SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, instagram.com/khaleja.4k
తెలుగునాట థియేటర్ల బంద్ వివాదం నడుస్తోన్న వేళ, రీరిలీజుల అంశం చర్చలోకి వచ్చింది.
థియేటర్లకు వచ్చే జనం తగ్గుతోన్న నేపథ్యంలో ఆ ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలకు పోటీగా, పాత సినిమాలు రావడంపై సినిమా పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజాగా విడుదలైన ‘భైరవం’ సినిమా బృందం చేసిన వ్యాఖ్యలు చర్చను తెరపైకి తెచ్చాయి.
గత వారాంతంలో విడుదలైన సినిమాల్లో భైరవం ఒకటి.
నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమాతో పాటే మహేశ్ బాబు నటించిన ఖలేజా రీరిలీజ్ అయింది.


ఫొటో సోర్స్, facebook.com/BellamkondaSreenivas
చాంబర్లో చర్చిస్తామన్న నిర్మాత
భైరవం సినిమా సక్సెస్ మీట్లో ఖలేజా ప్రభావం, మీ సినిమాపై ఉందా అని ప్రశ్నించారు విలేఖర్లు.
ఆ సినిమా నిర్మాత రాధామోహన్, నటుడు మంచు మనోజ్ ఈ అంశంపై మాట్లాడారు.
”రీరిలీజుల ప్రభావం కొంత వరకూ నిజమే. కానీ ఆపలేం. ప్రేక్షకులు పాతది చూస్తారా, కొత్తది చూస్తారా అని మనం ఆపలేం. భవిష్యత్తులో నేను కూడా రీరిలీజు చేస్తానేమో? ప్రభావం ఉన్నా మనమేమీ చేయలేం’’ అన్నారు రాధామోహన్.
రీరిలీజులను ఆదరించడం, ఆదరించకపోవడం ప్రేక్షకుల ఇష్టమని, ఇలాంటి అంశాల్లోకి ఫిలిం చాంబర్ రాదని ఆయన అన్నారు.
‘‘చాంబర్ తరపున నిర్మాతలను కోరవచ్చు. కానీ, వాళ్ళు మాట వినాలనీ లేదు. కాకపోతే శుక్రవారం కాకుండా, సోమవారం రీరిలీజులు పెట్టుకోమని మనం చాంబర్ తరపున విన్నవిస్తే బాగానే ఉంటుంది” అన్నారు రాధామోహన్.
తాజా విడుదలలో ఖలేజా రూ. 12 కోట్లు వసూలు చేసిందనీ, రీరిలీజుల్లో ఇదే అత్యధికమని ఖలేజా సినిమా బృందం చెబుతోంది.
అన్ని రీరిలీజులూ ఆ స్థాయిలో హిట్ అయ్యాయని కూడా చెప్పలేకపోయినా, వాటి ప్రభావం కొత్త సినిమాలపై ఉంటుందని ప్రస్తుతం పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
ఒక సినిమా వల్ల మరో సినిమాకు నష్టం ఎంత జరిగింది? ఎలా జరిగింది? అనేది చెప్పడం కష్టం.
ఒక సినిమా విడుదల కాకపోయుంటే, మరో సినిమా బాగా ఆడేదా అని చెప్పడానికి ఎక్కడా స్పష్టమైన కొలమానాలు లేవు.
థియేటర్ల యజమానులు అదేమాట చెబుతున్నారు.
”అది తప్పు అని చెప్పలేం. అలాగే ఆపలేం. స్లోగా మంచి టాక్ తెచ్చుకునే కాంతారా, కోర్టు వంటి సినిమాలు ఓవర్ షాడో అయి పికప్ అవడానికి ఇలాంటి రీరిలీజులు అడ్డం అయితే అప్పుడు అది చర్చలోకి వస్తుంది. సినిమా రంగంలో ఒక సినిమా గురించి మరో సినిమా వారు ఫిర్యాదు చేయలేదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కంటెంట్, సినిమా మేకింగ్ కీలకం. కొన్ని విషయాలు మన పరిధికి మించి ఉంటాయి” అని బీబీసీతో చెప్పారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి, సుదర్శన్ థియేటర్ భాగస్వామి గోవిందరాజు.

థియేటర్ల సమస్యలు
రీరిలీజు ప్రభావం చిన్న సినిమాలపై అసలు ఉండదు అంటున్నారు తెలుగు సినిమా నిర్మాతల మండలి కోశాధికారి రామ సత్యనారాయణ.
”రీరిలీజ్ అనేది సినిమా నిర్మాత హక్కు. అలాగని అన్ని సినిమాలకూ ఆ అవకాశం లేదు. పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అవి కూడా అన్నీ ఆడవు. కొన్ని ఫ్లాప్ అయినవి ఇప్పుడు హిట్ అవుతున్నాయి. హిట్ అయినవి ఫ్లాప్ అవుతున్నాయి. వీటి వల్ల చిన్న సినిమాలు ఆడడం లేదన్నది తప్పు. ఒకేసారి లేదా పండుగల వంటి సందర్భాల్లో అనేక పెద్ద సినిమాలు రిలీజ్ అయితే అప్పుడు బావున్న సినిమా ఆడుతుంది. బాగా లేకపోతే ఆడదు. కాబట్టి దానికీ దీనికీ సంబంధం లేదు” అన్నారాయన.
కంటెంట్ సరే, కానీ థియేటర్లు దొరకాలి కదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కాదంటున్నారాయన.
”థియేటర్లు లేవు అన్న వాదన కూడా సరికాదు. చాలా వరకూ రీరిలీజులు శుక్రవారం కాకుండా గురువారం, ఆదివారాలు చేసుకుంటున్నారు. థియేటర్లు మూసేయకుండా, ఏదో రూపంలో సినిమా ఆడుతుంది కదా. ప్రేక్షకుడు ఒకసారి వస్తే మళ్ళీ మరో సినిమాకు రావడానికి ఆసక్తి చూపుతాడు” అన్నారు సత్యనారాయణ.
అయితే ఈ సమస్యను కేవలం రీరిలీజు – కొత్త సినిమా అని కాకుండా మొత్తం థియేటర్ల పరిస్థితి అనే విస్తృత కోణం నుంచి అర్థం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు.
”ప్రేక్షకులు అన్ని రీరిలీజులకూ ఒకేలా స్పందించడం లేదు. పెద్ద హీరోలు రెండుమూడేళ్ళకు సినిమా తీస్తున్నారు. అందరు పెద్ద హీరోల సినిమాలూ కలిపి కనీసం నెలకు రెండైనా ఉండి, అవి కూడా పర్సెంటేజీ పద్ధతిలో ఇస్తే అప్పుడు, మిగతా సమయాల్లో చిన్న సినిమాలను నడిపేందుకు ఆస్కారం ఉంటుంది” అని సీనియర్ పాత్రికేయులు రంగావఝుల భరద్వాజ బీబీసీతో చెప్పారు.
థియేటర్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ వేరువేరు పరిస్థితుల్లో ఉన్నాయి.
సింగిల్ స్క్రీన్ కి వెళ్ళే వారు సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత డిసైడ్ అవుతున్నారు.
బావుంటే ఉంటే వెళ్దాం. లేదంటే వద్దు అనుకుంటున్నారు.
“జనం బాగా వచ్చే సినిమాకు పర్సంటేజీ ఇస్తే, జనం రాని సినిమాకు కూడా నష్టం అయినా భరించవచ్చన్నది థియేటర్ల మాట. ఈ వివాదంపై చాంబర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ నిర్ణయం అయ్యేలోపే తమ థియేటర్లను మూసేయాలని సింగిల్ స్క్రీన్ల వారు నిర్ణయించుకున్నారు. వాటి రియల్ ఎస్టేట్ విలువ అలాంటిది. గతంలో నెలకు ఏడెనిమిది అయినా పెద్ద సినిమాలు ఉండేవి కాబట్టి థియేటర్లు బతికాయి. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లను నిలబెట్టే సినిమాలు లేవు” అని భరద్వాజ అన్నారు.
ఓటీటీల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాలను చూస్తున్న ప్రేక్షకులకు మంచి కంటెట్ లేని సినిమాలు నచ్చడం లేదని భరద్వాజ చెప్పారు.
ఆ పద్ధతి మారడంతో పాటూ, సాయంత్రానికి పైరసీ ప్రింట్ వచ్చే పద్ధతి కూడా ఆగాలనీ, అప్పుడు థియేటర్లు నిలబడతాయన్నారు.
ఇవన్నీ జరగడంతో పాటు ఎగ్జిబిషన్ రంగం కూడా బావుంటే రీరిలీజు-కొత్త సినిమా వంటి సమస్యలు రావన్నది ఆయన విశ్లేషణ.

ఫొటో సోర్స్, facebook.com/urstrulyMahesh
టాలీవుడ్లో రీరిలీజ్ల సందడి
కొంత కాలంగా తెలుగునాట రీరిలీజుల సందడి పెరుగుతోంది.
దీనికోసం పాత పద్ధతుల్లో తీసిని సినిమాలను ఇప్పుడు పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నారు.
4K వంటి హైరిజల్యూషన్ లోకి తీసుకువచ్చి, ఆడియో క్వాలిటీ కూడా పెంచుతున్నారు.
దానికి కొంత ఖర్చు అవుతుంది.
మాయాబజార్ ని కలర్లోకి మార్చి ఐమాక్స్లో ప్రదర్శించినప్పుడు ఈ క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు టీవీలు కూడా పల్లెల్లో బాగా విస్తరించని రోజుల్లో థియేటర్లలో హిట్ సినిమాల రీరిలీజులు తరచూ జరిగేవి.
కోస్తా జిల్లాల్లో ఇలా రీరిలీజులు, పాత సినిమాలు మాత్రమే ఆడే థియేటర్లు కూడా ఉండేవి. 2022లో పోకిరి రీరిలీజు సంచలనం సృష్టించింది.
సినిమా రీ రిలీజ్ గురించి ప్రకటన చేయగానే అమెరికాలో టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
ఆ ఏడాది ఆగస్టులో ఇండియాలో ఈ సినిమా రీరిలీజ్ చేశారు. తరువాత చాలా సినిమాలు ఆ వరుసలో చేరాయి.
ఇక రీరిలీజు కోసం చాలా మండి అభిమానులు డిమాండ్లు కూడా చేస్తుంటారు.
అలాగే అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్, ఖలేజా వంటి సినిమాలు కూడా రీరిలీజు మంచి పేరు, డబ్బు తెచ్చుకున్నాయి.
ఇక రీరిలీజు సందర్భంగా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల హంగామా, అల్లరి భారీగా ఉంటోంది. ఆయా సినిమాల్లో పాటలు, సీన్లు ముందే ప్రేక్షకులకు తెలుసు కాబట్టి, అవి వచ్చినప్పుడు ప్రేక్షకులంతా పాడడం కొందరైతే ఆ సీన్లను అక్కడే నటించడం వంటివి చేస్తున్నారు.
ఇక ఆయా సినిమాలు రిలీజైప్పుడు చిన్నతనంలో థియేటర్లలో చూడని కొత్తతరం కూడా ఇక్కడ కనిపిస్తోంది.
సినిమా రంగ పెద్దలంతా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అంటున్నారు నటులు మంచు మనోజ్.
భైరవం విజయోత్సవ వేదికపై నుంచే ఆయన మాట్లాడారు.
”రీరిలీజులు ప్రభావం కొంచెం ఉంది. ఇప్పటికే సినిమాలపై ఐపీఎల్ ప్రభావం ఉంది. ఓటీటీల సంగతి సరే. పండుగలు, ముఖ్యమైన తేదీలకు పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేస్తారు. కాబట్టి రీరిలీజులు వారాంతాల్లో కాకుండా, వారం మధ్యలో పెడితే బావుంటుంది. దీనిపై పెద్దలు కూర్చుని ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటే బావుటుంది” అని మంచు మనోజ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS