SOURCE :- BBC NEWS

ఎన్టీ రామారావు

ఫొటో సోర్స్, facebook/TDP.Official

  • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
  • హోదా, బీబీసీ కోసం
  • 27 మే 2025

న‌ట‌ర‌త్నగా పిలుచుకునే ఎన్‌టీ రామారావు (ఎన్టీఆర్) అంటే తెలుగు ప్ర‌జ‌ల్లో చాలామందికి ప్రత్యేక ఆరాధనాభావం ఉండేది.

ల‌వ‌కుశ‌, వెంక‌టేశ్వ‌ర మ‌హ‌త్యం సినిమాలు వ‌చ్చిన‌పుడు థియేట‌ర్‌లోకి వెళ్లే ముందు ఆయ‌న అభిమానులు పోస్ట‌ర్‌కి దండం పెట్టుకుని వెళ్లేవాళ్లు.

అలాంటి ఎన్టీఆర్‌ని ఎద్దేవా చేస్తూ ఒకప్పుడు వ‌రుస‌గా రాజ‌కీయ సినిమాలు వ‌చ్చాయి.

మండ‌లాధీశుడులో ఎన్టీఆర్‌ని అనుక‌రిస్తూ న‌టించిన కోట శ్రీ‌నివాస‌రావుపై అప్పట్లో విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్‌లో దాడి కూడా జ‌రిగింది.

త‌న‌ని కొట్టార‌ని ఆయ‌నే స్వ‌యంగా ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు.

అస‌లు తెలుగునాట సినిమా రాజ‌కీయాలు, రాజ‌కీయ సినిమాలు ఎప్పుడు ప్రారంభ‌మ‌య్యాయో ఒక‌సారి చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎన్టీఆర్

ఫొటో సోర్స్, TDP

లోక్‌సభకు ఎన్నికైన తొలి సినిమా న‌టుడు తెలుగు వారే. ఆయ‌న కొంగ‌ర జ‌గ్గ‌య్య‌.

1967లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఎన్నిక‌య్యారు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తొలినాళ్లలో కాంగ్రెస్ అభిమానులు, క‌మ్యూనిస్ట్ భావ‌జాల ప్రతినిధులు ఉండేవారు.

ప్ర‌జానాట్య మండ‌లి స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చిన అనేక మంది న‌టులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు త‌మ లెప్ట్ భావ‌జాలాన్ని సినిమాల్లో కనబరిచేవారు.

అయితే, రాజ‌కీయ వ్యంగ్య‌మే త‌ప్ప‌, నేరుగా వ్య‌క్తిగ‌త దాడులుండేవి కావు.

వ్య‌క్తుల్ని ఎద్దేవా చేయ‌డం తెలియ‌ని కాలం.

1954లో కేవీ రెడ్డి తీసిన ‘పెద్ద మ‌నుషులు’ తొలి తెలుగు రాజ‌కీయ వ్యంగ్య చిత్రం అనుకుంటే.. ప్ర‌జా నాయ‌కుడు, దేశోద్ధార‌కులు సినిమాల్లో పొలిటిక‌ల్ సెటైర్స్ చాలా ఉంటాయి.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌డంతో విష‌యాలు మారిపోయాయి.

నందమూరి జయకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణలతో ఎన్టీఆర్

ఫొటో సోర్స్, facebook/TDP.Official

తమిళనాడులో ప్రారంభం

సినిమా, రాజ‌కీయం క‌లిసిపోవ‌డం మొద‌ట త‌మిళ‌నాడులో ప్రారంభ‌మైంది.

జ‌స్టిస్ పార్టీ మూలాల‌తో ప్రారంభ‌మైన డిఎంకె, సినిమాని పార్టీ ప్ర‌చార సాధ‌నంగా అద్భుతంగా వాడుకుంది.

సినిమా ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన అన్నాదురై, అనేక సినిమాల‌కి స్క్రిప్ట్ రాసిన క‌రుణానిధి ముఖ్య‌మంత్రి అయ్యారు.

కాంగ్రెస్ పార్టీని త‌మిళ‌నాడులో దెబ్బ‌తీశారు.

ఆ త‌ర్వాత నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎమ్జీఆర్) ముఖ్య‌మంత్రి కావ‌డంతో ఆ తరువాత త‌మిళ‌నాడులో రాజ‌కీయాల్లోకి వెళ్లాలంటే సినిమా తొలి మెట్టుగా మారింది.

ఇప్పటికీ సినిమాల నుంచి రాజకీయ ప్రయత్నాలు చేస్తున్న నటులు అక్కడ ఉన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే అప్పట్లో అగ్ర న‌టులెవ‌రూ రాజ‌కీయ ఆస‌క్తులు ఉన్న‌వారు కాదు.

విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు జ‌నంలోకి వెళ్లి విరాళాలు సేక‌రించి ప్ర‌భుత్వానికి అందించేవాళ్లు. అంతే త‌ప్ప నేరుగా జ‌నాల‌తో సంబంధం లేదు. రాజ‌కీయాలు మాట్లాడ‌డం, నేత‌ల‌తో స‌న్నిహితంగా ఉండ‌డం తెలియ‌దు.

రాజ‌కీయాల్లో ఇందిరాగాంధీకి ఎక్కువ ఆదరణ ఉండేది. ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో (1977) కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 42 సీట్ల‌కుగాను 41 సీట్ల‌లో గెలిచింది.

ఒక్క నంద్యాల‌లో మాత్రమే కాంగ్రెస్ గెలవలేదు. అక్కడ నీలం సంజీవ‌రెడ్డి భారతీయ లోక్‌దళ్ (బీఎల్‌డీ) నుంచి గెలిచారు.

1978లో కాంగ్రెస్ చీలిపోయిన త‌ర్వాత క‌ష్ట‌కాలంలో కూడా జ‌నం ఇందిర వెంటే నిలిచారు.

ఐదేళ్లు కాంగ్రెస్సే అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం. న‌లుగురు ముఖ్య‌మంత్రులు మారారు. జ‌నం విసిగివేసారారు. ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురు చూశారు.

అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. ప్ర‌భంజ‌నం మొద‌లైంది.

పీవీ నరసింహారావుతో ఎన్టీఆర్

ఫొటో సోర్స్, facebook/TDP.Official

త‌న మిత్రుడు భ‌వ‌నం వెంక‌ట్రామి రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసినప్పుడు ఎన్టీఆర్ హాజ‌ర‌య్యారు.

రాజకీయ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న్ను చూడ‌డం అదే మొద‌లు.

అక్క‌డి హంగామా చూసిన ఎన్టీఆర్ రాజ‌కీయాల‌పై ఆసక్తి పెంచుకుని రాజ్య‌స‌భ సీటు అడిగార‌ని, అయితే సౌత్ నుంచి శివాజీ గ‌ణేశ‌న్ అప్పటికే స‌భ్యుడిగా ఉండ‌డం వ‌ల్ల కాంగ్రెస్ తిర‌స్క‌రించింద‌నే క‌థ‌నం ఉంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు.

అనూహ్య‌మైన బ‌లంతో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆయ‌న మీద జ‌నం చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.

అనుభ‌వం లేక‌పోవ‌డంతో ఆయ‌న నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మయ్యేవి.

కృష్ణ

ఫొటో సోర్స్, Super Star Krishna Library/Facebook

ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేజారిపోవ‌డంతో ఇందిరాగాంధీ షాక్‌కు గురయ్యారు. కంచుకోట‌లో జ‌రిగిన అవ‌మానం తొల‌చివేసింది.

ఎమ్మెల్యేల‌ని చీల్చి ప్ర‌భుత్వాల‌ని ప‌డ‌గొట్టే సంస్కృతి అప్ప‌టికే మొద‌లైంది.

ఏడాది తిర‌గ‌క‌ముందే ఎన్టీఆర్‌ని దించేశారు. రాష్ట్రం భ‌గ్గుమంది.

ఎన్టీఆర్ తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ రామ్‌లాల్‌ను కలిసినా ప్రయోజనం లేకపోయింది.

ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని త‌ట్టుకోలేని ఇందిరాగాంధీ గవర్నరును మార్చారు. మ‌ళ్లీ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

అనంతరం హ‌ఠాత్తుగా ఇందిరాగాంధీ హ‌త్య జ‌రిగి రాజీవ్ అధికారంలోకి వ‌చ్చారు. రాజీవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త రాజ‌కీయం ప్రారంభించారు.

జ‌నంలో ఎన్టీఆర్‌కి ఉన్న బ‌లం ఇమేజ్‌. దాన్ని దెబ్బ‌తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సినిమాని సినిమాతోనే కొట్టాలి. ఆ సాహ‌సం కృష్ణ చేయ‌గ‌లిగారు.

కృష్ణ‌కి అంత‌కు ముందు కాంగ్రెస్‌తో సంబంధాలు లేవు. ఆయ‌న తీసిన ‘ఈనాడు’లో కాంగ్రెస్ వ్య‌తిరేక డైలాగులు అనేకం ఉంటాయి.

అయితే, రాజీవ్ కోరిక మేర‌కు కృష్ణ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేయ‌డ‌మే కాకుండా వ‌రుస‌గా ఎన్టీఆర్‌కి వ్య‌తిరేకంగా సినిమాలు తీశారు.

మండ‌లాధీశుడు, నా పిలుపే ప్ర‌భంజ‌నం, సాహ‌స‌మే నా ఊపిరి, గండిపేట ర‌హ‌స్యం… అన్నీ కృష్ణ తీసిన‌వే.

మండ‌లాధీశుడులో కోట శ్రీ‌నివాస‌రావు అచ్చం ఎన్టీఆర్‌లా మాట్లాడుతూ అనుక‌రిస్తూ న‌టించారు.

దీనికి ఆగ్ర‌హించిన ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న‌పై దాడి కూడా చేశారు.

రెండేళ్లు కృష్ణ త‌ప్ప‌ ఎవ‌రూ సినిమాలు ఇవ్వ‌లేదు. జంధ్యాల తెగించి ‘అహ‌నా పెళ్లంట‌’లో అవ‌కాశం ఇచ్చే వ‌ర‌కూ కోట శ్రీనివాసరావును ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

నిజానికి కోట‌కి ఈ వేషం ఇష్టం లేదు. కానీ గ‌త్యంత‌రం లేదు, వేషాలు రావ‌డం లేదు. సెల‌వు పెట్టిన బ్యాంక్‌ ఉద్యోగం నుంచి ఒత్తిడి ఎక్కువైంది.

మండ‌లాధీశుడులో పేరు వ‌చ్చిందే కానీ, ఎన్టీఆర్ అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

ఒక‌సారి ఆయ‌న ఎన్టీఆర్‌ని క‌లిసిన‌పుడు ఎన్టీఆర్ ఆ సినిమా గురించి మాట మాత్రం కూడా అన‌లేదు.

ఎన్టీఆర్ ప్ర‌త్యేక‌త ఏమంటే విమ‌ర్శ‌లు, సినిమాలు, కార్టూన్‌లు ఏమీ ప‌ట్టించుకునే వారు కాదు.

అభిమానుల్ని రెచ్చ‌గొట్టే ల‌క్ష‌ణం లేదు. వీట‌న్నింటికి తాను అతీతుడ‌నే భావ‌న ఉండేది ఆయనకు.

ఎన్‌టీఆర్, ప్రతిపక్షాలు

ఫొటో సోర్స్, TDP/Facebook

గండిపేట ర‌హ‌స్యంలో న‌టించిన పృధ్వి ఒక‌సారి వెళ్లి క‌లిస్తే అత‌న్ని ఏమీ అన‌వ‌ద్ద‌ని త‌న పార్టీ వాళ్ల‌కి ఎన్టీఆర్ సూచించారు.

కృష్ణ‌కి కూడా ఎన్టీఆర్ మీద ప్ర‌త్యేక‌మైన కోపం ఏమీ లేదు. రాజీవ్‌గాంధీ కోసం తీశాన‌ని ఆయ‌నే చెప్పుకున్నారు.

ఒక ముఖ్య‌మంత్రిని ఎద్దేవా చేస్తూ ఇంకో అగ్ర‌న‌టుడు వ‌రుస‌గా సినిమాలు చేసినా, ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌డం విశేషం.

అదే ఇప్పుడైతే సోష‌ల్ మీడియా యుద్ధాలే జ‌రిగేవి.

ఈ సినిమా యుద్ధంలో కాంగ్రెస్ 1989 నాటికి అనుకున్న‌ది సాధించింది. ఎన్టీఆర్ ఇమేజ్ దెబ్బ‌తీసి ఓడించింది.

రాజ‌కీయ వింత‌లు ఎలా ఉంటాయంటే కోట శ్రీ‌నివాస‌రావు త‌ర్వాత రోజుల్లో 1999లో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

టీడీపీ ఆయ‌న‌కి స‌పోర్ట్ చేసింది. విజ‌య‌నిర్మ‌ల కైక‌లూరు టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పృధ్వి ఇప్పుడు తెలుగుదేశం మ‌ద్ద‌తుదారుగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ని ప్ర‌జాస్వామ్య‌వాదిగా చెప్పొచ్చు. ఆయ‌న మీద ఎన్ని కార్టూన్‌లు వేసినా, సినిమాలు తీసినా, విమ‌ర్శించినా, వ్య‌తిరేక క‌థ‌నాలు రాసినా చ‌లించేవారు కాదు.

పార్టీని రెచ్చ‌గొట్టే వ్య‌క్తికాదు. కోట మీద జ‌రిగిన దాడి కూడా యాదృచ్ఛిక‌మే త‌ప్ప ప్రేరేపితం కాదు.

(కథనంలో అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. రచయిత సినీ విమర్శకులు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS