SOURCE :- BBC NEWS

- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
- హోదా, బీబీసీ న్యూస్
-
28 మే 2025
అమెరికా, ఇజ్రాయెల్ మద్దతున్న వివాదాస్పద గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) అనే సంస్థ ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి వేలాది మంది పాలస్తీనీయులు పోటెత్తారు.
రఫా నగరంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్దకు ప్రజలు కంచెలు, మట్టిగోడలు దాటుకొని వచ్చినట్లుగా వీడియోల్లో కనిపిస్తోంది.
ప్రజలు భారీగా తరలిరావడంతో ఒక దశలో తమ బృందం వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని జీహెచ్ఎఫ్ వెల్లడించింది. సమీపంలోని బలగాలు, హెచ్చరిక కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది.
గాజాలో ప్రధాన సహాయ పంపిణీదారుగా ఉన్న ఐక్యరాజ్య సమితిని మించి సహాయం అందించడమే జీహెచ్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎఫ్ తమ పనుల్లో సాయుధులైన అమెరికా భద్రతా కాంట్రాక్టర్లను ఉపయోగిస్తోంది.
గాజాలో 11 వారాల దిగ్బంధాన్ని ఇజ్రాయెల్ ఇటీవల సడలించింది. గాజా విపరీతమైన కరవు బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.
రఫా నుంచి వస్తోన్న వీడియోలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆకలితో ఉన్న 21 లక్షల మందికి తగిన సహాయం అందించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు ప్రకటించింది.


ఫొటో సోర్స్, Reuters
జీహెచ్ఎఫ్ ప్రణాళికకు యూఎన్ అభ్యంతరం
జీహెచ్ఎఫ్ సహాయ ప్రణాళికలకు సహకరించేందుకు ఐక్యరాజ్య సమితి, పలు సహాయ సంస్థలు నిరాకరించాయి. అవి మానవీయ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని, చూడటానికి ‘సాయుధ సాయం’ (వెపనైజ్ ఎయిడ్)లా ఉందని అభ్యంతరం చెబుతున్నాయి.
ఈ వ్యవస్థ ఆచరణాత్మకంగా వృద్ధులు, వికలాంగులు, క్షతగాత్రులు చేరలేని విధంగా, వేలాది మందికి హాని కలిగించేలా, రాజకీయ-సైనిక లక్ష్యాలకు లోబడి ఉంటుందని, సహాయ పంపిణీలో ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యంకాని విధానానికి ఉదాహరణగా నిలుస్తుందని అవి హెచ్చరిస్తున్నాయి.
ఎయిడ్ను హమాస్ దొంగిలించకుండా అడ్డుకోవడానికి, ప్రస్తుత పంపిణీ విధానానికి ప్రత్యామ్నాయం అవసరమని ఇజ్రాయెల్ అంటోంది. దొంగతనం ఆరోపణలను హమాస్ ఖండిస్తోంది.
స్థానికంగా ఉండే ప్రభుత్వేతర సంస్థల సహకారంతో 4.62 లక్షల మందికి ఆహారం అందించినట్లు జీహెచ్ఎఫ్ వెల్లడించింది.
హమాస్ దారులు మూసివేయడం కారణంగానే, సహాయ కేంద్రం వద్దకు చేరుకోవడానికి ప్రజలకు గంటల పాటు ఆలస్యం జరిగిందని జీహెచ్ఎస్ పేర్కొంది. అయితే వీటికి ఆధారాలేమీ చూపలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సహాయ కేంద్రాల వద్ద అమానవీయ పరిస్థితులు
ఒక సహాయ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు బారులు తీరినట్లుగా కనిపిస్తోన్న వీడియోలను ఇజ్రాయెల్, పాలస్తీనా మీడియా షేర్ చేసింది.
ఒక వీడియో క్లిప్లో తుపాకీ కాల్పుల్లా వినిపిస్తోన్న శబ్ధాలకు ప్రజలంతా పరిగెత్తుతున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రజలు ఆహార పదార్థాల పార్సిళ్లు, ఇతర సహాయ వస్తువులను లాక్కోవడంతో గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. స్థానికంగా మోహరించిన ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయని చెప్పారు.
”పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఒక దఫాలో 50 మంది మాత్రమే రావడానికి వారు అనుమతించారు. చివరకు గందరగోళం నెలకొంది. ప్రజలు గేట్లు ఎక్కేశారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆహార పదార్థాలను తీసుకెళ్లారు” అని బీబీసీ అరబిక్ మిడిల్ ఈస్ట్ డైలీ రేడియో ప్రోగ్రాంలో ఒక వ్యక్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
”ఇది ఒక అవమానకరమైన అనుభవం” అని ఆయన అన్నారు.
”ప్రజలు విసిగిపోయారు. ఏదైనా చేయడానికి, చివరకు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనక్కి తగ్గలేదు. కేవలం ఆహారం కోసం, తమ పిల్లలకు తిండి పెట్టడానికే ఇలా చేశారు” అని ఒక మహిళ చెప్పారు.
హెచ్చరించడానికే కాంపౌండ్ బయట కాల్పులు జరిపినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తెలిపింది.
”పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రణాళిక ప్రకారమే ఆహార పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐడీఎఫ్ బలగాల భద్రత విషయంలో రాజీపడం” అని పేర్కొంది.
సహాయం పంపిణీలో ఇజ్రాయెల్ ఘోరంగా విఫలమైందని గాజాలో హమాస్ ఆధీనంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం విమర్శించింది.
జీహెచ్ఎఫ్ కేంద్రాలకు ప్రజలు వెళ్లకుండా హమాస్ ప్రయత్నిస్తుందన్న ఆరోపణలను ఖండించింది.
వీడియో ఫుటేజీ హృదయవిదారంగా ఉందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ న్యూయార్క్లో జరిగిన ఒక సమావేశంలో అన్నారు.
ఐక్యరాజ్య సమితి విమర్శలు కపటత్వానికి పరాకాష్ట అని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ విమర్శించారు.
SOURCE : BBC NEWS