SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా,
- నుంచి బీబీసీ ప్రతినిధి
-
14 జూన్ 2025
“ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఆమె కల. కాలేజీలో చదువుతున్నప్పుడే ఎయిర్ హోస్టెస్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. అప్పుడామెకు 19ఏళ్లు. కొద్ది రోజుల కిందటే ఆమె ఇంటికి వచ్చింది. ఇకపై ఎప్పటికీ రాదు”
సంతోంబా శర్మ ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఆయన మొహంలో విషాదం, కళ్లలో నీళ్లు కనిపించాయి.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విమాన సిబ్బందిలో ఒకరైన నగన్తోయీ శర్మ కూడా ప్రాణాలు కోల్పోయారు. సంతోంబా శర్మ ఆమె మావయ్య. మేనకోడలితో తనకున్న జ్ఞాపకాలను ఆయన బీబీసీతో పంచుకున్నారు.
“నగన్తోయీ ముగ్గురు పిల్లల్లో రెండో అమ్మాయి. ఆమెకు అక్క, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు” అని ఆయన చెప్పారు.
“మా కుటుంబంలో అందరూ పూజలు లేదా వంటలు చేసేవాళ్లమే. నగన్తోయీ మా కుటుంబంలో ఎయిర్ హోస్టెస్ అయిన తొలి మహిళ. ఉద్యోగంలో భాగంగా ఆమె కొన్ని సార్లు దుబయ్, మరి కొన్ని సార్లు అమెరికా వెళ్లేది. ఆమెను చూసి మేం గర్వపడేవాళ్లం” అన్నారు.

నగన్తోయీశర్మ 2023లో ఇంఫాల్లోని ధానంజరి కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమెకు ఎయిర్హోస్టెస్ ఉద్యోగం వచ్చింది.
“నగన్తోయీ బాగా చదివేది. ఆమె స్నేహితుల్లో కొందరు ఆమెను ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కోసం తీసుకెళ్లారు. తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించింది” అని సంతోబాశర్మ చెప్పారు.
“ఆమెకు ఉద్యోగం వచ్చినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మా కుటుంబం నుంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలనే కల నెరవేర్చుకున్న మొదటి అమ్మాయి ఆమె” అన్నారు.

ఫొటో సోర్స్, Soibam B
‘అంతా అయిపోయింది’
మణిపుర్లోని థోబల్ పట్టణంలోని అవాంగ్ లీకాయ్లో నివసిస్తున్న నగన్తోయీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె తల్లిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. విమానం లండన్ బయల్దేరడానికి ముందు నగన్తోయీ తన అక్కకు ఫోన్ చేశారు.
ఇంటికి వచ్చిన వారికి గీతాంజలి తన చెల్లెలి ఫోటోలు చూపిస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు.నగన్తోయీ కుటుం సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మణిపుర్ మాజీ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ ముందు కూడా ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
“నా చెల్లెలు తనను కలవడానికి రమ్మని నన్ను పిలిచి ఉంటే నేను చాలా సంతోషించి ఉండేదానిని. అయితే నేనిప్పుడు ఆమె మృతదేహాన్ని తీసుకు రావడానికి అహ్మదాబాద్ వెళుతున్నాను. అంతా అయిపోయింది” అంటూ గీతాంజలి బోరుమన్నారు.
గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో నగన్తోయీ తన సోదరికి ఫోన్ చేశారని ఆమె తండ్రి నందేష్ కుమార్ శర్మ చెప్పారు. అదే ఆమె చివరి ఫోన్ కాల్.
“తాను లండన్ వెళుతున్నానని, కొన్ని రోజుల పాటు ఫోన్ చేయడం కుదరదని నగన్తోయీ తన అక్కకు చెప్పింది. జూన్ 15న తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానంది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Soibam B
అయితే మధ్యాహ్నం విమాన ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో చూసిన తర్వాత ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
“ఆమె విమానంలో ఉందని మాకు తెలుసు. అయితే మాకు ఎయిరిండియా లేదా ఆ సంస్థ ప్రతినిధుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. విమాన ప్రమాదం గురించి మాకు వార్తా చానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తెలిసింది” అని ఆమె పెదనాన్న చెప్పారు.
“ఆ రోజు సాయంత్రం ఎయిరిండియా అధికారులు మా ఇంటికి వచ్చారు. డీఎన్ఏ టెస్ట్ కోసం అహ్మదాబాద్ రావాలని అడిగారు. గీతాంజలి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు శుక్రవారం అహ్మదాబాద్ వెళ్లారు” అని ఆయన అన్నారు.
ఇంతకు ముందు నగన్తోయీ మార్చినెలలో ఇంటికి వచ్చారు. కేవలం నాలుగు రోజులే ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆమె తండ్రి ఆసుపత్రిలో ఉన్నారు.
“కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆమె తరచుగా ఇంటికి వస్తుంది. ఆమెకు గీతాంజలి అక్కలా కాకుండా స్నేహితురాలిలా ఉంటుంది. ఇంటి గేటు వద్దకు రాగానే గీతాంజలిని పిలుస్తుంది. ఆమె లేకపోయే సరికి అంతా బోసిపోయినట్లు ఉంది” అని సంతోంబా చెప్పారు.

ఫొటో సోర్స్, Lamnunnem Signson/FB
తల్లికి సింగ్సన్ ఒక్కరే అండ
జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిరిండియా విమానం సిబ్బందిలో నగన్తోయీతో పాటు కుకీ తెగకు చెందిన లామ్నుంథెమ్ సింగ్సన్ కూడా ఉన్నారు.
సింగ్సన్ ఇంఫాల్కు చెందినవారు. అయితే అక్కడ హింస చెలరేగిన తర్వాత ఆమె కంగ్పోక్పిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా అక్కడకు వెళ్లారని కుకీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ సభ్యుడొకరు చెప్పారు.
25 ఏళ్ల సింగ్సన్ గతేడాది ఎయిరిండియాలో ఉద్యోగంలో చేరారు. ఆమె తండ్రి చనిపోయారు. ఇంటి దగ్గర ఆమె తల్లి ఒక్కరే ఉంటారు.
“మణిపుర్కు చెందిన ఇద్దరు క్యాబిన్ క్రూ చనిపోవడం బాధాకరం. నగన్తోయీ, సింగ్సన్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు” అని మణిపుర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో రాశారు.
“వారు తమ జీవితంతో సంతోషంగా ఉన్నారు. అంకితభావంతో పని చేస్తున్నారు. వారి హఠాన్మరణం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, మనకు ఎంతో నష్టం” అని అందులో పేర్కొన్నారు.
గురువారం అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయింది. లండన్ వెళ్లేందుకు బయల్దేరిన విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే నివాస ప్రాంతాల్లో కూలిపోయింది.
విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారని ఎయిరిండియా స్పష్టం చేసింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ ప్రమాదంలో భారతసంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ బతికి బయట పడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS