SOURCE :- BBC NEWS

మావోయిస్టులు, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, AFP via Getty Images

దేశంలో దశాబ్ధాల తరబడి అడవుల్లో కొనసాగుతున్న తిరుగుబాటు ముగింపు దశకు చేరుకుందా?

ఛత్తీస్‌గఢ్‌లో గతవారం భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో, దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 26 మంది మావోయిస్టులు చనిపోయారు.

ఇది మూడు దశాబ్దాల్లో మావోయిస్టులపై జరిగిన ‘అత్యంత కచ్చితమైన దాడి’ అని హోంమంత్రి అమిత్‌షా దీనిని అభివర్ణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీస్ అధికారి మరణించారు.

బసవరాజు మరణం ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు, 1980ల నుంచి బస్తర్‌లో మావోయిస్టులు నిర్మించుకున్న బలమైన భద్రతా వలయం కకావికలమైందని చెప్పడానికి సంకేతం కూడా.

పశ్చిమబెంగాల్‌లోని నక్సల్‌బరి గ్రామంలో 1967లో నక్సల్ ఉద్యమం మొదలైన తర్వాత ‘నక్సలైట్లు’గా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు, మధ్య భారత దేశంలో ‘రెడ్‌ కారిడార్‌’ ఏర్పాటు కోసం ఏకమయ్యారు.

తూర్పున ఝార్ఖండ్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు దేశంలోని మూడొంతుల జిల్లాలకు విస్తరించారు.

‘మావోయిస్టు ఉద్యమం భారతదేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పు’ అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

గ్రామీణ పేదలు, ఆదివాసుల హక్కుల కోసం తాము పోరాడుతున్నామని, పాలక వర్గాలు దశాబ్దాలుగా వారిని నిర్లక్ష్యం చేశాయని, వారి భూముల్ని ఆక్రమించుకున్నాయని మావోయిస్టులు చెప్పేవారు.

వామపక్ష తీవ్రవాదంగా పిలిచే మావోయిస్టు ఉద్యమం, 2004లో మార్క్సిస్ట్- లెనినిస్టు గ్రూపులు కలిసి సీపీఐ (మావోయిస్టు)లు అవతరించడంతో మావోయిస్టు పార్టీ అధికారిక రూపాన్ని సంతరించుకుంది.

తెలంగాణలో 1946లో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ పార్టీ సైద్ధాంతిక మూలాలకు పునాది.

మావోయిస్టులు, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, AFP via Getty Images

మావోయిజం లేకుండా చేస్తామని మోదీ ప్రతిజ్ఞ

ఇక ప్రస్తుతానికి వస్తే, మార్చ్ 2026 నాటికల్లా మావోయిజాన్ని దేశంలో లేకుండా చేస్తామని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతినబూనడంతో, మావోయిస్టుల పోరాటం ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లో నిలబడింది.

నిజంగానే అంతమవుతుందా? లేక సుదీర్ఘ రక్తసిక్త పోరులో ఇదొక విరామమా?

“కొంత ప్రశాంతత ఉంటుంది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమాలు ఇలాంటి సవాళ్లను అధిగమించాయి. 70లలో నక్సలైట్లలో అగ్రనాయకుల్ని చంపేశారు. అయినా ఇప్పుడు మనం నక్సలిజం గురించి మాట్లాడుకుంటున్నాం” అని మావోయిస్టు ఉద్యమాన్ని చాలా కాలంగా పరిశీలిస్తున్న జర్నలిస్టు ఎన్. వేణుగోపాల్‌ అన్నారు.

మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లను పర్యవేక్షించే ఎంఏ గణపతి, కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన అభిప్రాయం మరోలా ఉంది.

“మావోయిస్ట్ ఉద్యమం ప్రధానంగా సైద్ధాంతిక పోరాటం. అయితే ఆ భావజాలానికి నేటి తరం యువతలో ఆదరణ లేదు. విద్యావంతులైన యువకులకు దీనిపై ఆసక్తి లేదు” అని గణపతి చెప్పారు.

“బసవరాజు చనిపోవడంతో పార్టీ స్థైర్యం దెబ్బతింది. వాళ్లు చివరి దశలో ఉన్నారు” అని ఆయన అన్నారు.

2013-2023 మధ్య మావోయిస్టుల హింసాత్మక ఘటనలు, హింస 48 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది.

2013లో 1136గా ఉన్న హింసాత్మక ఘటనలు 2023 నాటికి 594కి తగ్గాయి. మరణాల విషయానికొస్తే 65శాతం తగ్గాయి. 2013లో 397గా ఉన్న మావోయిస్టు మరణాలు 2023 నాటికి 138కి తగ్గాయి.

అయితే, 2022తో పోలిస్తే 2023లో భద్రత బలగాల మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని ఈ నివేదిక తెలిపింది.

మావోయిస్టులకు పట్టున్న ప్రాంతంలో భారీ ఆపరేషన్లు చేపట్టడం వల్ల ఇలా జరిగిందని అందులో పేర్కొంది.

2023లో మావోయిస్టుల హింస వల్ల ఛత్తీస్‌గఢ్‌ తీవ్రంగా ప్రభావితమైందని, వామపక్ష తీవ్రవాద ఘటనలు 63 శాతం, వారి మరణాలు 66 శాతం పెరిగినట్లు కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది.

27 శాతం హింసాత్మక ఘటనలు 23శాతం మరణాలతో ఛత్తీస్‌గఢ్‌ తర్వాతి స్థానంలో ఝార్ఖండ్‌ ఉంది. మిగతా సంఘటనలు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్‌లో జరిగాయి.

మావోయిస్టులు, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, AFP via Getty Images

సిద్ధాంతానికి కాలం చెల్లిందా?

మావోయిస్టులకు బలమైన కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిజం పతనం కావడం, ఉద్యమ క్షీణతకు సంకేతంగా కనిపిస్తోంది.

దశాబ్దం కిందట, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులంటే చాలా బలహీనులుగా భావించేవారని గణపతి చెప్పారు.

“ఇవాళ, ప్రభుత్వం చేస్తున్న నిర్దిష్ట దాడులు, వారికి కేంద్ర బలగాల మద్దతు మొత్తం పరిస్థితిని మార్చేశాయి. పారా మిలటరీ బలగాలు క్షేత్రస్థాయిలో పోరాడుతుంటే, రాష్ట్ర బలగాలు సమాచారాన్ని సేకరించి లక్షిత ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఇది వ్యవస్థల సమన్వయానికి నిదర్శనం’’ అని ఆయన అన్నారు.

అన్నిరకాలుగా కనెక్టివిటీ పెరగడం వల్ల మావోయిస్టు ఉద్యమానికి మద్దతు తగ్గిందని గణపతి చెప్పారు.

“ప్రజల ఆకాంక్షలు పెరిగాయి. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు విస్తృతం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సామాజిక వాస్తవికతకు దూరంగా మావోయిస్టులు మారుమూల అడవుల్లో నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించలేరు. ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమం కూడా మనుగడ సాగించలేదు” అని ఆయన అన్నారు.

మావోయిస్టు ఉద్యమ పతనానికి ప్రధాన లోపం రాజకీయంగా సంబంధాలు తెగిపోవడమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని మావోయిస్టు మాజీ సానుభూతిపరుడొకరు చెప్పారు.

“వాళ్లు నిజమైన మార్పును తీసుకొచ్చారు. తెలంగాణలో సామాజిక న్యాయం, ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసులను ఏకం చేయడంలాంటివి సాధించారు. కానీ దానిని సంఘటిత రాజకీయ శక్తిగా మార్చడంలో విఫలమయ్యారు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

కాలంచెల్లిన సిద్ధాంతం, ప్రజలకు దూరంగా ‘స్వేచ్ఛాయుత జోన్లు’ నిర్మించడం, సుదీర్ఘమైన ప్రజాపోరాటం ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బ తీయవచ్చనే సిద్ధాంతం వల్ల ఉద్యమం విఫలమైందనేది ఆయన వాదన.

“ప్రభుత్వం ఎదురు దాడికి దిగనంత వరకే ఇవన్నీ నడుస్తాయి. ప్రభుత్వం దాడి మొదలు పెడితే ఈ జోన్లు కూలిపోతాయి. వేలమంది చనిపోతారు. భారత్‌లో పలుచబడుతున్న అడవుల నుంచి ఉద్యమాన్ని నడపగలమా అని ప్రశ్నించుకోవల్సిన సమయం ఇది” అని ఆయన అన్నారు.

2007లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) విడుదల చేసిన పొలిటికల్ డాక్యుమెంట్ మావో కాలంనాటి ‘విముక్త ప్రాంతాలను సృష్టించడం, పల్లె ప్రాంతాల నుంచి నగరాలను చుట్టుముట్టడం’ అనే వ్యూహానికి కట్టుబడి ఉంది. అయితే ‘ఇది ఎంతమాత్రం పని చేయదని’’ ఆ సానుభూతిపరుడు భావిస్తున్నారు.

మావోయిస్టులు, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, AFP via Getty Images

మావోయిస్టు పార్టీకి కొన్నిచోట్ల, ప్రధానంగా తూర్పు మహారాష్ట్రలోని ఆదివాసీ ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో ఆదరణ ఉంది. అయితే అక్కడ బలమైన స్థావరాలు లేవు.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ప్రభుత్వ దళాలు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆపరేషన్లు మావోయిస్టు వనరుల్ని బలహీనపరుస్తున్నాయి. ప్రతీరోజూ కేడర్, లీడర్లు చనిపోతున్న తీరు, తమను తాము రక్షించుకోవడంలో మావోయిస్టుల అసహాయతకు నిదర్శనంగా నిలుస్తోంది.

మావోయిస్టులు ప్రాణాలు కోల్పోకుండా తమ వ్యూహంపై పునరాలోచన చేయాలని వేణుగోపాల్ భావిస్తున్నారు.

అడవుల్లో ఉండి చేసే పోరాటానికి ఆదరణ ఉంటుంది. అయితే “దాన్ని ఎన్నికల రాజకీయాలతో సమ్మిళితం చేయడమే అసలైన సవాలు” అని ఆయన చెప్పారు.

అయితే, హోంశాఖ మాజీ అధికారి గణపతి ఆలోచన దీనికి విరుద్ధంగా ఉంది. మావోయిస్టులు చర్చలకు రావల్సిన సమయం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నారు.

“వాళ్లిప్పుడు బేషరతుగా చర్చలకు అంగీకరించడం తెలివైన పని. షరతులు పెట్టినప్పటికీ ప్రభుత్వం వాటిని అంగీకరించేలా ఉండాలి. ఏ ప్రయోజనం లేకుండా తమ కేడర్ ప్రాణాలను త్యాగం చేయడానికి బదులు ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ఇదే సరైన సమయం” అని గణపతి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు మావోయిస్టులకు పట్ల సానుకూల వైఖరి

కాల్పుల విరమణ పాటించాలన్న ప్రతిపాదనకు తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, మరో 10 వామపక్ష పార్టీలు మద్దతిచ్చాయి. మావోయిస్టుల్లో మిగిలిన లీడర్లు, కేడర్‌ను రక్షించే విస్తృత ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.

కులపరమైన అణచివేతకు వ్యతిరేకంగా గతంలో కొనసాగిన మావోయిస్టు ఉద్యమానికి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సామాజిక ఆమోదం ఉంది. మావోయిస్టులు- ప్రభుత్వం మధ్య చర్చల కోసం సామాజిక కార్యకర్తలు కూడా ప్రయత్నిస్తున్నారు.

“మాతో పాటు ఇతర పౌర హక్కుల సంఘాలు కూడా తక్షణమే కాల్పుల విరమణ ఆ తర్వాత చర్చలు జరపడం అనే రెండు దశల ప్రక్రియ కోసం డిమాండ్ చేస్తున్నాయి” అని కోల్‌కతాకు చెందిన అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ప్రధాన కార్యదర్శి రంజిత్ కౌర్ చెప్పారు.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఖనిజ వనరులు దండిగా ఉండటంతో, ఆయా రాష్ట్రాలు చర్చల్ని వ్యతిరేకిస్తున్నాయి. మావోయిస్టుల ఉనికికి ఇది కీలకమైన అంశమని వేణుగోపాల్ భావిస్తున్నారు.

ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌ను తీసుకుంటే భారతదేశంమొత్తం మీద టిన్, మౌల్డింగ్ శాండ్‌ను ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఇది. అంతే కాకుండా బొగ్గు, డోలమైట్, బాక్సైట్, హై క్వాలిటీ ముడి ఇనుము ఉన్నాయని గనుల శాఖ చెబుతోంది.

దేశంలోని టిన్ మొత్తంలో 36శాతం, ముడి ఇనుములో 20 శాతం, బొగ్గులో 18శాతం, డోలమైట్‌లో 11శాతం వజ్రాలు, మార్బుల్ నిల్వల్లో నాలుగు శాతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నాయి. ఈ ఖనిజ వనరుల్ని వెలికి తీసేందుకు జాతీయ, అంతర్జాతీయ మైనింగ్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, వాటి వద్దకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాయి.

“జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఏర్పడిన మావోయిస్టు ఉద్యమం, అడవులు స్థానిక గిరిజనులకు చెందుతాయని, కార్పోరేషన్లకు కాదని స్పష్టంగా చెప్పింది. అందుకే బహుళ జాతి కంపెనీలు ప్రవేశించలేకపోయాయి” అని వేణుగోపాల్ చెప్పారు.

అయితే ఇప్పుడు మావోయిస్టులు బలహీనపడటంతో, ఛత్తీస్‌గఢ్‌లోని కనీసం నాలుగు మైన్లు మే నెలలో నిర్వహించిన వేల తర్వాత బిడ్డర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి.

అయితే, మావోయిస్టుల మరణాలతో పోరాటం ఆగిపోదని వేణుగోపాల్ అంటున్నారు. “నాయకులు చనిపోవచ్చు, కానీ ప్రజల్లో ఆగ్రహం ఉంటుంది. అన్యాయం ఉన్నచోట ఉద్యమాలు ఉంటాయి. మనం దాన్ని మావోయిజం అని పిలవకపోవచ్చు, కానీ వాళ్లక్కడ ఉంటారు” అని వేణుగోపాల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS