SOURCE :- BBC NEWS

అహ్మదాబాద్ విమానం

ఫొటో సోర్స్, Reuters

అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం జూన్ 12న కూలిపోయింది. ప్రమాదంలో ఒక బ్రిటిష్ ప్రయాణికుడు తప్ప విమానంలో ఉన్న వారందరూ మరణించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతుల్లో ఒకరు.

ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) నిర్దేశించిన అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తును ప్రారంభించిందని ఎక్స్‌లో ఆయన తెలిపారు.

“దీంతో పాటు, నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీ విమానయాన భద్రతను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను నివారించడానికి పని చేస్తుంది” అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా, బ్రిటన్ బృందాలు

ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్.

ప్రమాద సమయంలో ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు సహా 242 మంది ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందులో భారత పౌరులతో పాటు, 53 మంది బ్రిటిష్ వారు, ఒక కెనడియన్, ఏడుగురు డచ్ పౌరులు కూడా ఉన్నారు.

దీంతో, విమాన ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేయడానికి బ్రిటిషు దర్యాప్తు బృందం కూడా అహ్మదాబాద్‌కు చేరుకున్నట్లు యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు.

అమెరికాలో విమాన ప్రమాదాలను పరిశోధించే సంస్థ అయిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ నుంచి ఒక బృందం కూడా భారత్ చేరుకుంటోంది. విమాన ప్రమాదంపై దర్యాప్తులో భారత ఏజెన్సీలకు సహాయం చేస్తామని ఆ బృందం చెప్పింది.

అయితే, భారత్‌లో ఇది మొదటి విమాన ప్రమాదం కాదు, లేదా ఒక ప్రమాదంపై దర్యాప్తు జరగడం ఇదే మొదటిసారీ కాదు. మరి, ఈ సంస్థలు భారత్ ఎందుకు వస్తున్నాయి?

ఇంతకీ, దేశంలో విమాన ప్రమాదాలను ఎవరు దర్యాప్తు చేస్తారు?, దాని ప్రక్రియ ఏమిటి?.

ఎయిర్ ఇండియా ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

దర్యాప్తు ఎవరు చేస్తారు?

భారతదేశంలో విమాన ప్రమాదాలను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు అధికారుల బృందాన్ని ఆ సంస్థే ఏర్పాటు చేస్తుంది, వారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తారు.

అయితే, ‘ప్రమాదం కారణంగా ప్రభావితమైన సంస్థలను కూడా దర్యాప్తులో చేర్చవచ్చు’ అని విమానయాన నిపుణుడు మీను వాడియా చెప్పారు.

“అహ్మదాబాద్‌లో కూలిన విమానం తయారీదారు బోయింగ్, కాబట్టి బోయింగ్ సంస్థ కూడా దర్యాప్తులో చేరుతుంది. విమానంలో పెద్ద సంఖ్యలో బ్రిటిష్ ప్రయాణికులున్నారు, కాబట్టి బ్రిటిష్ ఏజెన్సీ అయిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కూడా ఇందులో పాల్గొంటోంది” అని అన్నారు.

“కానీ, ఆయా సంస్థల పాత్ర దర్యాప్తునకు సంబంధించిన చర్చలు, సమావేశాలకు మాత్రమే పరిమితం. వారు సూచనలను ఇవ్వగలరు. దర్యాప్తు చేయడం వారి అధికార పరిధి కాదు, ఏఏఐబీ బృందం మాత్రమే దర్యాప్తు చేస్తుంది” అని మీనూ తెలిపారు.

ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్

ఫొటో సోర్స్, AFP via Getty Images

దర్యాప్తు ఎలా జరుగుతుంది?

దర్యాప్తు సమయంలో ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుంటారనేది కేసును బట్టి ఉంటుంది. కానీ, ప్రతి దర్యాప్తు ప్రక్రియలో సాధారణంగా కనిపించే కొన్ని విషయాలు ఉన్నాయి.

ఉదాహరణకు, మొదట ప్రమాద స్థలాన్ని నియంత్రణలోకి తీసుకుంటారు. బ్లాక్ బాక్స్‌ను కనుగొంటారు. బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ డేటా రికార్డర్. ఇందులో విమాన ప్రయాణంలో పైలట్, కంట్రోల్ రూం మధ్య జరిగిన సంభాషణల సమాచారం రికార్డ్ అయి ఉంటుంది.

విమాన శిథిలాలను పరిశీలించి, ఆధారాలు సేకరిస్తారు. అలాగే, రాడార్ డేటా, నిర్వహణ రిపోర్టులు, పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణ రికార్డింగ్‌లు, వాతావరణ సూచనలు, భద్రతా కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తారు.

విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఎయిర్‌లైన్ నిర్వహణా సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు మొదలైన వారితో మాట్లాడటం ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తారు.

ఫోరెన్సిక్ దర్యాప్తు కూడా కీలకం. ఉదాహరణకు, పైలట్లు లేదా సిబ్బంది మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసినపుడు, వారు ఏదైనా వైద్య సమస్య లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నారా, లేదా తెలుసుకోవచ్చు.

అదే సమయంలో విమాన భాగాలను కూడా తనిఖీ చేస్తారు. కాగా, ప్రాథమిక దర్యాప్తు తర్వాతే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

దర్యాప్తు బృందంలో ఎవరుంటారు?

మీను వాడియా ప్రకారం, ఈ బృందంలో డాక్టర్లు, మానసిక వైద్యులు, ఇంజనీర్లు, పైలట్లు, మరికొందరు నిపుణులు ఉంటారు. వీళ్లు ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు.

దర్యాప్తు పూర్తయిన తర్వాత, ఆ రిపోర్టును ఏఏఐబీ విడుదల చేసి, దాని వెబ్‌సైట్‌లో పెడుతుంది. తుది రిపోర్టును ఐసీఏఓ, దర్యాప్తులో పాల్గొన్న అన్ని పార్టీలకు పంపుతారు.

దర్యాప్తు బృందం ఏవైనా భద్రతాపరమైన సూచనలు ఇస్తే, వాటిని డీజీసీఏ, ఈ దర్యాప్తులో పాల్గొన్న ఐసీఏఓ దేశాల విమానయాన విభాగాలకు పంపుతారు. తద్వారా వారు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఐసీఏఓ

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ ఐసీఏఓ?

ఐసీఏఓ అంటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ.

అమెరికాలోని చికాగోలో 1944లో అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంపై 52 దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం,ఈ దేశాలు (భారతదేశంతో సహా) అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని సురక్షితంగా, శాంతియుతంగా చేయడానికి కొన్ని నియమాలను రూపొందించుకున్నాయి.

ఈ నియమాలు గగనతల వినియోగం, భద్రతా ప్రమాణాలు, విమాన రిజిస్ట్రేషన్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విధానాలకు సంబంధించినవి. ఒప్పందంపై సంతకం చేసిన ప్రతి దేశం వాటిని పాటించాలి.

ఈ ఒప్పందం అనంతరం, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన ఐసీఏఓ ఏర్పడింది, ఇప్పటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని నిర్వహించడంలో ఈ సంస్థ సహాయపడుతుంది.

ఐసీఏఓ స్థాపనకు ముందు, అంటే 1944 సంవత్సరానికి ముందు, భారతదేశంలో విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసులను భారత విమాన చట్టం, 1934 కింద దర్యాప్తు చేసేవారు.

అప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఆ తర్వాత చికాగో సమావేశం జరిగి, భారత్ ఐసీఏఓ వ్యవస్థాపక సభ్యులలో ఒకటిగా మారింది, దీంతో ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా పని చేస్తోంది.

డీజీసీఏ

ఫొటో సోర్స్, Getty Images

డీజీసీఏ ఏం చేస్తుంది ?

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ ఒక జాతీయ పౌర విమానయాన సంస్థను ఏర్పాటు చేసింది. దీనిని డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని పిలుస్తారు.

భారతదేశంలో పౌర విమాన నియమాలు, భద్రతను డీజీసీఏ పర్యవేక్షిస్తుంది.

పైలట్లు, ఇంజనీర్లకు లైసెన్స్‌లు అందించడం, విమానయాన సంస్థలకు అనుమతులు, విమానం ప్రయాణానికి అనుకూలంగా ఉందో లేదో నిర్ధరించడం, విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడం, ఐసీఏఓ ప్రమాణాల ప్రకారం పని జరుగుతుందో లేదో నిర్ధరించడం – డీజీసీఏ బాధ్యత.

2012 వరకు, డీజీసీఏ విమాన ప్రమాదాలను దర్యాప్తు చేసేది. కానీ, డీజీసీఏ స్వయంగా నియమాలను రూపొందించి, ప్రమాదాలను కూడా పరిశోధిస్తుండటంతో దాని నిష్పాక్షికత గురించి ప్రశ్నలు తలెత్తాయి.

విమాన ప్రమాదాలను విమానయాన సంస్థ లేదా నియంత్రణ సంస్థతో సంబంధం లేని స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయాలని ఐసీఏఓ నియమాలు చెబుతున్నాయి.

అందుకే భారత ప్రభుత్వం 2012లో విమాన ప్రమాదాలను స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను ఏర్పాటు చేసింది.

అయితే, ఈ ఏఏఐబీ నిష్పాక్షికతనూ కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

మీను వాడియా బీబీసీతో మాట్లాడుతూ ‘ఏఏఐబీ ఒక స్వతంత్ర సంస్థ అని, పూర్తిగా నిష్పాక్షికంగా ఉందని దాని డైరెక్టర్ పేర్కొన్నప్పటికీ, అది భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కిందే ఉంది. అందువల్ల, ఈ సంస్థ లేదా దాని దర్యాప్తు నివేదికను పూర్తిగా నిష్పాక్షికంగా పరిగణించలేం’ అని అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)