SOURCE :- BBC NEWS

ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, విమాన ప్రమాదం

2 నిమిషాలు క్రితం

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురికావడంలో అసలేం జరిగిందన్న విషయం సమగ్ర విచారణ తర్వాతే తేలుతుంది.

అయితే టేకాఫ్ తర్వాత కొద్ది సమయం విమానయాన రంగంలో ఎంతో కీలకమైనది. ఈ సమయంలో జరిగే ప్రమాదాలను ఛేదించడం సవాలుతో కూడుకున్న విషయం.

భారత నిపుణులు అమెరికా, బ్రిటన్ నిపుణులతో కలిసి ప్రమాదానికి కారణాలపై రానున్న రోజుల్లో దర్యాప్తు చేయబోతున్నారు.

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేకు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరగనుంది.

2011లో కమర్షియల్ సర్వీసుల్లోకి అడుగుపెట్టిన తర్వాత 787-8 డ్రీమ్‌లైనర్‌కు చెందిన విమానానికి ఇంత తీవ్ర ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 241మంది చనిపోయారు. మరికొందరు స్థానికులు మరణించారు.

టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోవడానికి కారణాలేంటనేదానిపై భారత్‌లోని విమానయాన రంగ నిపుణులు, పైలట్లతో బీబీసీ మాట్లాడింది. వారిలో కొందరు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. వారు భారత్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి తరచుగా బోయింగ్ 787-8 మోడల్ విమానాలను నడుపుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఎత్తులోకి వెళ్లేందుకు శ్రమించిన పైలట్లు

ప్రమాదానికి గురైన 787-8 డ్రీమ్‌లైనర్‌ను కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్‌లు నడుపుతున్నారు. వారిద్దరికీ విమానం నడపడంలో చాలా అనుభవం ఉంది. ఇద్దరూ కలిసి 9,000 గంటలపాటు విమానం నడిపారు. కమర్షియల్ ఎయిర్‌లైన్ పైలట్‌గా సభర్వాల్‌కు 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 1.39గంటలకు విమానం టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా చెప్పింది

బయలుదేరేటప్పుడు విమానంలో వంద టన్నుల ఇంధనం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. విమానం సామర్థ్యనికి తగ్గట్టుగా అందులో ఇంధనం ఉంది.

దాదాపుగా టేకాఫ్ అయిన వెంటనే కాక్‌పిట్ నుంచి మే డే కాల్ వచ్చిందని, ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది. మే డే కాల్ తర్వాత ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. అయితే విమానం ఎత్తులోకి వెళ్లేందుకు ఇబ్బందిపడిందని, ఆ సమయంలోనే తనకు పెద్ద శబ్దం వినిపించిందని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి రమేశ్ విశ్వాస్ కుమార్ మీడియాకు చెప్పారు.

విమాన ప్రమాదం దృశ్యాలను బీబీసీ వెరిఫై పరిశీలించింది. పక్కనే ఉన్న నివాసిత ప్రాంతం మీదగా విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్టు ఆ దృశ్యాల్లో కనిపించింది. విమానం 625 అడుగుల ఎత్తుకు చేరింది. తర్వాత కిందకు దిగుతూ చెట్లు, భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.

”రెండు ఇంజిన్లపై నియంత్రణ కోల్పోయిన సమయంలో స్పందించే సమయం కూడా పైలట్‌కు ఉండుండకపోవచ్చు” అని ఒక పైలట్ చెప్పారు. బీబీసీ వెరిఫై చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో విమానం 30 సెకండ్లపాటు గాలిలో ఉన్నట్టు చూపిస్తోంది.

నివాసిత ప్రాంతంలో విమానం కూలిపోయింది. ఈ ప్రాంతంలో ఆస్పత్రులు, అధికారిక భవనాలు ఉంటాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో, విమానం ప్రమాదం కారణంగా భవనాలు బాగా దెబ్బతిన్నాయి.

ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, విమాన ప్రమాదం

‘రెండు ఇంజన్లు విఫలమయ్యయాన్న ప్రచారం’

కేవలం వీడియోలు పరిశీలించి ఘోర విమాన ప్రమాదానికి కారణమేంటో చెప్పడం దాదాపు అసాధ్యం.

విమానం సమాచారాన్ని నిక్షిప్తం చేసే బ్లాక్ బాక్స్ పరిశీలించడం ద్వారా రానున్నరోజుల్లో కీలకమైన దర్యాప్తు జరుగుతుంది. శిథిలాలను పరిశీలిస్తారు. అయితే ఒత్తిడి లేదా శక్తి లేకపోవడం వల్ల పైకి ఎగరడానికి విమానం ఇబ్బంది పడినట్టు వీడియోల్లో కనిపిస్తోంది.

చాలా అరుదుగా జరిగే ‘రెండు ఇంజిన్లు ఫెయిల్యూర్’ ప్రమదానికి కారణమయ్యే అవకాశముందని కొందరు నిపుణులు అంటున్నారు. ప్రధాన ఇంజిన్ విఫలం అయినప్పుడు అత్యవసర సమయంలో విమానం నడిచేందుకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయగల రామ్ ఎయిర్ టర్బైన్(ఆర్ఏటీ) ఈ ఫ్లైట్‌కు ఉందా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రెండు ఇంజిన్లు విఫలమవ్వడమన్నది చాలా చాలా అరుదుగా వింటుంటాం. దీనికి ఎప్పుడూ చెప్పే కీలక ఉదాహరణ 2009లో జరిగిన ” మిరాకిల్ ఆఫ్ హడ్సన్” గురించి.

యూఎస్ ఎయిర్‌వేస్ ఎయిర్ బస్ ఏ320ని న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకు పక్షులు ఢీకొట్టడంతో రెండు ఇంజన్లు విఫలమయ్యాయి. అయితే ఆ విమానాన్ని పైలట్లు సురక్షితంగా దించగలిగారు.

ఇంధనలో లోపం లేదా బ్లాక్ అయిపోవడం వంటివాటి వల్ల కూడా రెండు ఇంజన్లు విఫలమవుతాయని ఓ సీనియర్ పైలట్ బీబీసీతో చెప్పారు. విమానం ఇంజిన్లకు ప్రత్యేకమైన ఇంధనం సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ బ్లాకయిపోతే, ఇంధనం అందదు. ఇంజిన్ ఆగిపోతుంది.

అందుబాటులో ఉన్న దృశ్యాలను గమనిస్తే రెండు ఇంజన్లు విఫలమైనట్టు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని మార్కో చాన్ అనే మాజీ పైలట్ బీబీసీ వెరిఫైకి చెప్పారు.

రెండు ఇంజన్లు విఫలమవ్వడమన్నది ”చాలా చాలా అరుదుగా జరిగే ఘటన” అని విమానయాన రంగ నిపుణులు మోహన్ రంగనాథన్ బీబీసీతో చెప్పారు.

దర్యాప్తులో సహకరించేందుకు తమ బృందాన్ని భారత్‌కు పంపుతున్నట్టు ఇంజన్ తయారీసంస్థ GE ఏరోస్పేస్ చెప్పింది. ఎయిర్ ఇండియాకు పూర్తి సహకారం అందిస్తున్నామని బోయింగ్ తెలిపింది.

ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

పక్షులు ఢీకొట్టాయా?

విమాన ప్రమాదానికి భారత్‌లో నిపుణులు అంచనావేస్తున్న మరో కారణం పక్షులు ఢీకొట్టడం.

పక్షి ఢీకొట్టడం విమానానికి చాలా ప్రమాదం. కొన్నిసార్లు ఇంజిన్లలో పక్షి చిక్కుకుపోతే అవి ఇంజిన్లకు పవర్ అందదు. గత ఏడాది జరిగిన దక్షిణ కొరియా జెజు ఎయిర్ విమాన ప్రమాదానికి ఇదే కారణం.

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర రీతిలో పక్షులు ఉంటాయని విమానశ్రయం గురించి తెలిసిన నిపుణులు, పైలట్లు బీబీసీతో చెప్పారు.

”అవెప్పుడూ చుట్టూనే తిరుగుతుంటాయి” అని రంగనాథన్ చెప్పారు. విమానశ్రయం నుంచి లోపలకు, బయటకు వచ్చిన ముగ్గురు భారత పైలట్లు సైతం ఇది నిజమేనని బీబీసీతో అన్నారు.

గుజరాత్‌లో ఐదేళ్ల కాలంలో పక్షి ఢీకొన్న ఘటనలు 462 నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గరే జరిగాయని 2023 డిసెంబరులో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ పార్లమెంట్‌కు తెలిపింది.

అహ్మదాబాద్‌లో 2022-23లో పక్షి ఢీకొట్టిన ఘటనలు 38 నమోదయ్యాయని ఎయిర్‌పోర్టు అథారిటీ డేటా తెలిపినట్టు 2023 సెప్టెంబరులో టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. అంతకుముందు 12 నెలలతో పోలిస్తే ఇది 35శాతం పెరిగింది.

2009లో ఎయిర్ ఇండియా విమానం కన్నా నాలుగు రెట్లకు పైగా ఎక్కువ ఎత్తులో 2,700 అడుగుల ఎత్తులో సీగల్స్ పక్షుల గుంపు కనిపించింది. ఆ సమయంలో భారత పైలట్లకు విమానాన్ని మరింత ఎక్కువ ఎత్తులోకి తీసుకెళ్లడానికి లేదా కిందకు దించడానికి అవకాశం లేదు.

రెండు ఇంజిన్లపై ప్రభావం పడితే తప్ప, పక్షి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువని సీనియర్ పైలట్ ఒకరు చెప్పారు.

ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

వింగ్ ఫ్లాప్‌ల వల్ల ప్రమాదం జరిగుంటుందా?

టేకాఫ్ సమయంలో విమానం ఫ్లాప్‌లు విచ్చుకోకపోయి ఉండొచ్చని బీబీసీ వెరిఫైతో మాట్లాడిన ముగ్గురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇతర పైలట్లు, విశ్లేషకులు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు.

టేకాఫ్ సమయంలో ఫ్లాప్‌లది కీలక పాత్ర. తక్కువ స్పీడు వద్ద విమానం పూర్తిగా పైకి ఎగిరేందుకు సాయపడతాయి.

అవి సరిగ్గా విచ్చుకోకపోతే, ప్రయాణికులు, ఇంధనంతో భారీగా ఉండే విమానాలు వేడిగా ఉండే వాతావరణం మధ్య పైకి ఎగరడానికి ఇబ్బంది పడతాయి.

”అహ్మదాబాద్‌లో గురువారం దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉంది. గాలి తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫ్లాప్‌లు బాగా విచ్చుకోవాలి. ఇంజన్ బలంగా పని చేయాలి” అని ఒక పైలట్ బీబీసీతో చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న లోపం కూడా భారీ ప్రమాదానికి కారణమవుతుంది.

ఎత్తుకు ఎగరడానికి విమానం ఇబ్బంది పడుతున్నట్టు, ప్రమాదానికి ముందు నెమ్మదిగా కిందికి వాలుతున్నట్లు గురువారం మధ్యాహ్నం బయటికొచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది.

అయితే ఫ్లాప్‌లు విచ్చుకోకుండా టేకాఫ్ అయితే, విమాన సిబ్బందిని అప్రమత్తం చేస్తూ 787 టేకాఫ్ కన్ఫిగరేషన్ వార్నింగ్ సిస్టమ్ నుంచి హెచ్చరికలు వచ్చే అవకాశముందని ఒక పైలట్ బీబీసీతో చెప్పారు.

ఫ్లాప్‌లు సరిగ్గా విచ్చుకున్నాయా లేదా అన్నది ఇప్పటిదాకా వెలువడిన వీడియో ఫుటేజ్‌లు చూసి నిర్ధరించడం కష్టమని బీబీసీ వెరిఫైతో మాజీ పైలట్ చాన్ చెప్పారు. అయితే అలాంటి తప్పిదం చాలా అసాధారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS