SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
12 నిమిషాలు క్రితం
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్ కూడా దాడులు చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఇంతలో భారత్, పాకిస్తాన్ తమ ప్రతినిధులను వివిధ దేశాలకు పంపాయి. ఉగ్రవాదం, సరిహద్దు భద్రత సమస్యలపై భారత్ ఆయా దేశాల మద్దతు కోరింది. అయితే, పాకిస్తాన్ మాత్రం మానవ హక్కులు, ప్రాంతీయ అస్థిరత అంశాలను లేవనెత్తుతోంది.
ఇంతకీ ఇది కేవలం దౌత్య పోరాటమా లేదంటే రెండు దేశాల అంతర్గత రాజకీయాలు, సైనిక, అధికార సమీకరణాలు, మీడియా కథనాలు విషయాన్ని మరింత క్లిష్టతరం చేశాయా?
భారత్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కొందరు దీన్ని దేశ భద్రతా సమస్యగా భావిస్తుండగా, రాజకీయ లాభం కోసం చేస్తున్నట్లు మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఇంతకీ, ఈ వివాదం సరిహద్దు వరకే పరిమితమైందా? దౌత్య పరంగా ఏం జరుగుతోంది? గత నెలలో మోదీ ప్రభుత్వ చర్యలు ప్రజల మద్దతు పొందడంలో సహాయపడ్డాయా?
పాకిస్తాన్ చర్యలు అక్కడి సైన్యం, ప్రభుత్వ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? రెండు దేశాలు అనుసరించిన దౌత్య మార్గం ఎంతవరకు ప్రభావవంతంగా ఉంది?
కలెక్టివ్ న్యూస్రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ బీబీసీ హిందీ వీక్లీ కార్యక్రమం ‘ది లెన్స్’లో ఈ ప్రశ్నలన్నింటినీ చర్చించారు.
సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనికా రఖ్రా, బీబీసీ ఉర్దూ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఆసిఫ్ ఫరూఖీ చర్చలో పాల్గొన్నారు.


పహల్గాం దాడి తర్వాత భారత్లో ఏం మారింది?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్నినెలల సమయముంది. కానీ, బీజేపీ, మోదీ ప్రభుత్వం ప్రజల మద్దతు పొందే ప్రక్రియను వేగవంతం చేశాయి. దీన్ని ఎలా చూడవచ్చు?
ఈ ప్రశ్నకు సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి సమాధానమిస్తూ “దేశంలో, ప్రపంచంలో అనేక ఉగ్రదాడులు జరిగాయి. కానీ, పహల్గాం దాడిలోని అనాగరికత ఇంతకుముందు చూడలేదు. మహిళలు, పిల్లలు, కుటుంబాల ముందు 26 మంది పురుషులను అక్కడికక్కడే చంపేశారు” అని అన్నారు.
“ఇది ఆ కుటుంబాలను బాధించింది కానీ, ఆ గాయం ప్రజలను ఏకం చేసింది. ముంబయి దాడులు, కార్గిల్ యుద్ధం కూడా ప్రజలను అంతగా ఏకం చేయలేదు” అని ఆమె అభిప్రాయపడ్డారు.
“ఆర్టికల్ 370 రద్దు చేసినపుడు కశ్మీర్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ, అదే కశ్మీర్ నేడు దేశంతో నిలబడింది. హిందూ, ముస్లింల మధ్య వివాదం లేదు” అని నీరజా చౌదరి అన్నారు.
ఈ అంశంపై ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నాయని, పార్లమెంటు సమావేశం కూడా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాలు, దౌత్యం ఇలా ప్రతిదీ ఉంటుందన్నారు. ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా జరుగుతుందని అయితే, ఈ సంఘటన తర్వాత ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శించాయని నీరజ గుర్తుచేశారు. ఇది సానుకూల విషయమన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్లో ఏం మారింది?
పాకిస్తాన్లో అక్కడి ప్రభుత్వం, సైనిక నాయకత్వానికి మద్దతు విషయంలో పెద్ద మార్పు కనిపించిందని బీబీసీ ఉర్దూ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఆసిఫ్ ఫరూఖీ అన్నారు.
“గత రెండు, మూడేళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటి నుంచి ఆయన పార్టీ పాక్ ప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తోంది. సోషల్ మీడియా, రాజకీయ వేదికలలో వారిని విమర్శిస్తూ ఉన్నారు. వారి ఇబ్బందులు రోజురోజుకూ పెరిగాయి, కానీ భారత్, పాక్ ఘర్షణ మొత్తం పరిస్థితిని మార్చేసింది” అని ఫరూఖీ అన్నారు.
“ఇది పాక్ రాజకీయాలకు, సైన్యానికి విజయవంతమైన సమయం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంది?
పహల్గాం దాడిని ప్రపంచం ఖండించింది. కానీ, భారత్, పాక్ మధ్య ఘర్షణ విషయంలో ప్రపంచ దేశాల దౌత్యపరమైన స్పందన ఎలా ఉంది?
ఈ ప్రశ్నకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కనికా రఖ్రా స్పందిస్తూ “భారత ఆపరేషన్ సిందూర్కు కూడా మద్దతు లభించింది. ప్రతి దేశానికి దాని భద్రతపై హక్కు ఉందని రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఎక్స్లో తెలిపారు. వివిధ దేశాల ప్రభుత్వాలలో పనిచేసిన చాలామంది భారత్కు మద్దతు ఇచ్చారు”అని అన్నారు.
పాకిస్తాన్ కూడా దేశమే కాబట్టి, ఆయా దేశాలు బ్యాలెన్స్ పాటించాయని కనికా అభిప్రాయపడ్డారు. కొందరు బహిరంగంగా మద్దతు ఇస్తే, మరికొందరు నిశ్శబ్ద స్వరంతో మద్దతుగా నిలిచారని అన్నారు.
“భారత ప్రతినిధి బృందం(ఎక్కడికి వెళ్లినా) ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో, రాబోయే రోజుల్లో ఈ సమస్య ఆయా దేశాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరించడంలో వారు విజయం సాధించారు” అని కనికా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
దౌత్య రాజకీయాలు
విదేశాలకు వెళ్లిన ఏడుగురు భారత ప్రతినిధుల బృందంలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ను చేర్చడం నుంచి ఆయన వ్యాఖ్యలపై స్పందించడం వరకు, కాంగ్రెస్ వ్యవహార శైలి ఎలా ఉంది?.
ఈ ప్రశ్నపై నీరజా చౌదరి మాట్లాడుతూ “ఇది పార్లమెంటరీ ప్రతినిధి బృందం కాదు, ప్రభుత్వ ప్రతినిధి బృందం. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడి ఆ పార్టీ నుంచి పేర్లను సూచించాల్సిందిగా కోరడంతో మరోలా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ నాలుగు పేర్లను ఇచ్చింది. అందులో నుంచి ఆనంద్ శర్మను తప్ప ముగ్గురి పేర్లను తొలగించారు. వేరే వారిని చేర్చారు” అని అన్నారు.
“వారు పార్టీ నాయకత్వంతో విభేదాలున్న వ్యక్తులని కాంగ్రెస్ భావిస్తోంది. ఉదాహరణకు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఖర్గేపై పోటీ చేసిన శశి థరూర్ – ఇది భిన్నాభిప్రాయాలను సృష్టించింది” అని ఆమె అన్నారు.
“కాంగ్రెస్లో విభేదాలున్నాయని చూపించడానికి బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆ పార్టీ విశ్వసిస్తే, అది నిజం కావొచ్చు. కానీ, కాంగ్రెస్ కూడా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి” అని నీరజా చెప్పారు.
“ఇలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలో అనుభవజ్ఞులైన నాయకులు చూపించారు. క్రెడిట్ తీసుకునే బదులు బీజేపీ విమర్శల్లో కాంగ్రెస్ చిక్కుకుంది. ఇన్ని ఉన్నప్పటికీ, అందరు నాయకులు ఒకే గొంతుతో మాట్లాడారు” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, JOHN MACDOUGALL/AFP via Getty Images
భారత ప్రతినిధి బృందం గురించి దేశ రాజకీయాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ కూడా అనేక దేశాలకు తన ప్రతినిధులను పంపింది. మరి, పాకిస్తాన్ దౌత్యం అక్కడి రాజకీయాలపై ప్రభావం చూపిందా?
పాకిస్తాన్ ప్రతినిధి బృందంలో ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి చెందిన వారెవరూ లేరని బీబీసీ ఉర్దూ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఆసిఫ్ ఫరూఖీ అన్నారు.
అయితే, విదేశాలలో పాకిస్తాన్ ప్రతినిధి బృందం అభిప్రాయాలకు సానుకూల స్పందన కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
“దౌత్యంలో మీరు మీ అభిప్రాయాన్ని చెప్పే విధానం చాలా ముఖ్యం. బిలావల్ భుట్టో జర్దారీ ఎక్కడికి వెళ్లినా, పాకిస్తాన్ దృక్కోణాన్ని ప్రపంచానికి అందించిన తీరుకు ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు” అని ఫరూఖీ అన్నారు.
బిహార్ ఎన్నికల వరకు ఉంటుందా?
కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని బిహార్ ఎన్నికల వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి, ఎన్నికల వరకు ఈ అంశం అదే ప్రభావంతో ఉంటుందా?
“జాతీయవాదం ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా ఒక సమస్యగా మారింది. భారత ప్రతినిధులు విభేదాలను మరిచిపోయి దేశ స్వరాన్ని గట్టిగా వినిపించారని ప్రజలు అనుకుంటున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తత కొనసాగితే, ఇది అలాగే ఉంటుంది” అని సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి అన్నారు.
మరి, బిహార్ ఎన్నికలను ఈ అంశం ప్రభావితం చేస్తుందా?.
“బిహార్లో సాధారణంగా ప్రాంతీయ సమస్యలు తెరపైకి వస్తాయి. ప్రతిపక్షం కూడా ఇందులో భాగమైనందున కొంత ప్రభావాన్ని చూపొచ్చు” అని నీరజా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ను అంతర్జాతీయ అంశంగా మారుస్తున్నారా?
కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేసే ఆలోచన లేదని భారత్ మొదటి నుంచి చెబుతూనే ఉంది.
విదేశాలకు వెళ్లిన ఏ ప్రతినిధి బృందం కూడా కశ్మీర్ అంశంపై మాట్లాడలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ కనికా గుర్తుచేశారు.
“కశ్మీర్ సమస్యను భారత్ అంతర్జాతీయం చేయాలనుకోవడం లేదు. పాకిస్తాన్ తనను తాను రక్షించుకోవడంలో నిమగ్నమై ఉండటంతో, కశ్మీర్పై ప్రపంచం దృష్టి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది” అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)