SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
6 జూన్ 2025
గాజాలో పరిస్థితులు నరకం కంటే దారుణంగా ఉన్నాయని ‘ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్(ఐసీఆర్సీ)’ చీఫ్ బీబీసీతో చెప్పారు.
గాజాలో జరుగుతున్న దారుణాలను గమనించాక “మానవత్వం విఫలమవుతోంది” అని ఐసీఆర్సీ అధ్యక్షురాలు మీర్యానా స్పోల్జారిక్ బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఏప్రిల్లో ఆమె గాజాలో పరిస్థితులను “భూమి మీద నరకం” అని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ‘‘మీరు ఈ మాట అన్న తరువాత మీ ఆలోచనను మార్చే పరిణామం ఏదైనా అక్కడ జరిగిందా?’’ అని ప్రశ్నించా.
“పరిస్థితి మరింత దారుణగా మారింది. అక్కడ జరుగుతున్న దాన్ని మేం చూడలేక పోతున్నాం. అక్కడి విధ్వంసం, వాళ్లు అనుభవిస్తున్న బాధ ఆమోదయోగ్యమైన, చట్టపరమైన, నైతికపరమైన, మానవీయ ప్రమాణాలను దాటిపోయింది”
“మరీ ముఖ్యంగా, మనం గౌరవం పూర్తిగా కోల్పోయిన ప్రజలను చూస్తున్నాం. ఇది నిజంగా మనందరినీ కలచివేయాలి” అని ఆమె చెప్పారు.
ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయించేందుకు, పాలస్తీనీయన్ల కష్టాలను ముగించేందుకు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని తప్పనిసరిగా ఆపాలని ఆమె కోరారు.
ఐసీఆర్సీ అధ్యక్షురాలు తన పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు. అవి నైతికంగా చాలా బలమైనవి.
ఐసీఆర్సీ ప్రపంచ మానవీయ సంస్థ. ఒకటిన్నర శతాబ్దాలుగా ఈ సంస్థ యుద్ధాలలో ప్రజల బాధలను తగ్గించడానికి కృషి చేస్తోంది. ఈ సంస్థ జెనీవా ఒప్పంద సంరక్షకురాలు కూడా. ఈ ఒప్పందం యుద్ధం జరుగుతున్నప్పుడు పౌరులను రక్షించేందుకు ఉద్దేశించినది. వీటిని ఎవరు పాటిస్తున్నారో చూసే బాధ్యత ఈ సంస్థది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పౌరుల మారణ హోమం జరగకుండా 1949లో ఓ కొత్త ఒప్పందాన్ని తీసుకొచ్చారు.


ఫొటో సోర్స్, Getty Images
ఆత్మ రక్షణకే గాజాలో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెప్పిన విషయాన్ని నేను ఆమెకు గుర్తు చేశాను.
దీనిపై ఆమె స్పందిస్తూ “ప్రతి దేశానికి తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని” చెప్పారు.
“తన బిడ్డలు సురక్షితంగా ఉండేలా చూసే హక్కు ప్రతి తల్లికి ఉంటుంది. బందీలను తీసుకెళ్లడం ఏ మాత్రం క్షమించరానిది. అలాగే పిల్లలను ఆహారం, ఆరోగ్యం, భద్రతకు దూరం చెయ్యడం కూడా క్షమించరానిది. ప్రతి యుద్ధంలో శత్రువుల పట్ల వ్యవహరించాల్సిన నియమాలు అమల్లో ఉన్నాయి” అని ఐసీఆర్సీ అధ్యక్షురాలు చెప్పారు.
అంటే 2023 అక్టోబర్ 7న హమాస్, ఇతర సాయుధ పాలస్తీనియన్లు 1200 మందిని హత్య చేయడం, 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను ధ్వంసం చేయడం 50వేల మంది పాలస్తీనీయులను చంపేయడాన్ని సమర్థించవచ్చా?
“జెనీవా ఒప్పందాలను అగౌరవపరచడం లేదా వాటిని తప్పుదారి పట్టించడం సమర్థనీయం కాదు. ఏదేమైనా నియమాలను ఏ పక్షం కూడా ఉల్లంఘించకూడదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే జెనీవా ఒప్పందంలో ప్రతి మనిషికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్లో బాలుడికి ఎలాంటి రక్షణలు ఉన్నాయో, గాజాలో బాలుడికి కూడా అలాంటివే ఉన్నాయి”
మీ పిల్లవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవచ్చు, అతనికి ఇలాంటి రక్షణ అవసరం వస్తుందేమో అనే విషయం మీకు కూడా తెలియదు” అని ఆమె అన్నారు.
గాజాలో పరిణామాల గురించి ఐసీఆర్సీ ఇచ్చే సమాచారానికి విశ్వసనీయత ఉంది. ఇజ్రాయెల్ గాజాలోకి బీబీసీ సహా, అంతర్జాతీయ వార్తా సంస్థలను అనుమతించడం లేదు. జర్నలిస్టులను ఆ ప్రాంతంలోకి రానీయడం లేదు. గాజాలో 300కి పైగా ఐసీఆర్సీ సిబ్బంది రిపోర్టింగ్ చేస్తున్నారు. వారిలో 90శాతం మంది పాలస్తీనీయన్లు. యుద్ధంలో ముఖ్యమైన ఘటనలను వారు రికార్డు చేస్తున్నారు.
గాజాలో ఉన్న తమ టీమ్ లీడర్తో మీర్యానా స్పోల్జారిక్ ప్రతి రోజూ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా మద్దతున్న గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ రఫాలో సహాయ సామగ్రి పంపిణీ చేస్తున్న సమయంలో అనేకమంది పాలస్తీనియన్లు మరణించిన ప్రాంతానికి ఐసీఆర్సీ నిర్వహిస్తున్న ఆసుపత్రి సమీపంలోనే ఉంది.

ఫొటో సోర్స్, Reuters
ఐక్యరాజ్యసమితి మాదిరిగా ఐసీఆర్సీ కూడా కొత్త ఆపరేషన్లో పాల్గొనడం లేదు. ఆకలితో అలమటిస్తూ, నిరాశతో ఉన్న వేల మంది పౌరులను చురుకుగా ఉన్న యుద్ధ ప్రాంతం గుండా తీసుకెళ్లడం కొత్త విధానంలో ప్రాథమికంగా కనిపిస్తున్న లోపం.
“పని చేస్తున్న దాన్ని, పని చేయని దానితో మార్చడం, దాన్ని ముక్కలు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు” అని ఆమె చెప్పారు.
గత కొన్ని రోజుల్లో, గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ వద్దకు ప్రజలు భారీగా వచ్చి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు రెండుసార్లు జరగడాన్ని అక్కడకు సమీపంలోని తమ ఫీల్డ్ హాస్పిటల్ వద్ద ఉన్న ఐసీఆర్సీ వైద్య బృందాలు రెండుసార్లు చూశాయి.
“గాజాలో ఎక్కడా భద్రత లేదు. ఎక్కడా లేదు. పౌరులకు, బందీలకు కూడా. అది నిజం. మా ఆసుపత్రి కూడా సురక్షితం కాదు. యుద్ధం మధ్య మనం పని చేసే పరిస్థితిని మరోసారి నేను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు” అని మీర్యానా స్పోల్జారిక్ అన్నారు.
కొన్ని రోజుల కిందట ఓ బాలుడిని టెంట్లో ఉంచి చికిత్స చేస్తున్నప్పుడు, ఓ బుల్లెట్ టెంట్ నుంచి దూసుకుపోయింది.
“మా సిబ్బందికి కూడా భద్రత లేదు. వాళ్లు రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. వాళ్లంతా విసిగిపోయారు. ఇది చాలా దారుణం. ఇది సహనస్థాయిని దాటిపోయింది” అని ఐసీఆర్సీ అధ్యక్షురాలు అన్నారు.
మంగళవారం ఉదయం కొన్ని గంటల వ్యవధిలో రఫాలోని ఆసుపత్రికి 184 మంది పేషెంట్లు వచ్చారు. అందులో 19 మంది ఆసుపత్రికి వచ్చాక చనిపోయారు. ఆ తర్వాత మరో 8 మంది మరణించారని ఐసీఆర్సీ చెప్పింది. ఏడాది కిందట ఈ ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ఒకే సంఘటనలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి.
ఇది మంగళవారం తెల్లవారు జామున జరిగింది. దక్షిణ గాజాలో సహాయ పంపిణీ స్థలంలో గుమిగూడిన పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపడంతో అక్కడ భయంకరమైన దృశ్యాల గురించి ఐసీఆర్సీ మెడిక్స్, పాలస్తీనా సాక్షులు వివరించారు. ఇది “పూర్తిగా మారణహోమం” అని విదేశీ ప్రత్యక్ష సాక్షి ఒకరు అన్నారు.
అయితే ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటన మరో విధంగా ఉంది. అందులో “అనేక మంది అనుమానితులు” ఇజ్రాయెల్ బలగాల వైపు కదులుతున్నారని “వారికి కేటాయించిన మార్గాల నుంచి పక్కకు వస్తున్నారని” ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని హెచ్చరించేందుకు తమ బలగాలు “గాలిలోకి కాల్పుల జరిపాయని.. కొంతమంది అనుమానిత వ్యక్తులు సైనికుల వైపు రావడంతో వారు దగ్గరగా వచ్చిన తర్వాత వారిపై కాల్పులు జరిపినట్లు” అందులో ఉంది.
ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ఆదివారం మాదిరిగానే పాలస్తీనియన్లపై కాల్పులు జరిపారన్న వాదనను ఇజ్రాయెల్ సైన్యం తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Reuters
ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం, యుద్ధం, అమానవీయ పరిస్థితుల గురించి ఐసీఆర్సీ ఆందోళన చెందుతున్నట్లు స్పోల్జారిక్ చెప్పారు.
“ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు, ప్రాంతాలను దాటి ఈ ప్రపంచాన్ని దురదృష్టకరమైన ప్రదేశంగా మారుస్తున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాథమిక హక్కులను కాపాడే నియమాలను మనం తుంగలోకి తొక్కేస్తున్నాం” అని ఆమె అన్నారు.
కాల్పుల విరమణ లేకపోతే ఆ ప్రాంతం భవిష్యత్ ఏంటా అని ఆమె ఆందోళన చెందుతున్నారు.
“ఇది చాలా ముఖ్యం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు సరైన మార్గం. మీరు ఆ మార్గాన్ని శాశ్వతంగా నాశనం చేస్తే, ఈ ప్రాంతంలో భద్రత ఎన్నటికీ కనిపించదు. ఇప్పటికీ ఆలస్యం ఏం కాలేదు. మనం దీన్ని ఆపవచ్చు”
‘‘ప్రపంచ దేశాల నాయకులు బాధ్యత తీసుకోవాలి. వారు ఏదో ఒకటి చేయాలని, వారు చేయగలిగినంత చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు ప్రతిధ్వనిస్తుంది. వారి వెంట పడుతుంది. వారి ఇంటికి వస్తుంది” అని మీర్యానా అన్నారు.
ఐసీఆర్సీని జెనీవా ఒప్పందానికి రక్షకుడిగా భావిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఒప్పందంలో చేర్చిన నాలుగో తీర్మానం యుద్ధాల్లో పౌరుల హక్కులను కాపాడుతుంది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడులకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సమర్థన కాదనేది ఐసీఆర్సీ అధ్యక్షురాలి అభిప్రాయం.
“ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, నిబంధనలను ఉల్లంఘించే హక్కు ఏ పక్షానికీ లేదు” అని ఆమె అన్నారు.
హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపి, 251 మందిని బందీలుగా పట్టుకెళ్లిన తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించింది.
అప్పటి నుంచి గాజాలో 54,607 మంది చనిపోయారు. మార్చ్ 18న తిరిగి దాడులు ప్రారంభించిన తర్వాత మరో 4335 మంది చనిపోయారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.
రెండు పక్షాలు దాడులు ఆపాలని ఐసీఆర్సీ అధ్యక్షురాలు విజ్ఞప్తి చేశారు.
“జరుగుతున్న దాన్ని చూస్తూ మనం ఊరికే కూర్చోలేం. ఇది మనల్ని వెంటాడుతుంది” అని మిర్యానా అన్నారు.అంతర్జాతీయ సమాజం ఇప్పుడు చేస్తున్న దాని కంటే ఇంకా ఎక్కువ చేయాలని’’ ఆమె పిలుపిచ్చారు.
“ప్రస్తుతం గాజాలో జరుగుతున్న దానిని ఆపడానికి ప్రతి దేశం శాంతియుత మార్గంలో తమ ప్రయత్నాలను చేయాల్సి ఉంది” అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS