SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Facebook/Chevireddy Bhaskar Reddy
ఏపీ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో వైఎస్సార్సీపీ నేత, తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్టు చేసినట్టు సిట్ అధికారులు ప్రకటించారు.
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన చెవిరెడ్డి అరెస్టు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయంగా మారింది.
ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారిలో గత ప్రభుత్వంలో పని చేసిన ఉన్నతాధికారులతో పాటు డిస్టిలరీల యజమానులు ఉన్నారు.
లిక్కర్ స్కాంలో అరెస్టయిన తొలి రాజకీయ నేత కూడా చెవిరెడ్డి భాస్కర్రెడ్డే.

వైసీపీకే చెందిన ఎంపీ మిధున్ రెడ్డి ఈ కేసులో సాక్షిగా విచారణకు వచ్చినప్పటికీ అరెస్టు కాకుండా ఆయన కోర్టును ఆశ్రయించారు.
అయితే, ఈ కేసులో ఇటీవలే చెవిరెడ్డి పేరు తెరపైకి రావడం, వెనువెంటనే అరెస్టు కావడం చర్చకు తెరలేపింది.

ఫొటో సోర్స్, Facebook/Chevireddy Bhaskar Reddy
శ్రీలంకకు వెళ్తుండగా అరెస్ట్
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ నాయుడు శ్రీలంకలోని కొలంబో వెళ్లేందుకు మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డిపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో బెంగళూరు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అడ్డుకుని ఏపీ పోలీసులకు సమాచారం అందించారు.
మద్యం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు హుటాహుటిన బెంగళూరు వెళ్లి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్నట్టు సిట్ వర్గాలు మీడియాకి వెల్లడించాయి.

ఫొటో సోర్స్, Facebook/Chevireddy Bhaskar Reddy
చెవిరెడ్డిపై ఉన్న ఆరోపణలు ఏమిటి?
గత వైసీపీ ప్రభుత్వ హయాం (2019–24)లో వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణం జరిగిందనీ, ఆ ఐదేళ్లలో నాటి వైసీపీ పెద్దలు కొన్ని మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను విచారణకు నియమించింది.
చెవిరెడ్డిపై సిట్ చేసిన నేరారోపణలు ఏమిటంటే..
మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల సొమ్ము చెవిరెడ్డికి చేరింది.
ఆ మొత్తాన్ని చెవిరెడ్డి గతేడాది ఎన్నికల సమయంలో తన వ్యక్తిగత సిబ్బంది, తనకు అనుకూలురైన వ్యక్తుల ద్వారా వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని దర్యాప్తులో గుర్తించింది.

జగ్గయ్యపేట చెక్పోస్ట్ వద్ద డబ్బుతో దొరికిన లారీ
2024 మే 9వ తేదీన, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులకు ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.8.36 కోట్లు సొత్తు పట్టుబడింది.
సిట్ చెబుతున్న దాని ప్రకారం..
”ఆ సొమ్ము మొత్తం మద్యం ముడుపులకి సంబంధించినది, దాని వెనుక చెవిరెడ్డి పాత్ర ఉంది.
ఆ సొమ్మును రాజ్ కసిరెడ్డి (ఇప్పటికే మద్యం కేసులో అరెస్టయ్యారు) హైదరాబాద్లో ఉన్న చెవిరెడ్డి సన్నిహితుడైన రియల్టర్ వెంకటేశ్ నాయుడు వద్దకు చేర్చారు.
ఆయన ఆ మొత్తాన్ని, ఆ లారీ ద్వారా హైదరాబాద్ నుంచి గుంటూరులో చెవిరెడ్డి చెప్పిన ప్రాంతానికి తరలించే క్రమంలోనే లారీ పట్టుపడినట్లు దర్యాప్తులో తేలింది.
ఇదే మాదిరిగా అప్పట్లో వెంకటేశ్ నాయుడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి డబ్బును లారీలు, ట్రక్కుల ద్వారా పంపినట్టు విచారణలో వెల్లడైంది.
ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి బృందం నుంచి కలెక్ట్ చేసుకునేందుకు అప్పట్లో చెవిరెడ్డి చైర్మన్గా ఉన్న తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ‘తుడా’ వాహనాలను వాడుకున్నారు.
ఇందుకోసం చెవిరెడ్డి అప్పటి పీఏ, గన్మన్, డ్రైవర్లు, ఇతర సన్నిహితులను ఉపయోగించుకున్నారు” అనేవి సిట్ చేస్తున్న ప్రధాన ఆరోపణలు.
రియల్టర్ వెంకటేశ్ నాయుడిని సిట్ అధికారులు బుధవారం అరెస్ట్ చేయగా, రాజ్ కసిరెడ్డి గతంలోనే అరెస్ట్ అయ్యారు. దీంతో వారితో మాట్లాడే అవకాశం బీబీసీకి లభించలేదు.
సిట్ అధికార వర్గాలు చెబుతున్న వివరాలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సిట్పై చెవిరెడ్డి గన్మెన్ ఆరోపణలు
ఈ కేసులో సిట్ అధికారులు చెవిరెడ్డి వద్ద పనిచేసిన గన్మెన్లు గిరి, మదన్ రెడ్డిలను సాక్షులుగా పేర్కొంటూ, కొద్దిరోజులుగా విచారిస్తూ వచ్చారు.
అయితే, ఏఆర్ కానిస్టేబుల్ మదన్రెడ్డి రెండు రోజుల కిందట సిట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ డీజీపీకి లేఖ రాశారు.
చెవిరెడ్డికి రూ.200 కోట్ల వరకు మద్యం ముడుపులు అందాయని చెప్పాలంటూ సిట్ అధికారులు తనను వేధించారని డీజీపీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, తనను సిట్ అధికారులు విచారణ పేరిట చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ హైకోర్టులో మదన్రెడ్డి పిటిషన్ కూడా దాఖలు చేశారు.
కాగా, మదన్రెడ్డి ఆరోపణలను సిట్ ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మదన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
విచారణ సమయంలో కానిస్టేబుల్ మదన్రెడ్డి సిట్ అధికారులకు కనీసం సహకరించలేదని, తమ అధికారులతో ‘మీ పేర్లు రాసి చనిపోతాను’ అని బెదిరించారని సిట్ తెలిపింది.
మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన ముడుపులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డికి అందాయని, ఆ డబ్బులే ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్లు తెలిసిందని సిట్ ఆ ప్రకటనలో ఆరోపణలు చేసింది.
ఈ కేసు విచారణ జరుగుతున్న ఇదే సమయంలో, కొలంబో వెళ్లేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు చేరుకున్నారు. అయితే, ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సమాచారం అందించడంతో సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఏ–38గా, ఆయన కుమారుడు మోహిత్రెడ్డిని ఏ–39గా, వెంకటేశ్నాయుడును ఏ–34గా సిట్ చేర్చింది.
ఇది అక్రమ అరెస్ట్: చెవిరెడ్డి మోహిత్రెడ్డి
వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రతో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోందని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు వైసీపీ నేత మోహిత్రెడ్డి ఆరోపించారు.
ఈ మేరకు మోహిత్రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కూటమి ప్రభుత్వం బేతాళ కుట్రలకు తెరతీసిందని, ఆ కుట్రలో భాగంగానే తాజాగా చెవిరెడ్డిని అరెస్టు చేసిందని విమర్శించారు.

ఫొటో సోర్స్, UGC
ఇప్పటివరకు ఎవరెవరు అరెస్టయ్యారు?
మద్యం కుంభకోణం ఆరోపణలపై మంగళగిరి సీఐడీ పోలీసు స్టేషన్లో క్రైమ్ నెం.21/2024 యు బై ఎస్ 409, 420, 120(బి) ఆర్ బై డబ్ల్యూ 34, 37 ఐపీసీ సెక్షన్ 7, 7(ఏ), 8, 13(1)(బి), 13(3) ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఈ కేసులో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కడప మాజీ ఆర్డీవో కృష్ణమోహన్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, నాటి ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అరెస్టయ్యారు.
వీళ్లంతా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, మద్యం కంపెనీల ప్రతినిధులు కాగా, ఈ కేసులో అరెస్టయిన తొలి రాజకీయ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.
కాగా, చెవిరెడ్డి అరెస్టు వ్యవహారంపై సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుతో బీబీసీ మాట్లాడేందుకు యత్నించగా, దీనిపై ఇప్పుడే మీడియాతో మాట్లాడలేమన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)