SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Laura Marston
- రచయిత, ఫిలిప్పా రాక్స్బీ
- హోదా, హెల్త్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
-
31 మే 2025
తల, మెడ క్యాన్సర్ అడ్వాన్స్ దశలో ఉన్న వేలాది మంది రోగులు.. ఇమ్యునోథెరపీ డ్రగ్ ద్వారా క్యాన్సర్ తిరగబెట్టకుండా ఇంకా ఎక్కువ కాలం జీవించగలరని ఒక క్లినికల్ ట్రయల్ చెబుతోంది.
గడిచిన 20 ఏళ్లుగా చికిత్స కష్టంగా మారిన ఈ క్యాన్సర్ రోగులకు ఇదొక పెద్ద పురోగతి అని ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెప్పారు.
డెర్బీషైర్కు చెందిన 45 ఏళ్ల లారా మార్ట్సన్కు ఆరేళ్ల కిందట నాలుక క్యాన్సర్ అడ్వాన్స్ దశలో ఉందని నిర్ధరణ అయింది. బతికే అవకాశాలు చాలా తక్కువని తెలిశాక కూడా తానింకా జీవించి ఉండటం అద్భుతమేనని లారా మార్ట్సన్ అంటున్నారు.
సర్జరీకి ముందు, ఆ తర్వాత ఆమె ఇమ్యునోథెరపీ చేయించుకున్నారు. క్యాన్సర్ తిరగబెట్టినా దానిపై దాడి చేసేలా శరీరం నేర్చుకోవడానికి ఈ థెరపీ సాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.
తల, మెడ క్యాన్సర్లకు చికిత్స చేయడం చాలా కష్టం. రెండు దశాబ్దాలలో ఈ రోగులకు చికిత్స చేసే విధానంలో చెప్పుకోదగిన మార్పేమీ కనిపించలేదు.

తల, మెడ క్యాన్సర్లు అడ్వాన్స్ దశలో ఉన్నట్లు నిర్ధరణ అయిన వారు సగానికి పైగా ఐదేళ్లలోనే మరణిస్తున్నారు. గొంతులో వచ్చిన అల్సర్ ఎంతకూ తగ్గకపోవడంతో, పరీక్షల చేసిన తర్వాత 2019లో లారాకు క్యాన్సర్ అని నిర్ధరణ అయింది. ఆమె మరింత కాలం జీవించే అవకాశం 30 శాతం మాత్రమే ఉంది.
క్యాన్సర్ నిర్ధరణ అయిన తర్వాత ఆమె నాలుకను తొలగించేందుకు పెద్ద సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆమె మెడలోని లింప్ నోడ్స్ (శోషరస గ్రంథులను) తొలగించారు.
ఈ సర్జరీ జరిగిన తర్వాత ఆమె మళ్లీ మాట్లాడటం, తినడం నేర్చుకున్నారు.
”నాకు 39 ఏళ్లు, నేను చాలా కుంగిపోయాను.” అని లారా బీబీసీ న్యూస్తో అన్నారు.
క్యాన్సర్ చికిత్సకు సరికొత్త విధానాలను కనుగొనేందుకు లండన్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసర్చ్కు చెందిన నిపుణులతో ఒక అంతర్జాతీయ అధ్యయనాన్ని ప్రారంభించారు.
ఈ అధ్యయనంలో భాగంగా.. క్యాన్సర్పై పోరాడేలా శరీర రక్షణను పెంచేందుకు సర్జరీకి ముందు, ఆ తర్వాత ఇమ్యునోథెరపీ ఔషధం పెంబ్రోలిజుమాబ్ను ఇచ్చిన 350 మందికి పైగా రోగులలో లారా ఒకరు.
యూకేలో ఈ ట్రయల్కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కెవిన్ హరింగ్టన్ దీన్ని వివరిస్తూ.. ”కణితిని స్పష్టంగా చూసేందుకు రోగనిరోధక వ్యవస్థకు అవకాశం కల్పిస్తాం. దీని వల్ల అది కణితితో పోరాడటం నేర్చుకోగలుగుతుంది. కణితిని తొలగించిన తర్వాత ఏడాది పాటు ఈ డ్రగ్ను ఇస్తూ.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉంటాం.” అని తెలిపారు.
ఇలాంటి క్యాన్సర్లతో పోరాడుతున్న రోగులకు కూడా ఇదే రకమైన సంరక్షణను అందించారు. వారందరికీతల, మెడ క్యాన్సర్లు అడ్వాన్స్ దశలో ఉన్నాయి. అవి శరీరమంతా పాకకుండా ఈ చికిత్స దోహదపడింది.
ఈ కొత్త విధానం సానుకూల ఫలితాలను చూపించింది. రోగులకు క్యాన్సర్ తిరగబెట్టకుండా ఉండే కాలాన్ని సగటున రెండున్నరేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచింది.
మూడేళ్ల తర్వాత పెంబ్రోలిజుమాబ్ తీసుకున్న రోగులకు శరీరంలో మరే ప్రాంతంలోనైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 10 శాతం కంటే తక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
‘నా జీవితాన్ని తిరిగి ఇచ్చింది’
క్యాన్సర్ వచ్చి ఆరేళ్లవుతోందని, తానిప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాని లారా చెప్పారు. తాను చాలా బాగున్నట్టు తెలిపారు.
” ఇది అద్భుతం. ఎందుకంటే, నేను ఇక్కడుండి మాట్లాడగలుగుతున్నాను.” అని లారా చెప్పారు.
”ఇంత దూరం ప్రయాణిస్తాననుకోలేదు.” అని తెలిపారు.
”నా రోగ నిర్ధరణ చాలా భయానకంగా ఉంది.”
”నాలుక తీసేయడం ద్వారా ఏర్పడిన శూన్యతను నింపేందుకు నా ఎడమ చేతి నుంచి ఒక కండరాన్ని తీసి, నోటిలో అమర్చారు. . ఇది చాలా క్లిష్టమైన ప్రయాణం.” అని తన క్యాన్సర్ అనుభవాలను లారా గుర్తు చేసుకున్నారు.
” ఈ అద్భుతమైన ఇమ్యునోథెరపీని తీసుకున్న తర్వాత, నా జీవితం తిరిగి నాకొచ్చింది.” అని తెలిపారు.
సర్జరీకి ముందు ఈ డ్రగ్ను రోగులకు ఇవ్వడం తమ ఫలితాలకు చాలా కీలకమని, క్యాన్సర్ తిరగబెడితే దానిపై పోరాడేందుకు, దాన్ని రూపుమాపేందుకు శరీరానికి ఇది శిక్షణ ఇస్తుందని పరిశోధకులు చెప్పారు.
ఇమ్యునోథెరపీ రోగుల ప్రపంచాన్నే మార్చేస్తుందని ప్రొఫెసర్ హరింగ్టన్ తెలిపారు.
” చికిత్స చేయడానికి కష్టంగా ఉన్న ప్రాంతాల నుంచి శరీరమంతా క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశాలను ఇది బాగా తగ్గించేస్తుంది.” అని చెప్పారు.
యూకేలో ప్రతి ఏడాది 12,800 మంది తల, మెడ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
”కొందరు రోగులకు ఈ విధానం చాలా బాగా పనిచేస్తుంది. కానీ, ట్రయల్లో చికిత్స చేసిన రోగులందరికీ ఇది ప్రయోజనాన్ని చేకూర్చడం చూసి చాలా ఆశ్యర్యమేసింది. ఎన్హెచ్ఎస్ వద్ద దీన్ని అందుబాటులో ఉంచాలి.” అని ప్రొఫెసర్ హరింగ్టన్ చెప్పారు.
అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ఏఎస్సీఓ) వార్షిక సమావేశంలో ఈ అధ్యయన ఫలితాలను వివరించారు.
కీనోట్గా పిలిచే ఈ ట్రయల్కు సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ నేతృత్వం వహించగా 24 దేశాలకు చెందిన 192 ఆస్పత్రులు దీనిలో పాలుపంచుకున్నాయి. ఎంఎస్డీ అనే డ్రగ్ కంపెనీ నిధులు సమకూర్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS