SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్పై ట్రంప్ విధించే పన్నుల ప్రభావం పడనుంది. అమెరికా నుంచి విదేశాలకు పంపించే నిధుల మీద మూడున్నర శాతం పన్ను విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
దీంతో అమెరికా నుంచి భారత్ కు వచ్చే డబ్బు కాస్త తగ్గి, ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పడుతుందంటున్నారు నిపుణులు.
ఎన్ఆర్ఐలు తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగం స్వదేశానికి పంపించడం తెలిసిందే.
అమెరికా నుంచి వారు డబ్బు పంపే సమయంలో ఇకపై ఆ సొమ్ములో 3.5 శాతం అమెరికా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి రావచ్చు.
మొన్నటి వరకూ అది 5శాతం అనుకున్నారు. ఇప్పడది 3.5 శాతంగా ప్రతిపాదించారు.
జూన్ లేదా జూలైలో అమెరికా సెనేట్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా పౌరులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్లు సహా మిగతా వారంతా ఈ పన్ను చెల్లించాల్సిరావచ్చు.


ఎన్ఆర్ఐల నుంచి డిమాండ్ తగ్గుతుందా?
విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన తెలుగువారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
స్థలాలు, ఇళ్ళు కొనడం, సొంతూరులో భూములు కొనడం, ఇంకా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ బావుంది అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారిపై ఈ కొత్త పన్ను భారం పడనుంది.
ఈ పరిణామం వల్ల వారు పెట్టుబడులు పెట్టే తీరు మారుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లో మిడ్, హైరేంజ్ ఆస్తులు కొనేవారిలో ఎన్ఆర్ఐలు ఎక్కువ.
వారిలో లాభాల కోసం పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో నివాసం ఉండటానికి కొంటున్నవారు ఉన్నారు.
”ఈ కొత్త పన్ను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద కచ్చితంగా ప్రభావం చూపవచ్చు. హైదరాబాద్ లోని మధ్య, ఎగువ తరగతి రెసిడెన్షియల్ సముదాయాల కొనుగోళ్ళలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎన్ఆర్ఐల నుంచి డిమాండ్ తగ్గితే అది అన్ని రకాలుగా హైదరాబాద్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే మార్కెట్ నెమ్మదించింది. కొనుగోళ్లు తగ్గాయి. ఈ సమయంలో అదనపు పన్ను ప్రభావం కచ్చితంగా ఉంటుంది” అని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా అనే ఎక్స్ హ్యాండిల్ వ్యాఖ్యానించింది .

ఫొటో సోర్స్, Getty Images
డాలర్ల ప్రవాహం తగ్గుతుందా?
అమెరికా తరువాత స్థానంలో గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్కు భారీగా రెమిటెన్స్ వస్తుంది కానీ, అది పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వైపు వెళ్ళేది కాదు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అంత సానుకూలంగా లేదంటున్నారు ఆ రంగంలోని వ్యాపారులు.
”గత ఏడాదిగా హైదరాబాద్ మార్కెట్ గొప్పగా ఏమీ లేదు. ఇక ఆంధ్రలో మొన్నటి వరకూ బాలేదు. మళ్లీ అమరావతి అని హడావుడి జరుగుతోంది. అమరావతిలో పెరుగుతుంది కానీ, అప్పుడే వేగం పుంజుకోదు. హైదరాబాద్ తగ్గుతుందని ఎవరూ అనరుగానీ, ఎంత వేగంగా మార్కెట్ వెళుతోందనేది కూడా ముఖ్యమే. ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం ఈ ఒక్క పన్ను వల్ల ప్రభావం అవుతుందని కాదుగానీ, కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది” అని కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన రియల్టర్ వెంకటేశ్వర రావు బీబీసీతో చెప్పారు.
”కొనేవారు ఉంటారు. అయితే పెట్టుబడి రూపంగా పెట్టేవారు మాత్రం ఉండకపోవచ్చు. ఇక్కడ పెట్టుబడి పెడితే విలువ పెరుగుతుంది అనుకునేవారు మాత్రమే ఆలోచిస్తారు” అని బీబీసీకి చెప్పారు ఓ ఎన్ఆర్ఐ .
”చాలా మంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ విషయంలో ఒక పాయింట్ మిస్ అవుతారు. 2009-15 మధ్య ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్ లేదు. ఆ తరువాత ఒక్కసారిగా పెరిగింది. ఇది అనేకమందిని ఆకర్షించింది. కానీ ఆ స్థాయి పెరుగుదల నికరంగా ఉండదు. కేపిటల్ గెయిన్స్ కోసం పంపేవారు కూడా ఆలోచిస్తారు” అని అన్నారాయన.
”విడిగా చూస్తే మూడున్నర శాతమే. కానీ కోటి రూపాయల్లో మూడున్నర లక్షలు అంటే దాని తీవ్రత తెలుస్తుంది. కాబట్టి కచ్చితంగా ప్రభావం ఉంటుంది” అని బీబీసీతో అన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీనివాస్.
విదేశాల నుంచి భారత్కు వస్తున్న సొమ్ములో అమెరికా వాటా 27.7 శాతం.
అది 118.7 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే ఆ మొత్తం లక్ష కోట్ల రూపాయలకు పైనే.
మొత్తం విదేశాల నుంచి వచ్చే సొమ్ములో 23-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 8.1 శాతం, ఆంధ్రకు 4.4 శాతం వచ్చాయి.
”అమెరికాలో సంపాదించిన సొమ్మును అక్కడే పెట్టుబడి పెట్టడం లేదా ఖర్చు చేసేలా చూస్తోంది ఆ దేశం. అందుకే ఈ పన్ను ప్రతిపాదనలు” అని సీఏ శ్రీనివాస్ చెప్పారు.

ఇతరులకు భారం
విదేశాల నుంచి సొమ్ము పంపించేవారిలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే వారితో పాటు ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపించేవారు కూడా ఉంటారు.
అలాంటి వారికి ఈ పన్ను భారం కాబోతోంది.
అలాగే ఎన్నారైలు ఇక ముందు గ్రామాల్లో పొలాలు కొనేందుకు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది.
మొత్తంగా విదేశాలలో ఉండేవారు ప్రతీ డాలరూ లెక్క వేసుకునే పరిస్థితుల్లో ఈ మూడున్నర శాతం అదనపు భారం పెద్ద విషయమే అవుతందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
”అక్కడ పౌరసత్వం ఉన్నవారు సరే. కానీ గ్రీన్ కార్డు ఉన్న వారు, అక్కడ చదువుకుంటూ పనిచేసే వారు కూడా పన్ను కట్టాలి. కాబట్టి ఎగువ మధ్య తరగతి కుటుంబాలపై కూడా ఆ భారం కనిపిస్తుంది” అన్నారు శ్రీనివాస్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS