SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Twitter/Telangana Tourism
- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
27 మే 2025
72వ మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి.
మే 7వ తేదీన ప్రారంభమైన ఈ సందడి మే 31వ తేదీ వరకూ కొనసాగుతుంది.
పలు వివాదాలు, అనేక ఆరోపణల నడుమ ఈ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి.
‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ నినాదంతో ‘మిస్ వరల్డ్’ పోటీలను 1951లో ‘ది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ మొదలుపెట్టింది.


ఫొటో సోర్స్, Twitter/Telangana Tourism
ప్రతి దశలోనూ తీవ్ర పోటీ
భారత్ నుంచి నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ‘మిస్ వరల్డ్’ పోటీలకు హాజరయ్యారు.
ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్కు ఒక్కో ఖండం నుంచి పదేసి మంది (అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మంది)ని ఎంపిక చేస్తారు.
గత ఆదివారం మొదటి దశ క్వార్టర్స్ పోటీలు ముగిశాయి. ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున 40 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశలో 5 గురిని (టాప్ 5) ఎంపిక చేశారు.
ఇలా ప్రతి ఖండం నుంచి ఎంపికైన 5 గురిలో మూడో దశలో ఇద్దరిని (టాప్ 2)ను ఎంపిక చేశారు. అంటే అప్పుడు పోటీలో 8 మంది నిలిచారు. ఈ 8 మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్గా ఎంపిక చేశారు.
అలా ప్రతి ఖండం నుంచి మిగిలిన ఒక్కరి మధ్య ఫైనల్ పోటీ జరుగుతుంది.
ప్రస్తుతం ఫైనల్ బరిలో నిలిచిన నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్కు చెందిన ఆరెలీ జోచిమ్లు ఎంపికయ్యారు.
తుది పోటీ (ఫైనల్స్)లో పాల్గొనేదీ ఈ నలుగురే. వారిలో ఒకరు ‘మిస్ వరల్డ్’ కిరీటం దక్కించుకుంటారు. మిగిలిన ముగ్గురిని ప్రతిభను బట్టి రన్నరప్లుగా ప్రకటిస్తారు.
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే ఈనెల 31వ తేదీన హైటెక్స్లో జరుగుతుంది.

ఫొటో సోర్స్, Miss World Official Website
భారత్దే పైచేయి
‘మిస్ వరల్డ్’ కిరీటం దక్కించుకోవడంలో ఇండియా, వెనెజ్వెలాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
ఇప్పటివరకు భారత్ నుంచి ఆరుగురు ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. రీటా ఫారియా (1966), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హైడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లార్ (2017) మిస్ వరల్డ్ అయ్యారు.
వెనెజ్వెలా కూడా ఆరుసార్లు విజయంతో ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే (5), యూఎస్ఏ (3), దక్షిణాఫ్రికా (3) ఉన్నాయి.

ఫొటో సోర్స్, Miss World Official Website
తొలి నుంచి నిరసనలు, వివాదాలు
పోటీదారుల్లో ఒకరైన మిస్ ఇంగ్లండ్-2024 మిల్లా మాగీ అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకోవడం, తిరిగి స్వదేశానికి వెళ్లిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై విచారణకు కమిటీ వేసింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా తన వివరణతో ప్రకటన విడుదల చేసింది.
భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది మూడోసారి. తొలిసారి 1996లో బెంగళూరులో నిర్వహించారు. వీటి నిర్వహణలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు చెందిన ఏబీసీఎల్ ( అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్) కంపెనీ నాడు కీలక పాత్ర పోషించింది.
రెండోసారి 2024లో ముంబయి, దిల్లీలో నిర్వహించారు. మార్చి 9న ముంబయిలో జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు.
మూడోసారి మిస్ వరల్డ్-2025 పోటీలకు హైదరాబాద్ వేదిక గా మారింది. అంతేకాదు గతంలో కన్నా భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఆతిథ్యం ఇస్తోంది.
‘తెలంగాణ, జరూర్ ఆనా’ స్లోగన్తో తెలంగాణ పర్యటక శాఖ ఈ పోటీల నిర్వహణలో భాగస్వామిగా (కో-హోస్ట్) బాధ్యతలు తీసుకుంది.
తెలంగాణ పర్యటకానికి ఒక బ్రాండింగ్ తీసుకురావడం, ఇక్కడి ఉత్పత్తులకు, కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. వివిధ దేశాల నుంచి ఈ పోటీలకు వచ్చిన పోటీదారులంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పర్యటక ప్రాంతాలైన నాగార్జునసాగర్లోని బుద్ధిస్టు థీమ్ పార్క్, హైదరాబాద్లో చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలస్, ఓరుగల్లు కోట తదితర ప్రాంతాల్లో సందడి చేశారు. తెలంగాణ సచివాలయానికి కూడా వెళ్లారు.
ఈ పోటీల నిర్వహణకు రూ.27 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోటీలపై రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఎక్స్లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Screengrab/I&PR Telangana
మహిళా సంఘాల నిరసనలు
భారత్లో బెంగళూరు వేదికగా 1996లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు కొన్ని వారాల ముందు నుంచే ఈ పోటీలను వ్యతిరేకిస్తూ దేశంలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి.
మహిళా సంఘాల సభ్యులు కొంతమంది సామూహిక ఆత్మహత్యకూ వెనుకాడబోమని హెచ్చరికలు చేయడం చర్చనీయాంశం అయింది. అప్పట్లో బీజేపీ కూడా వీటిని వ్యతిరేకించింది.
అందాల పోటీల వల్ల భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి పెచ్చుమీరుతుందని, మహిళలను వ్యాపార వస్తువు చేస్తున్నారనే ఆరోపణలు తొలి నుంచీ ఉన్నాయి. మహిళావాదులు చాలామంది ఈ పోటీలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 1996లో ఈ పోటీలకు వేదికైన బెంగళూరులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఇప్పుడు హైదరాబాద్లోనూ అందాల పోటీలు నిర్వహించవద్దంటూ ఇటీవల కొన్ని మహిళా సంఘాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారిని ముందస్తు అరెస్టులు చేయడం ద్వారా పోలీసులు ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
సాంస్కృతిక, చారిత్రాత్మక, పర్యటక ప్రదేశాల సందర్శనలో భాగంగా మిస్ వరల్డ్ పోటీదారులు రామప్ప దేవాలయానికి వెళ్లినప్పుడు స్వాగత కార్యక్రమంలో భాగంగా వారి కాళ్లను స్థానిక మహిళలతో కడిగించారంటూ ఒక వివాదం నడిచింది.
పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ అర్ధంతరంగా తప్పుకోవడం, నిర్వహణ తీరును తప్పుపడుతూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఇంగ్లండ్లో ‘ది సన్’ టాబ్లాయిడ్ ప్రచురించడంతో అందాల పోటీలకు వివాదాల సెగ ఎక్కువైంది.
మిల్లా ఆరోపణల నేపథ్యంలో, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించిందని, ఆమె ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పీటీఐకి వెల్లడించారు.
మాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈవో జూలియా మోర్లే ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే మాగీ ఆరోపణలను తేలిగ్గా తీసుకోవద్దని, సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని బీబీసీతో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.

‘శ్రమైక సౌందర్యానికి ప్రాధాన్యమివ్వాలి’
”కొలతలేసి మహిళల అందాన్ని లెక్కించే అందాల పోటీల వెనుక కార్పొరేట్ల మాయాజాలం ఉంది. జనాభాలో 60 శాతం యువతే. వారిని ఆకర్షించి తమ సౌందర్య సాధనాలు, ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడానికే ఈ అందాల పోటీలు. వీటిపై పలు దేశాల్లో వ్యతిరేకత వచ్చింది. శ్రమైక సౌందర్యానికి గౌరవం ఇవ్వాలే తప్ప మిగతా మహిళలలో ఆత్మన్యూనత పెంచేదిగా ఉన్న ఈ పోటీలను వ్యతిరేకిస్తున్నాం” అని మల్లు లక్ష్మి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS