SOURCE :- BBC NEWS

భరత్‌భాయి

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలో సింహాల సంఖ్యను లెక్కించింది. 2025 మే 10 నుంచి 13 మధ్య చేపట్టిన సింహాల గణన(లయన్ సెన్సస్ 2025) వివరాలను తాజాగా విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం… గుజరాత్‌లో సింహాల(ఏసియాటిక్ లయన్స్) సంఖ్య 891కి పెరిగింది. 2020లో ఈ సంఖ్య 674గా ఉండేది.

గుజరాత్‌లో గత అయిదేళ్లలో 227 సింహాలు(32.2 శాతం) పెరిగినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చెప్తున్నాయి.

అయితే, ఆశ్చర్యకరంగా అక్కడి మొత్తం సింహాలలో సుమారు సగం నేషనల్ పార్క్స్, అభయారణ్యాలు వంటి రక్షిత అటవీ ప్రాంతాలలో కాకుండా మనుషులు నివసించే ప్రాంతాల్లో ఉంటున్నాయి.

అధికారిక డేటా ప్రకారం 2020 నాటికి సౌరాష్ట్ర ప్రాంతంలో 30 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సింహాలు ఉండగా 2025 నాటికి ఆ విస్తీర్ణం 35 వేల చదరపు కిలోమీటర్లుకు పెరిగింది.

సింహాలు గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు.

ప్రతి రోజూ రాత్రి మా వీధుల్లో సింహాలు తిరుగుతూ ఉంటాయని కొన్ని గ్రామాల్లోని ప్రజలు చెప్తున్నారు.

సింహాలు, చిరుతలు వంటివి మనుషులున్న ప్రాంతాల్లోకి వస్తుండడంతో సౌరాష్ట్రలోని ప్రజలు తమ జీవనశైలిని, నివాసాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మనుషుల నివాసాలకు దగ్గర్లో సింహాలు, చిరుతలు తిరుగుతుండడంతో మనుషులకు, వన్య ప్రాణులకు మధ్య సంఘర్షణ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సింహాలు సాధారణంగా మనుషులపై దాడి చేయవు అని అటవీ అధికారులు చెప్పారు. సౌరాష్ట్రలోని ప్రజలు జంతువుల పట్ల సున్నితంగా, సహనంతో ఉంటారు. దీంతో, మనుషులకు, జంతువులకు మధ్య సంఘర్షణలు పెరిగే అవకాశం చాలా తక్కువని.. కానీ, చిరుతలు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 రైతు అపాభాయి ధఖాడా

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

‘బయట కట్టేసిన పశువులకు ప్రమాదం’

గత 15 ఏళ్లుగా అమ్రేలీలోని రాజులా తాలుకాలోని ధాతర్వాడీ నదీ తీర ప్రాంతంలో ఉన్న జపోదార్ గ్రామంలో సింహాలు తిరుగుతున్నాయని ఆ గ్రామానికి చెందిన 75 ఏళ్ల రైతు అపాభాయి ధఖాడా చెప్పారు.

‘‘నేను యువకుడిగా ఉన్నప్పుడు గధియా గ్రామంలోని (అమ్రేలీలోని ధరి తాలుకాలో ఉన్న గిర్ సరిహద్దు) మా బంధువుల ఇంటికి వెళ్లేవాళ్లం. ఈ సమయంలో అక్కడి ప్రజలు మాకు సింహాలను చూపించేవారు. అప్పట్లో మా గ్రామంలో సింహాన్ని ఎప్పుడూ చూడలేదు. మా పొలంలో రాత్రింబవళ్లు పనిచేసేవాళ్లం. రాత్రిపూట పొలంలోనే పడుకునేవాళ్లం” అని ఆయన బీబీసీతో చెప్పారు.

”కానీ, 15 ఏళ్లుగా మా గ్రామంలోకి సింహాలు, చిరుతలు వస్తున్నాయి. గత పదేళ్లుగా అవి మా గ్రామంలోనే ఉంటున్నాయి. ఇప్పుడు పొలంలో ఆరుబయట పడుకోలేం. ఎప్పుడు చిరుత వచ్చి దాడి చేస్తుందో తెలియదు. పశువులను కూడా ఆరుబయట కట్టేయడం లేదు ఇప్పుడు వాటికోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మించాం” అన్నారు దఖాడా.

సింహాలు, మనుషులు

ఫొటో సోర్స్, ANI/Getty Images/Bipin Tankariya

‘చిరుతల భయంతో పిల్లలను పంజరాల్లో పడుకోబెట్టాల్సి వస్తోంది’

జఫ్రబాద్‌కు చెందిన భకోదార్ గ్రామంలో భరత్‌భాయి భార్య తన కొడుకు ప్రకాశ్‌కు జన్మనిస్తూ ఆరు నెలల క్రితం చనిపోయారు. ఆ తర్వాత రెండు నెలలకు భరత్‌భాయి తండ్రి ఖీమాభాయి మరణించారు.

పుట్టిన కొడుకు, ఐదుగురు కూతుళ్లు, తన తల్లిని సంరక్షించే బాధ్యత భరత్‌భాయిపైనే పడింది.

”నా పెద్ద కూతురికి పదేళ్లు. తల్లికి 70 ఏళ్లు. రాత్రి కూడా పొలంలోనే పనిచేయాలి. నేను పనిచేసే పొలానికి దగ్గరిలో ఎలాంటి ఇళ్లు లేవు. మేం ఉండే ఇల్లు గుడిసెలాగా ఉంటుంది. రెండు వైపులా ఖాళీయే’ అని భరత్‌భాయి బీబీసీకి చెప్పారు.

”భార్య మరణించిన తర్వాత ఒకరోజు చిరుతను మా ఇంటికి దగ్గర చూశా. అప్పటి నుంచి నా పిల్లల భద్రత విషయంలో చాలా భయపడుతున్నా. ఇంటి లోపలే రూ.10 వేలతో ఒక పెద్ద ఇనుప పంజరం నిర్మించా. దాని లోపలే పిల్లల్ని పడుకోబెడతా. ఎందుకంటే రాత్రి కూడా నేను పనికి వెళ్లాల్సి ఉంటుంది” అని తెలిపారు.

చేతన్ బరాద్

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

సింహాలు, చిరుతలు పంటలను నాశనం చేస్తాయని భయం

గిర్ సోమనాథ్ జిల్లాలోని కోడినార్ తాలుకా అలిదార్ గ్రామంలోని చేతన్ బరాద్ అనే రైతు అటవీ విభాగం ఇచ్చిన రూ.15 వేల రాయితీతో తన పొలంలో ఒక ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.

నాలుగు ఇనుప పైపులతో పది అడుగుల ఎత్తులో పంజరం లాంటిది నిర్మించారు. అన్ని వైపులా ఇనుప గ్రిల్‌, పైకప్పు దీనికి ఉన్నాయి.

‘అడవి పందులు, నీల్గాయిలు పంటలను తినేస్తాయనే భయం మా ప్రాంతంలో ఉంది. జంతువుల నుంచి పంటలను రక్షించేందుకు రాత్రంతా పొలంలోనే కాపలాగా ఉంటాం. మరోవైపు మా పొలంలో సింహాలు, చిరుతల సంచారం పెరిగింది. చిరుతల విషయంలో భయం ఎక్కువైంది. ఎందుకంటే, చిరుతలు దాక్కునేందుకు చెరకు తోటలు ఉపయోగపడతాయి. వాటికి అవసరమైన నీరు, చల్లని వాతావరణం ఈ తోటల్లో దొరుకుతుంది” అని చేతన్ చెప్పారు.

”సింహాలు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. కానీ, చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ప్రభుత్వ సాయంతో పచ్చిక మైదానాలను ఏర్పాటు చేసిన తర్వాత మేం కాస్త సురక్షితంగా భావిస్తున్నాం” అని తెలిపారు.

”కొన్నిసార్లు మా పొలం దగ్గర్నుంచి సింహాలు వెళ్లేటప్పుడు, లోపల కట్టేసిన ఆవులతో పాటు మాకూ గుండె దడ పెరుగుతుంటుంది. కానీ, మా పొలంలో సింహాలు ఉంటే ఒకరకంగా ప్రయోజనకరమే. అవి తిరుగుతుంటే అడవి పందులు పొలంలో రావు” అని చెప్పారు.

పశువుపై సింహం దాడి

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

‘ప్రతి రోజూ మా గ్రామంలో సింహాన్ని చూస్తాం’

రాజులా తాలుకాలోని పిపావావ్ పోర్టుకు సమీపంలోని రాంపారా-2 గ్రామాన్ని మే 21న ‘బీబీసీ’ సందర్శించింది.

ఆ గ్రామంలోని బాఘభాయి వాఘ్‌ అనే రైతుకు చెందిన ఆవుపై సింహాలు దాడి చేశాయి. ఆవు ఆ దాడిలో తీవ్రంగా గాయపడింది.

”పశువుల కొట్టంలో ఆవును ఉంచాం. అది నీళ్లు తాగడానికి వెళ్లినప్పుడు, ఐదు నుంచి ఆరు సింహాలు దానిపై దాడి చేశాయి. అక్కడున్నవారు గట్టిగా అరవడంతో అవి పారిపోయాయి. ఆ తర్వాత ఆవును కాపాడాం. కాలికి అయిన గాయం వల్ల అది నిల్చోలేకపోయింది” బాఘభాయి చెప్పారు.

రాంపారా గ్రామం చుట్టుపక్కల ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల్లో చెట్ల పొదలు ఉన్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రజలకూ నీల్గాయిలు కనిపిస్తుంటాయి. ఇవి సింహాలకు ఆహారం.

”సింహాలు రోజూ మా గ్రామ వీధుల్లోకి వస్తాయి. అర్ధరాత్రి వాటి అరుపులు వినిపిస్తుంటాయి. మా పంట పొలాల్లో పనిచేసేందుకు అసలు కూలీలే రావడం లేదు. మహిళలు ఒంటరిగా పొలాలకు వెళ్లరు. పంటలంటే భయం కాదు, పొలానికి వెళ్లేటప్పుడు సింహాలు దాడి చేస్తాయేమోనని భయపడుతుంటారు” అని 55 ఏళ్ల రైతు లక్ష్మణ్‌భాయి వాఘ్ చెప్పారు.

భూషన్ పాండ్యా

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

మనుషులు-జంతువుల సంఘర్షణపై నిపుణులు ఏం చెబుతున్నారు?

సింహాలు కొత్త ప్రాంతానికి వస్తున్నప్పుడు అక్కడి మనుషులతో పాటు ఆ సింహాలు కూడా భయపడుతుంటాయని ప్రముఖ వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్, పర్యావరణవేత్త భూషణ్ పాండ్యా చెప్పారు.

”సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అందరూ తొలుత భయపడేవారు. పిల్లలపై సింహాలు దాడి చేస్తాయేమోనని భావించేవారు. కానీ, సింహం కూడా భయపడుతుందన్న విషయం తెలియదు. సింహం అతిపెద్ద మాంసాహార జీవి అని ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. ఇదొక ప్రాదేశిక జంతువు. తన భూభాగంలో మరో సింహం ఉండటానికి అది ఒప్పుకోదు” అని ఆయన తెలిపారు.

”ఒకవేళ ప్రజలు వీటి ప్రవర్తనను కాస్త అర్థం చేసుకుంటే, శాంతియుతమైన సహజీవనం సాధ్యమవుతుంది. ఏళ్ల కొద్ది ఇది జరుగుతోంది. మనుషుల భూభాగంలోకి సింహాలు వచ్చినప్పుడు, వాటి ప్రవర్తనను మార్చుకుంటాయి. మనుషులు కూడా అలానే ప్రవర్తిస్తారు” అని చెప్పారు.

”గిర్ సింహాల ప్రధాన ఆహారం నీల్గాయి, చితాల్ (మచ్చల జింక), అడవి పంది. ఈ జంతువులన్ని రైతుల పంటలను నాశనం చేస్తుంటాయి. ఒకవేళ సింహాలు లేకపోతే, ఈ జంతువుల సంఖ్య పెరిగి రైతులకు పెద్ద సమస్యగా మారుతుంది” అని తెలిపారు.

జైపాల్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ప్రభుత్వం ఏం చెబుతోంది?

” సింహాల జనాభా రెవెన్యూ ప్రాంతాల్లో పెరుగుతున్నందున, మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు పెరుగుతాయని నేను అనుకోవడం లేదు” అని గుజరాత్ ప్రభుత్వ అటవీ విభాగపు చీఫ్ కన్జర్వేటర్ జైపాల్ సింగ్ చెప్పారు.

ప్రజలే సింహాలను ఆహ్వానిస్తున్నట్లు తమకు అనిపిస్తుందన్నారు.

‘‘సింహాలు వచ్చి, వారి ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఏదైనా ఒక కారణం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తే.. సింహాలు ఎప్పుడు తిరిగి వస్తాయని మా ఉద్యోగులను స్థానిక రైతులు అడుగుతున్నారు. ఎందుకంటే, పంటలను నాశనం చేసే అటడి జంతువుల నుంచి సింహాల కారణంగా వారికి రక్షణ దొరుకుతుంది” అని చెప్పారు.

సింహాల జనాభా పెరగడం వల్ల మనుషులకు-వన్యప్రాణులకు మధ్య సంఘర్షణలు పెరుగుతాయనే వాస్తవం తమకు పెద్ద ఆందోళనకరంగా ఏమీ లేదని జైపాల్ సింగ్ బీబీసీతో అన్నారు.

చిరుతలు అయితే ఈ ప్రాంతాల్లో సమస్యగా ఉన్నట్లు తెలిపారు. ఏడాదిలో మనుషులపై 20 వన్యప్రాణుల దాడులు జరగగా.. అందులో చిరుతలే 19 సార్లు దాడులకు పాల్పడట్టు తెలిపారు.

గ్రేటర్ గిర్ ప్రాంతంలో ఈ సంఘర్షణలను తగ్గించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)