SOURCE :- BBC NEWS

వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

ఎనిమిదేళ్ల క్రితం, చైనా సైనికుడు వాంగ్‌చి కథను బీబీసీ ప్రపంచానికి పరిచయం చేసింది. 1962 భారత్- చైనా యుద్ధం తర్వాత ఆయన భారత్‌లో చిక్కుకుపోయారు.

బీబీసీ కథనం ప్రచురితమైన తర్వాత ఆయన చైనా వెళ్లారు. కుమారుడితో కలిసి 55 ఏళ్ల తర్వాత చైనా వెళ్లి తన కుటుంబాన్ని కలుసుకున్నారు.

దీంతో తన జీవితం మంచి మలుపు తిరిగిందని ఆయన అనుకున్నారు. అయితే ఆరు దశాబ్దాలు భారత్‌లోనే గడిపిన తర్వాత వీసా వివాదం కారణంగా దేశం వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆయనకు నోటీసులిచ్చింది.

వీసా కారణంగా తమను భారత్ ‌నుంచి పంపించేస్తారన్న భయంతో ఉన్న వాంగ్ చి కుటుంబాన్ని బీబీసీ బృందం కలిసింది.

“నన్నిప్పుడు ఇండియా కూడా బహిష్కరిస్తుందా?” అని ఆయన అడిగారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

భారత్ – చైనా యుద్ధంలో..

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో టిరోడి గ్రామంలో 85ఏళ్ల వాంగ్‌చి 50ఏళ్లుగా నివసిస్తున్నారు.

“నేను 60 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్నాను. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి కూడా పంపించేస్తారా? నేను చైనాలో లేను. నా జీవితంలో 60 ఏళ్లు భారత్‌లోనే గడిపాను. నా పిల్లలు, కుటుంబం ఇక్కడే ఉంది. నాకు ఇక్కడ జీవించే హక్కు లేదా?” అని టిరోడి గ్రామంలోని తన ఇంటి వరండాలో మామిడి చెట్టు కింద కూర్చుని అలసిపోయిన కళ్లు, వణుకుతున్న గొంతుతో వాంగ్‌చి ప్రశ్నించారు.

ఆయన మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

“పాపా వీసా గడువు ముగిసిందని మే 6న మాకు నోటీసు అందింది. ఇప్పుడు వీసా పునరుద్ధరించుకోవాలి. లేదంటే పాపా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది” అని ఆయన కుమారుడు విష్ణువాంగ్ చెప్పారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసే విష్ణు “ఇంట్లో గడవడమే కష్టంగా ఉంది. నాన్నకు మందులు కొనాలి. నాకొచ్చే 10,15వేల రూపాయలతో పిల్లల చదువులు, వీసా సమస్యలను చూసుకోవాలి” అని విష్ణు అన్నారు.

వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

“వీసాను పునరుద్ధరించకపోతే విదేశీయుల చట్టం కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది” అని బాలాఘాట్ ఎస్పీ నాగేంద్ర సింగ్ చెప్పారు.

వీసా కాకుండా, వాంగ్‌చి కుటుంబం ఇతర పాలనా పరమైన సమస్యల్ని ఎదుర్కొంటోంది.

తన కుమారులకు కుల ధృవీకరణ పత్రం పొందడం చాలా కష్టంగా మారిందని విష్ణు చెబుతున్నారు.

“మాకు కుల ధృవీకరణ పత్రం కావాలని అడిగితే, మీ తండ్రి ఏ ప్రాంతానికి చెందిన వారు? ఆయన కులం ఏంటి? అని అడుగుతారు. మా తండ్రిది చైనా అని చెబితే, ఆయన కులం ఏంటో అక్కడ నుంచి రాయించుకుని తీసుకు రావాలని చెబుతారు. ఇప్పుడు అక్కడ నుంచి మేము ఎలా రాయించుకుని రాగలం?” అని విష్ణు చెప్పారు.

ఈ అంశంపై బీబీసీ జిల్లా అధికారులను సంప్రదించింది. “న్యాయపరమైన చిక్కుల వల్ల కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదని, ఆ కుటుంబానికి అవసరమైన మిగతా సాయం అంతా చేస్తున్నామని” అధికారులు చెప్పారు.

ఆరు దశాబ్దాలుగా వాంగ్ భారత్‌లో ఉంటున్నా, ఆయన జీవితం ఎన్నడూ స్థిరంగా లేదు.

చైనా సైనికుడు నుంచి టిరోడీ గ్రామంలో ‘రాజ్ బహదూర్’గా మారడం వరకు ఆయన జీవతంలో అనేక కష్టనష్టాలు ఎదురయ్యాయి.

వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

చైనా సైనికుడు భారత్ ఎలా వచ్చారు?

1962 భారత్- చైనా యుద్ధంలో దారి తప్పి వాంగ్‌చి భారత్‌లోకి వచ్చినట్లు చెప్పారు. ఆయన రెడ్ క్రాస్ వాహనం నడుపుతున్న డ్రైవర్‌ను సాయం కోరినప్పుడు, వాళ్లు తనను భారత సైన్యానికి అప్పగించారని అన్నారు.

తనను ఆరేళ్ల పాటు భారత్‌లోని వివిధ జైళ్లలో ఉంచారని వాంగ్ చెప్పారు. 1969లో చండీగఢ్ కోర్టు ఆయనను జైలు నుంచి విడుదల చేసింది. అయితే చైనా ప్రభుత్వం ఆయన్ను దేశంలోకి వచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన మధ్యప్రదేశ్‌లోని టిరోడి గ్రామానికి వెళ్లారు.

“ఒక చిన్న పొరపాటు నా మొత్తం జీవితాన్ని మార్చేసిందని నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది” అని వాంగ్ చెప్పారు.

“మొదట నేను దిల్లీ జైలులో ఉన్నాను. తర్వాత నన్ను నెలో, రెండు నెలలో రాజస్థాన్ జైల్లో పెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి పంజాబ్‌లో జైలుకు తరలించారు” అని వాంగ్ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

“1969లో చండీగఢ్ కోర్టు నన్ను విడుదల చేసింది. చైనా నన్ను అనుమతించలేదు. దీంతో నన్ను చండీగఢ్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోపాల్‌కు పంపించారు. తర్వాత అక్కడ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిరోడికి పంపించారు” అని వాంగ్ తాను ఈ గ్రామానికి ఎలా వచ్చారో వివరించారు.

ఈ గ్రామంలో ఆయన ప్రయాణం రాజాబహదూర్‌గా మారింది.

వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

టిరోడిలో కొత్త జీవితం

వాంగ్ జీవితం 1969లో చాలా మారిపోయింది. భారత్‌లో తన జీవితాన్ని నిర్మించుకునే పనిలో ఉంటూనే, చైనాలో ఉన్న తన కుటుంబ సభ్యుల్ని, తన తల్లిని కలుసుకునేందుకు ప్రయత్నం చేశారు.

క్రమేపీ టిరోడి గ్రామస్తులు వాంగ్‌ను తమలో ఒకరిగా గుర్తించడం మొదలు పెట్టారు. మొదట్లో ఆయనకు ఒక మిల్లులో పని దొరికింది. తర్వాత ఆయన సొంతంగా సరుకుల దుకాణం పెట్టుకున్నారు.

ఆయన పని చేస్తున్న మిల్లు యజమాని వాంగ్‌కు రాజా బహదూర్ అని పేరు పెట్టారు.

“నెమ్మదిగా భారత్‌లో స్థిరపడుతున్న సమయంలో టిరోడిలోని నా స్నేహితులు పెళ్లి చేసుకోవాలని నన్ను ఒత్తిడి చేశారు. నాకు అండగా ఉండేందుకు ఒక భాగస్వామి అవసరం అని చెప్పేవారు” అని వాంగ్ గుర్తు చేసుకున్నారు.

స్నేహితుల బలవంతం మీద వాంగ్ స్థానికురాలైన సుశీలను 1974లో పెళ్లి చేసుకున్నారు.

ఇరుగుపొరుగువారు ఆయన్ను బావమరిది అని పిలిచేవారు. వాంగ్ తన జీవితాన్ని నెమ్మదిగా పట్టాలకెక్కించే పనిలో పడ్డారు.

“ఒక వ్యక్తి చైనా నుంచి టిరోడి రావడం ఆ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయం. చైనా వాళ్లు ఎలా ఉంటారో చూద్దామని మేమంతా వెళ్లేవాళ్లం” అయన పొరుగింటి వ్యక్తి చెప్పారు.

మరోవైపు వాంగ్ చైనా వెళ్లి తన తల్లిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.2013లో ఆయన ప్రయత్నం విజయవంతమైంది. అదే ఏడాది చైనా ఆయనను తమ దేశ పౌరుడిగా గుర్తించి పాస్‌పోర్ట్ మంజూరు చేసింది.

వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

2017లో చైనా ప్రయాణం

పాస్‌పోర్టు జారీ చేసినప్పటికీ, వాంగ్ తన తల్లిని కలవలేకపోయారు. నాలుగేళ్ల తర్వాత 2017లో బీబీసీ ఆయన కథను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఆయనకు చైనా వెళ్లే అవకాశం ఏర్పడింది. ఆయన అక్కడ తన కుటుంబాన్ని కలుసుకున్నారు. అయితే వాంగ్ చైనా వెళ్లేసరికి ఆయన తల్లి మరణించారు.

తల్లిని గుర్తు చేసుకున్నప్పుడు ఆయన గొంతు వణికింది. “నా తల్లి చివరి క్షణాల్లో ఆమె వద్ద ఉండలేకపోయాను. ఆమె నా కోసం జీవితాంతం ఎదురు చూసిందని మా ఊరివాళ్లు చెప్పారు. చివరి రోజుల్లో ఆమె నన్ను గుర్తు చేసుకుని ఏడ్చేవారని అన్నారు” అని వాంగ్ వివరించారు.

“తల్లిని కలవలేకపోయాననే బాధ ఆయన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. అమ్మ గుర్తుకొస్తే చాలు ఆయన ఏడుస్తారు” అని విష్ణు చెప్పారు.

వాంగ్ చైనా నుంచి వచ్చిన కొన్ని రోజులకు ఆయన భార్య చనిపోయారు.

వాంగ్ చి, భారత్ చైనా యుద్ధం, మధ్యప్రదేశ్, చైనా

చైనా వెళ్లలేరు, భారత్ ఉండనీయదు

చైనా వెళ్లాలన్న ఆయన కల నెరవేరింది. అయితే ఆయన చైనా నుంచి వచ్చిన 8ఏళ్ల తర్వాత మరోసారి ఆయన కుటుంబం ఇబ్బందుల్లో చిక్కుకుంది.

ఇప్పుడు వాంగ్ శాశ్వతంగా భారత్‌లో ఉండలేరు. చైనాకు వెళ్లలేరు.

ఆయన శాశ్వతంగా చైనాలో ఉండేందుకు కూడా వీలు కాదు. చైనా ఆర్మీలో తన ఉద్యోగం గురించి అంతర్గత విచారణ జరుగుతోదంని వాంగ్ చెప్పారు.

మరోవైపు ఆయన పిల్లలను వదిలి దూరంగా వెళ్లడం సాధ్యం కాని పని.

ప్రస్తుతం ఆయనకు 85ఏళ్లు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది.

‘‘నేనిప్పుడు చైనాలో లేను. భారత్ నన్ను బహిష్కరిస్తుంది. నేను ఏ దేశానికి చెందినవాడిని? ఇప్పుడు నేనెక్కడికి వెళ్లాలి” అని వాంగ్ ప్రశ్నిస్తున్నారు?

“నాన్నకు చైనాలో కుటుంబం ఉంది. మేమిక్కడ భారత్‌లో ఉన్నాం. నా సొంత దేశం ఏది? ఇండియానా? చైనానా? అని ఆయన అప్పుడప్పుడు అడుగుతుంటారు. ఈ రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, వాటిని నడుపుతున్న పాలకులు మాకు సాయం చేయడం లేదు” అని విష్ణు చెప్పారు.

ఈ రెండు దేశాల మధ్య తన అస్తిత్వం, ఇంటి గురించి వాంగ్ వెదుకుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS