SOURCE :- BBC NEWS

కాల్పుల విరమణ

ఫొటో సోర్స్, Getty Images

అనేక నాటకీయ పరిణామాల తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు చెప్పేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నారు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణను తగ్గించడంలో అమెరికా మధ్యవర్తులతోపాటు, తెరచాటున జరిగిన అనేక దౌత్య ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంత జరిగినా, సీజ్ ఫైర్ మొదలైన కొద్దిసేపటికే, దాని ఉల్లంఘన జరుగుతోందంటూ ఇరు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత బలహీనంగా ఉందో ఇది చెప్పకనే చెప్పినట్లయింది.

పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతోందని భారత్ ఆరోపిస్తుంటే, తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, తమ బలగాలు బాధ్యత, సంయమనం ప్రదర్శిస్తున్నాయని పాకిస్తాన్ అంటోంది.

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనకు ముందు, భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చని చాలామంది భయపడే దిశగా సాగుతూ వెళ్లింది.

పహల్గాంలో తీవ్రవాద దాడిలో 26 మంది పర్యటకులు మరణించిన తర్వాత, భారత్ పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్ మీద వైమానిక దాడులు చేసింది.

ఇది రోజుల తరబడి గగనతల ఘర్షణలు, ఫిరంగి దాడులకు దారి తీసింది. శనివారం ఉదయం తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిపారంటూ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఈ వాదనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రెండు దేశాలు తాము ప్రత్యర్థి దాడులను భగ్నం చేశామని చెప్పడంతోపాటు, శత్రువుకు భారీ నష్టం కలిగించామని ప్రకటించుకున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్ పాకిస్తాన్, కాల్పుల విరమణ, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

మూడు డజన్ల దేశాల మధ్యవర్తిత్వం..?

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మే 9న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశారు. “అదే కీలకమైన అంశం అయి ఉండవచ్చు” అని వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో తన్వీ మదన్ అన్నారు.

“ఇంకా అనేకమంది అంతర్జాతీయ వ్యక్తులు, దేశాల పాత్ర గురించి మనకు తెలియదు. అయితే ఒకటి సుస్పష్టం. మూడు రోజుల నుండి కనీసం మూడు దేశాలు ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, సౌదీ అరేబియా కూడా వాటిలో ఉండి ఉండవచ్చు” అని తన్వీ మదన్ అన్నారు.

పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ “మూడు డజన్ల దేశాలు” దౌత్య ప్రక్రియలో పాల్గొన్నాయని చెప్పారు. అందులో తుర్కియే, సౌదీ అరేబియా, అమెరికా ఉన్నాయి.

ఈ ప్రయత్నం ఇంకొంచెం ముందుగానే జరిగి ఉంటే ఉద్రిక్తతలు మరింత తగ్గేవేమోనన్న సందేహం కూడా ఉంది.

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గంచడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడం ఇదే తొలిసారి కాదు.

2019లో పాకిస్తాన్ అణ్వాయుధాలను సిద్ధం చేస్తోందని కంగారు పడుతున్న ఓ వ్యక్తితో తాను మాట్లాడానని అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో గుర్తు చేసుకున్నారు. తన హోదాకు సమానమైన ఆ వ్యక్తి పేరు చెప్పడానికి పాంపియో ఇష్టపడలేదు.

భారత్ పాకిస్తాన్, కాల్పుల విరమణ, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

అమెరికా సమయానుకూలంగా స్పందించిందా?

అణు ప్రమాదం గురించి, ఉద్రిక్తతలను తగ్గించి, పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడంలో అమెరికా పాత్ర గురించి పాంపియో కాస్త అతిశయోక్తిగా చెప్పారని పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో రాశారు.

అయితే ఈసారి సంక్షోభాన్ని తగ్గించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందనే దాని మీద సందేహాలు ఉన్నాయని దౌత్య వేత్తలు చెబుతున్నారు.

“అమెరికా కీలక పాత్ర పోషిస్తుంది. గతంలోనూ తాము అణు యుద్ధాన్ని ఆపామని పాంపియో చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఉన్నప్పటికీ, ప్రాథమికమైన దౌత్య పాత్ర పోషించి ఉండవచ్చు. బహుశా ఇస్లామాబాద్‌లో దిల్లీ స్థాయిని పెద్దదిగా చూపించారేమో” అని బిసారియా బీబీసీతో చెప్పారు.

అయినప్పటికీ ఈ ఘర్షణ ఆరంభంలో, అమెరికా ఏమీ పట్టించుకోనట్లుగా కనిపించింది.

ఉద్రిక్తతలు చెలరేగగానే, భారత్- పాకిస్తాన్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది లేదని ‘‘అది మా పని కాదు’’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు.

“మేము ఆ దేశాలను నియంత్రించలేము” అని ఆయన అన్నారు.

”భారత్‌కు పాకిస్తాన్‌తో విభేదాలు ఉన్నాయి. ఆయుధాలు వదిలేయాలని అమెరికా ఇండియాకు చెప్పలేదు. అలాగే పాకిస్తాన్‌కూ చెప్పలేదు. దౌత్య మార్గాల ద్వారా మా ప్రయత్నాలు కొనసాగిస్తాం” అని జేడీ వాన్స్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇదిలా ఉండగానే, అధ్యక్షుడు ట్రంప్ గతవారం మొదట్లో “నాకు రెండు దేశాల నాయకులు బాగా తెలుసు. వారు దానిని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్లిది ఆపేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

భారత్ పాకిస్తాన్, కాల్పుల విరమణ, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

మూడు కీలక అంశాలు

“గత సందర్భాలతో పోలిస్తే ఇదొక్కటే తేడాగా కనిపిస్తోంది” అని లాహోర్‌లో ఉంటున్న రక్షణ రంగ నిపుణుడు ఇజాజ్ హైదర్ బీబీసీతో చెప్పారు.

“అమెరికా పాత్ర గతంలో అనుసరించిన విధానానికి కొనసాగింపుగా ఉంది. అయితే ఈసారి కీలక మార్పు ఏంటంటే, మొదట్లో వాళ్లు దీనికి దూరంగా ఉన్నారు. వెంటనే ఇందులో జోక్యం చేసుకునే బదులు, ఈ సంక్షోభం ముదిరిపోయే వరకు చూశారు. పరిస్థితులు చేయిదాటిపోతున్న సమయంలో రంగంలోకి దిగారు” అని హైదర్ బీబీసీతో చెప్పారు.

ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత పాకిస్తాన్ రెండు రకాల సంకేతాలు పంపించిందని పాకిస్తాన్‌లో నిపుణులు చెబుతున్నారు. సైన్యంతో ఎదురుదాడి చేయడం, అవసరమైతే అణ్వస్త్రాలు ప్రయోగానికి సిద్ధమని చెప్పేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయడం.

పాకిస్తాన్ ‌అణ్వాయుధాల నియంత్రణ, వాటి ప్రయోగానికి సంబంధించిన నిర్ణయాలను నేషనల్ కమాండ్ అథారిటీ తీసుకుంటుంది.

ఈ సమయంలోనే అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో రంగంలోకి దిగారు.

“అమెరికా పాత్ర చాలా ముఖ్యమైనది. రుబియో ప్రయత్నించకపోయి ఉంటే ఈ ఫలితం సాధ్యమయ్యేది కాదు” అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలో అష్లే జే టెల్లిస్ బీబీసీకి చెప్పారు.

ఇందులో వాషింగ్టన్‌కు దిల్లీతో ఉన్న బలమైన బంధం కూడా ఉపయోగపడింది.

భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడితో ఉన్న వ్యక్తిగత సంబంధం, అమెరికా విస్తృత వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు లాంటి అంశాలు కూడా రెండు దేశాలు తమ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఒత్తిడి చేసేలా, అమెరికన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన అవకాశాన్ని ఇచ్చాయి.

2019లో పుల్వామా- బాలాకోట్ తర్వాత, ఈసారి శాంతి సాధనలో మూడు కీలకమైన అంశాలు ఉన్నాయని భారతీయ దౌత్యవేత్తలు భావిస్తున్నారు.

అవి 1. అమెరికా, బ్రిటన్ ఒత్తిడి

2. సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం, సౌదీ విదేశాంగ సహాయమంత్రి రెండు దేశాల రాజధానుల్లో పర్యటించారు.

3. భారత్ పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారుల మధ్య డైరెక్ట్ చానల్.

అంతర్జాతీయ ప్రాధాన్యతలు పెను మార్పులు జరుగుతున్నవేళ, మొదట విముఖంగా ఉన్నప్పటికీ, అమెరికా ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా అడుగు పెట్టింది.

తమ అధికారులు అతిశయోక్తిగా చెప్పుకున్నా, దిల్లీ, ఇస్లామాబాద్ అంగీకరించకున్నా, సంక్షోభ పరిష్కారకర్తగా అమెరికా పాత్ర చాలా కీలకమైందని నిపుణులు భావిస్తున్నారు.

అయితే శనివారంనాటి సంఘటనల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం ఉంటుందనే దానిపై సందేహాలు ఉన్నాయి. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని, రెండు దేశాల సీనియర్ సైనిక అధికారుల మధ్యవర్తిత్వం వల్ల సాధ్యమైందని కొన్ని భారతీయ మీడియా సంస్థలు తెలిపాయి.

“ఈ కాల్పుల విరమణ దుర్బలంగా ఉంది. ఎందుకంటే ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తర్వాత హఠాత్తుగా సంభవించిన పరిణామం ఇది. భారత్ దీన్ని అమెరికా, పాకిస్తాన్‌ల కంటే భిన్నంగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది” అని విదేశాంగ విధాన విశ్లేషకుడు మైఖేల్ కుగల్‌మాన్ బీబీసీతో అన్నారు.

“ఈ ఒప్పందం చాలా వేగంగా కుదరడం వల్ల, ఇలాంటి ఉద్రిక్త సమయంలో అవసరమైన హామీలు, గ్యారంటీలు ఇందులో లేవు” అని కుగల్‌మాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)