SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, UGC
గమనిక: ఈ కథనంలో కొన్ని కలచివేసే అంశాలున్నాయి.
”అప్పు తీర్చమని నన్ను కొట్టారు. చెయ్యి పట్టుకొని లాక్కెళ్లి చెట్టుకు కట్టేశారు.. చీర లాగి, చింపేశారు. అమ్మను కొట్టొద్దని నా బిడ్డ కాళ్లు పట్టుకుంటే, కనికరం లేకుండా పక్కకు లాగి పడేశారు..నాపై దాడి చేశారు”
చిత్తూరు జిల్లాలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారంటూ వైరల్ అయిన వీడియోలోని బాధితురాలు శిరీష ఆవేదన ఇది.
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని నారాయణపురం గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలు ఆ రోజు ఏం జరిగింది. దీనిపై ఎవరేమంటున్నారో తెలుసుకోవడానికి బీబీసీ ఆ గ్రామానికి వెళ్లింది.
కుప్పం నుంచి ఘటన జరిగిన నారాయణపురం గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండల మధ్య ఉన్న ఆ గ్రామంలో అక్కడక్కడా విసిరేసినట్టు 20 ఇళ్లు ఉంటాయి.
బాధితురాలు శిరీష గ్రామం అడవికొట్టాలు. ఆ గ్రామానికి నారాయణ పురం గ్రామానికి కిలోమీటరు దూరం ఉంటుంది. అది కూడా కొండ ప్రాంతమే. అక్కడికి కూడా బీబీసీ వెళ్లింది. ఆ గ్రామంలో పది ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
అక్కడ శిరీష ఇల్లు తాళం వేసి ఉంది. ఆ ఇల్లు కొత్తగా కట్టినట్టు ఉంది. ఈ ఘటనపై మాట్లాడ్డానికి వారెవ్వరూ ముందుకు రాలేదు. అయితే దాడి చేసిన వారిదీ, గాయపడిన వారిదీ ఒకే సామాజిక వర్గం. వీరంతా బంధువులేనని అక్కడి వారంటున్నారు.
బాధితురాలు శిరీష చికిత్స పొందుతున్న కుప్పంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి మంగళవారం బీబీసీ వెళ్లింది. అక్కడ ఆమె పిల్లలతోపాటు అత్త ఈశ్వరి, బంధువులున్నారు కానీ, ఆమె భర్త మాత్రం లేరు.
వడ్డీలకు వడ్డీ కడుతున్నాం – శిరీష
తన భర్త తిమ్మరాయప్ప నారాయణపురం గ్రామంలోని మునికన్నప్ప దగ్గర 80 వేల రూపాయలు (2022లో) అప్పుగా తీసుకున్నారనీ , అయితే అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరు విడిచి ఎక్కడికో వెళ్లిపోయారని శిరీష చెబుతున్నారు.
తన ముగ్గురు పిల్లలను అత్త దగ్గర వదలి బెంగళూరులో ఇళ్లలో పనిచేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ, భర్త చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నానని ఆమె బీబీసీతో చెప్పారు.
”నా కుమార్తె వికలాంగురాలు కావడంతో ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. ఆ పింఛన్ డబ్బులను కూడా అప్పులవాళ్లు వడ్డీకి లాక్కొంటున్నారు. స్కూలు దగ్గరకు వెళ్లి నా పిల్లలతో అవమానకరంగా మాట్లాడుతున్నారు” అని అన్నారు.
ప్రాథమిక పాఠశాలలో తన కొడుకు టీసీ తీసుకోడానికి బెంగళూరు నుంచి నారాయణపురం వచ్చారు శిరీష. తన కొడుకును వేరేచోట హాస్టల్లో చేర్పించేందుకు టీసీ కోసం వచ్చారు.
”నేను వచ్చానని తెలిసి మునికన్నప్ప ఆయన కుటుంబ సభ్యులు నాతో గొడవకు దిగారు, వాళ్లింటి దగ్గరున్న చెట్టుకు కట్టేసి కొట్టారు” అని ఆమె చెప్పారు.
”నా మొగుడు మాకు దూరమై ఏడాదయింది. ఆరు నెలలుగా బిడ్డలను చూడ్డానికి కూడా ఇంటికి రాలేదు. వడ్డీలకు వడ్డీ అయ్యింది. ఇంట్లో ఉంటే భార్యను గలాట పెడతారని వడ్డీలు కట్టేవారు. ఇప్పుడు పది రూపాయలు వడ్డీ ఎలా కడతాం. ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ, ఎలా బతికేది. నాకు జరిగిన అవమానం వేరే స్త్రీకి జరగకూడదు’’ అని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

నా భర్తను కూడా కొట్టారు-శిరీష
అప్పులు ఎలాగోలా తీరుస్తామని చెబుతున్నా, అప్పులవాళ్లు రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తట్టడం, అసభ్యంగా మాట్లాడారని శిరీష చెప్పారు.
”ఎక్కడంటే అక్కడ చేతులు వేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అందుకే భయపడి నేను బెంగళూరుకు వెళ్లిపోయి ఇళ్లల్లో పని చేసుకుంటున్నాను. ఇప్పుడు టీసీ కోసం వస్తే చెట్టుకు కట్టేసి కొట్టారు. నా కొడుకు వాళ్ల కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడినా వదల్లేదు. వాడి కంటికి దెబ్బ తగిలింది” అని ఆమె అన్నారు.
గతంలో అప్పులవాళ్లు తన భర్తను కూడా కొట్టారని చెప్పిన శిరీష, ఇప్పుడు తనను చెట్టుకు కట్టేసి కొట్టారు కాబట్టే ఈ విషయం అందరికీ తెలిసిందని అన్నారు.
”అప్పుడు మేమెవరికీ చెప్పుకోలేదు. ఇప్పుడు నా వరకు వచ్చింది కాబట్టి పెద్దది అయ్యింది. నీ మొగుడు ఎక్కడున్నాడో రప్పించు అన్నారు. నా దగ్గర బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు” అని శిరీష చెప్పారు.

‘సొంత ఊళ్లో బతకాలనే ఆశ పోయింది’
సొంత ఇల్లు కట్టుకున్నా అందులో ఉండలేక బెంగళూరుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, కానీ సొంత ఊళ్లో తమ ప్రాణాలకే ప్రమాదం తలెత్తే పరిస్థితి వచ్చిందని శిరీష ఆవేదన చెందారు.
తనను కొట్టడంతోపాటూ చీరను కూడా చింపారని దారిన వెళ్లే ఒక వ్యక్తి ఇలా చేయడం తప్పు అంటే తనను విడిచిపెట్టారని ఆమె చెప్పారు.
”నా కట్లు విడిపించిన పది నిమిషాలకు పోలీసులు వచ్చారు. ఊళ్లో మాకొక ఇల్లు ఉంది. అక్కడికెళ్లి ఉండాలనుకుంటున్నాం. కానీ వాళ్లు ఏం చేస్తారో అనే భయం కూడా ఉంది. బతుకుతెరువు కోసం మేం బెంగళూరు వెళ్ళాం. మళ్లీ వచ్చి ఆ ఊర్లో ఉండాలని ఆశ ఉండేది. కానీ ఈ మాదిరి చేస్తే ఎలా ఉంటాం” అన్నారు శిరీష.
అప్పుల బాధ తట్టుకోలేకే
అప్పులు ఇచ్చినవారు దాడులు చేస్తుంటే, ఆ బాధలు తట్టుకోలేకే తన కొడుకు ఊరు వదిలి వెళ్లిపోయాడని ఆస్పత్రిలో శిరీషతోపాటు ఉన్న ఆమె అత్త ఈశ్వరి చెప్పారు.
”మా కొడుకుని కొట్టి ఇదే విధంగా దౌర్జన్యం చేశారు. మాకు ఏం జరిగినా ఎవరూ రారు. ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. మమ్మల్ని కొట్టినా ఎవరు అడ్డం రాలేదు. వాళ్లు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీకి వడ్డీల పై వడ్డీలు వేసి ఇలా అప్పు పెంచేశారు”
శిరీషపైన దాడి జరిగిన ప్రాంతం నారాయణపురానికి కూడా బీబీసీ వెళ్లింది. కానీ పోలీసులు అరెస్ట్ చేయడంతో మునికన్నప్ప ఇంటికి తాళం వేసి ఉంది.
ఈ ఘటన గురించి గ్రామస్థులు కొందరిని అడిగి తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది. కానీ వారందరూ మాట్లాడ్డానికి నిరాకరించారు.

బాధితురాలికి అండగా ఉంటాం-చంద్రబాబు
కుప్పం ఘటన విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బాధితురాలు శిరీషతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి, పిల్లల చదువులకు హామీ ఇచ్చారు.
తనకు జరిగిన అన్యాయం గురించి ముఖ్యమంత్రికి వివరించారు శిరీష.
ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని అన్నారు.
శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్న సీఎం వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని….ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.
అంతకు ముందు నారాయణపురం ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడారు.

మహిళలకు కల్పించే రక్షణ ఇదేనా-వైఎస్ జగన్
మహిళను చెట్టుకు కట్టేసిన వీడియోను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అని ప్రశ్నించారు.
‘‘ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను’’ అన్నారు.
అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు
శిరీషపై దాడిచేసిన నలుగురిని అరెస్ట్ చేశామని కుప్పం డీఎస్పీ పార్థసారధి బీబీసీకి వివరించారు.
” నారాయణపురం గ్రామంలో ఎ.శిరీష అనే మహిళపై ఆ ఊరి వాళ్ళు నలుగురు ముని కన్నప్ప, ఆయన భార్య వెంకటరమణమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరి దాడి చేశారు. ఆవిడ భర్త మూడు సంవత్సరాల క్రితం 80 వేలు అప్పు తీసుకొని తీర్చకుండా తన కుటుంబంతో సహా వెళ్లిపోయారు. శిరీష వచ్చిన విషయం తెలుసుకున్న నలుగురు ముద్దాయిలు, ఆమెను పట్టుకొని డబ్బులు ఇవ్వాలని అడిగారు” అని ఆయన తెలిపారు.

రాజకీయ ఉద్దేశాలు లేవు- పోలీసులు
నారాయణపురంలో జరిగిన ఘటన వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని, అది పూర్తిగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందని పోలీసులు చెప్పారు.
మునికన్నప్పతోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది దగ్గర తిమ్మరాయప్ప అప్పులు చేసినట్లు చెప్పారు.
”ఈ నేపథ్యంలో గొడవ జరగడంతో ఆ అమ్మాయిని వేప చెట్టుకు తాడుతో కట్టేసి డబ్బులు ఇచ్చేవరకు వదిలేది లేదు అని గొడవ చేశారు. మాకు దీనిపై వాట్సాప్లో ఒక ఫోటో రావడంతో, దాని ఆధారంగా తక్షణం అక్కడికి వెళ్లాం. అయితే అప్పటికే అమ్మాయి కట్లు విప్పి గొడవపడుతూనే ఉన్నారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఇది పూర్తిగా ఫైనాన్షియల్ మేటర్” అని డీఎస్పీ తెలిపారు.
నలుగురు నిందితులపై అటెంప్ట్ టు మర్డర్ (హత్యాయత్నం) కేసు రిజిస్టర్ చేసినట్లు ఆయన చెప్పారు.
” బాధితురాలికి ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలన్నా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా మేం ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తాం”అని ఆయన అన్నారు.
ఈ కేసులో అరెస్టయిన వారిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు రిమాండ్లో ఉన్నందున అది సాధ్యం కాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)