SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
-
27 మే 2025
కొచ్చి తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన కార్గో షిప్ మునిగిపోయి చమురు లీకవ్వడంతో, తమ రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఓడ మునక వల్ల ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం నైరుతి రుతుపవనాల తీవ్రత కారణంగా కష్టంగా మారినట్లు తెలిపింది.
ఓడలో ఉన్న 643 కంటెనర్లలో 73 ఖాళీగా ఉన్నాయి. 13 కంటెనర్లలో కాల్షియం కార్బైడ్ రసాయనం ఉంది. ఇది ఎసిటలీన్ వాయువును విడుదల చేస్తుంది.
ఇదే కాకుండా 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నెస్ ఆయిల్ లోడ్ కూడా ఓడలో ఉంది.
ఈ కారణంగానే తీర ప్రాంత జిల్లాల్లో ముఖ్యంగా అలప్పుజా, కొల్లం, ఎర్నాకుళం, తిరువనంతపురాలలో రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది.

ఈ ప్రాంతాల్లోకి గత రాత్రి నుంచి 9 కంటెయినర్లు కొట్టుకొచ్చాయి. వీటిలో అలప్పుజాలోనే 4 కంటెయినర్లను గుర్తించారు.
సముద్ర తీర ప్రాంత వాసులు, ఒడ్డుకు కొట్టుకొచ్చే కంటైనర్లను, చమురును తాకొద్దని, మత్స్యకారులెవరూ ఆ మునిగిపోయిన ఓడ సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఓడ మునిగిన ప్రాంతం నుంచి 20 నాటికల్ మైళ్ల పరిధిలో చేపలు పట్టొద్దని మత్స్యకారులను ప్రభుత్వం హెచ్చరించింది.

ఫొటో సోర్స్, ANI
సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్
ఓడలోని 24 మంది సిబ్బందిలో కెప్టెన్, ఇంజినీర్ సహా ముగ్గురిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) రక్షించగా, మిగతా వారిని నేవీ కాపాడింది. శనివారం ఓడ ఒకవైపు ఒరిగిపోయి మునిగిపోవడం కనిపించిన తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు.
సముద్రంలో 1.5 నాటికల్ మైళ్ల పరిధిలో చమురు తెట్టును గుర్తించినట్లు, తర్వాత అది 2.2 నాటికల్ మైళ్లకు విస్తరించినట్లు బీబీసీతో రక్షణ శాఖ అధికార ప్రతినిధి అతుల్ పిళ్లై చెప్పారు.
”చమురు తెట్టు కనిపించిన వెంటనే మేం పంపిన డోర్నియర్ విమానం, ఆయిల్ స్పిల్ డిస్పరెంట్ (ఓఎస్డీ)ని ఉపయోగించి కాలుష్య నియంత్రణ ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే రుతు పవనాల తీవ్రత, చీకటి పడటంవంటి కారణాల వల్ల అక్కడి పరిస్థితిని మరోసారి అంచనా వేయడం కుదరలేదు” అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ANI
ఇది ఎంత ప్రమాదకరం?
అలప్పుజ జిల్లాలోని తొట్టపల్లి ఓడరేవుకు 14.6 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఓడ మునిగిపోయింది.
”ఇది టైర్-2 కేటగిరీ విపత్తు కిందకు వస్తుంది. అందుకే జాతీయ స్థాయి సంస్థలు, వనరులు, సదుపాయాల ద్వారా ఈ ఓడకు సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి. నేషనల్ ఆయిల్ ఫీల్డ్ ప్రివెన్షన్ ప్రాజెక్టుకు కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షత వహిస్తారు” అని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
ఒడ్డుకు కొట్టుకొచ్చే కంటెయినర్ల వ్యవహారాలు చూడటానికి కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ అండ్ బాయిలర్ విభాగానికి చెందిన రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను అక్కడ మోహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఓడ ఒకవైపు వంగినప్పుడు దాదాపు 100 కంటెయినర్లు సముద్రంలో పడిపోయాయని, రుతు పవనాల కారణంగా అవి తీరం వైపు కదులుతున్నాయనే భావనతో ఈ టీమ్లను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఓడలో ఉన్న చమురు సముద్రపు లోతుల్లో స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని కోస్ట్ గార్డ్, నేవీ, అటవీ, ఫ్యాక్టరీ-బాయిలర్ విభాగాలకు సూచనలు జారీ అయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేయలేమా?
సముద్రంలో ఒలికిన చమురు, రసాయనాల కారణంగా రాబోయే రోజుల్లో పర్యావరణం, సముద్ర జీవులు, మత్స్యకారుల జీవనోపాధిపై పడే ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయడం సాధ్యం కాదని బీబీసీతో కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్లోని అక్వాటిక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ చీఫ్, ప్రొఫెసర్ అనూ గోపీనాథ్ చెప్పారు.
”పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడానికి డేటా వచ్చేంతవరకు వేచి ఉండాలి. ఎన్ని కంటైనర్లు ఓపెన్ అయి ఉన్నాయి, వాటిలో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి అన్నది తెలుసుకోవడం ముఖ్యం’’ అన్నారామె.
ఈ కంటెయినర్లు ఉక్కుతో చేసినవి కాబట్టి, అవి సముద్రంలో కలిసిపోవనీ, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
‘‘రసాయనాలు, సముద్రంలో కలిస్తే ఆ ప్రాంతాన్ని 6 నుంచి 12 నెలల వరకు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు నీళ్లలో కరగడానికి సమయం పడుతుంది. తర్వాత ఆ రసాయనాలు, చేపల్లోకి చేరొచ్చు. ప్రభావిత ప్రాంతంలో కొంతకాలం చేపలు పట్టడం మానేయాలి” అని ఆమె వివరించారు.
‘13 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్ ఉంది, అది నీటితో చర్య జరిపితే ఎసిటలీన్ వాయువు కారణంగా పేలిపోవచ్చు’ అంటూ వస్తున్న ఊహాగానాలపై ఆమె స్పందించారు.
”కంటైనర్లు ఉక్కుతో తయారయ్యాయా? లేదా? అనే అంశాన్ని నిర్ధరించే వరకు ఏ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఉక్కు కంటైనర్లు అయితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండదు” అని ఆమె స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS