SOURCE :- BBC NEWS

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధానిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి.

దిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే పీవీ విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్ కావడం చర్చనీయాంశంగా మారింది.

జూన్ 28న పీవీ జయంతి. ఈలోగా తెలంగాణ భవన్ వద్ద పీవీ విగ్రహం ఏర్పాటుకు దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అనుమతి ఇచ్చింది.

అయితే, విగ్రహ ఏర్పాటుపై ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఏం చెప్పిందంటే..

మార్చి 27వ తేదీన దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ సమావేశం జరిగింది.

ఇందులో ‘అదనపు వివరాలు’ కింద న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) పంపించిన ఆన్‌లైన్ దరఖాస్తుపై కమిషన్ చర్చించినట్లుగా మినిట్స్‌‌ లో ఉంది.

ఇందులో పీవీ నరసింహారావు విగ్రహం తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసేందుకు అనుమతించింది కమిషన్.

చుట్టూ ఉన్న పచ్చదనం, ఫుట్‌పాత్‌లకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేసింది.

”రాత్రిళ్లు కూడా విగ్రహం స్పష్టంగా కనిపించేలా లైటింగ్ ఉండాలి. కాంతి కాలుష్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని సమావేశం మినిట్స్ లో పేర్కొంది.

దిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ పీవీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు 2024 ఏప్రిల్ 24న న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంది.

”ఏపీ భవన్ లేదా తెలంగాణ భవన్ వద్ద కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి” అని కోరింది.

పీవీ నరసింహారావు, విగ్రహం, బీజేపీ, దిల్లీ, ఏపీ, తెలంగాణ భవన్

ఫొటో సోర్స్, PVNR Family/GoI

అప్పట్లో ‘టంగుటూరి’ విగ్రహాన్ని ఆవిష్కరించిన పీవీ

ఇప్పటికే దిల్లీలోని ఏపీ భవన్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. ఇది ఏపీ భవన్ (కాంపౌండ్ వాల్) బయట ఫుట్‌పాత్ పక్కన ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు.

ప్రకాశం పంతులు విగ్రహాన్ని 1992 నవంబరు 8న అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు ఆవిష్కరించారు.

తాజాగా పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుకు దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అనుమతించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

”పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ది కాదు. దీనిపై పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది” అని కార్పొరేషన్ చైర్ పర్సన్ కేశవ్ చంద్ర చెప్పినట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది.

”పీవీ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు” అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బీబీసీతో చెప్పారు.

ఒకవేళ ప్రకాశం పంతులు విగ్రహం వద్ద పెట్టుకుంటే, అది ఏపీ లేదా తెలంగాణ భవన్ పరిధిలోకి రాదని చెప్పారాయన.

దిల్లీ ఆర్ట్ కమిషన్ పీవీ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో, తెలంగాణ ప్రభుత్వం తరఫున విగ్రహం పెడతామంటే స్వాగతిస్తామని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ చెప్పారు.

దిల్లీలో పీవీ విగ్రహం ఏర్పాటుకు 2005 నుంచి ప్రతిపాదిస్తూ వచ్చినట్లు ఎన్వీ సుభాష్ చెప్పారు.

”యూపీఏ ప్రభుత్వంలో అనుమతులు రాలేదు. పీవీకి భారతరత్న ఇచ్చాక మా కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైంది. ఆ సందర్భంలో కూడా పీవీ విగ్రహం ఏర్పాటు అంశం చర్చకు వచ్చింది” అని బీబీసీతో చెప్పారు ఎన్వీ సుభాష్.

పీవీ నరసింహారావు, విగ్రహం, బీజేపీ, దిల్లీ, ఏపీ, తెలంగాణ భవన్

ఫొటో సోర్స్, Getty Images

నిరుడు భారతరత్నకు, ఇప్పుడు విగ్రహానికి అనుమతి

మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా పీవీకీ గుర్తింపు ఉంది. 2004డిసెంబరులో గార్డియన్ పత్రిక దీనికి ఒక ఉదాహరణను తన కథనంలో పేర్కొంది.

”1984లో ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. సాంకేతికంగా చూస్తే భద్రత వైఫల్యానికి బాధ్యులయ్యేవారు. కానీ, తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ.. ఆయన్ను రక్షణ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నారు” అని గార్డియన్ పత్రిక కథనంలో పేర్కొంది.

పీవీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది.

నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది.

ప్రధానిగా పని చేసిన పీవీకి దిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా హైదరాబాద్ తరలించడం, భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి అనుమతించకపోవడం, దిల్లీలో స్మారకం ఏర్పాటుచేయకపోవడంపైన అప్పట్లో విమర్శలు వచ్చాయి.

సోనియాగాంధీకి, పీవీ నరసింహారావుతో సరైన సంబంధాలు ఉండేవి కావని, ఒకరి పట్ల మరొకరు అనుమానంతోనే ఉండేవారని కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా స్వీయ చరిత్రలో ప్రస్తావించారు. పీవీ ప్రభుత్వంలో ఆమె సిబ్బంది వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

‘కరేజ్ అండ్ కమిట్‌మెంట్’ పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథలో సోనియా, పీవీలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

‘‘1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టివేస్తూ దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది’’ అని ఆ పుసక్తంలో మార్గరెట్ అల్వా పేర్కొన్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం, దిల్లీ, తెలంగాణ ప్రభుత్వం

కాంగ్రెస్ వైఖరి ఏంటి?

2024 ఫిబ్రవరిలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది.

నెక్లెస్ రోడ్డులో పీవీ విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు నెక్లెస్ రోడ్డు పేరును ‘పీవీ నరసింహారావు మార్గ్’ అని పేరు మార్చింది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గాంధీల కుటుంబంతో పీవీకి సత్సంబంధాలు లేవన్న వాదనలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటు విషయంలో ఎలా వ్యవహరిస్తోందో చూడాల్సి ఉంది.

”పీవీ తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయన విగ్రహం దిల్లీలో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు” అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీబీసీతో అన్నారు .

అయితే, పీవీ విగ్రహం తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసేందుకు దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అనుమతించినా, విగ్రహ ఏర్పాటుకు స్థలం ఎక్కడనే విషయంపై స్పష్టత లేదు.

ఆంధ్రప్రదేశ్ భవన్ ఉన్న ప్రాంతాన్ని విభజించి.. ఏపీ, తెలంగాణకు విడిగా భవనాలు నిర్మించనున్నారు.

ఇప్పటికే ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం పక్కన ఏర్పాటు చేస్తారా, మరో ప్రదేశం గుర్తిస్తారా, మరొకచోటైతే అది ఏపీ భవన్ నిర్మించే వైపు వస్తుందా లేదా తెలంగాణ భవన్ వైపు ఉంటుందా..అనే విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)