SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
ఒక గంట క్రితం
ఇరాన్లో ప్రస్తుతం తమ జీవితం గురించి బీబీసీతో మాట్లాడిన వారిలో చాలామంది చెప్పిన మాట “ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాం” అని.
మూడు రోజుల ఇజ్రాయెల్ దాడుల తర్వాత, “ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా తెహ్రాన్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఓ స్థానికుడు బీబీసీతో చెప్పారు.
నగరం అంతటా పెట్రోల్ బంకుల వద్ద ఆదివారం భారీ క్యూలు కనిపించాయి. చాలా మంది ప్రజలు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి దూరంగా మారుమూల ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ భారీ ట్రాఫిక్ కారణంగా బయటకు రాలేకపోయారు.
“ఇజ్రాయెల్ దాడుల గురించి అధికారుల నుంచి మాకు ఎటువంటి హెచ్చరికలు అందలేదు. మేం పేలుళ్ల శబ్దాలు మాత్రమే విన్నాం. మా ప్రాంతం దాడుల వల్ల దెబ్బతినకూడదని ఆశిస్తున్నాం. కానీ మేం ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడా సురక్షితంగా అనిపించడం లేదు. తెహ్రాన్ సురక్షితంగా లేదన్నది స్పష్టం” అని ఒక తెహ్రాన్ నివాసి అన్నారు.
తెహ్రాన్ నుంచి బయటపడిన మరో వ్యక్తి మాట్లాడుతూ “నేను యుద్ధం జరుగుతున్న ప్రాంతలో నివసిస్తున్నానే విషయాన్ని అంగీకరించే మానసిక స్థితిలో లేను. ఈ పరిస్థితిని ఎప్పుడు అంగీకరిస్తానో తెలియదు” అన్నారు.
“ఇది నా యుద్ధం కాదు. నేను రెండు దేశాల్లో దేనికీ మద్దతు ఇవ్వడం లేదు. నా కుటుంబంతో కలిసి జీవించాలనుకుంటున్నాను.” అని ఆ వ్యక్తి తెలిపారు.
కొన్నేళ్లనుంచి ఎప్పుడూ చేయని విధంగా శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ ఇరాన్పై అతిపెద్ద వైమానిక దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా ప్రతిస్పందనగా క్షిపణి దాడులు మొదలుపెట్టింది.
ఇరాన్ దాడుల వల్ల ఇజ్రాయెల్లో కనీసం 19 మంది మరణించారని అధికారులు తెలిపారు.
శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ దాడులలో 224మంది మరణించారని ఇరాన్ ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది.
‘‘రెండురోజుల నుంచి నేను నిద్రపోలేకపోతున్నా. నిజంగా కఠినపరిస్థితులను ఎదుర్కొంటున్నా’’ అని ఒక ఇరాన్ మహిళ బీబీసీకి చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి…1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో బాంబు దాడులు జరిగి తాము శిబిరాలకు వెళ్లిన తన చిన్నప్పటి రోజులను, ఆనాటి పరిస్థితులను గుర్తుకుతెస్తోందని ఆమె తెలిపారు.
“తేడా ఏమిటంటే, అప్పట్లో, కనీసం దాడి జరిగే ముందు వైమానిక దాడి సైరన్ లేదా హెచ్చరికలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు, కనీస హెచ్చరికలు కూడా లేకుండా దాడులు జరుగుతున్నాయి” అని ఆమె తెలిపారు.
యుద్ధం తర్వాత జన్మించిన వారికి అది ఎలా ఉంటుందో తెలియదని బీబీసీ పర్షియన్ ప్రతినిధి ఘోంచె హబీబియాజాద్ అన్నారు.
దాడుల నుంచి తప్పించుకోవడానికి నగరం విడిచి వెళ్లిపోవాలని భావించినట్టు తెహ్రాన్కు చెందిన ఒక మహిళ తెలిపారు.
“మేమందరం చిన్న నగరాలకు లేదా గ్రామాలకు వెళ్లాలని అనుకుంటున్నాం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మాలో ప్రతి ఒక్కరికీ వదిలి వెళ్ళలేని ఆత్మీయులు ఉన్నారు. మేం వారి గురించి ఆలోచిస్తున్నాం, న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇరాన్ ప్రజలుకు రాకూడనివి” అని ఆమె చెప్పారు.
“మేమందరం భయం, అలసట, ఒత్తిడితో రోజులు వెళ్లదీస్తున్నాం. ఇది కష్టమైనది, బాధాకరమైనది.” అని ఆమె అన్నారు.
“నేను తెహ్రాన్ను వదిలి వెళ్ళలేను. ముసలివాళ్లైన నా తల్లిదండ్రులను వదిలి నేను వెళ్ళలేను, వారు ఎక్కువ దూరం ప్రయాణించలేరు. నేనూ నగరాన్ని వదిలి వెళ్ళలేను. ఎందుకంటే పనికి వెళ్లక తప్పని పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చేయాలి?” అని రాజధాని నివాసి ఒకరు అన్నారు.


ఫొటో సోర్స్, EPA-EFE
ఇంటర్నెట్కు అంతరాయాలు కలుగుతుండటంతో ఇరాన్ ప్రజలతో సంప్రదింపులు జరపడం కష్టంగా మారింది. దేశం బయట నివసిస్తున్న చాలామంది… తిరుగు సమాధానం వస్తుందన్న ఆశతో తమ ఆత్మీయులకు మెసేజ్లు పంపిస్తున్నారు.
సైనిక స్థావరాల సమీపంలో ఉన్న ప్రాంతాలను విడిచిపెట్టాలంటూ కొంతమంది ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు పంపింది.
తెహ్రాన్ ప్రజలు దీని గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
“సైనిక స్థావరం ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు అని మేం ఎలా తెలుసుకోవాలి?” అని ఒకరు అన్నారు. మరోవైపు, దాడుల రెండవ రోజున ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు… “మీ స్వేచ్ఛ కోసం ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రజలు ఇప్పటికయితే సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
నెతన్యాహు పిలుపు క్షేత్రస్థాయిలో ప్రజలవరకూ చేరిందని చెప్పడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని బీబీసీ న్యూస్ పర్షియన్ ప్రతినిధి దార్యూష్ కరిమి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అణు స్థావరాలు, వైమానిక స్థావరాలపై దాడుల కంటే నివాస భవనాల ధ్వంసం ఇరాన్ ప్రజలను ఎక్కువగా దిగ్భ్రాంతికి గురి చేసిందని బీబీసీ పర్షియన్ ప్రతినిధి పౌయాన్ కలాని అన్నారు.
ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసినప్పటి నుంచి చాలా మంది ఇరాన్ ప్రజలు రాజధాని వీధుల్లో ఇలాంటి దృశ్యాలను చూడలేదని చెప్పారు.
తెహ్రాన్, ఇతర ప్రాంతాలలోని చాలా మంది శుక్రవారం నాటి గందరగోళాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది. ఈ యుద్ధం ఎంత పెద్దది. వారు తమను, తమ కుటుంబాలను ఎలా రక్షించుకోవాలి?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)