SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, GSTT
బ్రిటన్లోని వైద్యులు మనుషుల మలంతో చేసిన మాత్రలను(పూ పిల్స్) ఉపయోగించి, కడుపులోని సూపర్బగ్ ఇన్ఫెక్షన్లను తొలగించే చికిత్స విధానాలను పరిశీలిస్తున్నారు. ఈ మాత్రల తయారీలో గడ్డకట్టించిన మలాన్ని ఉపయోగిస్తున్నారు.
ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం శాంపిళ్లను సేకరించారు. ఈ శాంపిళ్లలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.
యాంటీబయాటిక్స్ను తట్టుకునే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేసేందుకు ఈ ప్రయోగం చేస్తున్నారు.
మనుషుల్లో యాంటీబయాటిక్ నిరోధకతను కలిగి ఉన్న అతిపెద్ద భాగమైన పేగులపై తాము దృష్టిసారించినట్లు ‘గయ్స్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్స్’లో ఈ మాత్రలను పరీక్షిస్తోన్న డాక్టర్ బ్లెయిర్ మెరిక్ చెప్పారు.
మందుల నుంచి తప్పించుకోగల ఈ సూపర్బగ్స్ వాటికి ఆశ్రయమైన పేగు నుంచి బయటకు వచ్చి, శరీరంలో మరో ప్రాంతంలో ఇబ్బందిని కలిగించగలవు. అవే యూరినరీ ట్రాక్ లేదా బ్లడ్స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు.
క్లోస్ట్రిడియం డిఫిసిల్ బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన విరోచనాల చికిత్సకు ట్రాన్స్-పూ-షన్ అని పిలిచే మల మార్పిడికి ఇప్పటికే అనుమతులు వచ్చాయి.

గత ఆరు నెలల కాలంలో డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ సోకిన రోగులపై ఈ కొత్త అధ్యయనం దృష్టిసారించింది.
డోనర్స్ నుంచి మలాన్ని సేకరించి ఈ మాత్రలను రూపొందించారు.
ప్రతి మల నమూనాను కూడా ఎలాంటి హానికరమైన బగ్స్ ఉండకుండా చాలా జాగ్రత్తగా పరీక్షించారు. అరగని ఆహారాన్ని తొలగించారు. ఆ తర్వాత ఎండబెట్టి, పౌడర్గా మార్చారు.
దాన్ని మాత్ర లోపల పెట్టి, దాన్ని కడుపులోంచి పేగుల్లోకి వెళ్లేలా చేశారు. మల పౌడర్ పేలోడ్ను విడుదల చేసేందుకు ఆ మాత్ర అక్కడ కరిగిపోతుంది.
పెద్ద ఎత్తున అధ్యయనం చేసేందుకు లండన్లోని గయ్స్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్స్లో 41 మంది రోగులపై ఈ ప్రయోగం నిర్వహించారు.
పెరుగుతున్న సూపర్బగ్ మహమ్మారిపై పోరాడేందుకు ఈ మాత్రలు నిజంగా ప్రభావవంతంగా ఉన్నాయని డాక్టర్ మెరిక్ చెప్పారు.
”ఆహారం శరీరంలోకి ప్రవేశించేందుకు పేగులలో స్థలం కోసం పోరాడుతుంది. చివరికి, ఈ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శరీరం నుంచి శాశ్వతంగా ఈ సూపర్బగ్స్ను తొలగించడం లేదా వాటి సంఖ్యను సురక్షితమైన స్థాయిలకు తగ్గించడం చేస్తుంది” అని మెరిక్ తెలిపారు.
ఈ థెరపీ తర్వాత గట్ బ్యాక్టీరియా శ్రేణి మరింత వైవిధ్యంగా మారడాన్ని ఈ అధ్యయనం సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మనం పుట్టిన కొన్ని గంటల్లోనే మన శరీరంలోకి మంచి బ్యాక్టీరియా వస్తుందని ఈ వారం ప్రారంభంలో శాస్త్రవేత్తలు చెప్పారు. ఇవి చిన్న పిల్లలకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తున్నాయని అన్నారు.
సూపర్బగ్స్పై పోరాడటంలో పూ పిల్స్ ఉపయోగపడుతున్నాయని తేలితే, ప్రమాదంలో ఉన్న ప్రజల చికిత్సకు, ఇన్ఫెక్షన్ల నివారణకు వాడొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
రోగనిరోధక శక్తిని అణచివేసే క్యాన్సర్ థెరపీలు, అవయవాల మార్పిడి వంటి వైద్య చికిత్సలు మన శరీరాన్ని మరింత ప్రమాదకరంగా మార్చుతాయి.
వీరిలో చాలామందికి డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్ల నుంచి చాలా ప్రమాదం వాటిల్లుతుందని డాక్టర్ మెరిక్ అన్నారు.
450కి పైగా మైక్రోబయోమ్ మెడిసిన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని యూకే డ్రగ్స్ రెగ్యులేటర్ మెడిసిన్స్, హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చెప్పింది.
వీటిలో కొన్ని విజయవంతమవుతాయని, త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని ఎంహెచ్ఆర్ఏలో మైక్రోబయోమ్ రీసెర్చ్ హెడ్గా ఉన్న డాక్టర్ క్రిసి సెర్గాకి చెప్పారు.
భవిష్యత్లో యాంటీబయాటిక్స్ను మైక్రోబయోమ్ చికిత్సలతో భర్తీ చేయగలమని ఆశిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)