SOURCE :- BBC NEWS

”మా పుస్తకాలు, లాప్టాప్స్ , ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అన్ని కాలిపోయాయి. కొందరు చనిపోగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. మేం ఎంతో నష్టపోయాం” అని అహ్మదాబాద్లోని తెలుగు వైద్య విద్యార్థి, రెసిడెంట్ డాక్టర్ ఒకరు బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిరిండియా విమానం కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లుగా భారత పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం వెనుకవైపు ఉన్న మేఘనీనగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కళాశాల హాస్టల్ మెస్, రెసిడెంట్ డాక్టర్ల నివాస సముదాయ భవనాలపై కూలింది.


ఫొటో సోర్స్, UGC
ఈ నివాస సముదాయంలోనే హైదరాబాద్, మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారు. వారు సూపర్ స్పెషాలిటీ కోర్సు చదువుతూ రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు.
వారిలో హైదరాబాద్కు చెందిన రెసిడెంట్ డాక్టర్ ఒకరు బీబీసీతో మాట్లాడారు.
”ప్రమాద సమయంలో నేను అక్కడ లేను. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. చాలా సందర్భాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 5 వరకు డ్యూటీలోనే ఉంటాం. ప్రమాద సమయంలో పీజీ, యూజీ విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్ల కుటుంబసభ్యులు ఉన్నారు” అని చెప్పారు.
తాను ఆ ప్రాంతంలో లేనందువల్లే ప్రాణాలు కాపాడుకోగలిగినట్టు చెప్పారాయన.

8మంది మృతి
విమానం కూలిన సమయంలో మెస్లో కొందరు విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ ఘటనలో బీజే మెడికల్ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్ల బంధువులు కలిపి ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయినట్లుగా బీజే మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ మీనాక్షి పారిఖ్ బీబీసీతో చెప్పారు.
మరికొంత మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
అలాగే దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. వారిలో కొందరు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జి కాగా, మరికొందరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లుగా వైద్యులు చెప్పారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రి వైద్యులు రాత్రింబవళ్లు చికిత్స అందిస్తూ శ్రమిస్తున్నారు.
ఈ విమాన ప్రమాదంలో ఫ్లాట్లలో వస్తువులన్నీ కాలిపోయాయని, లక్షలరూపాయలు నష్టపోయామని వైద్యులు వాపోతున్నారు.
”మరో మూడు నెలల్లో మాకు పరీక్షలు ఉన్నాయి.మా పుస్తకాలన్నీ కాలిపోయాయి. సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసేందుకు అవి ఎంతో కీలకం” అని తెలుగు విద్యార్థి, రెసిడెంట్ డాక్టర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
మెడికల్ హాస్టల్ భవనాలలో పరిస్థితి ఎలా ఉందంటే..
బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనాల బ్లాక్లలో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను రెసిడెంట్ డాక్టర్ల కోసం బీజే మెడికల్ కళాశాల అధికారులు కేటాయిస్తారు. డాక్టర్లు కుటుంబాలతో నివసిస్తూ సివిల్ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తూ కళాశాలలో సూపర్ స్పెషాలటీ కోర్సులు చదువుతుంటారు.
బీబీసీతో మాట్లాడిన రెసిడెంట్ డాక్టర్, విద్యార్థి రెండున్నరేళ్ల కిందట ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పారు.
విమానం కూలిన భవనాల్లోకి వెళ్లి తన వస్తువులు తెచ్చుకున్నానని ఆయన తెలిపారు.
”రెండు రోజుల నుంచి పోలీసులు లోపలికి వెళ్లనీయలేదు. మా సామాన్లు తీసుకోనివ్వలేదు. చివరికి కళాశాల అధికారులతో అడిగిస్తే సామాన్లు తీసుకెళ్లేందుకు అనుమతించారు” అని చెప్పారాయన.
అయితే, సామాన్లు పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. శుక్ర, శనివారాల్లో కొందరు వైద్యులు, వైద్య విద్యార్థులు వచ్చి తమ సామాన్లు తీసుకెళుతూ కనిపించారు.
”విమానం కూలిన సమయంలో పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ధాటికి ఇళ్లలోని వస్తువులు చాలావరకు కాలిపోయాయి” అని చెప్పారాయన.
మంటల ధాటికి నాలుగు భవనాలలో రెండు భవనాలు చాలావరకు దెబ్బతిన్నాయి.
”గోడలు కూలిపోయాయి. దానివల్ల ఫ్లాట్లలోకి మంటలు వ్యాపించాయి. నా స్నేహితుడు కట్టుబట్టలతో మిగిలాడు. తనకు చెందిన అన్ని వస్తువులు కాలిపోయాయి” అని చెప్పారు తెలుగు విద్యార్థి.

మెస్పై కూలి, ముందు భాగం హాస్టల్ పై పడి..
మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలలో బ్లాక్ -1, 4 భవనాలు దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ పిల్లర్లు వంగి కనిపిస్తున్నాయని లోపలికి వెళ్లి వచ్చిన వైద్యులు, విద్యార్థులు చెబుతున్నారు.
”విమానం మొదటగా మెస్ భవనంపై కూలింది. విమానం వెనుక భాగం మెస్ భవనంలో ఇరుక్కుపోయింది.ముందుభాగం ఎగిరి పేలిపోయింది. ఆ మంటలు ముందువైపున హాస్టల్, రెసిడెన్షియల్ భవనాలకు పాకాయి” అని మరో వైద్య విద్యార్థి చెప్పారు.
భవన సముదాయాలను అతుల్యం కాంప్లెక్సుగా పిలుస్తుంటారు. వీటిల్లో కింది అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైద్యులు చెబుతున్నారు .
బయటకు వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకొని కొంతమంది చనిపోయారని చెబుతున్నారు. అలాగే వైద్యుల కుటుంబసభ్యులు , వైద్య విద్యార్థులతోపాటు మెస్లో పనిచేసే వంట మనిషి కుమార్తె కూడా కనిపించడం లేదని బీబీసీతో వైద్య విద్యార్థి ఒకరు చెప్పారు.

బీజే వైద్య కళాశాల ప్రత్యేకత ఏమిటి?
బీజే(భైరామ్జీ జీజీ బాయ్) మెడికల్ కళాశాల గుజరాత్ రాష్ట్రంలో కీలకమైనది. ఇది రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి అనుసంధానంగా ఈ మెడికల్ కాలేజీ నడుస్తోంది.
దేశంలోని పురాతన వైద్య కళాశాలలో ఇది కూడా ఒకటి. దాదాపు వంద ఎకరాల్లో విస్తరించిన ప్రాంగణంలో ఎంబీబీఎస్, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
తొలుత అహ్మదాబాద్ మెడికల్ స్కూల్ పేరుతో దీన్ని 1871లో స్థాపించారు.
అప్పటినుంచి ఎన్నో వేల మంది వైద్యులను కళాశాల తీర్చిదిద్దింది.
ఈకళాశాలకు గుజరాత్ నుంచి మాత్రమే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు వస్తుంటారు. దీనివల్ల వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు.ప్రస్తుతం కళాశాలలో చదువుతూ సివిల్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేస్తున్న తెలుగువారు కూడా ఇక్కడ ఉన్నారు.
”దక్షిణ భారతదేశం నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల కావడంతో సీట్ల కోసం తీవ్ర పోటీ ఉంటుంది” అని కర్ణాటకకు చెందిన విద్యార్థి ఒకరు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)