SOURCE :- BBC NEWS

పూంఛ్‌లోని ప్రజలు

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC

6 నిమిషాలు క్రితం

భారత్-పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో, భారత వైపున్న సరిహద్దులోని ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి బయటికి వెళ్లిపోతున్నారు.

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర జరుగుతున్న భారీ కాల్పుల నుంచి బయటపడేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

పహల్గాంలో పర్యటకులపై దాడి అనంతరం, సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను చేపడుతోందని భారత్ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మే 7న బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌పై వైమానిక దాడులు జరిపినప్పటి నుంచి ఎల్ఓసీ గుండా జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా, 59 మంది గాయపడ్డట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

మృతుల్లో మహిళలు, పిల్లలు, భారత ఆర్మీ జవాను లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు.

పంజాబ్‌లోని చాలా జిల్లాల్లో క్షిపణులు, డ్రోన్ల శకలాలను గుర్తించిన తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

మే 7, 8 తేదీల్లో రాత్రిపూట పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను, క్షిపణి దాడులను భగ్నం చేసినట్లు భారత్ చెప్పింది.

ఆ తర్వాత గురువారం (మే 8న) లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసినట్లు భారత్ తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని పాకిస్తాన్ ధ్రువీకరించలేదు.

సఫ్రీన్

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC

బుధవారం రాత్రి డ్రోన్, క్షిపణి దాడులు

ఎల్‌ఓసీ సమీపంలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంఛ్, రజౌరిలలో భారీ ఫిరంగులను వాడుతున్నట్లు గురువారం విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.

పూంఛ్‌లోని గురుద్వారాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆ దాడిలో సిక్కు వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిపారు.

బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఉన్న పలు సైనికి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడికి యత్నించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అవంతీపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్, భుజ్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను జరిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

”ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దాడులను అడ్డుకున్నాం. పలు ప్రాంతాల్లో ఈ దాడుల శకలాలను గుర్తించాం. పాకిస్తాన్ దాడులు జరిపినట్లు ఇవి ధ్రువీకరిస్తున్నాయి” అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు బుధవారం రాత్రి 25 భారత డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ల వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పింది.

పూంఛ్‌లో దాడికి ధ్వంసమైన ఇల్లు

ఫొటో సోర్స్, Aamir Peerzada/BBC

ఎల్ఓసీ వద్ద పరిస్థితి ఎలా ఉంది?

భారత వైమానిక దాడుల తర్వాత కాల్పులు తీవ్రతరమైనట్లు స్థానికులు చెప్పినట్లు జమ్మూ కశ్మీర్‌లోని సురాన్‌కోట్ నుంచి బీబీసీ ప్రతినిధి దేవినా గుప్తా రిపోర్టు చేశారు.

” భారీ పేలుళ్లను నేను విన్నాను. ఏడాది బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని వచ్చాను. నాకు చాలా భయం వేసింది” అని స్థానికురాలు సోబియా చెప్పారు.

తమ ఇంటి ఎదుట షెల్ పడటంతో, ఇంటి నుంచి తాను, తన కుటుంబం బయటికి వచ్చినట్లు స్థానికులైన సఫ్రీన్ అఖ్తర్ చెప్పారు.

”ఆ సమయంలో కారు కనిపించలేదు. సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వచ్చింది. దారంతా కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉంది” అని అన్నారు.

గత 48 గంటలుగా పూంఛ్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుండటంతో, సురాన్‌కోట్‌లోని తమ బంధువులను, స్నేహితులను శరణార్థాన్ని కోరుతున్నట్లు చాలామంది చెప్పారు. ఇది సరిహద్దుకు కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ కాల్పుల ఘటనలు ఎక్కువగా జరగడం లేదు.

”మా ఇంట్లో 25 మంది వరకు ఉంటున్నారు. కొంతమంది నడుస్తూ ఇక్కడకు వచ్చారు. కొందరు తమ ఇళ్లకు తాళాలను కూడా వేసుకోలేకపోయారు” అని సురాన్‌కోట్‌కు చెందిన మొహమ్మద్ ఆలమ్ మాలిక్ చెప్పారు.

”అంతకుముందు అంత విస్తృతంగా ప్రజల తరలింపు లేదు. 2016లో సరిహద్దు సమీపంలో నివసించే 27 వేల మందికి పైగా బయటికి వెళ్లిపోయారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు సరిహద్దులో నివసించే వారికి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి” అని బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ చెప్పారు.

రాకెట్ లాంటి వస్తువు

ఫొటో సోర్స్, Ravinder Robin

పంజాబ్ గ్రామాల్లో రాకెట్ లాంటి వస్తువులు

పంజాబ్‌లోని పలు గ్రామాల్లో గురువారం రాకెట్ లాంటి వస్తువుల శకలాలను గుర్తించినట్లు బీబీసీ పంజాబీ తెలిపింది.

కొన్ని శిథిలాలను గుర్తించానని, తన పొలం తగలపబడిపోయిందని గుర్దాస్‌పూర్‌లోని పంధేర్ గ్రామానికి చెందిన రచ్‌పాల్ సింగ్ తెలిపారు.

బుధవారం రాత్రి అమృత్‌సర్, భటిండా, గుర్దాస్‌పూర్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనుమానిత వస్తువులను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నాయని తాము భావిస్తున్నట్లు గ్రామస్థులు చెప్పారు.

”రాత్రి పూట భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉదయం పూట పొలంలో క్షిపణి శకలాలను గుర్తించాం. వీటి గురించి పోలీసులకు చెప్పాం” అని అమృత్‌సర్‌లోని జేతువాల్ గ్రామవాసి దిల్దార్ సింగ్ తెలిపారు.

పొలాల్లో 6 నుంచి 7 అడుగుల రాకెట్ లాంటి వస్తువును చూసినట్లు మరో స్థానికుడు లవ్‌ప్రీత్ సింగ్ చెప్పారు.

మోగా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక పశువుల షెడ్డుపై ఇనుప వస్తువు పడిందని బీబీసీ ప్రతినిధి సురీందర్ మన్ చెప్పారు. తల్వాండిలోని భాంగేరియా గ్రామంలో ఇలాంటి ఒక ఇనుప వస్తువును గుర్తించారు.

పరిపాలనా యంత్రాంగం వీటిపై విచారణ ప్రారంభించింది. ఈ వస్తువులపై స్థానిక అధికారులు మరింత సమాచారం ఇవ్వలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)