SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
విమానం అలా టేకాఫ్ అయిందో లేదో పక్షుల గుంపు దానిని ఢీకొట్టింది. ఎయిర్పోర్టుకు తిరిగి రావడానికి చేసిన ప్రయత్నం విఫలమవుతుందని గ్రహించిన పైలట్, విమానాన్ని నదిలో దించారు.
ఆ విమానంలో ఉన్న 155 మంది ప్రాణాలతో బయటపడడం ఓ అద్భుతం.
ఈ ఘటన 2009లో న్యూయార్క్ నగరంలో జరిగింది. ప్రమాదానికి గురైన విమానం యూఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1549. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో విమానం ల్యాండ్ కావడంతో ఈ ఘటనను ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ అని అంటుంటారు.
నీళ్లల్లో విమానాన్ని ల్యాండ్ చేసిన కెప్టెన్ చెస్లీ సలెన్ బర్గర్. ఆయన్నే సల్లీ అని కూడా పిలుస్తుంటారు.
మీరు ‘సల్లీ’ సినిమా చూసి ఉండొచ్చు, అందులో టామ్ హాంక్స్ కెప్టెన్ సల్లీ పాత్ర పోషించారు. అందులో ఆయన అమెరికన్ పైలట్.
ఈ ఘటన జనవరి 15, 2009న జరిగింది. న్యూయార్క్లోని లాగ్వార్డియా విమానాశ్రయం నుంచి ఉత్తర కెరోలినాకు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది.


ఫొటో సోర్స్, Getty Images
నీటిపై విమానం, రెక్కలపై ప్రయాణికులు
టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు, పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. రెండు ఇంజిన్లు విఫలమయ్యాయి. సలెన్ బర్గర్ వెంటనే లాగ్వార్డియాకు మేడే కాల్ చేసి, తాను ఎయిర్పోర్టుకు తిరిగి వస్తున్నానని చెప్పారు. కానీ అది సాధ్యం కాలేదు.
సమీపంలోని టెటర్బోరో విమానాశ్రయంలో ల్యాండయ్యే అవకాశం కూడా లేదు. హడ్సన్ నది నీళ్లల్లో తాను ల్యాండ్ అవుతానని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు చెప్పారు సల్లెన్ బర్గర్. ఇది అత్యంత అరుదైనది, ప్రమాదకరమైనది.
పక్షులు ఢీకొట్టిన దాదాపు మూడున్నర నిమిషాల తర్వాత విమానం నదిలో దిగింది. విమానం వెనుక భాగం ముందు నీటిలోకి దిగింది. దీని వల్ల విమానంలోకి నీళ్లు వచ్చాయి. అయితే, విమానం ముక్కలు కాలేదు. ఎమర్జెన్సీ డోర్ల నుంచి, రెక్కలపై నుంచి ప్రయాణికులు బయటకు వచ్చారు.
నీటిపై తేలియాడుతున్న విమానం, ఆ విమానం రెక్కలపై ఇరువైపులా ప్రయాణికులు నిలబడి ఉన్న దృశ్యాన్ని ప్రపంచం చూసింది.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రమైన చలిలోనూ రెస్క్యూ ఆపరేషన్
చలి చాలా ఎక్కువగా ఉన్న జనవరి నెల అది. ఉష్ణోగ్రతలు మైనస్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉన్నాయి. హడ్సన్ నదిలో నీరు పుష్కలంగా ఉంది.
విమానం నదిపై ల్యాండయిన కొన్ని నిమిషాల్లోనే, సమీపంలోని ఫెర్రీ బోట్లు, ఇతర నౌకలను నది వైపు మళ్లించారు. వారు వేగంగా స్పందించడం చాలా సాయపడింది.
150 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందిలో ఒకరికి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. మొత్తం 78 మంది వైద్య చికిత్స పొందారు. కానీ వారందరికీ అయింది చిన్న చిన్న గాయాలే.
ప్రయాణికుల అదృష్టం, పైలట్ నైపుణ్యం, సకాలంలో చేపట్టిన రక్షణ చర్యలు విమానంలోని వారందరూ ప్రాణాలతో బయటపడడానికి కారణమయ్యాయని ఈ సంఘటనను కవర్ చేసిన బీబీసీ విలేఖరులు చెప్పారు.
నీరు ప్రవేశిస్తుండటంతో విమానం మునిగిపోవడం ప్రారంభమైంది, కానీ టగ్ బోట్లు దానిని ఆపగలిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
పైలట్పై ప్రశంసల జల్లు
“విమానాన్ని నదిలో దింపి పైలట్ చాలా గొప్ప పని చేసారు” అని అప్పటి మేయర్ మైక్ బ్లూమ్బెర్గ్ అన్నారు.
“అందరూ దిగిన తర్వాత, విమానంలో ఎవరూ చిక్కుకుపోలేదని నిర్ధరించుకోవడానికి ఆయన మొత్తం విమానాన్ని రెండుసార్లు తనిఖీ చేశారు” అని సల్లెన్బర్గర్ను మెచ్చుకుంటూ బ్లూమ్బెర్గ్ అన్నారు.
ఈ సంఘటనతో కెప్టెన్ సల్లెన్బర్గర్పై ప్రశంసల జల్లు కురిసింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంతా ప్రశంసించారు. కానీ ఈ పరిస్థితి ఎలా వచ్చిందనే ప్రశ్న కూడా వినిపించింది.
అమెరికా రవాణా నియంత్రణ సంస్థ అయిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ఘటనపై దర్యాప్తు చేసింది. నదిలో విమానాన్ని ల్యాండ్ చేయాలనే నిర్ణయం సరైనదేనని దర్యాప్తు బృందం కూడా అభిప్రాయపడింది.
కొన్ని రోజులకే ఆ విమానాన్ని నదిలో నుంచి బయటకు తెచ్చి అమెరికాలోని కరోలినాస్ ఏవియేషన్ మ్యూజియంలో పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కెప్టెన్ సల్లీ ఎవరు?
కెప్టెన్ సల్లెన్ బర్గర్ 16 ఏళ్ల వయస్సులో పైలట్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. 1973లో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత, ఆయన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్గా చేరారు.
1980లో ప్రైవేట్ విమానయాన రంగంలో పైలట్గా చేరారు. మార్చి 2010లో పదవీ విరమణ పొందారు. హడ్సన్ నదిలో ఆయన చేసిన ల్యాండింగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఎమర్జెన్సీ ల్యాండింగ్గా గుర్తింపు పొందింది.
హడ్సన్ నదిలో విమానాన్ని దించడానికి ముందు, సల్లీకి 20 వేల గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. దాదాపు 40 సంవత్సరాలు పైలట్గా పనిచేశారు. సల్లీని మాజీ అధ్యక్షులు జో బైడన్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు అమెరికా ప్రతినిధిగా నియమించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS