SOURCE :- BBC NEWS

మిగ్యుల్ ఉరిబ్ టర్బే

ఫొటో సోర్స్, Getty Images

కొలంబియా రాజధాని బొగోటాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బేపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

మూడు రౌండ్లు ఆయనపై కాల్పులు జరపగా, అందులో రెండు బుల్లెట్లు నేరుగా తలపై కాల్చాడు దుండగుడు.

39 ఏళ్ల ఈ సెనేటర్‌ శనివారం ఓ పార్కులో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

15 ఏళ్ల అనుమానితుడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఉరిబ్ ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించాలని ఆయన భార్య మారియా క్లాడియా తారాజోనా ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘ఉరిబ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులకు మార్గం చూపాలని భగవంతుడిని చేతులెత్తి ప్రార్థిద్దాం.” అని మారియా క్లాడియా తారాజోనా అన్నారు.

సెంట్రో డెమొక్రాటికో పార్టీ ఈ దాడిని ఖండించింది. ఈ దాడి కొలంబియాలో ప్రజాస్వామ్యానికి, స్వతంత్రతకు ముప్పుగా ఆ పార్టీ పేర్కొంది.

ప్రసంగిస్తుండగా ఆయన తలపై కాల్పులు జరిగినట్లు ఆన్‌లైన్‌లో షేర్ అయిన ఫుటేజ్‌లలో కనిపిస్తోంది.

కాల్పులు జరిగిన వెంటనే అక్కడున్న వారంతా భయాందోళనతో పరుగులు తీసినట్లు ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోల్లో కనిపిస్తోంది.

మోకాలిపై ఒకసారి, తలపై రెండుసార్లు ఆయనపై కాల్పులు జరిపినట్లు పారామెడికల్ సిబ్బందిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

బుల్లెట్ గాయాలు తగిలిన ఉరిబ్‌ను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ దాడిని ఖండించారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై కాదు, మొత్తం ప్రజాస్వామ్యం జరిగిన హింసాత్మక చర్యగా పెట్రో పేర్కొన్నారు.

రక్షణ మంత్రి పెడ్రో శాంచెజ్ కూడా ఈ దాడిని ఖండించారు. ఈ దాడి వెనుకాల ఎవరున్నారో తెలియజేసినవారికి భారీ మొత్తంలో రివార్డ్ అందిస్తామని ప్రకటించారు.

అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో కూడా ఈ దాడిని ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష ముప్పు అన్నారు.

అయితే, ఈ దాడి వెనుకాల ఉన్న అనుమానితుల ఉద్దేశం ఏంటో ఇంకా తెలియలేదు.

జాతిని ఉద్దేశించి వీడియోలో ప్రసంగించిన అధ్యక్షుడు గుస్తావో పెట్రో.. ఉరిబ్ త్వరగా కోలుకోవాలని కొలంబియా ప్రజలు ప్రార్థించాలని కోరారు. ఇది ఒక బాధాకరమైన రోజుగా పెట్రో అభివర్ణించారు.

గుస్తావో పెట్రోకు ప్రధాన విమర్శకుడైన ఉరిబ్ వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తన అభ్యర్థిత్వాన్ని అక్టోబర్ నెలలో ప్రకటించారు. 2022 నుంచి ఆయన సెనేటర్‌గా ఉన్నారు.

కొలంబియాలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఉరిబ్. ఆ దేశ లిబరల్ పార్టీతో అనుబంధాలు కూడా ఉన్నాయి.

పాబ్లో ఎస్కోబార్ నడిపిన మెడిలిన్ డ్రగ్స్ కార్టెల్ 1991లో ఉరిబ్ తల్లి, జర్నలిస్ట్ డియానా టర్బేను కిడ్నాప్ చేసి హత్య చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)