SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
గడిచిన రెండు దశాబ్దాలలో ప్రపంచంలోని మహా సముద్రాల్లో ఐదో వంతుకు పైగా నల్లగా మారాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ప్లిమత్ అధ్యయనం తెలిపింది.
”ఓషియన్ డార్కెనింగ్” అని పిలిచే ఈ ప్రక్రియ, సముద్రపు అత్యంత పొరల్లోఃమార్పులు జరగడం వల్ల సూర్యకాంతి లోపలకు చొచ్చు మార్పులు చోటు చేసుకుని, సూర్యకాంతి నీటిలోకి చొచ్చుకు పోకుండా క్లిష్టతరమైనప్పుడు జరుగుతోంది.
గ్లోబల్ చేంజ్ బయాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రపంచ మహాసముద్రాల్లో 21 శాతం 2003 నుంచి 2022 మధ్య కాలంలో నల్లగా మారినట్లు పేర్కొంది.

మహాసముద్రాలు నల్లగా ఎందుకు మారుతున్నాయి?
ఆల్గే (శైవలాలు) పెరుగుదలో హెచ్చుతగ్గులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో మార్పులు, సముద్రంలో నౌకలు, తీరప్రాంతంలోని పరిశమ్రలు, ఆయిల్ రిగ్గుల నుంచి వెలువడే కృత్రిమ కాంతులు మహాసముద్రాలు నల్లగా మారడానికి కారణంగా భావిస్తున్నారు.
సముద్రపు పైపొరను ‘ఫొటిక్ జోన్’ అంటారు. మొత్తం సముద్ర జీవుల్లో 90 శాతం ఇక్కడే ఉంటాయి. ఆరోగ్యకరమైన గ్లోబల్ జీవరసాయన చక్రాన్ని నిర్వహించడానికి ఈ ఫొటిక్ జోన్ చాలా కీలకం.
భూమి ఉపరితలంపైకి చేరిన పోషకాలు ఎక్కువగా ఉండే నీరు, అత్యధిక వర్షపాతం కారణంగా వ్యవసాయభూముల్లోని పోషకాలను, పురుగుమందుల అవశేషాలన్నీ కలిసి సముద్రంలో చేరడం వల్ల కూడా సముద్రాలు తరచూ నల్లగా మారుతున్నాయి. ఇవి ప్లాంక్టన్ (నీటిపై తేలియాడే జీవులు అంటే మొక్కలు, సూక్ష్మజీవులు వంటివి) పెరిగేందుకు కారణమవుతున్నాయి.
వాతావరణ మార్పుల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల అత్యధిక వర్షపాతాలు ప్రస్తుతం సర్వసాధారణంగా మారుతున్నాయి.
తీరప్రాంతానికి దూరంగా లోతు ఎక్కువగా ఉండే చోట సముద్రాలు నల్లగా మారడమనేది ఉపరితల ఉష్ణోగ్రతలతో ముడిపడి ఉండొచ్చు. దీనివల్ల ప్లాంక్టన్ స్థాయిలు పెరిగి, సూర్యరశ్మి నీటి లోపలికి వెళ్లకుండా ఆపుతుండొచ్చు.

ఫొటో సోర్స్, University of Plymouth
ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి?
మహాసముద్రాల్లో 9 శాతానికి పైగా అంటే ఆఫ్రికా అంత పరిమాణంలో 164 అడుగులకు పైగా వెలుతురు తగ్గినట్లు తాజా అధ్యయనం గుర్తించింది.
మహాసముద్రంలో వెలుతురు మరో 2.6 శాతంలో 328 అడుగుల కంటే ఎక్కువ తగ్గుదల కనిపించింది.
గల్ఫ్ స్ట్రీమ్ ఎగువన, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఫొటిక్ జోన్ లోపల తీవ్రమైన మార్పులు కనిపించాయని ఈ అధ్యయనం నివేదించింది. పర్యావరణ మార్పుల వల్ల ఈ ప్రాంతాలు గణనీయమైన మార్పులను ఎదుర్కొంటున్నాయి.
తీర ప్రాంతాలు, బాల్టిక్ సముద్రం వంటి ప్రాంతాల్లో మహాసముద్రం నల్లగా మారడం పెరుగుతోంది.
అయితే, మహాసముద్రాల్లో అన్ని ప్రాంతాలు నల్లగా మారడం లేదని ఈ అధ్యయనం తెలిపింది. 2003 నుంచి 2022 మధ్య కాలంలో మహాసముద్రాల్లో 10 శాతం వరకు వెలుతురులోకి మారినట్లు చెప్పింది.
ఈ మిశ్రమ ఫలితాలు మహాసముద్రపు వ్యవస్థల్లో సంక్లిష్టతను, నీటి స్వచ్చతను ప్రభావితం చేసే చాలా అంశాలను తెలియజేస్తున్నాయని అధ్యయన రచయితలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సముద్ర జీవులపై ఇదెలా ప్రభావం చూపుతుంది?
ఈ మార్పుల కచ్చితమైన ప్రభావాలు స్పష్టంగా తెలియనప్పటికీ, మన భూభాగంపై ఉన్న చాలా సముద్ర జీవులు, జీవవైవిధ్యం ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
”ప్లాంక్టన్ మార్పుల ఫలితంగా గత 20 ఏళ్లల్లో మహాసముద్రపు ఉపరితలం రంగు ఎలా మారిందో మా పరిశోధన చూపించింది.” అని యూనివర్సిటీలోని మెరైన్ కన్జర్వేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ డేవిస్ చెప్పారు.
” ఇటువంటి మార్పులు మహాసముద్రం నల్లగా మారడాన్ని పెంచుతోంది. జీవించడం, పునరుత్పత్తి కోసం సూర్యచంద్రుళ్లపై ఆధారపడ్డ జంతువులకు అందుబాటులో ఉండే మహాసముద్రాన్ని కూడా తగ్గిస్తున్నాయి.” అని తెలిపారు.
చాలా సముద్ర జీవులకు నీటిపై ఉండే పొరనే ఆవాసం. అక్కడే ఫైటోప్లాంక్టన్ ఫొటోసింథెసిస్ అని పిలిచే మొక్కల మాదిరి జీవులు ఉంటాయి. వీటిని మనం నీటి ఉపరితలంపై చూడొచ్చు. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన సూర్యరశ్మి వాటికి కావాల్సి ఉంటుంది.
ఫైటోప్లాంక్టన్ అనేవి అతి సూక్ష్మంగా ఉండి, కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే జీవులు. ఇవి సముద్రపు ఆహార వ్యవస్థకు మూలంగా ఉంటాయి.
క్రిల్ నుంచి తిమింగలాల వరకు ఆహార గొలుసులో దీని మీదే ఆధారపడి ఉంటాయి.
అందుకే, చాలా సముద్ర జీవులు ఫొటిక్ జోన్లలో ఇతర జీవులను వేటాడటం, పునరుత్పత్తి చేయడం చేస్తుంటాయి. అక్కడే వీటికి అవసరమైన ఆహారం పుష్కలంగా లభిస్తుంది. ఫైటోప్లాంక్టన్లు వాతావరణానికి చెందిన సగం ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. కార్బన్ సైక్లింగ్కు, సముద్ర జీవానికి ఇది చాలా కీలకం.
‘ఆందోళనకు కచ్చితమైన కారణం’
ప్రజలు పీల్చే గాలి, వారు తినే చేపలల, పర్యావరణ మార్పులపై ప్రపంచం పోరాడే సామర్థ్యంపైనా సముద్రపు చీకటి ప్రభావం చూపుతుండొచ్చని డాక్టర్ డేవిస్ అన్నారు.
తాము కనుగొన్న ఫలితాలు ఆందోళనచెందడానికి తగిన కారణాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు.
”ఈ మార్పుల వల్ల కొన్ని సముద్ర జీవులు వెలుతురు కోసం ఉపరితలానికి దగ్గరగా వస్తున్నాయి. దీనివల్ల ఆహారం, ఇతర వనరుల కోసం పోటీ పెరుగుతోంది.” అని ప్లేమౌత్ మెరైన్ ల్యాబోరేటరీ మెరైన్ బయోజియోకెమిస్ట్రీ, అబ్జర్వేషన్స్ సైన్స్ హెడ్ ప్రొఫెసర్ టిమ్ స్మిత్ చెప్పారు.
మొత్తం సముద్ర జీవవ్యవస్థలో ఇవి మౌలిక మార్పులను తీసుకురానున్నాయని అన్నారు.

ఈ అధ్యయనం ఎలా నిర్వహించారు?
‘డార్కెనింగ్ ఆఫ్ ది గ్లోబల్ ఓషియన్’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో… పరిశోధకులు సుమారు రెండు దశాబ్దాలకు చెందిన శాటిలైట్ డేటాతో పాటు అధునాతన మహాసముద్రపు నమూనాను పరిశీలించారు.
గ్లోబల్ ఓషియన్ను 9 కి.మీల పిక్సెల్లో విభజించే నాసా ఓషియన్ కలర్ వెబ్ డేటాను పరిశీలించారు. ఇది ప్రతి పిక్సెల్పై సముద్రపు ఉపరితలంపై మార్పులను పర్యవేక్షించేందుకు సహకరించింది.
సముద్రపు నీటిలో వెలుతురును కొలిచేందుకు రూపొందించిన అల్గారిథమ్ ప్రతి ప్రాంతంలో ఫొటిక్ జోన్ లోతును కొలిచేందుకు ఉపయోగించారు.
రాత్రింబవళ్లు వెలుతురులో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో పరిశీలించేందుకు సోలార్, లూనార్ ఇరాడియన్స్ మోడల్స్ను ఉపయోగించారు. అవి సముద్ర జీవులపై ప్రభావం చూపుతుండొచ్చు.
పగటిపూటతో పోలిస్తే రాత్రివేళల్లో కాంతి స్థాయిల్లో మార్పులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ, ఇప్పటికీ అవి పర్యావరణపరంగా చాలా ముఖ్యమైనవని ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS