SOURCE :- BBC NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ, చంద్రబాబు సర్కారు, ఏపీ  హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
  • హోదా, బీబీసీ కోసం
  • 5 జూన్ 2025

“మేం ఊరికే ఉద్యోగాలిమ్మని అడగడం లేదు. డీఎస్సీ రాసేందుకు అవకాశం ఇవ్వమంటున్నాం. పరీక్షల్లో మేం ప్రూవ్‌ చేసుకుంటే వస్తుంది లేదంటే లేదు.. దానికి కూడా వీలు కల్పించకపోతే ఎలా.. చివరకు కోర్టు ఆదేశాల పేరుతో మా ఆశలపై నీళ్లు చల్లుతారా . ఇది చాలా అన్యాయం” అని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లకు చెందిన ప్రకాష్‌రావు బీబీసీ కి చెప్పారు.

“2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు మేం అర్హులం, కానీ అప్పుడు పరీక్ష జరగలేదు.. ఏడాది తరువాత పరీక్ష నిర్వహిస్తుండటంతో మా వయో పరిమితి దాటిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 44 ఏళ్ల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని కోరుకున్నాం” అని తాజా డీఎస్సీలో అనర్హులైన నందిగామకి చెందిన సీతారాములు బీబీసీతో అన్నారు.

ఇలా వీరిద్దరే కాదు.. 44ఏళ్ల వయో పరిమితి నిబంధనతో వేలాదిమంది జూన్‌ 6న జరిగే పరీక్షకు అనర్హులయ్యామని చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ, చంద్రబాబు సర్కారు, ఏపీ  హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పరీక్షలు

చంద్రబాబు సీఎంగా 2024 జూన్‌ 12న పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ తొలిసంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు.

దానికి సరిగ్గా నాలుగు నెలల ముందు 2024 ఫిబ్రవరి 12న వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చినప్పటికీ పరీక్షలు జరగలేదనీ ఇప్పుడు తాము వీలైనంత త్వరగానే పరీక్షలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఎస్సీ వర్గీకరణ తర్వాతే డీఎస్సీ నిర్వహిస్తామని ఆ తదుపరి ప్రకటించారు.

ఇలా దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రభుత్వం ఏప్రిల్‌ 20న షెడ్యూల్‌ విడుదల చేసింది.

జూన్‌ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తోంది.

ప్రతి రోజూ రెండు సెషన్లలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించనుంది.

ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో కూడా డీఎస్సీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

మొత్తం 3లక్షల 35 వేల 401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

చివరి పరీక్ష పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ విడుదల చేస్తారు. కీ పై అభ్యంతరాలు స్వీకరించడానికి 7 రోజుల సమయం ఇస్తారు.

అభ్యంతరాలు పూర్తయిన రోజు నుంచి 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.

ఆ తరువాత 7 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను ప్రకటిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ, చంద్రబాబు సర్కారు, ఏపీ  హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

పరీక్షల వాయిదా కుదరదన్న హైకోర్టు

గత ఏడాది ఫిబ్రవరి 12న జారీచేసిన ఏపీ డీఎస్సీ–2024కు తాము వయోపరంగా అర్హులమని, దానిని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌ 20న మరో నోటిఫికేషన్‌ జారీ చేయడం వల్ల ఈ కొత్త నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అనర్హులమయ్యామని, అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ ప్రస్తుత డీఎస్సీకి అర్హులుగా ప్రకటించాలని కోరుతూ కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.

మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు కేవలం 45 రోజుల షెడ్యూల్‌ ప్రకటించడం సహేతుకం కాదని పరీక్షలు వాయిదా వేయాలని మరికొందరు అభ్యర్ధులు హైకోర్టుకు వెళ్లారు.

అదేవిధంగా 2011లో ప్రభుత్వం జారీచేసిన జీవో–51 ప్రకారం ఏడాదికి రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాల్సి ఉందని, అందుకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్‌ నిర్వహించి డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌ జారీచేయడం చట్ట విరుద్ధమంటూ మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

సీబీఎస్‌ఈ(పదో తరగతి)లో మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు చదివామని, డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ అర్జీలను తిరస్కరించారంటూ ఓ అభ్యర్ధి వ్యాజ్యం వేశారు.

హౌస్ మోషన్‌లో దాఖలైన ఈ పిటిషన్లపై ఈనెల 2వ తేదీన సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. డీఎస్సీ పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లన్నీ కొట్టేసింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో స్టే ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ, చంద్రబాబు సర్కారు, ఏపీ  హైకోర్టు

ఫొటో సోర్స్, facebook.com/KSLakshmanaRaoMLC

వాళ్లకీ అవకాశం ఇవ్వండి: కేఎస్‌ లక్ష్మణరావు

“ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రే పరీక్షల నిర్వహణకు ఏడాది టైం తీసుకుంటున్నారు.. అందుకు తగిన కారణాలు ఉండొచ్చు.. ఆ క్రమంలో అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలి కదా.. 47ఏళ్లకు పెంచమని అభ్యర్ధులు డిమాండ్‌ చేశారు. కనీసం 46ఏళ్లకి పెంచినా 30వేలమంది అభ్యర్థులకు పరీక్షలు రాసే అవకాశం దక్కేది.. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంది. దీనివల్ల చాలామంది డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాట నిజం” అని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు బీబీసీ వద్ద అన్నారు.

‘‘నవోదయ, కేంద్రీయ విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లో ఫస్ట్‌ లాంగ్వేజీ ఇంగ్లీషు ఉంటుంది.. ఇలా ఉంటే డీఎస్సీ రాసేందుకు అనర్హులని చేయడం సరికాదు.. అదే సీబీఎస్‌ఈలో ఫస్ట్‌ లాంగ్వేజీ ఇంగ్లీషు ఉన్న వాళ్లు బీఈడీ, టెట్‌ రాశారు.. మరి డీఎస్సీకి వచ్చిన అభ్యంతరం ఏమిటి’’ అని లక్ష్మణరావు ప్రశ్నించారు.

‘‘అదేవిధంగా డిగ్రీలో ఓసీలకు 50శాతం మార్కులు వస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులనే నిబంధన కూడా సరికాదనీ, నిజానికి యూపీఎస్సీ పోటీ పరీక్షలకి కూడా ఇలాంటి నిబంధన లేదని’’ లక్ష్మణరావు గుర్తు చేశారు.

మొత్తంగా ఇలాంటి నిబంధనల వల్ల లక్షమంది అభ్యర్ధులు నష్టపోయి ఉంటారు. వారంతా వ్యతిరేకమైనట్టే కదా.. ఎందుకిలా’’ అని ప్రశ్నించారు ఆయన.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ, చంద్రబాబు సర్కారు, ఏపీ  హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

పరీక్షల నిర్వహణకు సిద్ధమైన ప్రభుత్వం

“లోకేష్‌కు విద్యాశాఖను చూసే టైం ఉండటం లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే.. ఈ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని యత్నించినప్పటికీ టైం ఇవ్వలేదు. ఆయన అధికారులపై అంతా వదిలేస్తే వాళ్ళు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని అనుకుంటున్నాను.. ఇప్పటికైనా లోకేష్‌ విద్యావ్యవస్థపై దృష్టి పెట్టాలి, సమయం వెచ్చించాలి” అని లక్ష్మణరావు సూచించారు.

డీఎస్సీ పరీక్షలపై అభ్యంతరాలు ఉన్నవాళ్లు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలిచ్చేసింది. ఇక ఎవరి అభ్యంతరాలను మేం పట్టించుకోం.. మా దృష్టంతా పరీక్షల నిర్వహణపైనే ఉంది. ఇప్పటికే హాల్‌టికెట్లను పంపిణీ చేసేశాం. ఎటువంటి గందరగోళం లేకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహిస్తాం” అని ఏపీ ఎస్‌సిఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్ ట్రైనింగ్‌), డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి.కె.రెడ్డి బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS