SOURCE :- BBC NEWS

గౌరీకుండ్ సమీపంలో కూలిన హెలీకాప్టర్

ఫొటో సోర్స్, SDRF

41 నిమిషాలు క్రితం

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఒక హెలీకాప్టర్ కూలిపోయినట్లు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) వెల్లడించినట్లు సంస్థ ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో హెలీకాప్టర్‌లోని ఏడుగురూ మరణించారు.

”కేదార్‌నాథ్ ధామ్ నుంచి ప్రయాణికులను తీసుకుని గుప్త్‌కాశీకి తిరిగి బయల్దేరిన ఆ హెలీకాప్టర్ గౌరీకుండ్ సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఆరుగురు యాత్రికులు, ఒక పైలట్ ఉన్నారు. వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు” అని పేర్కొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, హఠాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) అందించిన వివరాల ప్రకారం, హెలీకాప్టర్ ప్రమాద మృతుల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
హెలీకాప్టర్ కూలిన ప్రాంతం

ఫొటో సోర్స్, SDRF

ఘటనా స్థలానికి పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఫ్ బృందాలు చేరుకున్నాయి.

ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం చాలా మారుమూల ప్రాంతమని ఏఎన్‌ఐతో గర్వాల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ స్వరూప్ అన్నారు.

‘‘ప్రాథమిక సమాచారం మేరకు ఆర్యన్ ఏవీయేషన్ హెలీకాప్టర్ కేదార్‌నాథ్ నుంచి గుప్త్‌కాశీ బేస్‌కు ప్రయాణికులను తీసుకువస్తుండగా, లోయలోని వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది. దీంతో హెలీకాప్టర్ కూలిపోయింది’’ అనే సమాచారం అందిందని ఉత్తరాఖండ్ జిల్లా పర్యటక అభివృద్ధి అధికారి రాహుల్ చౌబే చెప్పారు.

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని వానీ ప్రాంతానికి చెందిన జైస్వాల్ కుటుంబంలోని ముగ్గురు ఈ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. మృతులు రాజ్ కుమార్ జైస్వాల్, శారదా జైస్వాల్‌తో వారి రెండేళ్ల కుమార్తె కాశీ జైస్వాల్‌లు అని యావత్మాల్ జిల్లా కలెక్టర్ వికాస్ మీనా ధృవీకరించారు.

ఉత్తరాఖండ్‌లో గత 40 రోజుల్లో ఇది అయిదో హెలీకాప్టర్ ప్రమాదమని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)