SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
12 జూన్ 2025
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కుప్పకూలింది.
అహ్మదాబాద్లోని మేఘని నగర్ అనే నివాస ప్రాంతంలో విమానం కూలిపోయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అసోసియేటెడ్ ప్రెస్తో చెప్పారు.
విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్లో ధ్రువీకరించింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారని తెలిపింది.
ఫ్లైట్రాడార్ 24 ప్రకారం, కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్, దాని రిజిస్ట్రేషన్ నంబర్ వీటీ-ఏఎన్బీ.
ఈ బోయింగ్ 787 మోడల్ను 14 ఏళ్ల కిందట ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Flight Radar
ఎంత ఎత్తులో జరిగింది?
విమానం టేకాఫ్ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను బీబీసీ వెరిఫై చెక్ చేసింది.
విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్కు బయలుదేరింది.
విమానం టేకాఫ్కు ముందు రన్వే అంచుకు వెళ్లినట్లు డేటా చూపిస్తోంది. విమానం 625 అడుగుల (190 మీటర్లు) ఎత్తులో ఉన్నట్లు చివరి ట్రాకింగ్ పాయింట్ చూపిస్తోంది.
క్రాష్, ఆ తర్వాత ఏం జరిగిందో చూపిస్తూ ఆన్లైన్లో షేర్ అయిన వీడియోలను కూడా బీబీసీ చెక్ చేస్తోంది.

ఏ సమయంలో ఏం జరిగింది?
ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం..
- మధ్యాహ్నం 1:30 గంటలకు విమానం నేల మీదే ఉంది( వేగం సున్న నాట్స్).
- మధ్యాహ్నం 1:34 గంటలకు విమానం నేల మీదే ఉంది కానీ, నెమ్మదిగా కదులుతోంది, ఆ సమయంలో విమానం వేగం 10 నాట్స్(గంటకు 18.5 కి.మీ).
- మధ్యాహ్నం 1:38 గంటలకు విమానం టేకాఫ్ అయింది. 174 నాట్స్ వేగంతో 625 అడుగుల ఎత్తులోకి చేరింది. ఆ తర్వాత విమానం సిగ్నల్ రాలేదు.

ఫొటో సోర్స్, BBC/Tejas Vaidya
విమానంలో ఎవరెవరున్నారు?
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఏఐ171 విమానం టేకాఫ్ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలిపింది.
”అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు పైకి ఎగిరిన ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 1 కెనడా జాతీయుడు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు” అని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
బాధిత కుటుంబాలు, మరిన్ని వివరాలు అవసరమైన వారి కోసం ఎయిర్ ఇండియా హెల్ప్లైన్ నంబర్: 1800 5691 444ను ఏర్పాటు చేసింది.
ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఎయిర్లైన్ పూర్తిగా సహకరిస్తుందని తెలిపింది.
మేడే కాల్
అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయిందని డీజీసీఏ ప్రకటించింది.
డీజీసీఏ ప్రకటనలో.. విమానం నడుపుతున్న కెప్టెన్కు 8,200 గంటల విమానయాన అనుభవం ఉంది. కో-పైలట్కు 1,100 గంటల అనుభవం ఉంది. అహ్మదాబాద్లోని రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39కి విమానం బయలుదేరింది.
టేకాఫ్ అయిన తర్వాత, విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే (అత్యవసర) కాల్ వచ్చింది. కానీ, ఆ తర్వాత ఎటువంటి కాంటాక్ట్ లేదు. విమానాశ్రయ సరిహద్దు వెలుపల విమానం కూలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
మేడే కాల్ అంటే ఏంటి?
ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది.
‘మేడే’ అనే పదం ఫ్రెంచ్ పదబంధం “మైడర్” నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘నాకు సహాయం చేయండి’ అని.
విమానం మాదిరే పడవలు కూడా అత్యవరసర పరిస్థితుల్లో ఈ కాల్ను ఉపయోగిస్తాయి.
మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనూ వాడుతున్నారు.
1927లో అమెరికా అధికారికంగా రేడియో అత్యవసర పరిస్థితులకు దీనిని ఉపయోగించడం ప్రారంభించింది.
కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితి తీసుకెళ్లడానికి లేదా పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పడానికి ‘మేడే, మేడే, మేడే’ అని రిపీటెడ్గా చెబుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS