SOURCE :- BBC NEWS

అస్సాం, ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Pritam Roy/BBC

  • రచయిత, అరుణోదయ ముఖర్జీ
  • హోదా, బీబీసీ న్యూస్
  • 6 జూన్ 2025

గడచిన కొన్ని రోజుల గురించి ఆలోచిస్తే షోనా బను ఇప్పటికీ వణికిపోతున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలోని బార్‌పేట్ జిల్లాకు చెందిన షోనా బను వయసు 58 ఏళ్లు. మే 25న తనను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిచారని, తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లారని షోనా బను తెలిపారు. అక్కడినుంచి ఆమెను, దాదాపుగా మరో 13 మందిని బలవంతంగా బంగ్లాదేశ్ దాటించారని ఆమె తెలిపారు.

తనను ఎందుకు పంపించారో చెప్పలేదని, తాను జీవిస్తున్న అస్సాంలో కొన్నేళ్లగా పరిస్థితులు మారిపోయాయని ఆమె చెప్పారు. తాను అక్రమంగా వలస వచ్చిన వ్యక్తిని కాదని, భారతీయ పౌరురాలేనని నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని షోనా బను ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పరిస్థితి భయాందోళనకు గురి చేస్తోందని ఆమె అన్నారు.

”తుపాకీ పెట్టి బెదిరించి వాళ్లు నన్ను తీసుకెళ్లారు. ఓ పొలం మధ్యలో మోకాలి లోతు నీటిలో దోమలు, జలగల మధ్య ఆహారం, నీళ్లు లేకుండా రెండురోజులపాటు ఉన్నా. భారత్, బంగ్లాదేశ్ మధ్య మనుషులెవరూ లేని ఆ ప్రాంతంలో రెండు రోజులున్న తర్వాత బంగ్లాదేశ్ వైపున్న ఒక పాత జైలులాంటి దానికి నన్ను తీసుకెళ్లారు” అని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అస్సాం, ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Alahi Sgagria Nazim/BBC

‘ఎందుకు పంపారు..తిరిగి ఎందుకు తీసుకొచ్చారు’

ఆ పాత జైలులాంటి దానిలో రెండురోజులున్న తరువాత ఆమెతో పాటు మరికొందరిని బంగ్లాదేశ్ అధికారులు సరిహద్దుల దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ భారత అధికారులు ఉన్నారని, వారు తమను ఇళ్లకు పంపించారని షోనా బను తెలిపారు. అప్పుడు తనతోపాటు ఉన్నవారంతా కొన్నిరోజుల క్రితం తనతో పాటు వచ్చినవారేనా కాదా అనేది తనకు స్పష్టంగా తెలియదని ఆమె చెప్పారు.

బనును బలంతంగా బంగ్లాదేశ్ ఎందుకు పంపించారో, తిరిగి ఎందుకు వెనక్కి తీసుకొచ్చారో తెలియదు. అయితే గతంలో ‘అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారు’ అనే అనుమానంతో ట్రిబ్యునల్స్ విదేశీయులుగా ప్రకటించిన వారిని అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు అస్సాంలో ఇటీవల జరుగుతున్నాయి. వాటిలో బను కేసు ఒకటి.

దీనిపై బీబీసీ వేసిన ప్రశ్నలకు భారత సరిహద్దు భద్రతా బలగాలు, అస్సాం పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు స్పందించలేదు.

అస్సాం,ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Alahi Sgagria Nazim/BBC

పొడవైన సరిహద్దు

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడం భారత్‌లో కొత్త కాదు. రెండు దేశాల మధ్య 4,906కిలోమీటర్ల పొడవైన సున్నితమైన సరిహద్దు ఉంది. దీంతో భారీ భద్రత ఉన్నప్పటికీ సరిహద్దులు దాటడం సాపేక్షికంగా తేలికైన విషయంగా మారింది.

అయితే ఇళ్లల్లో ఉన్న ప్రజలను తీసుకొచ్చి , ఎలాంటి విధానపరమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా మరో దేశం పంపించడం చాలా అరుదని, ఈ కేసుల్లో వాదించే లాయర్లు చెబుతున్నారు. కానీ ఇటువంటి ప్రయత్నాలు గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతున్నాయి.

తాజాగా ఇలా ఎంతమందిని సరిహద్దులు దాటించారనే విషయమై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించడం లేదు. కానీ ఒక్క అస్సాం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మే లోనే 12వందలమందికి పైగా ప్రజలను భారత్ అక్రమంగా బంగ్లాదేశ్‌లోకి పంపించిందని అక్కడి ఉన్నతస్థాయి అధికారయంత్రాంగం ఆరోపిస్తోంది.

వారిలో వందమందిని భారత పౌరులుగా గుర్తించి, బంగ్లాదేశ్ వారిని తిరిగి వెనక్కి పంపిందని పేరు చెప్పడానికి ఇష్టపడని అక్కడి అధికారులు చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు సరిహద్దు వెంట గస్తీ పెంచామని బంగ్లాదేశ్ సరిహద్దు రక్షకదళం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఆరోపణలపై భారత్ స్పందించలేదు.

అస్సాం,ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC

1971 మార్చి 24 ముందు వచ్చినవారికే..

ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న రోహింజ్యా ముస్లింలు సహా మిగిలినవారిపై ఇటీవల కఠిన చర్యలు పెరిగాయని, ప్రత్యేకించి అస్సాంలో పరిస్థితి ఉద్రిక్తంగా, సంక్లిష్టంగా ఉందని మీడియా రిపోర్టులు తెలియజేస్తున్నాయి. పౌరసత్వం, జాతి గుర్తింపు సమస్యలు చాలా కాలంగా అస్సాం రాజకీయాలను శాసిస్తున్నాయి.

అస్సాంకు, బంగ్లాదేశ్‌కు మధ్య దాదాపు 300కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. అవకాశాలను వెతుక్కుంటూనో మతపరమైన హింస నుంచి తప్పించుకునేందుకో ప్రజలు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి వలసలొస్తుంటారు.

ఈ వలసల వల్ల జనాభా సంఖ్యలో మార్పు వచ్చి, వనరుల దోపిడీ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అస్సాంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్రమ వలస సమస్యకు అడ్డుకట్ట వేస్తామని తరచూ హామీ ఇస్తుంటుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ)ని ఇటీవలి సంవత్సరాల్లో ప్రాధాన్యతా అంశంగా మార్చుకుంది.

పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించకముందు, అంటే 1971 మార్చి 24కు ముందు అస్సాం వచ్చామని నిరూపించుకోగలిగే వారి జాబితాతో ఈ రిజిస్టర్ ఉంటుంది. ఈ జాబితాను అనేకసార్లు సవరించారు. జాబితాలో పేర్లు మిస్సయిన వారు తమ అధికారిక పత్రాలు ఫారినర్స్ ట్రిబ్యునల్స్‌కు చూపించి భారత పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవకాశాలిచ్చారు.

అస్సాం, ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, ani

20 లక్షల మందికి రిజిస్టర్‌లో దక్కని చోటు

అనేక మార్పులు చేర్పులు తర్వాత 2019లో తుదిజాబితా రూపొందించారు. అస్సాంకు చెందిన దాదాపు 20 లక్షలమందికి ఆ జాబితాలో చోటు దక్కలేదు. వారిలో చాలా మందిని నిర్బంధ శిబిరాలకు తరలించారు. జాబితాలో తమను చేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఎగువ కోర్టులను ఆశ్రయించారు.

తన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, అయినప్పటికీ వెళ్లిపోవాల్సిందిగా అధికారులు తనను బలవంతం చేశారని బను తెలిపారు.

అస్సాంలో కనీసం ఆరుగురు ఇలాంటి బాధలనే బీబీసీకి చెప్పారు. వారంతా ముస్లింలు. బనును పంపించిన సమయంలోనే తమ కుటుంబసభ్యులను బంగ్లాదేశ్‌కు పంపించారని వారు తెలిపారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని, తరతరాలుగా తామిక్కడే జీవిస్తున్నామని, అయినా ఇలా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వారిలో కనీసం నలుగురు ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చారు. అసలు వారిని ఎందుకు పంపించేశారు అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు లేవు.

3కోట్ల20లక్షల అస్సాం జనాభాలో మూడో వంతు మంది ముస్లింలు. వారిలో చాలా మంది బ్రిటిష్ పాలనా కాలంలో వలసవచ్చిన వారి వారసులే.

అస్సాం, ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత…

అస్సాంలోని బార్‌పేటకు చెందిన 67ఏళ్ల మలేక ఖతూన్ ఇప్పటికీ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారు. అక్కడి స్థానిక కుటుంబం తనకు తాత్కాలికంగా ఆశ్రయమిచ్చిందని ఆమె తెలిపారు.

”నాకిక్కడ ఎవరూ లేరు” అని ఆమె ఏడుస్తూ చెప్పారు. కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడగలుగుతున్నారు. కానీ ఆమె ఎప్పుడు తిరిగి వస్తారో వారికి తెలియదు. ఫారినర్స్ ట్రిబ్యునల్‌లో, హైకోర్టులో ఆమె కేసు ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.

విదేశీయులుగా ప్రకటించి ఇంకా నిర్బంధ శిబిరాల్లోనే ఉంచిన వారిని దేశం నుంచి పంపించమంటూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇటీవలి చర్యలు ప్రారంభించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రస్తావించారు.

”విదేశీయులుగా ప్రకటించిన తర్వాత కనీసం కోర్టుల్లో కూడా అప్పీలు చేసుకోని వారిని మేం వెనక్కి తిరిగి పంపిస్తున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు. కోర్టులో పెండింగ్ కేసులున్నవారికి ఎలాంటి ఇబ్బందులూ లేవని అన్నారు.

ఇటీవలి చాలా ఘటనల్లో భారత్, బంగ్లాదేశ్ ఈ వ్యవహారంలో విధానపరంగా సహకరించుకోవాల్సిన ప్రక్రియను అనుసరించడం లేదని అస్సాంలోని పౌరసత్వం కేసుల్లో వాదించే లాయర్ అబ్దుర్ రజాక్ భుయాన్ ఆరోపించారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా, ఇష్టానుసారం తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అస్సాం, ఎన్‌ఆర్‌సీ, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, AFP

అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ…

బార్‌పేటకు దాదాపు 167కిలోమీటర్ల దూరమున్న మోరిగాన్‌లో ఒక టేబుల్‌కు దగ్గరగా ఉన్న కుర్చీలో రీటా ఖతూన్ కూర్చుని ఉన్నారు.

ఆమె భర్త ఖైరుల్ ఇస్లామ్ స్కూల్ టీచర్. ఆయన వయసు 51 ఏళ్లు. బనుతో పాటు అధికారులు బలవంతంగా తీసుకెళ్లిన బృందంలో ఆయన ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

2016లో ట్రిబ్యునల్ ఆయన్ను విదేశీయునిగా ప్రకటించింది. విడుదలకు ముందు ఆయన రెండేళ్ల పాటు నిర్బంధ శిబిరంలో ఉన్నారు. బనులానే ఆయన కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది.

”నా భర్త భారతీయుడని ప్రతి డాక్యుమెంట్ నిరూపిస్తోంది” అని ఖతూన్ చెప్పారు. కొన్ని భూమి పత్రాలను, హైస్కూల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను ఆమె చూపిస్తున్నారు. కానీ అధికారుల దగ్గర ఆయన జాతీయత నిరూపించేందుకు ఈ పత్రాలు సరిపోవడం లేదు.

తన భర్త, ఆయన తండ్రి, తాత అందరూ భారత్‌లోనే జన్మించారని ఆమె తెలిపారు.

మే 23న పోలీసులు తమ ఇంటికొచ్చి ఏమీ చెప్పకుండా ఇస్లామ్‌ను తీసుకెళ్లారని ఖతూన్ తెలిపారు. కొన్నిరోజుల అనంతరం జనసంచారం లేని ప్రాంతంలో ఒక బంగ్లాదేశీ జర్నలిస్ట్ ఇస్లామ్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాతే ఆ కుటుంబానికి ఆయన ఎక్కడున్నారో తెలిసింది.

బనులానే ఇప్పుడు ఇస్లామ్‌ను భారత్‌కు తిరిగి పంపించివేశారు. ఆయన తిరిగొచ్చినట్టు కుటుంబం చెబుతున్నప్పటికీ, దానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు బీబీసీకి చెప్పారు.

ఇస్లామ్‌ను తీసుకెళ్లిన రాత్రే పోలీసులు సంజిమా బేగం అనే యువతి తండ్రిని తీసుకెళ్లారు. గుర్తింపులో జరిగిన పొరపాటు కారణంగా ఆయన్ను విదేశీయునిగా ప్రకటించారు.

”మా నాన్న పేరు అబ్దుల్ లతీఫ్, మా తాత పేరు అబ్దుల్ సుభాన్. ఫారిన్ ట్రిబ్యునల్ నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన నోటీసులో మా తాత పేరును షుకుర్ అలీగా రాశారు. ఆయన మా తాత కాదు. నాకసలు ఆయన తెలియనే తెలియదు. మా నాన్న పౌరసత్వాన్ని నిరూపించేందుకు కావాల్సిన అన్ని పత్రాలు నా దగ్గరున్నాయి” అని బేగమ్ చెప్పారు.

లతీఫ్ అస్సాంకు తిరిగి వచ్చారని కుటుంబానికి తెలిసింది. కానీ ఆయనింకా ఇంటికి చేరుకోలేదు.

”మేం ఆడుకునే వస్తువులం కాదు” అని బేగమ్ అన్నారు.

”వీరు మనుషులు. మీ ఇష్టానుసారం వారితో బొమ్మాబొరుసు ఆడలేరు’’

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS