SOURCE :- BBC NEWS

నతాంజ్

ఫొటో సోర్స్, Getty Images

జూన్ 13 నుంచి ఇరాన్ పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో దాడులు మొదలుపెట్టిన తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆపరేషన్ గురించి సమాచారం ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తమ ఉనికికి ముప్పుగా మారిందని, ఆ దేశం అణ్వాయుధాల తయారీకి చాలా చేరువగా ఉందని అందులో పేర్కొంది.

ఈ చర్య వెనుక గల కారణాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి బీజీ ఎఫీ డెఫ్రిన్ వివరించారు.

“ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచానికి ముప్పు కలిగించే అణ్వాయుధాలను ఇరాన్ ప్రభుత్వం తయారుచేయడానికి మేం అనుమతించలేం. అందుకే పూర్తి సన్నాహాలతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేశాం” అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ దాడి తర్వాత, ఇరాన్.. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులు చేసింది.

శుక్రవారం నుంచి జరిగిన ఈ దాడుల్లో 220 మందికి పైగా మరణించారని, వారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని ఇరాన్ తెలిపింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

ఈ దాడులలో ఇరాన్‌లోని అనేక అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. వీటిలో, నతాంజ్ న్యూక్లియర్ ఎన్‌రిచ్‌మెంట్ ఫెసిలిటీ ముఖ్యమైనది.

ఈ అణు కేంద్రం 2007 నుంచి వార్తల్లో ఉంటోంది. తాజా దాడులకు ముందే, దీనిని అనేకసార్లు లక్ష్యంగా చేసుకున్నారు.

ఇరాన్ అణు కార్యక్రమం ఏ స్థాయిలో ఉంది, అందులో నతాంజ్ ప్రాధాన్యత ఏంటి? ఇరాన్‌కు ఇది ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
క్షిపణి

ఫొటో సోర్స్, Mohsen Shandiz/Corbis via Getty Images

ఇరాన్ అణుశక్తి

ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) తాజాగా విడుదల చేసిన తన త్రైమాసిక నివేదికలో ఇరాన్ 60 శాతం స్వచ్ఛమైన, శుద్ధి చేసిన యురేనియంను సేకరించిందని చెప్పింది.

ఈ స్వచ్ఛత స్థాయి 90 శాతానికి చేరుకుంటే, సాంకేతికంగా దాని నుంచి అణు బాంబులను తయారు చేయవచ్చని ఐఏఈఏ తెలిపింది. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏఈఏ చెబుతోంది.

తన అణు కార్యక్రమం ఆయుధాల తయారీకి కాదు, శాంతియుత ప్రయోజనాలకేనని మొదటి నుంచీ చెబుతూనే ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా జరుగుతోందని అంటోంది.

కానీ, ఇరాన్ అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకేనన్న నమ్మకం తమకు కలగడం లేదంటోంది ఐఏఈఏ.

బుషెహర్

ఫొటో సోర్స్, BEHROUZ MEHRI/AFP via Getty Images

ఎన్ని అణు కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి?

ఇరాన్ అణుకార్యక్రమా ఇప్పటిది కాదు. 1974లో అప్పటి ఇరాన్ పాలకుడు షా రెజా పహ్‌లవీ తమ దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి అణుశక్తిని ఉపయోగించాలని ప్రణాళిక వేసి, ఇరాన్ అణుశక్తి సంస్థను స్థాపించడంతో ఇది మొదలైంది.

ఆ ప్రణాళికలో భాగంగా రాబోయే 20 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 20కి పైగా అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఈ ప్రయత్నాలు చాలా నెమ్మదిగా సాగాయి.

అయితే, 1974కి ముందు కూడా ఇరాన్ అణు శక్తి గురించి ప్రయత్నాలు మొదలయ్యాయి. 1957లోనే అమెరికాతో అణు సహకార ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఇరాన్ తన అణు విధానాన్ని మొదలుపెట్టింది. ‘అణ్వస్త్రాలను శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో పరస్పర సహకారం కోసం జరిగిన ఒప్పందంగా దీనిని చెబుతారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్‌లో ప్రస్తుతం మూడు ప్రధాన అణు కేంద్రాలున్నాయి. వీటిలో నతాంజ్, ఫోర్డో అనే యురేనియం శుద్ధి కేంద్రాలతోపాటు ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం ఉన్నాయి. వీటితో పాటు, బుషెర్, డార్ఖోవిన్, సిరిక్‌లలో అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక అరక్‌లోని అణు కేంద్రాలలో పరిమితంగా ఉపయోగించే ఒక హెవీ వాటర్ ప్లాంట్ కూడా ఉంది.

ఐఏఈఏ చెప్పినదాని ప్రకారం..ఈ ప్రాంతాలే కాకుండా, మరో మూడింటిలో మానవ నిర్మిత అణుకణాల (యురేనియం పార్టికల్స్ ) జాడలను వారు కనుగొన్నారు. కానీ ఇరాన్ ఈ ప్రదేశాల గురించి ఎప్పుడూ అధికారిక సమాచారం ఇవ్వలేదు.

అవి వరమిన్, మారివాన్, తుర్కుజాబాద్. 2019, 2020 మధ్య ఈ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఐఏఈఏకి లభించింది. కానీ వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు.

2024 వరకు వచ్చిన వార్తా కథనాల ప్రకారం.. దర్యాప్తులో ఇరాన్ సహకరించడం లేదని ఐఏఈఏ ఆరోపించింది. ఇవి ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ప్రదేశాలని పేర్కొంది.

కౌంట్‌డౌన్ టూ జీరో

నతాంజ్ ఎన్‌రిచ్‌మెంట్ ఫెసిలిటీ

నతాంజ్‌ను 2002లో రహస్యంగా నిర్మించారు. అయితే ఈ విషయం కొద్దికాలంలోనే వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లోని ప్రతిపక్షాలు ఆగస్టు 2002లో దాని ఉనికిని బయటపెట్టాయి.

ఈ ప్లాంట్ 2007 నుంచి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి అధ్యక్షుడు అహ్మదీ నెజాద్, తన రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా 2008లో ఈ ప్లాంట్‌ను సందర్శించారు. ఆయన సందర్శనపై ప్రపంచ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.

ఇక ఈ సంవత్సరం మే నెలాఖరులో, నతాంజ్ ఇరాన్ అణు కేంద్రం అని, అక్కడ యురేనియం శుద్ధి పనులు జరుగుతాయని ఐఏఈఏ ప్రకటించింది.

ఈ ప్లాంట్‌ భూగర్భంలో అణు శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. ఈ సైట్‌ను 50 వేలకు పైగా సెంట్రిఫ్యూజ్‌లను (యురేనియంను శుద్ధి చేసే యంత్రాలు) ఆపరేట్ చేసే సామర్థ్యంతో నిర్మించారని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రాథమిక నివేదిక తెలిపింది.

ఈ అణు కర్మాగారంలో 2007లో 75 కిలోగ్రాముల యురేనియంను శుద్ధి చేయగా, 2008 చివరి నాటికి అది 630 కిలోగ్రాములకు పెరిగిందని ‘కౌంట్‌డౌన్ టు జీరో డే’ అనే పుస్తకంలో కిమ్ జెట్టర్ రాశారు.

తక్కువ గ్రేడ్ కలిగిన ఈ యురేనియం నుంచి 20 నుంచి 25 కిలోగ్రాముల అధిక నాణ్యత గల యురేనియంను తయారు చేయవచ్చని, దీన్నిఅణ్వాయుధాల తయారీలో ఉపయోగించవచ్చని నిపుణులు చెప్పిన మాటలను ఉటంకిస్తూ కిమ్ జెట్టర్ రాశారు.

యురేనియంను అణ్వాయుధాలలో ఉపయోగించుకునేందుకు, యురేనియం ధాతువును అనేక దశల్లో శుద్ధి చేస్తారు. ఈ ప్రాసెసింగ్‌ను శుద్ధిప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియను ప్రత్యేక సెంట్రిఫ్యూజ్‌లలో నిర్వహిస్తారు.

అణు శుద్ధి ప్లాంటు

ఫొటో సోర్స్, pris.iaea.org

ఫోర్డో ఎన్‌రిచ్‌మెంట్ ఫెసిలిటీ

ఈ ప్రదేశం టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్ నగర పర్వతాలలో ఉంది. ఇది భూగర్భంలో అరమైలు లోపల ఉందని టైమ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం, ఫోర్డో ఒక సంక్లిష్టమైన నెట్‌వర్క్. దానిని వైమానిక దాడులతో దెబ్బతీయడం కష్టం. ఎందుకంటే ఇది భూగర్భంలో ఏర్పాటుచేశారు.

2018లో, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆయుధాలలో ఉపయోగించడానికి అధిక నాణ్యత గల యురేనియంను తయారుచేయడమే ఈ ప్లాంట్ పని అని ఆ పత్రాల్లో రాసి ఉంది.

అయితే భారీయెత్తున శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టేంత పెద్ద ప్రదేశం కాదని కూడా అందులో ఉంది.

2023లో ఐఏఈఏ ఇక్కడ 83.7 శాతం వరకు స్వచ్ఛత కలిగిన యురేనియం కణాలను కనుగొంది. యురేనియంలో ఈ స్థాయి స్వచ్ఛత ఆయుధాల తయారీ స్థాయికి చాలా దగ్గరగా ఉంటుందని భావిస్తారు.

దీని గురించి ఇరాన్‌ను ప్రశ్నించినప్పుడు, శుద్ధి స్థాయిలో అనుకోని హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని చెప్పింది.

నతాంజ్

ఫొటో సోర్స్, 2025 Maxar Technologies

నతాంజ్‌కు జరిగిన నష్టం ఎంత?

శుక్రవారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసినప్పుడు, రాజధాని తెహ్రాన్ నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంజ్ అణు కేంద్రం సమీపంలో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా తెలిపింది.

తరువాత, ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో ఒక ఉపగ్రహ చిత్రాన్ని పోస్ట్ చేసి, దాడిలో ఆ ప్రాంతపు భూభాగం దెబ్బతిందని రాసింది .

“ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా మాకు తెలిసిందేంటంటే.. యుద్ధ విమానాలు రాత్రిపూట నతాంజ్ సైట్‌లోని ఇరాన్ యురేనియం శుద్ధికేంద్రంపై దాడి చేశాయి. ఇది ఇరాన్‌లో అణ్వాయుధాల తయారీకి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న అతిపెద్ద యురేనియం శుద్ధి కేంద్రం. అయితే స్వచ్ఛమైన యురేనియం శుద్ధికి మరిన్ని సదుపాయాలు అవసరం” అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

దీని తరువాత, మరొక పోస్ట్‌లో, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సోషాని మాట్లాడుతూ, నతాంజ్‌తో పాటు, ఇజ్రాయెల్ తన దాడులలో ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకుందని అన్నారు.

ఆ తర్వాత.. ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ మాట్లాడుతూ, ఇరాన్ అధికారులు నతాంజ్‌పై దాడిని ధృవీకరించారని, కొన్ని నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని చెప్పారని అన్నారు. అయితే, దాడుల తర్వాత నతాంజ్, ఫోర్డో అణు కర్మాగారాలలో అదనపు రేడియేషన్ ఉన్నట్లు ఎటువంటి వార్తలు లేవని అధికారులు తనకు చెప్పారని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)