SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.
సింధు జలాల ఒప్పందం నిలిపివేత, సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ పౌరులకు వీసాల రద్దు వంటి అనేక నిర్ణయాలను భారత్ తీసుకుంది.
దానికి ప్రతిచర్యగా సిమ్లా ఒప్పందంనుంచి వైదొలుగుతున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది.
పహల్గాం దాడిపై గత గురువారం ఓ ర్యాలీలో మొదటిసారి స్పందించిన భారత ప్రధాని మోదీ ”దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తాం” అని హెచ్చరించారు.
”ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతుగా నిలిచిన వారిని కూడా భారత్ గుర్తించి శిక్షిస్తుంది’ అని ఆయన చెప్పారు.
‘పాకిస్తాన్ ఒక చుక్క నీటిని కూడా పొందకుండా వ్యూహం రచిస్తున్నాం’ అని జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు.
మరోవైపు’ఎలాంటి చర్యకైనా తీవ్రస్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన ఏ చర్యనయినా యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, ani
ప్రతిదాడికి దిగే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా?
భారత్ పరిమిత స్థాయిలో అయినా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని దక్షిణాసియా రాజకీయ వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు. ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.
అయితే సైనిక చర్యకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్హెచ్ పనాగ్ హెచ్చరించారు.
భారత ఆర్మీ పరిమిత సైనిక చర్యకు దిగితే స్పందించగల సామర్థ్యం పాకిస్తాన్కు ఉందని, అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర సమృద్ధిగా ఉన్నాయని ‘ద ప్రింట్’లో రాసిన ఆర్టికల్లో ఆయన చెప్పారు.
”మేం సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు. మేం ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం. ఏ పరిస్థితికయినా మేం సిద్ధం” అని పాకిస్తాన్ రక్షణ మంత్రి బీబీసీతో ఇంటర్వ్యూలో చెప్పారు.
”ఏదైనా సాహసోపేతమైన చర్య తీసుకుంటే 2019లోలా సమాధానం ఇస్తాం” అని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఏప్రిల్ 26న అన్నారు.
పుల్వామా దాడి తర్వాత బాలకోట్పై భారత్ చేసిన వైమానిక దాడుల గురించి ఆయన ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, @CMShehbaz

ఫొటో సోర్స్, Globelfirepower.com
భారత త్రివిధ దళాల బలమెంత?
‘గ్లోబల్ ఫైర్ పవర్’ వెబ్సైట్ ప్రకారం 2025 మిలటరీ ర్యాంకింగ్లలో భారత్.. పాకిస్తాన్ కంటే ముందుంది.
2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు 12.
భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్లడ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బారల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి.
భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం ఉంది. 2,229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ విమానాలు కాగా, 270 రవాణా విమానాలు. 130 అటాక్ ఎయిర్క్రాఫ్ట్లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్క్రాఫ్ట్లున్నాయి.
భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు.
భారత నావికాదళం దగ్గర లక్షా 42 వేలమంది సెయిలర్లు ఉన్నారు. రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి. వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి.
భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్టులు, 56 పోర్టులు, 63లక్షల కిలోమీటర్ల రోడ్డు, 65వేల కిలోమీటర్ల రైల్వే కవరేజ్ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఆయుధ సంపత్తి ఎలా ఉంది?
‘గ్లోబల్ ఫైర్ పవర్’ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13లక్షల11వేలమంది సైనికులు ఉన్నారు. లక్షా24వేలంది నావికాదళ సిబ్బంది, 78వేల వైమానిక సిబ్బంది ఉన్నారు.
పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లున్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 ఎటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, నాలుగు ట్యాంకర్ ఫ్లీట్లు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 57 ఎటాక్ హెలికాప్టర్లు.
2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొపెల్లడ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ ఆర్టిలరీ, 600 మల్టీబ్యారల్ ఆర్టిలరీ ఉన్నాయి.
పాకిస్తాన్ నావికాదళం దగ్గర మొత్తం 121 యుద్ధనౌకలున్నాయి. వాటిలో 9 ఫ్రిగేట్లు, 9 కార్వెట్టులు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో మూడు పోర్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు 116 ఎయిర్పోర్టులు, 60 మర్చంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి. 2.64 కిలోమీటర్ల రోడ్డు, 11.9 కిలోమీటర్ల రైల్వే కవరేజ్ పరిధి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నాయి?
స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా, పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి.
రెండు దేశాలు ఎన్ని అణువార్హెడ్లను మోహరించాయనేదానిపై స్పష్టత లేదు.
భారత్తో పోటీపడడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారుచేసుకుంటోంటే, దీర్ఘశ్రేణి లక్ష్యాలను చేధించగల ఆయుధాల మోహరింపుపై భారత్ దృష్టి పెట్టిందని సంస్థ తెలిపింది. ఈ ఆయుధాలు చైనాను కూడా టార్గెట్ చేయగలవు.
భారత్, పాకిస్తాన్లకు పొరుగు దేశమైన చైనా ప్రపంచంలో మూడో అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశం. అణ్వాయుధాలను 22శాతం పెంచుకుంది. చైనా దగ్గర అణు వార్హెడ్లు 410 నుంచి 500కు చేరాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల దగ్గర ఎన్ని డ్రోన్లు ఉన్నాయి?
భారత్, పాకిస్తాన్ డ్రోన్ల సంఖ్యను బాగా పెంచుకుంటున్నాయని గత ఏడాది నవంబరులో బీబీసీ ఉర్దూ ప్రతినిధి షకీల్ అఖ్తర్ రాసిన ఆర్టికల్లో పేర్కొన్నారు.
వచ్చే రెండు నుంచి నాలుగేళ్లలో డ్రోన్ల సంఖ్యను భారత్ దాదాపు ఐదువేలకు పెంచుకుంటుందని రక్షణరంగ నిపుణులు రాహుల్ బేదీ చెప్పారు.
భారత్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ దగ్గర అనేక రకాల సామర్థ్యమున్న 10 నుంచి 11 రకాల డ్రోన్లు ఉన్నాయి.
3.5 బిలియన్ డాలర్ల విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గత ఏడాది అక్టోబరులో భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రిడేటర్ డ్రోన్లను ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్రోన్లుగా భావిస్తారు.

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images
వాటితో పాటు 500 మిలియన్ డాలర్ల విలువైన బాంబులు, లేజర్ గైడెడ్ మిస్సైల్స్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించవచ్చు.
తుర్కియే, చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటోందని రాహుల్ బేదీ తెలిపారు. జర్మనీ, ఇటలీ నుంచి కూడా పాకస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేసింది.
బరాఖ్, శహపర్ వంటి డ్రోన్లను కూడా పాకిస్తాన్ తయారుచేస్తోంది.
తుర్కియేకు చెందిన అధునాతన బైరాక్తర్ డ్రోన్లు టీబీ2, ఎకెంజీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ‘వాంగ్ లాంగ్ 2’ సీహెచ్ 4వంటి డ్రోన్లను కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)