిపేశారు. వీటిలో ఉత్తర కొరియాకు సమాచారం అందించడానికి పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి.
ఉత్తర కొరియాలో రాత్రిపూట ప్రసార కార్యక్రమాలు అందించే రేడియో ఫ్రీ ఆసియా, వాయిస్ ఆఫ్ అమెరికా (వీఓఏ) అనే రెండు వార్తా సర్వీసులకు కూడా ఆయన నిధులు నిలిపేశారు.
వాయిస్ ఆఫ్ అమెరికా వార్తా సంస్థ ‘ట్రంప్ వ్యతిరేకి’, ‘రాడికల్’ అని ట్రంప్ ఆరోపించారు.
”ఉత్తర కొరియా ప్రజల బయటి ప్రపంచంలోకి వెళ్లడానికి అందుబాటులో ఉన్న అతికొద్ది మార్గాల్లో వీఓఏ ఒకటి. ఇప్పుడు ఎలాంటి వివరణ ఇవ్వకుండా వీఓఏ నోరు నొక్కారు” అని సోల్కు చెందిన వీఓఏ మాజీ బ్యూరో చీఫ్ స్టీవ్ హెర్మన్ అన్నారు.
బిల్లులు ఎవరు చెల్లించాలి?
ఇప్పుడు సమాచారాన్ని చేరవేసే పనికి నిధులు ఎవరు సమకూరుస్తారు? అనేదే ప్రశ్న.
మొత్తంగా అమెరికాపైనే ఎందుకు ఆధారపడ్డారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
దక్షిణ కొరియా ఈ బిల్లులు చెల్లించడం ఒక పరిష్కారంగా చూస్తున్నారు. కానీ, ఉత్తర కొరియా సమస్య ఇక్కడ పూర్తిగా రాజకీయంగా మారిపోయింది.
ప్రతిపక్ష లిబరల్ పార్టీ, ప్యాంగ్యాంగ్తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి చూస్తోంది. అలాంటప్పుడు సమాచార యుద్ధానికి నిధులు సమకూర్చడం కష్టం.
వచ్చే వారం జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేస్తోన్న వ్యక్తి, ఒకవేళ తాను అధికారంలోకి వస్తే లౌడ్ స్పీకర్లను తీసేస్తాననే సంకేతాలు ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS