SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Niraj Gera
28 మే 2025, 07:38 IST
భారతీయ కుటుంబాల్లో నెలసరి పరిశుభ్రత గురించి మాట్లాడుకోవడం చాలా అరుదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ కుటుంబంలో ఈ అంశంపై ఎప్పుడైనా బహిరంగంగా చర్చ జరిగిందా? అవగాహన పెరుగుతున్నప్పటికీ ఈ విషయం ఇప్పటికీ నిషేధితమైనదిగా, అసౌకర్యమైనదిగా ఉంది.
బాలికలు రజస్వల అయినప్పుడు చేసుకునే వేడుకలు, పరిశుభ్రత ప్రాముఖ్యత వంటి అంశాలపై మహిళలు తమ అనుభవాల గురించి సామాజిక మాధ్యమాలు, వీడియోల్లో మాట్లాడుతున్నారు.
అయితే స్కూళ్లలో ఏర్పాటు చేసే ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాలు, ఇంట్లో భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి చర్చలు చాలా అరుదుగా జరుగుతాయి. ఆరోగ్యం, గౌరవాన్ని పణంగా పెట్టే ఈ నిశ్శబ్దం ఇలాగే కొనసాగుతోంది.
మే 28న వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే (నెలసరి పరిశుభ్రతా దినోత్సవం) జరుపుకుంటున్నారు.
నెలసరి పరిశుభ్రత అంటే ఏంటో తెలుసుకుందాం.
ఇందులో మహిళలు సాధారణంగా ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?
ఇవే కాక మరి కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం గైనకాలజిస్టు, మద్రాస్ మెడికల్ కాలేజ్లో మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమలతతో బీబీసీ ప్రతినిధి సంభాషించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి శానిటరీ ప్యాడ్లను ఎంచుకోవాలి?
కాటన్ ఫైబర్స్తో చేసిన శానిటరీ ప్యాడ్లను ఎంచుకోవాలి.
సింథటిక్ పదార్ధాలతో పోలిస్తే కాటన్ రక్తాన్ని సమర్థవంతంగా పీల్చుకుంటుంది. కాటన్ ప్యాడ్ల వల్ల చిరాకు తక్కువ.
నైలాన్తో పాటు మరి కొన్ని కృత్రిమ వస్త్రాలతో తయారయ్యే శానిటరీ ప్యాడ్లు కొంత చౌకగా ఉండవచ్చు.
అయితే కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఆరోగ్యం, సౌకర్యం లభిస్తాయి.
తిరిగి వాడుకోవడానికి వీలైన కాటన్ ఉత్పత్తులైన పీరియడ్ ప్యాంటీస్, హైబ్రిడ్ క్లాత్ ప్యాడ్స్ను వినియోగించిన తరువాత ప్రతిసారీ వాటిని బాగా ఉతికి, ఎండబెట్టిన తరువాతే మరోసారి వాడుకోవాలి. ఇవి పర్యావరణ హితమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
తిరిగి వాడదగినవాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి?
తిరిగి వాడదగిన పీరియడ్ ప్యాంటీలు, కాటన్ ప్యాడ్లను తాను ఎవరికీ సూచించనని డాక్టర్ ప్రేమలత చెప్పారు.
“చౌక ధరలు, పర్యావరణం వంటి అంశాల దృష్ట్యా ఇప్పుడీ వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. మీరు వాటిని ఉపయోగిస్తుంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం” అని ఆమె అన్నారు.
అందుకు అవసరమైన కొన్ని సూచనలు చేశారు.
- ఒకసారి ఉపయోగించిన వెంటనే వాటిని గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి.
- సబ్బుతో బాగా ఉతకాలి. కఠినమైన డిటర్జెంట్లు, యాంటీ సెప్టిక్స్ను వాడవద్దు.
- ముఖ్యంగా ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఎండ సహజమైన క్రిమిసంహారిగా పని చేస్తుంది.
“సరిగ్గా శుభ్రం చేయకపోయినా, ఆరబెట్టకపోయినా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఇవి పర్యావరణ హితమైన ఉత్పత్తులు కావడంతో వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Niraj Gera
రోజులో ప్యాడ్లను ఎన్ని సార్లు మార్చుకోవాలి?
సాధారణంగా, రోజులో నాలుగు సార్లు శానిటరీ ప్యాడ్లను మార్చుకోవడం మంచిది. మెన్స్ట్రువల్ కప్ ఉపయోగించేటప్పుడు ఆరు నుంచి 8 గంటలకొకసారి కప్ను ఖాళీ చేయడం ఉత్తమం.
అయితే ఈ సమయాన్ని కచ్చితంగా పాటించడం తప్పనిసరేమీ కాదు.
కొంతమంది మహిళల్లో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
అలాంటప్పుడు ప్యాడ్లు పూర్తిగా నిండిపోయే వరకు ఆగకుండా, ప్రతి మూడు గంటలకొకసారి మార్చుకోవడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
నెలసరి కప్పులు : జాగ్రత్తలు
దీర్ఘకాలిక, ఆర్థికపరమైన కోణంలో ఆలోచించి మెన్స్ట్రువల్ కప్ను తీసుకొచ్చారని డాక్టర్ ప్రేమలత చెప్పారు.
దీన్ని కొన్నేళ్ల పాటు వాడుకోవచ్చు. ప్రత్యేకించి ప్రయాణాలు చేసే వారికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.
పీరియడ్ ప్యాంటీలు, తిరిగి వాడదగిన కాటన్ ప్యాడ్స్ మాదిరిగానే కప్ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలి.
కప్ను వేడి నీటిలో నాలుగు నిముషాల పాటు మరిగించి వాసన లేని సబ్బుతో తేలిగ్గా రుద్ది శుభ్రం చేయాలి.
మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ కప్లు ఉంటే, వాటిని మార్చి మార్చి వాడుకోవడం మంచిది. సరిగ్గా శుభ్రపరచకుండా రోజంతా ఒకే కప్ను వాడకండి.
శుభ్రంగా, పొడిగా ఉన్న కప్లనే ఉపయోగించండి.
రుతుస్రావం చాలా సహజమైన ప్రక్రియ అని డాక్టర్ ప్రేమలత చెప్పారు.
“ఈ సమయంలో మహిళలకు పొత్తికడుపులో నొప్పి రావడం సహజం. ఈ అసౌకర్యాన్ని తొలగించుకునేందుకు నొప్పి నివారణ మందులు వాడవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు” అని ఆమె అన్నారు.
“నెలసరి సమయంలో వచ్చే నొప్పి మీరోజువారీ కార్యక్రమాలను ఆటంకపరచకూడదు. పొత్తికడుపు నొప్పి తీవ్రంగా ఉన్నా, నిరంతరంగా వస్తున్నా తక్షణమే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి” అని డాక్టర్ ప్రేమలత సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
రుతుస్రావం: ఎలాంటి అలవాట్లు మంచివి?
నెలసరి సమయంలో పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి డాక్టర్ ప్రేమలత వివరించారు.
బాలికలు, మహిళలు తేమను తగ్గించడానికి, ఇన్ఫెక్షన్లు సోకకుండా, గాలి తగిలేందుకు వీలైన, మెత్తగా ఉండే కాటన్ లోదుస్తులు ఎంచుకోవాలి.
పీరియడ్ సమయంలో స్త్రీల జననావయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ సమయంలో షేవ్ చేయడం వల్ల చిన్న చిన్న గాయాలు కావచ్చు. ఈ గాయాల వల్ల బ్యాక్టీరియా పెరగడం, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది.
అందుకే పూర్తిషేవింగ్ చేయడం కంటే, ట్రిమ్ చేయడం మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు.
జననావయవం వద్ద ఉండే వెంట్రుకలు మహిళలకు ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తాయి.
రక్తస్రావం అధికంగా ఉన్నా, తీవ్రమైన వాసన వస్తున్నా మహిళలు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇవి ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడని అనారోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.
యోని ప్రాంతాన్ని ముందు నుంచి వెనక్కు శుభ్రం చేయాలి. దీని వల్ల మల ద్వారం వద్ద ఉన్న బ్యాక్టీరియా యోని వద్దకు రాకుండా, ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవీ లాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా సాయపడుతుంది.
టాంపూన్లు( రుతుస్రావం సమయంలో యోని లోపల ఉంచుకునే వస్తువు) ఉపయోగిస్తున్న మహిళల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దురదగా ఉన్నట్లు లేదా అసౌకర్యంగా అనిపించినా, దుర్వాసన వస్తున్నా ఎలాంటి ఆలస్యం చేయకుండా గైనకాలజిస్టును సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక నిషేధాలతో సమస్య
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది మహిళలకు సురక్షితమైన, పరిశుభ్రమైన శానిటరీ ప్యాడ్ల లాంటి ఉత్పత్తులు అందుబాటులో లేవని 2022లో ప్రపంచబ్యాంక్ నివేదిక తెలిపింది. దీనివల్ల మహిళలకు సమస్యలు పెరిగాయి.
“ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య శానిటరీ ఉత్పత్తుల కొరత ఒక్కటే కాదు” అని ఆ నివేదిక తెలిపింది.
మహిళల ఆరోగ్యకరమైన జీవితంలో రుతుస్రావం సహజ పరిణామం. అయినప్పటికీ అనేక సమాజాల్లో నెలసరి అయిన మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు.
కొన్ని సమాజాల్లో పీరియడ్స్ వచ్చిన మహిళలను బహిరంగంగా మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదు. సరైన సమాచారం, సురక్షిత వనరులు లేకపోవడం వల్ల, రుతుస్రావం సమయంలో మహిళలు సురక్షితం కాని పద్ధతులు అనుసరించి అనారోగ్యం పాలవుతున్నారు.
నెలసరి చుట్టూ ఉన్న సామాజిక నిషేధాలు, తప్పుడు సమాచారం వల్ల మహిళలు తరచూ అవమానం, ఎగతాళి, లింగ ఆధారిత హింస ఎదుర్కొంటున్నారు.
“కొన్ని తరాలుగా మహిళలు రుతుక్రమంలో అనారోగ్య పద్ధతులను పాటించడం వల్ల సామాజిక, ఆర్థిక అసమానతలు పెరగడమే కాకుండా వారిని విద్య, ఆరోగ్యం, భద్రతకు మొత్తంగా మానవాభివృద్ధికి దూరం చేశాయి” అని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS