SOURCE :- BBC NEWS

ఇరాన్, అణు కార్యక్రమం, ఇజ్రాయెల్, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం సహా ఇరాన్‌లోని అణు స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో తెహ్రాన్‌లోని అణు శాస్త్రవేత్తలు, టాప్ మిలటరీ కమాండర్లను హతమార్చింది.

శాంతియుత కార్యక్రమాలకు ఉద్దేశించిన తమ అణు స్థావరాల మీద ఇజ్రాయెల్ విచక్షణా రహిత దాడులను ఖండిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి చెప్పారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ వైమానిక దాడులు చేసింది.

నతాంజ్ అణు స్థావరాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు అరాగ్చి చెప్పారు. ఈ అణు కేంద్రం మీద జరిగిన దాడి వల్ల రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉందన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

తమదేశ భద్రత కోసం ఈ ఆపరేషన్ తప్పనిసరని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడానికి కారణాలు వివరిస్తూ “ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని ఆపకుంటే, త్వరలోనే అణు బాంబు తయారు చేస్తుందని” నెతన్యాహు చెప్పారు.

“ఇందుకు ఇరాన్‌కు ఏడాది పట్టవచ్చు లేదా కొన్ని నెలల్లోనే ఇది పూర్తి కావచ్చు” అని ఆయన హెచ్చరించారు.

ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనే అంశాన్ని ఇజ్రాయెల్ ఎన్నడూ ఖండించలేదు. అలాగని ఉన్నాయని కూడా చెప్పలేదు.

ఇరాన్, అణు కార్యక్రమం, ఇజ్రాయెల్, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఆధారాలెక్కడ?

“అణు బాంబు తయారీకి అవసరమైన పదార్థాలను ఉత్పత్తి చేసేందుకు సాగించిన ప్రయత్నాల్లో ఇరాన్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తమ వద్ద సమాచారం ఉందని” ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

అణు విస్ఫోటానికి అవసరమైన యురేనియం, న్యూట్రాన్‌ సమకూర్చుకున్నట్లు తమ నిఘా విభాగం సమాచారం అందించినట్లు ఐడీఎఫ్ వివరించింది.

అయితే ఈ ఆరోపణను బలపరిచేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థలోని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం డైరెక్టర్ కెల్సీ డావెన్‌పోర్ట్ చెప్పారు.

“ఇరాన్ కొన్ని నెలల్లోనే అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తుందనే విశ్లేషణ కూడా కొత్తదేమీ కాదు” అని ఆయన అన్నారు.

ఇరాన్ తీసుకున్న కొన్ని చర్యలు చూస్తే, అది అణు బాంబు తయారు చేస్తుందని నమ్మవచ్చని, కానీ ఆ దేశం ఆ దిశగా పని చేస్తున్నట్లు అమెరికన్ నిఘా సంస్థలు భావించడం లేదని డావెన్ పోర్ట్ చెప్పారు.

ఇరాన్, అణు కార్యక్రమం, ఇజ్రాయెల్, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా నిఘా సంస్థలేమంటున్నాయి?

“ఇరాన్‌లో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయని” అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గాబర్డ్ ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో చెప్పారు.

“అణ్వాయుధాలు లేని దేశానికి ఇది చాలా గొప్ప విషయం” అని ఆమె అన్నారు.

అయితే ఆమె కాంగ్రెస్‌కు మరో విషయం కూడా చెప్పారు.” అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడం లేదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అందుకు అనుమతి ఇవ్వలేదని” ఆమె చెప్పారు.

“అణు విస్తరణ ముప్పు గురించి నెతన్యాహు వద్ద సమాచారం ఉండి ఉంటే, ఆయన అమెరికాతో పంచుకునేవారు. దీన్ని పక్కన పెడితే అలాంటి సమాచారం ఉంటే, ఇజ్రాయెల్ ఈపాటికే ఇరాన్‌లోని అణు స్థావరాలన్నింటిపైనా దాడులు చేసి ఉండేది” అని కెల్సీ డావెన్‌పోర్ట్ చెప్పారు.

ఇరాన్ 60 శాతం స్వచ్ఛమైన, శుద్ధి చేసిన యురేనియం సేకరించిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ గత వారం విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదికలో తెలిపింది. ఇది 90 శాతానికి చేరుకుంటే, దానితో 9 అణు బాంబులు తయారు చేయవచ్చని ఐఏఈఏ చెబుతోంది. ఇది తీవ్రంగా పరిశీలించాల్సిన అంశమని సంస్థ చెబుతోంది. ఇరాన్ అణుకార్యక్రమం శాంతియుతంగా జరుగుతుందన్న నమ్మకం లేదని ఐఏఈఏ తెలిపింది.

ఇరాన్, అణు కార్యక్రమం, ఇజ్రాయెల్, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ అణు కార్యక్రమం గురించి మనకేం తెలుసు?

తమ అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందని, అణ్వాయుధాలను ఎన్నడూ తయారు చేయలేదని ఇరాన్ చెబుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ, 1980 నుంచి 2003 మధ్య ఇరాన్ ‘అణ్వస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి ‘ పనిచేసినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పదేళ్లపాటు చేసిన దర్యాప్తులో గుర్తించింది. 2009వరకు కూడా కొన్ని కార్యకలాపాలు కొనసాగించినట్టు గుర్తించింది. ఈప్రాజెక్టుకు “అమాద్” అని పేరు పెట్టారు.

ఇరాన్ ప్రభుత్వం ఫోర్డో ప్రాంతంలో యురేనియాన్ని శుద్ధి చేసేందుకు భూమి లోపల ఒక కేంద్రాన్ని నిర్మించినట్లు పశ్చిమ దేశాలు 2009లో తెలిపాయి.అయితే అప్పటి నుంచి ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు లభించలేదు.

వియన్నాలోని  ఐఏఈఏ ప్రధాన కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ప్రపంచంలోని ఆరుశక్తిమంతమైన దేశాలతో 2015లో ఒక ఒప్పందం చేసుకుంది. తమ అణుకార్యక్రమాలపై అనేక ఆంక్షలను అంగీకరించింది. ప్రపంచ దేశాల కఠిన ఆంక్షలను తప్పించుకోవడానికి తమ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అనుమతి ఇచ్చింది.

అయితే 2018లో డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆరు దేశాల ఒప్పందం నుంచి వైదొలగారు.ఇరాన్ అణు బాంబు తయారు చేయకుండా ఈ ఒప్పందం ఆపలేదని ఆయన అన్నారు. అమెరికా ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాత ఇరాన్ మీద మళ్లీ ఆంక్షలు విధించారు.

ఈ ఒప్పందం కింద, ఫోర్డో ప్రాంతంలో 15ఏళ్ల పాటు ఇరాన్ ఏరకమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టకూడదు. అయితే 2021లో ఇరాన్ మళ్లీ యురేనియం శుద్ధిని ప్రారంభించి, 20 శాతం స్వచ్ఛతను సాధించింది.

ఇదిలా ఉంటే, 20 ఏళ్లలో తొలిసారి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకానికి సంబంధించిన నిబంధనలను ఇరాన్ ఉల్లంఘించిందని అంతర్జాతీయ అణుఇంధన సంస్థలో భాగమైన 35 దేశాల బోర్డు గవర్నర్లు ఇటీవల ప్రకటించారు.

“నూతన సురక్షిత ప్రాంతంలో” ఆరో తరానికి చెందిన మెషినరీతో ఆధునిక పద్దతులను ఉపయోగించి యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ఇటీవలే తెలిపింది.

ఇరాన్, అణు కార్యక్రమం, ఇజ్రాయెల్, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్ అణు స్థావరాలకు ఇజ్రాయెల్ ఎంత నష్టం కలిగించింది?

తమ వైమానిక దాడులలో నతాంజ్ అణు శుద్ధి కేంద్రంలో భూగర్భ సెంట్రిప్యూజ్ హాలు, ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన కీలక మౌలిక వసతులు ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

నతాంజ్ కేంద్రంలో ఉపరితల భాగంలో నిర్మించిన పైలట్ ఫ్యూయల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్, విద్యుదుత్పత్తి కేంద్రం ధ్వంసం అయ్యాయని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చెప్పారు.

అండర్‌గ్రౌండ్‌లోని హాలుపై నేరుగా దాడి జరిగినట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదని ఆయన చెప్పారు. ఆధునిక సెంట్రీఫ్యూజ్‌ల తయారీకి పైలట్ ఫ్యూయల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్‌ను ఉపయోగించడం వల్ల దానికి ఎక్కువగా నష్టం జరిగి ఉండవచ్చని అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ తెలిపింది.

“ఈ ప్రాంతాన్ని ఐఏఈఏ సందర్శించే వరకు, ఇరాన్ ఈ కేంద్రాన్ని పునరుద్ధరిస్తుందా లేక యురేనియంను ఇక్కడ నుంచి మరో చోటకు తరలిస్తుందా అనే దానిపై దానిపై స్పష్టత రావడం కష్టం” అని ఆయన చెప్పారు.

ఫోర్డో అణు శుద్ధి కేంద్రంతో పాటు ఇష్ఫాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌పైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది.

ఇష్ఫాన్ మీద దాడి గురించి వివరిస్తూ ” యురేనియం ఉత్పత్తి ప్రాంతం, శుద్ధి చేసిన యురేనియాన్ని తిరిగి ప్రాసెస్ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు, అనేక ఇతర ల్యాబ్‌లను ధ్వంసం చేసినట్లు” ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

యురేనియంను అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి శుద్ధి చేయడం లేదా ఇక్కడ నుంచి దాన్ని రహస్య ప్రాంతానికి తరలించడం ఒక్కటే ఇరాన్ ముందున్న ప్రత్యామ్నాయం.

“ఒక దాడి అణు స్థావరాలను ధ్వంసం చేయవచ్చు, శాస్త్రవేత్తలను చంపవచ్చు, అయితే ఇరాన్ అణు విధానాన్ని ధ్వంసం చేయలేదు” అని ఆయన అన్నారు.

“యురేనియం శుద్ధిలో సాధించిన పురోగతి వల్ల గతంలో కంటే వేగంగా ధ్వంసమైన వాటన్నింటినీ ఇరాన్ తిరిగి నిర్మించగలదు” అని డావెన్ పోర్ట్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)