SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, UGC
పోలీస్ కానిస్టేబుల్పై దాడికి దిగారన్న ఆరోపణపై గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టిన వీడియోలు ఇటీవల కలకలం రేపాయి.
ఓ పోలీస్ కానిస్టేబుల్ కర్రతో కొడుతుంటే, కాళ్లు కదపకుండా మరో కానిస్టేబుల్ ఆ యువకుడి మోకాలిపై కాలు బలంగా తొక్కి పెట్టిన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలోని ఓ దేవాలయానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కోసం ఆ గుడి ఎదురుగా ఉన్న ఇంటి మహిళలతో మర్రిపూడి పోలీసుల వాగ్వాదం వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి.
ఇంట్లో ఇప్పుడు మగవాళ్లు లేరని, వారితో మాట్లాడి తీసుకోవాలని సమాధానం చెప్పిన సదరు మహిళలతో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
ఆ ఘటన తర్వాత సదరు మహిళలతోపాటు ఆ ఇంటి యజమానిపై, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
సరిగ్గా పక్షం రోజుల వ్యవధిలో వెలుగుచూసిన ఈ రెండు ఘటనల్లోనూ పోలీసుల తప్పేమీ లేదని ఆ రెండు జిల్లాల ఎస్పీలు ప్రకటించారు.
అయితే, ఈ రెండు ఘటనలూ ఏపీలో పోలీసుల వ్యవహారశైలికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని మానవహక్కుల వేదికలు, పౌరహక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.
మరోవైపు కొన్ని జిల్లాల పోలీసులు కేసుల నమోదు, విచారణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు.


ఫొటో సోర్స్, Eluru police
ఏలూరులో ఏఐతో ఫిర్యాదు స్వీకరణ
ఒకపక్క పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుంటే, మరోపక్క కేసుల నమోదు, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం కూడా ఏపీ పోలీసుల్లో కనిపిస్తోంది. ఏఐ టెక్నాలజీని వాడుకోవడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)పై దృష్టి సారించారు.
ఈ మేరకు ఏఐ పోలీస్ అసిస్ట్ అనే ప్రత్యేక అప్లికేషన్ను తయారు చేయించుకుని వాడుతున్నామని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ బీబీసీతో చెప్పారు.
జిల్లా పోలీసు కార్యాలయం(డీపీవో)లో కేసు నమోదు నుంచి ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తయారీ వరకు అవసరాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయం తీసుకుంటున్నామని చెప్పారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం….
ఫిర్యాదు చేయాలనుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి ఏఐ పోలీస్ అసిస్ట్ అప్లికేషన్ ముందు కూర్చొని తమ ఫిర్యాదును చెబితే ఏఐ బోట్ అదంతా టైప్ చేస్తుంది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ భాషలో మాట్లాడినా తెలుగులోనే టైప్ చేస్తుంది.
ఫిర్యాదుకు సంబంధించి ఏవైనా అనుమానాలు వస్తే ఆ ప్రశ్నలను ఏఐ బోట్ అడుగుతుంది. ఆ సమాధానాలను నమోదు చేస్తుంది. ఆ వివరాలతో ఏ సెక్షన్లు వర్తిస్తాయో వివరిస్తూ ఎఫ్ఐఆర్ తయారు చేస్తుంది. ఫిర్యాదు అనంతరం అక్కడ ఉండే పోలీసులు/ఫిర్యాదుదారు మాన్యువల్గా చెక్ చేసిన తర్వాత ప్రింటవుట్ తీస్తారు.
“ఫిర్యాదుదారు మాట్లాడిన వివరాలన్నీ ఆడియో, వీడియోలోనూ రికార్డ్ అవుతాయి. దీంతో భవిష్యత్లో ఫిర్యాదుదారులు మేము చెప్పని విషయాలు రాసి పోలీసులు తప్పుడు ఫిర్యాదులు సృష్టించారని ఆరోపించేందుకు అవకాశం ఉండదు. మొత్తం రికార్డెడ్గా ఉంటుంది” అని ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ వివరించారు.
తాము ఇప్పటికే నెల రోజులకి పైగా డీపీవోలో ఈ అప్లికేషన్ వాడుతున్నామని, ఇప్పుడు జిల్లాలోని అన్నిస్టేషన్లలోనూ వాడేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
ఇటీవల సీఎం చంద్రబాబుకి తమ జిల్లాలో ఏఐ వినియోగిస్తున్న తీరు వివరించగా, కొన్ని సూచనలు చేశారని, ఆ సూచనలు కూడా పొందు పరుస్తున్నామని కిషోర్ చెప్పారు.
ఏఐ వినియోగంతో గతంతో పోలిస్తే కేసుల డ్రాఫ్టింగ్లో తప్పులు 90%కి పైగా తగ్గడంతో పాటు కచ్చితత్వం పెరిగిందని ఎస్పీ వివరించారు.

ఫొటో సోర్స్, ugc
‘సెక్షన్లే కాదు.. తప్పులను కూడా చెబుతోంది’
“విచారణ తీరు, ఆధారాల సేకరణ వివరాలను ఒక క్రమపద్ధతిలో చెప్పడం వల్ల దర్యాప్తు వేగవంతంగా చేసేందుకు వీలవుతోంది. చార్జిషీటులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని చెప్పడంతో పాటు అదనపు సమాచారం అవసరమైతే పొందుపరచాలని చెబుతుంది. నిరక్షరాస్యులు, ఫిర్యాదులు రాయలేని వారికి ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుంది” అని ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీకోర్ విభాగంలో పని చేస్తున్న ఎస్ఐ నరేంద్రకుమార్ బీబీసీకి తెలిపారు.
ఈ విధానంలో ప్రయోగాత్మకంగా ఇప్పటివరకు సుమారు 150కిపైగా ఫిర్యాదులు నమోదు చేశామన్నారు.
కాగా, ”ఏఐ బోట్(టూల్)కి ఫిర్యాదు చేయడం కొత్తగా ఉన్నప్పటికీ చాలా సులువుగా ఉంది. ఏలూరులో పోలీసుశాఖకే చెందిన ఓ వ్యక్తి డబ్బుల విషయంలో మోసం చేశారు. దాంతో అతనిపై ఇటీవల ఏఐ ద్వారా ఫిర్యాదు చేశాను. ఇంకా విచారణ సాగుతోంది” అని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన యర్రంశెట్టి గోపాలమధుసూదన్రావు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనంతపురంలో 50 కేసులు
అనంతపురం జిల్లాలో కూడా ఫిర్యాదుల నమోదు చేయడానికి ఏఐను వినియోగించడంతో సమయం ఆదా అవుతోందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ బీబీసీకి తెలిపారు.
నేర విచారణలో, రిపోర్టుల తయారీలో వేగంతో పాటు కచ్చితత్వం పెరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ఏఐని వినియోగించి దాదాపు 50కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ఏఐ వినియోగంతో ఫిర్యాదుల నమోదు, ఎఫ్ఐఆర్ కాపీ తయారీని ప్రయోగాత్మకంగా ఏలూరు, అనంతపురం, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో చేపట్టినట్టు అనంతపురం ఎస్పీ జగదీష్ వెల్లడించారు.
విజయవాడలో కూడా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు పడమట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుపై ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నట్టు పడమట సీఐ పవన్ కిషోర్ బీబీసీకి తెలిపారు.
ఇంకా కేసు నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదని, సాంకేతిక అంశాలన్నీ సెట్ అయ్యాక ఏఐతో ఫిర్యాదుల స్వీకరణ మొదలు పెడతామని సీఐ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘శాస్త్రీయ పరిశోధన లేకుండా ఏం ప్రయోజనం’
అయితే, సమగ్ర విచారణ, పరిశోధన చేయాల్సిన పోలీసుల్లో నైతికత, మానవత్వ విలువలు లేకుంటే కేసుల నమోదులో టెక్నాలజీ వాడకం వల్ల ఏం లాభం అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీఎస్ నాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.
ఇటీవల వివాదాస్పదమైన పోలీసుల ప్రవర్తనను ఆయన గుర్తు చేశారు.
సాంకేతికతో పాటు పోలీసులు శాస్త్రీయ పరిశోధన ద్వారా కేసుల విచారణ చేపట్టాలని ఆయన సూచించారు.
ఈ ఏఐ అప్లికేషన్ను ఏపీలోని కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు.
లోటు పాట్లను సమీక్షించి, మరింత పనికొచ్చేలా చేస్తామని పోలీసులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)